సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1885వ భాగం....



ఈ భాగంలో అనుభవం:

  • తల్లిదండ్రులను మించి ప్రతిక్షణం అందరికీ అండగా ఉండే సాయిబాబా

ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయిమహరాజ్‌కి, సాయిభక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఒక సాయిభక్తురాలిని. నిజానికి నేను ఈరోజు నా అనుభవాలను వ్రాయాలని అనుకోలేదు. నేను ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నాను. మా ఉద్యోగ నిర్వహణలో భాగంగా ప్రతినెలా సెలవు దినాన నలుగురికి (కనీసం ముగ్గురికైనా) డ్యూటీ వేస్తారు. ఆ క్రమంలోనే 2024, జూన్ 30న నాకు డ్యూటీ వేశారు. తర్వాత జూలై 7న మరో ఇద్దరితో పాటు నాకు డ్యూటీ వేశారు. అలా వెంటవెంటనే రెండు ఆదివారాలు (సెలవు రోజులు) ఎవరికీ డ్యూటీ వేయరు. మరి నా విషయంలో ఎందుకిలా అయిందనుకొని, బాబా ప్రణాళిక ఏదో ఉండి ఉంటుంది అనుకున్నాను. తర్వాత 2024, జూలై 12, శుక్రవారం సాయిభక్తురాలు రమాదేవిగారు 'ఏ ఒక్కరోజూ ఈ బ్లాగులో అనుభవాలు ప్రచురితం కాకుండా ఉండలేదు. అలాంటిది ఈమధ్య రెండు, మూడు రోజులు అనుభవాలు ప్రచురితం కావడం లేదు. కాబట్టి బాబా అనుగ్రహం పొందగానే దయచేసి మీ అనుభవాలను వివరంగా బ్లాగుకి పంపండి. తద్వారా తోటి సాయిబంధువులకు మేలు చేసిన వాళ్ళమవుతాం' అని తమ అనుభవంలో వ్రాశారు. అది చదివాక, "రేపు (రెండో శనివారం) సెలవు కదా! ఇంటి దగ్గరే ఉంటాను. నా అనుభవాలు బ్లాగుకు పంపించాలి" అని అనుకున్నాను. మర్నాడు అనుభవాలు వ్రాస్తుంటే నాకనిపించింది, 'మన సాయిబాబా నాకు 30వ తేదీన, జూలై 7వ తేదీన డ్యూటీ వేయించి, జూలై 12న బ్లాగులో ప్రచురితమైన అనుభవం చదివించి ఈరోజు నాచేత ఈ అనుభవాలు వ్రాయిస్తున్నారు. అంతా సాయిబాబా ప్రణాళికలో భాగమ'ని.

నాకు వివాహమైనప్పటినుండి, అంటే 27 సంవత్సరాలుగా నేను ప్రతి గురువారం సాయిబాబా పూజ చేస్తున్నాను. నాకు ఏ సమస్య వచ్చినా నేను బాబాని ప్రార్థిస్తున్నాను. నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం, అన్నీ బాబాతండ్రే. ఆయనని మా ఇంటి పెద్దగా భావిస్తాను. నేను ఉద్యోగం చేస్తున్నానని చెప్పాను కదా! నేను రోజూ ఆఫీసుకి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు నాకు నచ్చిన సాయిబాబా పాటలు పాడుకుంటూ ఉంటాను. ఒకరోజు సాయిబాబా ప్రశ్నలు-జవాబులు చూస్తే, 'ఏముంది? పాటలేగా పాడుతావు' అని వచ్చింది. అప్పుడు నేను బాబా గుడిలో 1,1116 రూపాయలు దక్షిణ సమర్పించాను. మళ్ళీ ఇంకోరోజు ప్రశ్నలు-జవాబులు చూస్తే, 'దక్షిణ ఇచ్చావుగా, సంతోషంగా ఉంది' అని వచ్చింది. నేను అప్పటినుండి గుడిలోగాని, భిక్షగాళ్ళకిగాని ఎంతో కొంత డబ్బులిస్తూ ఉన్నాను. నేనెప్పుడూ ఒకటే అనుకుంటాను, 'నా దగ్గర ఉన్నదంతా నాకు బాబా పెట్టిన భిక్ష. దాన్ని నా అవసరాలకు (ఇంటి ఖర్చులు, పిల్లల చదువు మొదలైనవి) వాడుకుంటూ, కొంత దక్షిణ రూపంలో ఆయనకి సమర్పించుకుంటున్నాన'ని. నేను నాకు జీతం పెరిగితే నెలకు 500 రూపాయలు అనాథాశ్రమంలో ఇస్తానని అనుకున్నాను. బాబా దయవల్ల నా జీతం పెరిగింది. దాంతో నేను నెలకు 500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 6,000 రూపాయలు రెండు సంవత్సరాలుగా అనాథాశ్రమంలో ఇస్తున్నాను.

కొన్నాళ్ల నుండి నా రెండు అరికాళ్ళలో ఆనెకాయలు వచ్చి చాలా బాధగా ఉంటోంది. చాలా మందులు (హోమియో) వాడాను. కానీ ఎన్నిరకాల మందులు వాడినా అవి తగ్గట్లేదు. నాకు వచ్చే జీతంతో అన్ని మందులు వాడటం కష్టంగా ఉండేది. ఒకరోజు ఆఫీసు నుండి వస్తూ నడవడానికి ఇబ్బందిగా ఉంటే, "ఏంటి బాబా? ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు. అయినా ఆ డబ్బులు మంచిగా ఉపయోగపడాలి కాని, మందులకోసమైతే ఎలా తండ్రీ?" అని అనుకున్నాను. అంతే! మరుక్షణంలో ఎదురుగా ఒక బడ్డీకొట్టు మీద పెద్ద సాయితండ్రి క్యాలెండర్ కనిపించింది. నేను రోజూ అదే మార్గంలో ఆఫీసుకి వెళ్లి, వస్తాను. కానీ అప్పటివరకు ఎప్పుడూ ఆ క్యాలండర్ నా కంటపడలేదు. నాకు ఎంత సంతోషమేసిందంటే మాటల్లో చెప్పలేను. ఆ తర్వాత మందులు వాడటమా? ఆపేయటమా? అన్న విషయంలో బాబా దగ్గర చీటీలు వేసి వారి అనుమతి తీసుకుందామని చీటీలు వేస్తే, 'మందులు వాడొద్దు' అని వచ్చింది. అప్పటినుండి నేను ఆ ఆనెకాయలకి మందులు వాడటం మానేసాను. తర్వాత మా పాప ప్యూమిస్ స్టోన్ తీసుకొచ్చింది. వారంలో రెండు, మూడు సార్లు గోరువెచ్చని నీళ్లలో గళ్ళ ఉప్పు, నిమ్మరసం, తినేసోడా, షాంపూ వేసి అందులో 20 నిమిషాలపాటు పాదాలు ఉంచిన తర్వాత ప్యూమిస్ స్టోన్‌తో శుభ్రం చేయాలట. కానీ నాకు వీలుకాక వారానికి ఒకసారి అలా చేస్తూ రోజూ రాత్రి పడుకునేటప్పుడు పాదాలకు ఆముదం రాసుకుంటూ, ఇంట్లో కూడా మెత్తటి చెప్పులు వాడటం చేస్తూ ఉంటే ఇప్పుడు చాలావరకు ఆనెకాయలు తగ్గుముఖం పట్టాయి. ఇదంతా బాబా ప్రేరణ అనుకుంటున్నాను.

ఇంకోసారి నాకు కడుపు ఉబ్బరం వచ్చి ఇబ్బందిగా ఉంటుంటే, మందులు వాడటమా, లేదా అని బాబా ముందు చీటీలు వేస్తే, 'మందులు వాడొద్దు' అని వచ్చింది. దాంతో నేను 'బాబా మందులు వాడొద్దన్నారుగా, ఆయనే తగ్గించేస్తారు' అన్న నమ్మకంతో మందులు ఏమీ కొనలేదు. తర్వాత ఒకరోజు ఉదయం ఆఫీసుకు వెళ్లేటప్పుడు కడుపు ఉబ్బరంతో ఇబ్బందిగా ఉంటే ఇంట్లో ఉన్న ధనియాల పొడి అరస్పూను నోట్లో వేసుకొని నములుతూ ఆఫీసుకు వెళ్లాను. దాంతో నాకు ఆరోజు చాలా తేలిగ్గా అనిపించింది. అప్పటినుండి కడుపు ఉబ్బరంగా అనిపించినా, ఒక్కోసారి తేలిగ్గా ఉన్నా కూడా ధనియాల పొడి అరస్పూను తింటున్నాను. బాబా దయవల్ల నాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది.

నాకు స్పాండిలైటిస్(వెన్నుపూస డిస్క్ అరగటం) వలన వీపు అంతా నొప్పిగా ఉంటుంది. దానికి చాలాకాలం నుండి మందులు వాడుతున్నాను. ఆ విషయంలో కూడా మందులు వాడాలా, వద్దా అని చీటీలు వేసి బాబాని అడిగితే, 'మందులు వాడమ'ని బాబా చెప్పారు. అయినా నేను మందులు కొనకుండా బాబా తగ్గించేస్తారని భరిస్తూ ఉండేదాన్ని. అలా ఉండగా ఒకరోజు ఆఫీసులో ఖాళీ దొరికినప్పుడు శ్రీసాయి సచ్చరిత్ర చదువుతుంటే, ఒక భక్తుడితో బాబా వీపునొప్పి తగ్గడానికి మందులు వాడమని చెప్పడం చదివాను. అది నాకే చెప్పినట్లుగా అనిపించింది. ఎందుకంటే, చీటీలు వేసినప్పుడు కూడా మందులు వాడమనే బాబా చెప్పారు. కానీ నేను వాడట్లేదు. అందుకే బాబా ఈవిధంగా తెలియజేశారని అప్పటినుండి మందులు వాడుతున్నాను. "అన్నిటికీ ధన్యవాదాలు బాబా".

ఓం శ్రీసాయినాథ్ మహారాజ్ కీ జై.

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo