సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1886వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • బాబాతో అనుబంధం

సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు శిరీష. నేను ఈరోజు మీతో సాయితో నా పరిచయం గురించి, క్రమంగా నాలో వచ్చిన పరిణితి గురించి, ఆయనతో నా అనుబంధం గురించి పంచుకుంటున్నాను. నాకు 1990 వరకు 'సాయి' అంటే ఎవరు తెలీదు. కనీసం ఆ పేరు కూడా నేను వినలేదు. కారణం మా ఇంట్లోగాని, బంధువుల్లో గానీ బాబా భక్తులు లేరు. ఆ సంవత్సరం నేను ఎంసెట్ కోచింగ్ నిమిత్తం హాస్టల్లో ఉన్నాను. అప్పుడే నేను మొట్టమొదట బాబా గురించి విన్నాను. నా స్నేహితురాలు ఒకరు తన కుటుంబమంతా బాబా భక్తులమని చెప్పింది. అయితే ఆయన ఎవరని తెలుసుకోవాలనిగాని, ఆయన ఫోటోని చూడాలనిగాని నేను ఆ సమయంలో అనుకోలేదు. కానీ, ఇప్పుడు ఆలోచిస్తే, 'నా భక్తులను నేనే నా దగ్గరకు రప్పించుకుంటాన'ని బాబా అంటారు కదా! అది నా విషయంలో నిజమైందనిపిస్తుంది. ఎంసెట్ పరీక్షరోజు నా స్నేహితురాలి నాన్న వచ్చి పరీక్ష మధ్యాహ్నం ఉన్నందున గుడికి వెళ్ళొద్దామని అన్నారు. అప్పటికి నా తల్లిదండ్రులు ఇంకా నా దగ్గరికి రాలేదు. అందుకని నేను కూడా వాళ్లతో కలిసి గుడికి వెళ్లాను. అక్కడ ఒక ప్రాంగణంలో చాలా చిన్న మందిరాలు ఉన్నాయి. అక్కడొక రావిచెట్టు ఉంది. దాని కింద ఒక చిన్న మందిరంలో బాబా మూర్తి ఉంది. నేను అదే మొదటిసారి బాబాను చూడటం. నేను ఆ ప్రాంగణంలో వేరే దేవతలకు నమస్కరించానో, లేదో నాకు గుర్తులేదు కానీ, మొదటిసారి బాబాను చూడటం నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. నేను బాబాకి నమస్కరించి, "మీరు ఎవరో నాకు తెలియదు కానీ, నాకు ఈ పరీక్షలో మంచి ర్యాంకు రావాలి" అని దణ్ణం పెట్టుకున్నాను. అంతకంటే నాకు ఏమీ గుర్తులేదు. నేను మళ్ళీ ఆ గుడికి ఇంతవరకూ వెళ్ళలేదు. అసలు ఆ గుడి ఏ ప్రాంతంలో ఉందో కూడా నాకు గుర్తులేదు. ఏదేమైనా బాబా దయవల్ల నాకు ఎంసెట్ పరీక్షలో 125వ ర్యాంకు వచ్చింది. దాంతో నేను నాకు నచ్చిన కాలేజీలో మెడిసిన్ జాయినయ్యాను. అయినప్పటికీ నాకు బాబా మీద పూర్తి నమ్మకం కలగక మెడిసిన్ చదివే రోజుల్లో ఆయన గురించి మర్చిపోయాను. పరీక్షల సమయంలో హాస్టల్‌కి దగ్గరలో ఉన్న గుడికి వెళ్లి దణ్ణం పెట్టుకొనేవాళ్ళం కానీ, బాబా గుడికి మాత్రం ఎప్పుడూ వెళ్ళలేదు. కారణం నా స్నేహితులు ఎవరికీ బాబా తెలియదనుకుంటా. నాకు సరిగా గుర్తులేదుగాని మెడిసిన్ నాలుగో సంవత్సరంలోనూ, చివరి సంవత్సరంలోనూ ఉన్నప్పుడు మరోసారి బాబా గురించి విన్నాను. మా క్లాస్మేట్ వాళ్ళ తమ్ముడు బాబా గుడికి వెళ్ళేవాడు. తాను, పరీక్ష ముందు గుడికి వెళ్లి బాబాకి దణ్ణం పెడితే మంచి మార్కులు వస్తాయని చెప్పాడు. కానీ నేను ఆ సమయంలో బాబా గుడికి వెళ్లినట్లు గుర్తులేదు.

మెడిసిన్ పూర్తైన తర్వాత హౌస్ సర్జన్ చేయడానికి నేను హాస్టల్ మారాను. అది చాలా చిన్న రూమ్. నా రూమ్మేట్ నాకు సీనియర్. తన ఎప్పుడూ రూమ్లో ఉండేది కాదు. తను తన స్నేహితులతో కలిసి పీజీ ఎంట్రన్స్ కోసం వాళ్ళ ఇంట్లో చదువుకుంటున్నానని చెప్పేది. మా రూంలో ఒక మంచం మాత్రమే ఉండేది. రెండో మంచం వేయడానికి చోటు లేక నేను కిందే పడుకునేదాన్ని. నా స్నేహితురాలి మంచం కింద చాలా పుస్తకాలు ఉండేవి. వాటిలో సాయిలీలామృతం, గురుచరిత్ర పుస్తకాలు ఉండేవి. నేను వాటిని చూడటం అదే మొదటిసారి. కానీ నేను వాటిని చదివానో, లేదో నాకు గుర్తులేదు. పీజీ ఎంట్రన్స్‌లో నా రూమ్మేటుకి స్టేట్ ఫస్ట్ ర్యాంకు వచ్చింది. తను ఆ పుస్తకాలు పారాయణ చేసినందువల్లే మంచి ర్యాంకు తెచుకోగలిగిందని నేను అనుకున్నాను. దాంతో నాకు బాబా మీద ఆసక్తి కలిగింది. కానీ అది భక్తి కాదు. కేవలం ఏదో పొందవచ్చనే ఆశ అని మాత్రం చెప్పగలను. నేను అప్పుడప్పుడు బాబా గుడికి వెళ్లడం ప్రారంభించాను. ఆ బుక్స్ కూడా కొని చదవడం ప్రారంభించాను. అయితే యాంత్రికంగా, ఏదో పొందాలన్న ఆశతో చాలాసార్లు పారాయణం చేశానుగాని అందులో ఏముందో తెలుసుకోకుండా చదివాను. అలా చిన్నగా బాబా వైపు ఆకర్షితురాలినయ్యాను. బాబా నన్ను ఆయా మిషలతో నన్ను తమ వైపుకు లాక్కున్నారని అనుకుంటున్నాను. పీజీ ఎంట్రెన్స్ పరీక్షలో నాకు నేను కోరుకున్న బ్రాంచ్‌లో డిప్లమా సీటు మొదటి ప్రయత్నంలోనే వచ్చింది. నా క్లాస్మేట్స్‌లో బాగా చదివేవాళ్ళకు కూడా సీట్ రాలేదు. నాకు మాత్రమే వచ్చింది. ఆ పుస్తకాలు చదవడం వల్లే నాకు ఆ సీటు వచ్చిందని భావించాను. బాబా మీద భక్తి పెరిగింది. కానీ ఆ భక్తి నా కోరిక తీరితే గుడికి వస్తాను, కొబ్బరికాయ కొడతాను అనే భక్తే కానీ, నిజమైన అనుబంధం కాదు.

పీజీ చదివేటప్పుడు మా పక్క వీధిలో ఒక బాబా మందిరం ఉండేది. ప్రతి గురువారం సాయంత్రం అక్కడికి వెళ్లడం అలవాటు అయింది. ఆరతి అర్థం తెలియకపోయినా అందరితో కలిసి పాడుతుండేదాన్ని. పల్లకి సేవలో కూడా పాల్గొనేదాన్ని. కొంతకాలానికి నాకు వివాహమైంది. నా భర్త నాస్తికుడు. వాళ్ళ ఇంట్లోవాళ్లకి బాబా తెలీదు. నేను అత్తింటికి  వెళ్ళినప్పుడు వాళ్ళింట్లో ఒక చిన్న బాబా ఫోటో చూసాను. దాన్ని నా ఆడపడుచు తన స్నేహితులతో కలిసి శిరిడీ వెళ్లి, వచ్చినప్పుడు తెచ్చిందట. నేను ఆ ఫోటో చూశాను గాని, నాకోసం నాకంటే ముందే బాబా మా ఇంటికి వచ్చారని అప్పుడు తెలుసుకోలేదు. తర్వాత మా అత్తింటివాళ్లకు తెలిసిన ఒకతను ఒక పెద్ద బాబా ఫోటో తెచ్చి వాళ్ళకి ఇచ్చారు. నేను ఆ ఫోటో తీసుకొని నా గదిలో తగిలించుకున్నాను. కానీ ఎప్పుడూ పూజించలేదు. కొన్నిరోజులకి నేను శిరిడీ వెళదామని నా భర్తని అడిగితే, తీసుకొని వెళ్లారు. అలా మొదటిసారి శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకొని వచ్చాను. తర్వాత బాధ్యతల వల్ల బాబాను మర్చిపోయాను. 18 సంవత్సరాలలో ఎన్నో సార్లు ఇబ్బందులు వచ్చాయి. కానీ నేను ఎప్పుడూ బాబాని తలచుకోలేదు. కానీ ఇప్పుడు ఆలోచిస్తే, బాబా నాకు తోడుగా ఉన్నారని అనిపిస్తుంది. 2018లో మొదటిసారి ఈ బ్లాగు చూశాను. సాయి సచ్చరిత్ర గురించి తెలుసుకున్నాను. బ్లాగు వల్ల, సచ్చరిత్ర వల్ల బాబా తత్త్వం అర్థమై క్రమంగా బాబాతో అనుబంధం పెరిగింది. 2018లో రెండోసారి శిరిడీ వెళ్లాను(ఆ అనుభవాన్ని ఇదివరకు ఈ బ్లాగులో పంచుకున్నాను). 2024, జులైలో మూడోసారి శిరిడీ వెళ్ళాను. నా భర్త దేవుని నమ్మకపోయినా ఆయనకు తెలియకుండానే గురువారం దర్శనానికి బుక్ చేశారు. 2018లో కూడా ఆయనకు తెలియకుండానే దసరా రోజు దర్శనానికి బుక్ చేశారు. ఇప్పుడు బాబాతో నాకు తండ్రితో ఉన్న అనుబంధం ఉంది. ఆశతో కూడుకున్న అనుబంధం కాదు. బాబా క్రమంగా నాలో పరిమితి తీసుకుని వచ్చారు. భక్తుల అనుభవాలు చదువుతుంటే ఇంకా చాలా పరిణితి రావాలని నాకనిపిస్తుంది. ఈ వివరాలు చాలా రోజుల నుండి పంచుకోవాలనుకుంటున్నాను. కానీ ఇప్పుడు బాబా అనుమతించినట్లు ఉంది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

సాయిభక్తుల అనుభవమాలిక 1885వ భాగం....



ఈ భాగంలో అనుభవం:

  • తల్లిదండ్రులను మించి ప్రతిక్షణం అందరికీ అండగా ఉండే సాయిబాబా

ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయిమహరాజ్‌కి, సాయిభక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఒక సాయిభక్తురాలిని. నిజానికి నేను ఈరోజు నా అనుభవాలను వ్రాయాలని అనుకోలేదు. నేను ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నాను. మా ఉద్యోగ నిర్వహణలో భాగంగా ప్రతినెలా సెలవు దినాన నలుగురికి (కనీసం ముగ్గురికైనా) డ్యూటీ వేస్తారు. ఆ క్రమంలోనే 2024, జూన్ 30న నాకు డ్యూటీ వేశారు. తర్వాత జూలై 7న మరో ఇద్దరితో పాటు నాకు డ్యూటీ వేశారు. అలా వెంటవెంటనే రెండు ఆదివారాలు (సెలవు రోజులు) ఎవరికీ డ్యూటీ వేయరు. మరి నా విషయంలో ఎందుకిలా అయిందనుకొని, బాబా ప్రణాళిక ఏదో ఉండి ఉంటుంది అనుకున్నాను. తర్వాత 2024, జూలై 12, శుక్రవారం సాయిభక్తురాలు రమాదేవిగారు 'ఏ ఒక్కరోజూ ఈ బ్లాగులో అనుభవాలు ప్రచురితం కాకుండా ఉండలేదు. అలాంటిది ఈమధ్య రెండు, మూడు రోజులు అనుభవాలు ప్రచురితం కావడం లేదు. కాబట్టి బాబా అనుగ్రహం పొందగానే దయచేసి మీ అనుభవాలను వివరంగా బ్లాగుకి పంపండి. తద్వారా తోటి సాయిబంధువులకు మేలు చేసిన వాళ్ళమవుతాం' అని తమ అనుభవంలో వ్రాశారు. అది చదివాక, "రేపు (రెండో శనివారం) సెలవు కదా! ఇంటి దగ్గరే ఉంటాను. నా అనుభవాలు బ్లాగుకు పంపించాలి" అని అనుకున్నాను. మర్నాడు అనుభవాలు వ్రాస్తుంటే నాకనిపించింది, 'మన సాయిబాబా నాకు 30వ తేదీన, జూలై 7వ తేదీన డ్యూటీ వేయించి, జూలై 12న బ్లాగులో ప్రచురితమైన అనుభవం చదివించి ఈరోజు నాచేత ఈ అనుభవాలు వ్రాయిస్తున్నారు. అంతా సాయిబాబా ప్రణాళికలో భాగమ'ని.

నాకు వివాహమైనప్పటినుండి, అంటే 27 సంవత్సరాలుగా నేను ప్రతి గురువారం సాయిబాబా పూజ చేస్తున్నాను. నాకు ఏ సమస్య వచ్చినా నేను బాబాని ప్రార్థిస్తున్నాను. నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం, అన్నీ బాబాతండ్రే. ఆయనని మా ఇంటి పెద్దగా భావిస్తాను. నేను ఉద్యోగం చేస్తున్నానని చెప్పాను కదా! నేను రోజూ ఆఫీసుకి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు నాకు నచ్చిన సాయిబాబా పాటలు పాడుకుంటూ ఉంటాను. ఒకరోజు సాయిబాబా ప్రశ్నలు-జవాబులు చూస్తే, 'ఏముంది? పాటలేగా పాడుతావు' అని వచ్చింది. అప్పుడు నేను బాబా గుడిలో 1,1116 రూపాయలు దక్షిణ సమర్పించాను. మళ్ళీ ఇంకోరోజు ప్రశ్నలు-జవాబులు చూస్తే, 'దక్షిణ ఇచ్చావుగా, సంతోషంగా ఉంది' అని వచ్చింది. నేను అప్పటినుండి గుడిలోగాని, భిక్షగాళ్ళకిగాని ఎంతో కొంత డబ్బులిస్తూ ఉన్నాను. నేనెప్పుడూ ఒకటే అనుకుంటాను, 'నా దగ్గర ఉన్నదంతా నాకు బాబా పెట్టిన భిక్ష. దాన్ని నా అవసరాలకు (ఇంటి ఖర్చులు, పిల్లల చదువు మొదలైనవి) వాడుకుంటూ, కొంత దక్షిణ రూపంలో ఆయనకి సమర్పించుకుంటున్నాన'ని. నేను నాకు జీతం పెరిగితే నెలకు 500 రూపాయలు అనాథాశ్రమంలో ఇస్తానని అనుకున్నాను. బాబా దయవల్ల నా జీతం పెరిగింది. దాంతో నేను నెలకు 500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 6,000 రూపాయలు రెండు సంవత్సరాలుగా అనాథాశ్రమంలో ఇస్తున్నాను.

కొన్నాళ్ల నుండి నా రెండు అరికాళ్ళలో ఆనెకాయలు వచ్చి చాలా బాధగా ఉంటోంది. చాలా మందులు (హోమియో) వాడాను. కానీ ఎన్నిరకాల మందులు వాడినా అవి తగ్గట్లేదు. నాకు వచ్చే జీతంతో అన్ని మందులు వాడటం కష్టంగా ఉండేది. ఒకరోజు ఆఫీసు నుండి వస్తూ నడవడానికి ఇబ్బందిగా ఉంటే, "ఏంటి బాబా? ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు. అయినా ఆ డబ్బులు మంచిగా ఉపయోగపడాలి కాని, మందులకోసమైతే ఎలా తండ్రీ?" అని అనుకున్నాను. అంతే! మరుక్షణంలో ఎదురుగా ఒక బడ్డీకొట్టు మీద పెద్ద సాయితండ్రి క్యాలెండర్ కనిపించింది. నేను రోజూ అదే మార్గంలో ఆఫీసుకి వెళ్లి, వస్తాను. కానీ అప్పటివరకు ఎప్పుడూ ఆ క్యాలండర్ నా కంటపడలేదు. నాకు ఎంత సంతోషమేసిందంటే మాటల్లో చెప్పలేను. ఆ తర్వాత మందులు వాడటమా? ఆపేయటమా? అన్న విషయంలో బాబా దగ్గర చీటీలు వేసి వారి అనుమతి తీసుకుందామని చీటీలు వేస్తే, 'మందులు వాడొద్దు' అని వచ్చింది. అప్పటినుండి నేను ఆ ఆనెకాయలకి మందులు వాడటం మానేసాను. తర్వాత మా పాప ప్యూమిస్ స్టోన్ తీసుకొచ్చింది. వారంలో రెండు, మూడు సార్లు గోరువెచ్చని నీళ్లలో గళ్ళ ఉప్పు, నిమ్మరసం, తినేసోడా, షాంపూ వేసి అందులో 20 నిమిషాలపాటు పాదాలు ఉంచిన తర్వాత ప్యూమిస్ స్టోన్‌తో శుభ్రం చేయాలట. కానీ నాకు వీలుకాక వారానికి ఒకసారి అలా చేస్తూ రోజూ రాత్రి పడుకునేటప్పుడు పాదాలకు ఆముదం రాసుకుంటూ, ఇంట్లో కూడా మెత్తటి చెప్పులు వాడటం చేస్తూ ఉంటే ఇప్పుడు చాలావరకు ఆనెకాయలు తగ్గుముఖం పట్టాయి. ఇదంతా బాబా ప్రేరణ అనుకుంటున్నాను.

ఇంకోసారి నాకు కడుపు ఉబ్బరం వచ్చి ఇబ్బందిగా ఉంటుంటే, మందులు వాడటమా, లేదా అని బాబా ముందు చీటీలు వేస్తే, 'మందులు వాడొద్దు' అని వచ్చింది. దాంతో నేను 'బాబా మందులు వాడొద్దన్నారుగా, ఆయనే తగ్గించేస్తారు' అన్న నమ్మకంతో మందులు ఏమీ కొనలేదు. తర్వాత ఒకరోజు ఉదయం ఆఫీసుకు వెళ్లేటప్పుడు కడుపు ఉబ్బరంతో ఇబ్బందిగా ఉంటే ఇంట్లో ఉన్న ధనియాల పొడి అరస్పూను నోట్లో వేసుకొని నములుతూ ఆఫీసుకు వెళ్లాను. దాంతో నాకు ఆరోజు చాలా తేలిగ్గా అనిపించింది. అప్పటినుండి కడుపు ఉబ్బరంగా అనిపించినా, ఒక్కోసారి తేలిగ్గా ఉన్నా కూడా ధనియాల పొడి అరస్పూను తింటున్నాను. బాబా దయవల్ల నాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది.

నాకు స్పాండిలైటిస్(వెన్నుపూస డిస్క్ అరగటం) వలన వీపు అంతా నొప్పిగా ఉంటుంది. దానికి చాలాకాలం నుండి మందులు వాడుతున్నాను. ఆ విషయంలో కూడా మందులు వాడాలా, వద్దా అని చీటీలు వేసి బాబాని అడిగితే, 'మందులు వాడమ'ని బాబా చెప్పారు. అయినా నేను మందులు కొనకుండా బాబా తగ్గించేస్తారని భరిస్తూ ఉండేదాన్ని. అలా ఉండగా ఒకరోజు ఆఫీసులో ఖాళీ దొరికినప్పుడు శ్రీసాయి సచ్చరిత్ర చదువుతుంటే, ఒక భక్తుడితో బాబా వీపునొప్పి తగ్గడానికి మందులు వాడమని చెప్పడం చదివాను. అది నాకే చెప్పినట్లుగా అనిపించింది. ఎందుకంటే, చీటీలు వేసినప్పుడు కూడా మందులు వాడమనే బాబా చెప్పారు. కానీ నేను వాడట్లేదు. అందుకే బాబా ఈవిధంగా తెలియజేశారని అప్పటినుండి మందులు వాడుతున్నాను. "అన్నిటికీ ధన్యవాదాలు బాబా".

ఓం శ్రీసాయినాథ్ మహారాజ్ కీ జై.

సాయిభక్తుల అనుభవమాలిక 1884వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. తలచినంతనే చేత్తో తీసేసినట్టు బాధలన్నీ తీసేసే సాయి
2. వారం రోజుల్లో డబ్బు సమకూర్చిన బాబా

తలచినంతనే చేత్తో తీసేసినట్టు బాధలన్నీ తీసేసే సాయి

చల్లని తండ్రి శ్రీసాయినాథుని దివ్య పాదపద్మములకు నా నమస్కారం. నా పేరు జ్యోతి. ఎందరో సాయిభక్తులు అసంఖ్యాకమైన సాయిలీలలు తెలుసుకోవడానికి, అలాగే తమ అనుభవాలను సంతోషంగా అందరితో పంచుకోవడానికి, ఇంకా ఆ తండ్రి యందు భక్తి, విశ్వాసాలు మరింతగా బలపడటానికి ఈ బ్లాగు ఎంతో ఉపయోగపడుతుంది. నిజముగా ఈ బ్లాగు సాయి భక్తులకు ఒక వరం. సాయి అందరినీ కాపాడే దైవం. ఆయన అసంఖ్యాక లీలలలో నుండి కొన్ని మీతో ఇప్పుడు పంచుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను కొంచెం సున్నితమైన మనస్కురాలిని. అందువల్లనేమో తెలియదుకానీ, నాకు ఏవైనా సమస్యలు వస్తే వాటి గురించే ఆలోచిస్తూ బాగా ఆందోళన చెందుతూ ఉంటాను. ఆ కారణంగా నాకు నిద్ర సరిగా పట్టదు. మనిషి జీవితంలో సమస్యలు సహజమేనని నాకు తెలుసు. కానీ ఎంత ప్రయత్నించినా నేను ఆ ఆందోళన నుండి బయటపడలేకపోతున్నాను. నాకు వచ్చిన ఎన్నో చిన్న, పెద్ద సమస్యల నుండి ఆ సాయినాథుడు నన్ను కాపాడారు. అయినా నేను చాలా భయపడుతూ తీవ్రంగా ఆలోచిస్తూ ఉండటం వల్ల ఒకసారి రాత్రి అకస్మాత్తుగా ఆందోళన నా అధీనం తప్పిపోయి ఒళ్లంతా చల్లబడిపోయేది, గుండెల్లో నొప్పి వచ్చింది. ఇంకా ఏమైనా అయిపోతుందేమోననిపించి నాకు చాలా భయమేసింది. ఎంత శాంతపరుచుకుందామనుకున్నా నా వల్ల కాలేదు. నిజంగా అది అత్యంత ప్రమాదకర పరిస్థితి. ఆ సమయంలో నేను సాయితండ్రిని తలుచుకొని, "సాయీ! నన్ను క్షమించు. నువ్వు ఉన్నావని, ఆదుకుంటావని, అన్నీ చూసుకుంటావని తెలిసి కూడా ఆలోచిస్తూ భయంతో ఇంతదాకా తెచ్చుకున్నాను. ఇప్పుడు నా పరిస్థితి చాలా భయానకంగా ఉంది. నా కుటుంబం నా మీదే ఆధారపడి ఉంది. నన్ను కాపాడు సాయీ" అని వేడుకున్నాను. అంతే, దాదాపు గంట నుండి అనుభవిస్తున్న నరకయాతన, గుండెబరువు అన్నీ ఒక్కసారిగా చేత్తో తీసేసినట్లు పోయాయి.

ఇంకోసారి నేను తీవ్ర జ్వరం, ఒళ్లునొప్పులు, కడుపునొప్పితో చాలా బాధపడ్డాను. లేచే ఓపిక కూడా లేక సాయితండ్రిని వేడుకున్నాను. అప్పటినుండి జ్వరం తగ్గి చమటలు పట్టాయి. తలచినంతనే చేత్తో తీసేసినట్లు నా బాధలన్నీ తీసేసారు సాయి. ఇలా ఎన్నోసార్లు పిలవగానే తండ్రి నన్ను ఆదుకున్నారు. ఆయన ఎప్పుడూ తమని నమ్ముకున్న బిడ్డల పక్కనే ఉంటారు. అందుకే పిలవగానే పలుకుతున్నారు. మహాసముద్రం వంటి సాయి లీలలలో నుండి నేను ఒక చిన్న నీటి బిందువును పంచుకున్నాను. ఇంకా చాలా చెప్పాలనుంది. త్వరలో మరిన్ని అనుభవాలతో  మిమ్మల్ని కలుసుకుంటాను. సాయితండ్రికి, సాయి భక్తులకు నా ధన్యవాదాలు.

వారం రోజుల్లో డబ్బు సమకూర్చిన బాబా

సాయిబంధువులకు నా నమస్కారం. నా పేరు స్వాతి. నేను హైదరాబాద్ వాసిని. బాబా నా జీవితంలోకి వచ్చి 2 సంవత్సరాలవుతుంది. 'బాబా ఇంత ఆలస్యంగా నా జీవితంలోకి వచ్చారు. ముందే ఎందుకు రాలేదు' అని నాకు  అనిపిస్తుంది. కానీ ఆయన చాలా అద్భుతాలు చూపించారు.అందులోనుండి ఒక చిన్న అనుభవం పంచుకుంటున్నాను. నా జీవితంలోకి ఒక అబ్బాయి వచ్చి, నన్ను పెళ్లి చేసుకుంటానని అన్నాడు. నేను చాలా గందరగోళంలో ఉండి ఆ విషయం గురించి బాబా దగ్గర చీటీలు వేసాను. అప్పుడు, 'మోసం ఏం జరగదు. అతను నన్ను పెళ్లి చేసుకుంటాడ'ని వచ్చింది. నేను బాబా మీద నమ్మకంతో ఆ అబ్బాయిని మా ఇంటికొచ్చి మాట్లాడమని చెప్పాను. ఆ అబ్బాయి వచ్చి మా ఇంట్లో మాట్లాడాడు. మా అమ్మ ఒప్పుకుంది గానీ, నా పెళ్లి బాధ్యత మా మావయ్య తీసుకున్నందున ఆయనతో కూడా మాట్లాడించాల్సి ఉంది. ఈ విషయం అలా ఉంచితే, ఆ అబ్బాయికి విదేశాలకు వెళ్లే ప్రణాళికలున్నాయి. నవంబర్‌లో నన్ను పెళ్లి చేసుకొని విదేశాలకు వెళ్లాలన్నది అతని ఆలోచన. అయితే వీసా విషయంగా బ్యాంకు బాలన్స్ చూపించడానికి 3 లక్షల రూపాయలు తక్కువ అయ్యాయి. సమయం చూస్తే, ఒక వారమే ఉంది. అందువల్ల మేమిద్దరం ఒక్క వారంలో 3 లక్షలు ఎలా ఏర్పాటు చేయాలని చాలా ఆందోళన చెందాము. అప్పుడు నేను బాబాని, "మీరే ఆ డబ్బు ఏర్పాటు చేయాలి బాబా" అని గట్టిగా ప్రార్థించాను. అలా రోజూ రాత్రి బాబాని ప్రార్థిస్తూ, ఆయన మీద నమ్మకంతో ఆయనకే వదిలేసాను. అసలు ఎలా జరిగిందో తెలియదుకానీ, సమయానికి 3 లక్షలు సర్దుబాటు అవ్వడంతో బ్యాంక్ స్టేట్మెంట్ చూపించగలిగాము. అంతా అద్భుతంగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే, అంత మొత్తం ఏర్పాటవ్వడం అసాధ్యం. కానీ బాబా దయవల్ల జరిగింది. "థాంక్యూ సో మచ్ బాబా. నాకు ఇంత మద్దతు ఇస్తున్నందుకు, నాతో ఉంటున్నందుకు లవ్ యు సో మచ్ బాబా. మీ దయతో అంతా మంచిగా జరగాలని ఏ అడ్డంకులు లేకుండా మా పెళ్లి జరగాలని కోరుకుంటున్నాను తండ్రీ".

సాయిభక్తుల అనుభవమాలిక 1883వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. తోటి భక్తుల అనుభవాల ద్వారా జరిగిన మేలు
2. మనస్ఫూర్తిగా బాబా అనుకుంటే చాలు, ఏదైనా అయిపోతుంది

తోటి భక్తుల అనుభవాల ద్వారా జరిగిన మేలు
 
సాయి మహారాజ్‌కి, సాయి బంధువులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు రమాదేవి. నేను నా అనుభవాలు పంచుకునే ముందు సాయిబంధువులకు ఒక చిన్న విన్నపం చేసుకుంటున్నాను. నేను దాదాపు రెండున్నర సంవత్సరాల నుండి ఈ బ్లాగులోని భక్తుల అనుభవాలు చదువుతున్నాను. బాబా దయతో నేను కూడా చాలాసార్లు నా అనుభవాలు పంచుకున్నాను. ఏ ఒక్క రోజూ బ్లాగులో అనుభవాలు ప్రచురితం కాకుండా ఉండలేదు. కానీ ఈ మధ్యకాలంలో ప్రతిరోజూ బ్లాగులో అనుభవాలు ప్రచురితం కావడం లేదు. కాబట్టి బాబా అనుగ్రహం పొందగానే దయచేసి మీ అనుభవాలను వివరంగా బ్లాగుకి పంపండి. తద్వారా తోటి సాయి బంధువులకు మేలు చేసిన వాళ్లమవుతాం. అలా బ్లాగులోని సాయిబంధువుల అనుభవాలు చదివాక నేను పొందిన మేలును ఇప్పుడు చెప్తాను.

దాదాపు 2 సంవత్సరాల ‌నుండి మా బాబుకి స్కిన్ అలర్జీ ఉంది. స్కిన్ స్పెసలిస్ట్‌కి చూపించి, వాళ్ళు వ్రాసిన క్రీములు, సబ్బులు, టాబ్లెట్లు వాడినప్పటికీ 50% కూడా తగ్గలేదు. ఇక అప్పుడు దత్తస్వామికి, బాబాకి మ్రొక్కుకొని దత్త భస్మం, బాబా ఊదీ రాస్తుంటే 90% తగ్గింది. కానీ సమస్య రెండు సంవత్సరాల నుండి ఉండటం వలన కాళ్లపై నల్లటి మచ్చలు చాలా ఏర్పడ్డాయి. అవి అప్పుడప్పుడు దురదపెడుతుండేవి. నేను వాటిని తగ్గించమని బాబాని వేడుకుంటూ ఉండేదాన్ని. కొన్ని రోజులకి ఈ బ్లాగులో 'స్కిన్ అలర్జీ వస్తే, బాబాకి అభిషేకం చేసిన నీళ్ళు అలర్జీ ఉన్న చోట వ్రాయడం వల్ల అలర్జీ పూర్తిగా తగ్గింది' అని భక్తులు పంచుకున్నారు. అది చదివాక నన్ను కూడా అలా చేయమని బాబా ప్రేరణ ఇచ్చినట్లు అనిపించి, బాబుకి అభిషేక జలం రాద్దామని అనుకున్నాను. మా ఇంట్లో చిన్న బాబా విగ్రహం ఉంది. నేను ఆ బాబాకి అభిషేకం చేసి ఆ జలాన్ని ఒక సీసాలో భద్రపరిచాను. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అదేమిటంటే, ఒక సంవత్సరం కిందట బాబుకి చికెన్ పాక్స్ వచ్చి తగ్గింది. కానీ ఛాతీ దగ్గర ఒక కురుపు పెద్దగా, గట్టి కాయలా ఉండిపోయింది. నొప్పి కూడా ఉండేది. నేను బాబాని, "బాబా! బాబు అలర్జీ, అలర్జీ వల్ల ఏర్పడ్డ మచ్చలు, చికెన్ పాక్స్ వల్ల ఏర్పడ్డ కురుపు తగ్గిపోవాలి" అని వేడుకొని బాబా అభిషేక జలం బాబు శరీరంపై ఆయా ప్రాంతాల్లో రాశాను. అలా నాకు గుర్తు వచ్చినప్పుడు, అది కూడా చాలా కొద్దిసార్లే చేశాను. బాబా దయతో ఇప్పుడు బాబుకి పూర్తిగా తగ్గిపోయింది. అలాగే ఒకసారి మా బాబుకి ఆటలో ఇనుప తీగ గీసుకుపోయింది. నేను ఇంజక్షన్ చేయించలేమోననుకొని గాయమైన చోట ఊదీ, బాబా అభిషేక జలం రాశాను. బాబా దయవల్ల ఇంజక్షన్ లేకుండానే తగ్గింది. "బాబా! మీకు శతకోటి వందనాలు".
.
ఒకసారి మావారు తన ఆఫీసులో బాస్‌తో చాలా సమస్యలు ఎదుర్కొని 2, 3 నెలలు చాలా ఇబ్బందిపడ్డారు. అప్పుడు ఒకరోజు నేను ఈ బ్లాగులో అనుభవాలు చదువుతున్నప్పుడు 'సాయినాథ మూలబీజ మంత్రాక్షరి స్తోత్రం' పఠించడం వల్ల తమ సమస్య తీరిందని భక్తులు పంచుకున్న అనుభవం చదివాను. అప్పుడు నేను మా వారిచేత ఆ స్తోత్ర పఠనం చేయించాను. బాబా దయవల్ల రెండు నెలలలో మావారికి ఒక మంచి ఉద్యోగం వచ్చింది. ఈ విధంగా తోటి భక్తుల అనుభవాలు నాకు మేలు చేసాయి.

మరికొన్ని చిన్న చిన్న అనుభవాలు: ఒకరోజు మా ఇంట్లో గీజర్ పని చేయలేదు. నేను బాబాను వేడుకొని ఊదీ పెట్టాను. బాబా దయవల్ల సాయంత్రానికి మావారు ఆ సమస్యను సరిచేయగలిగారు. ఒకసారి మా అమ్మకి యూరిన్ ఇన్ఫెక్షన్ వలన ఇబ్బంది అయింది. నేను అమ్మకి తగ్గిపోవాలని ఊదీ పెట్టుకున్నాను. దాంతో అమ్మకి తగ్గిపోయింది. అలాగే అమ్మకి మోకాలు నొప్పి తగ్గాలని అనుకున్నాను. బాబా దయవల్ల ఇప్పుడు అమ్మకి ఉపశమనంగా ఉంది. మా పిల్లలు చాలాసార్లు వాళ్ళ పరీక్షల విషయంలో బాబాను వేడుకొని, బాబా నామం 108 సార్లు వ్రాసారు. బాబా వాళ్ళను ఎప్పరూ నిరాశపరచలేదు. "మీకు శతకోటి కృతజ్ఞతలు బాబా. మీ ప్రేమకు అంతులేదు సాయినాన్నా!".

మనస్ఫూర్తిగా బాబా అనుకుంటే చాలు, ఏదైనా అయిపోతుంది

సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. నేను ఒక బాబా భక్తురాలిని. నాకు తల్లి, తండ్రి, గురువు, సర్వస్వం ఆయనే. మా బ్రతుకు ఆయన కృపాబిక్ష. ఆయన లేని నిమిషం మాకు బ్రతుకు లేనట్లే! బాబాని నమ్ముకుంటే అడుగడుగునా అద్భుతాలు చూపిస్తారని మన అందరికీ తెలిసిందే! ఆయన నాకు ఎన్నో అద్భుతాలు చూపారు. అందులో నుంచి ఒకటి మీతో పంచుకుంటున్నాను. ఒకరోజు మా బాబుకి చాలా జ్వరమొచ్చి ఆ రోజంతా అలానే ఉంది. టెంపరేచర్‌లో అస్సలు మార్పు లేదు. బాబు జ్వరంతో పాటు కడుపునొప్పి అని కూడా ఏడ్చాడు. దానికితోడు మరుసటిరోజు వాంతులు, విరోచనాలు కూడా అయ్యాయి. నాకు చాలా భయమేసి బాబాతో చెప్పుకున్నాను. తర్వాత హాస్పిటల్‌కి వెళ్తే, ఇన్ఫెక్షన్ అని చెప్పి యాంటీబయాటిక్స్ ఇచ్చారు. బాబా దయ బాబు రెండురోజుల్లో కోలుకున్నాడు.  మనం బాబాకి సర్వస్య శరణాగతి వెడితే చాలు, అంతా ఆయన చూసుకుంటారు. మనస్ఫూర్తిగా బాబా అనుకుంటే చాలు, ఏదైనా అయిపోతుంది. నిజంగా బాబా అంటే బాబానే. ఆయన పాదాల చెంత మేము క్షేమంగా ఉన్నామని నా నమ్మకం. "ధన్యవాదాలు బాబా".

సాయిభక్తుల అనుభవమాలిక 1882వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఆరోగ్యప్రదాత సాయి
2. బాబా దయ
3. బాబాని నమ్ముకుంటే దేనికి ఢోకా ఉండదు

ఆరోగ్యప్రదాత సాయి

సాయిబంధువులకు నమస్కారం. నా పేరు లక్ష్మి. నేను సాధారణ సాయి భక్తురాలిని. ఎనిమిది నెలల కిందట అంటే 2023, నవంబర్ లేదా డిసెంబర్‌లో నాకు తీవ్రమైన చలి జ్వరం వచ్చింది. చలికి ఒకరోజు రాత్రి అస్సలు తట్టుకోలేకపోయాను. మర్నాడు హాస్పిటల్‌కి వెళ్తే డాక్టర్లు టెస్టులన్నీ చేసి 'డబల్ టైఫాయిడ్' అని చెప్పి నాలుగు రోజులు సెలైన్లు పెట్టారు. నేను, "బాబా! నాకు జ్వరం తగ్గేలా చేయండి" అని బాబాను వేడుకున్నాను. వెంటనే బాబా దయవలన జ్వరం పూర్తిగా తగ్గింది. 'బాబా! నువ్వు ఉన్నావు తండ్రీ' అని మనసులోనే బాబాకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఒకసారి ఛాతి మీద రుద్దుతున్నప్పుడు గాయంలా అయింది. అది చూసి నేను ఎంతో భయపడిపోయి, "బాబాతండ్రీ! మీరే ఈ గాయాన్ని మాన్పించాలి. ఏమీ కాకుండా ఉండేలా చూడు తండ్రీ" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల రెండు రోజుల్లో ఆ గాయం మానిపోయింది. మరోసారి నాకు తీవ్రమైన తలనొప్పి వచ్చి వారం రోజులు వరకు తగ్గలేదు. నాకు భయమేసి, "బాబాతండ్రీ! ఏమిటీ తలనొప్పి? ఒక్క రోజుతో తగ్గిపోయేది వారం రోజులైనా తగ్గటం లేదు. ఈ నొప్పిని తగ్గించు తండ్రీ" అని బాబాని వేడుకున్నాను. తర్వాత బాబా దయవలన తలనొప్పి తగ్గుముఖం పట్టి పూర్తిగా తగ్గిపోయింది. ఇలా ఎన్నో అనుభవాలు ప్రసాదించారు బాబా. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

బాబా దయ

సాయిభక్తులందరికీ నమస్కారాలు. నా పేరు తిలోత్తమ. బ్లాగులోని తోటి సాయిభక్తుల  అనుభవాలు చదువుతుంటే బాబా మీద భక్తి, గౌరవాలు మరింత పెరుగుతున్నాయి. బాబా చల్లని చూపుతో మాకు 2023, జూలై 20న పాప పుట్టింది. తను పుట్టినప్పటినుంచి ఇప్పటివరకు ఏ చిన్న సమస్య వచ్చినా బాబాని ప్రార్థించి, ఊదీ వాడుతుంటే అంతా సమసిపోతుంది. తనకి 11వ నెల వచ్చాక తలనీలాలు(వెంట్రుకలు) తీసే కార్యక్రమం పెట్టుకున్నాం. నేను అప్పుడు తను సరిగ్గా చేయించుకుంటుందో, లేదోనని చాలా కంగారుపడ్డాను. నేను తనకి తలనీలాలు తీసే సమయంలో బాబాని తలుచుకుంటూ, "బాబా! తను సరిగ్గా తీయించుకొనేలా చూడండి" అని వేడుకున్నాను. అంతే, పాప కొంచెం కూడా తల కదపకుండా చాలా బాగా తీయించుకుంది. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. బాబా దయతోనే తను సరిగ్గా కూర్చుంది అని నాకు తెలుసు. ఇలా ప్రతి చిన్న విషయంలో బాబా మాకు తోడుగా ఉన్నారు. "ధన్యవాదాలు బాబా".

బాబాని నమ్ముకుంటే దేనికి ఢోకా ఉండదు

సాయి ఆత్మబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు సంధ్య. మా అబ్బాయి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తను చదువులో సాధారణంగా ఉంటాడు. మందకొడి మాత్రం కాదు. కానీ అతి విశ్వాసం(ఓవర్ కాన్ఫిడెన్స్)తో చదువుని చాలా తేలికగా తీసుకుంటాడు, అందువల్ల మ్యాథ్స్‌లో ఫెయిల్ అయ్యాడు. కాలేజీవాళ్లతో పాటు మేమంతా నమ్మలేకపోయాం. 'ఏంటి ఇలా జరిగింది?' అని ఒక నిమిషం షాక్ తిన్నాము. తప్పితే తప్పాడుగానీ ఆ కారణం చేత తనెక్కడ మనస్తాపం చెందుతాడోనని భయపడ్డాము. "అయ్యో బాబా! ఏంటి ఇలా చేశారు? మీరే కాపాడండి" అని బాబాని ప్రార్థించి చాలా రకాలుగా బాబుని ఉత్సాహపరిచి ఇంట్లోనే పరీక్షకి మళ్ళీ ప్రిపేర్ చేయించాం. ఆ క్రమంలో మేము బాగా ఒత్తిడికి లోనయ్యాం. కానీ నేను నా మనసులో, 'బాబా నా బిడ్డకు పెద్ద గుణపాఠం నేర్పారు. వైఫల్యాన్ని తట్టుకొని నిలబడడం నేర్పించారు' అని అనుకుంటూ బాబు చేత ప్రాక్టీసు చేయించాను. బాబా దయవల్ల బాబు సప్లిమెంటరీలో 90 మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. బాబా ఏది చేసినా మన మంచికే అన్నది నిజం. ఆయన  ఎన్నో అసాధ్యమైన పనులు సుసాధ్యం చేశారు. ఒకటి మాత్రం నిజం, బాబాని నమ్ముకుంటే దేనికి ఢోకా ఉండదు. "థాంక్యూ బాబా".

సాయిభక్తుల అనుభవమాలిక 1881వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ప్రణాళికతో పాపకి నయమయ్యేలా చేసిన బాబా
2. రెండు నెలల నరకయాతన నుంచి విముక్తి కలిగించిన బాబా

ప్రణాళికతో పాపకి నయమయ్యేలా చేసిన బాబా

సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు రమాదేవి. నేను సాయినాథుడు నాపై చూపిన కృపను మీతో పంచుకుంటున్నాను. మా పాపకి మూడు సంవత్సరాలు. ఒకరోజు నేను తనకి స్నానం చేయిస్తుండగా తను, ఛాతి భాగం నొప్పిగా ఉందమ్మా అని చెప్పింది. చూస్తే, చనుమొన ప్రాంతంలో వాపు ఉంది, ఎర్రగా కూడా ఉంది. ఒక వైపే అలా ఉంది. అప్పుడు నేను చీమకుట్టినట్టు ఉందని జండూబామ్ రాసి, విషయాన్ని తేలికగా తీసుకున్నాను. ఎందుకంటే, అప్పుడప్పుడు తనని చీమలు కుడుతుంటాయి, అప్పుడు అక్కడ ఎర్రగా అవుతుంటుంది కూడా. అందుచేత ఇది అలానే అనుకున్నాను. రెండు రోజుల తర్వాత పాప మళ్లీ నొప్పి అంది. అప్పుడు రాత్రి 10 గంటలైంది. నాకు చాలా భయమేసింది, చాలా టెన్షన్ పడ్డాను. వెంటనే నాకు తెలిసిన డాక్టర్‌కి కాల్ చేశాను. పాపం ఆ డాక్టర్ ఆ సమయంలో పడుకొని ఉన్నారు. నిజానికి నేను సమయంలో అలా డిస్టర్బ్ చేయకూడదు. కానీ నాకు చాలా భయమేసి కాల్ చేసి విషయం చెప్పి, వీడియో కూడా తీసి పంపాను. ఆయన, "రేపు క్లినిక్‌కి తీసుకొని రండి" అని చెప్పారు. నాకు భయంతో ఆ రాత్రి నిద్ర రాలేదు. "బాబా! పాపకి ఏం కాకూడదు" అనుకుంటూ పాపకి వాపు, ఎర్రదనం ఉన్న చోట ఊదీ రాసి, మరికొంత ఊదీ పాప నోట్లో వేసి పడుకోబెట్టాను. మరుసటిరోజు పాపని హాస్పిటల్‌కి తీసుకెళ్తే, పిల్లల డాక్టరు చూసి, "వాపు సమస్య కాదు. చనుమొన దగ్గర గట్టిగా ఉంది. దాని సంగతి చూడాలి" అని చెప్పి మూడు రోజులకి మందులిచ్చి మళ్లీ రమ్మని చెప్పారు. నాకు చాలా భయమేసి ఆందోళన చెందాను. "సాయినాథా! నువ్వే కాపాడాలి. పాపకి ఏం కాకూడదు, తగ్గిపోవాల"ని అని బాబాకి చెప్పుకున్నాను. రెండు రోజులు తర్వాత మా అక్క ఫోన్ చేసి, "శిరిడీ వెళదామ"ని అడిగింది. నేను సరేనని మనసులో 'శిరిడీ వెళ్తే, పాపకి తగ్గుతుంది. బాబా అక్కడ న్యాయం చేస్తారు' అని అనుకున్నాను. నేను మెడికల్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నాను. సెలవుకోసం మా డాక్టర్ దగ్గరకి వెళ్లాను. ఆయన సెలవు ఇచ్చారు. తర్వాత ఎందుకైనా మంచిదని ఆయనతో పాప గురించి చెప్పి వీడియో చూపించాను. అప్పుడు ఆయన, "అది అంత సమస్య కాదు. చనుమొన దగ్గర లింఫ్ నోడ్స్ డిలీట్ అయుంటాయి. కొంతమందికి అలా జరుగుతుంద"ని చెప్పి ఆంటిబయోటిక్స్ ఇచ్చి, "ఉదయం, సాయంత్రం వాడమ"ని చెప్పారు. అయితే నేను ఉదయం మాత్రమే పెట్టాను. దాంతో అది తగ్గిపోయింది. కానీ నా శిరిడి ప్రయాణం రద్దు అయింది. ట్రైన్ టికెట్లు కన్ఫర్మ్ కాలేదు. బాబా ఇదంతా మా డాక్టర్ని కలవడానికి ప్లాన్ చేసి ఉంటారు. నేను ఆయన ప్లాన్‌లో భాగంగా సెలవుకోసం మా డాక్టరు దగ్గరకి వెళ్లకపోయుంటే పాపకి ఇంత త్వరగా తగ్గేది కాదు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. లవ్ యు బాబా".

రెండు నెలల నరకయాతన నుంచి విముక్తి కలిగించిన బాబా

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి. నా పేరు శ్రీనివాసబాబు. నేను హైదరాబాదులో నివాసం ఉంటున్నాను. నాకు నిజంపేటలో ఒక డబుల్ బెడ్ రూమ్ ప్లాట్ ఉంది. దాన్ని 2019లో అద్దెకిచ్చాను. ఈమధ్య అద్దె పెంచితే వాళ్ళు, రెండు నెలల్లో ఖాళీ చేస్తామని చెప్పారు. వాళ్ళు ఖాళీ చేయడానికి ఇంకో 20 రోజులు ఉండగా నేను టూలేట్ బోర్డు పెట్టాను. దాంతో ఇల్లు చూడటానికి కొంతమంది వచ్చారు. అలా వచ్చిన వాళ్లు ఇంట్లో ఉన్న లాప్టాప్ తీసుకుని వెళ్లారని, లాప్టాప్ డబ్బులు ఇస్తేగాని ఇల్లు ఖాళీ చేయనని ఆ ఇంట్లో ఉన్నతను గొడవపెట్టాడు. అంతే కాకుండా మెంటైనెన్స్ డబ్బులు కూడా ఇవ్వలేదు. నాకు వేరే దారిలేక పోలీసు కేసు పెట్టాను. అయినా అతను, "నా లాప్టాప్ మీ ఇంట్లోనే పోయింది కనక అది దొరికే వరకు నేను ఇల్లు ఖాళీ చేయన"ని  సతాయించాడు. ఇక మావల్ల కాక బాబా మీద భారమేసి, "ఏ గొడవలూ జరగకుండా అతని మనసు మారి ఖాళీ చేసేలా చేయండి" అని బాబాని వేడుకున్నాను. మరుసటి ఆదివారం పెద్దమనుషులను తీసుకొని వెళ్లి పంచాయతీ పెట్టించాను. బాబా వాడి మనసు మార్చారు. ఖాళీ చేయడానికి ఒక నెల గడువు అడిగి, చెప్పినట్టు ఇల్లు ఖాళీ చేశాడు. ఇప్పుడు మేము ఇల్లు వేరేవాళ్ళకి అద్దెకు ఇచ్చాము. ఇదంతా కేవలం బాబా దయ. రెండు నెలల నరకయాతననుండి విముక్తి కలిగించారు బాబా. "ధన్యవాదాలు బాబా".

సాయిభక్తుల అనుభవమాలిక 1880వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. శ్రీసాయి అనుగ్రహాశీస్సులు
2. పోయిన మొబైల్ తిరిగి ఇప్పించిన బాబా

శ్రీసాయి అనుగ్రహాశీస్సులు


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి. నా పేరు లలిత. ఒకసారి మా అమ్మకి ప్లేట్లెట్స్ తగ్గిపోయాయి. అదీకాక జ్వరం వలన అమ్మ బాగా నీరసించిపోయింది. అప్పుడు అమ్మని హాస్పిటల్‌కి తీసుకెళితే డాక్టర్, "5 రోజులు హాస్పిటల్లో ఉండాల"ని ఆ 5 రోజులు అమ్మకి సెలైన్‌లు ఎక్కించారు. దాంతో అమ్మకి ప్లేట్లెట్స్ పెరిగి జ్వరం, నీరసం తగ్గాయి. అప్పుడు డాక్టరు అమ్మని ఇంటికి పంపించారు. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మకి రెండు రోజులు బాగానే ఉందికానీ, తర్వాత కాలు, కడుపు బాగా పొంగిపోయాయి. దాంతో అమ్మని మళ్లీ హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళాము. అప్పుడు నేను బాబాకి దణ్ణం పెట్టుకొని, "అమ్మకి మందుల ద్వారా తగ్గిపోవాలి. హాస్పిటల్లో ఉంచవలసిన అవసరం రాకూడదు" అని చెప్పుకున్నాను. బాబా దయవల్ల డాక్టర్ అమ్మని చూసి నెల రోజులకి మందులు వ్రాసి, ఇంటి దగ్గరే మందులు వాడుకోమని చెప్పి పంపారు. "ధన్యవాదాలు బాబా".


2024, మార్చి 30న మా బాబాయి కొడుకు ఉపనయనం అయ్యింది. ఆ కార్యక్రమానికి అలాగే పందిరిరాటకి రమ్మని బాబాయివాళ్లు మరీ మరీ పిలిచారు. కానీ అది నాకు నెలసరి సమయం. నెలసరి రాకుండా మాత్రలు వేద్దామంటే ఆ కార్యక్రమాలు జరిగిన వెంటనే ఉగాది పండుగ ఉంది. అందువలన నేను మాత్రలు వేయకుండా బాబాకి దణ్ణం పెట్టుకొని, "పందిరిరాటకి వెళ్లలేకపోయినా ఉపనయనానికి వెళ్లేలా చూడమ"ని చెప్పుకున్నాను. సాయి దయవలన పందిరిరాటకి వెళ్లలేకపోయినా ఉపనయనంకి వెళ్లాను. "ధన్యవాదాలు బాబా".


మా పిన్నికి బోన్ క్యాన్సర్ వచ్చింది. తను చనిపోతారని ఆమెను హాస్పిటల్‌లోనే ఉంచారు. చెల్లెలిద్దరూ చాలా ఏడుస్తుంటే నేను బాబాకి దణ్ణం పెట్టుకొని, "బాబా! ఆవిడ మంచం మీద అయినా కొన్నాళ్ళు ఉంటే బాగుంటుంది. ఆ పిల్లలిద్దరూ చాలా బాధపడుతున్నారు" అని చెప్పుకున్నాను. బాబా దయవలన ఆవిడ ప్రస్తుతానికి బాగానే ఉన్నారు. కాకపోతే, మంచం మీద. చివరి దశ, ఇంకా ఆవిడ లేచి తిరగలేరు. ఇకపోతే, మా పెద్దపాపలో ఇంటర్‌‌లో 900 పైన మార్కులు రావాలని, అలాగే చిన్నపాపకి పదవ తరగతిలో 500 మార్కులు రావాలని బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. బాబా దయవల్ల పెద్దపాపకి 901, చిన్నపాపకి 521 మార్కులు వచ్చాయి. "ధన్యవాదాలు బాబా. వయసుకు తగ్గట్టు పెద్దపాప ఎదగడం లేదు బాబా. దయచేసి తను ఎత్తు, బరువు పెరిగేటట్లు చేయండి. అలాగే చిన్నపాపకి సెల్ చూసే అలవాటు తగ్గేటట్లు చేయండి. జన్మజన్మలకి మేము మేలు మరిచిపోను తండ్రీ. నన్ను, నా కుటుంబాన్ని కాపాడండి. నాకు మీ పాదాలందు స్థిరమైన నమ్మకం, భక్తి ఉండేలా అనుగ్రహించండి బాబా".


శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై.


పోయిన మొబైల్ తిరిగి ఇప్పించిన బాబా

సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. సాయిబాబానే నాకు అన్నీ. నేను ఉద్యోగస్థురాలిని. ఒక సాయంత్రం నేను కాలేజీ బస్సు దిగి ఇంటికొచ్చాక చూసుకుంటే నా మొబైల్ లేదు. బస్సు స్టాప్ దగ్గర పడిపోయిందేమోనని వెనక్కి వెళ్లి అక్కడ చూసాము కానీ, మొబైల్ కనిపించలేదు. అప్పుడు బస్సులో మర్చిపోయానేమోనని డ్రైవరుకి కాల్ చేస్తే, అతను బస్సులో చూసి లేదన్నాడు. నేను ఇంకా అది దొరుకుతుందన్న ఆశను కోల్పోయాను. మొబైల్‌లో బ్యాటరీ తక్కువగా ఉంది. మా మామయ్య తన మొబైల్ నుండి కాల్ చేస్తే, రింగ్ అయిందికానీ, ఎవరూ లిఫ్ట్ చేయలేదు. అందుకని పోలీసుస్టేషన్‌లో చెప్తే ట్రాక్ చేస్తారని బయలుదేరి నా భర్తకి కాల్ చేసి, విషయం చెప్పాను. ఆయన నేను ట్రాక్ చేస్తానని, "పోలీస్ స్టేషన్ దగ్గర చూపిస్తుంది" అని చెప్పారు. దాంతో మేము ఎవరైనా నా మొబైల్ పోలీస్ స్టేషన్‌లో ఇచ్చి ఉంటారని తొందరగా వెళ్ళాము. అయితే అక్కడు పోలీసులు ఎవరూ మొబైల్ తెచ్చివ్వలేదన్నారు. దాంతో నేను నిరాశ చెంది, "బాబా! ఇప్పటికే మొబైల్ దొరకడం అసాధ్యం. కానీ మీరు దాన్ని సాధ్యం చేయగలర"ని బాబాకి చెప్పుకున్నాను. అంతలో నా భర్త ఫోన్ చేసి, "నీ మొబైల్ ఎవరి దగ్గర ఉందో, వాళ్ళు అక్కడే ఉన్నారు. మొబైల్ తీసుకోండి" అని అన్నారు. సరేనని, మేము నా మొబైల్‌కి కాల్ చేస్తే, వాళ్ళు లిఫ్ట్ చేసి, "పోలీస్ స్టేషన్ బయట వున్నాము. రండి, మీ ఫోన్ మీకు ఇస్తాము' అన్నారు. మేము వెళ్లి నా ఫోన్ తీసుకున్నాము. బాబా 20 నిమిషాల్లో నా మొబైల్ నాకు ఇప్పించేసారు. నిజంగా 'బాబా' అనుకుంటే చాలు తీరుస్తారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

సర్వం సాయినాథ పాదర్పణమస్తు.

సాయిభక్తుల అనుభవమాలిక 1879వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఎప్పుడూ తోడుగా ఉండే బాబా
2. రెండురోజుల్లో ఉద్యోగం వచ్చేలా అనుగ్రహించిన బాబా

ఎప్పుడూ తోడుగా ఉండే బాబా

సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు కోమలవల్లి. మా అమ్మాయి వివాహానంతరం ఆర్థికంగా నిలబడటానికి నేను 2024, జనవరి నెలలో నిండు గర్భంతో ఉన్న ఒక ఆవును 60 వేల రూపాయలకి కొన్నాను. అది మా దగ్గరకు వచ్చిన నాలుగు రోజులకు డెలివరీ సమయం ఆసన్నమై ఈనలేక అవస్థపడుతుంటే డాక్టర్ పట్టి దూడను బయటకి లాగారు. ఆ దూడ ఒక పది రోజులు ఉండి చనిపోయింది. డెలివరీ అయినప్పటినుండి ఆవుకు రోజూ జ్వరం వస్తుండేది. ఎన్నో ఇంజక్షన్లు, మందులు వాడాము. అదే సమయంలో నా ఆరోగ్యం బాగాలేక ఒక 20 రోజులు బాగా ఇబ్బందిపడ్డాను. ఆవు కూడా చాలా ఇబ్బందిపెట్టింది. సరిగ్గా తినదు, నీళ్లు తాగదు. తెల్లారి లేచిన వెంటనే ఆవు ఎలా ఉందోనని ముందు దాన్నే చూసేదాన్ని. స్కూలులో టీచరుగా పనిచేస్తున్న నేను డ్యూటీలో ఉండగా నా ఫోన్ రింగ్ అయితే చాలు, 'ఏం వినాల్సి వ స్తుందో!' అని భయపడేదాన్ని. అంతలా నేను మానసిక వ్యధకు గురయ్యాను. ఇలా ఉండగా ఒకరోజు ఆవు ఉన్నట్టుండి పడిపోయింది. 10 సెలైన్ బాటిళ్లు ఎక్కించాము. అందరూ, "అది ఇంకా బతకదు. మీరు దానికోసం చాలా ఖర్చు పెట్టారు. దాన్ని కసాయివాళ్ళకి ఇచ్చేయండి. ఎంతో కొంత వస్తుంది" అని అన్నారు. నేను ఏడుస్తూ మావారితో, "చనిపోతే పూడ్చేద్దాం. కానీ కసాయివాళ్ళకి ఇవ్వొద్దు" అని అక్కడ ఉండలేక డ్యూటీకి వెళ్ళిపోయాను. మావారికి కూడా దానిని కసాయివాళ్లకు ఇవ్వడం ఇష్టంలేక మన ప్రయత్నం మనం చేద్దామని ఏవో ప్రయత్నాలు చేశారు. బాబా ఆశీర్వాదంతో ఆయన ప్రయత్నాలు ఫలించి ఆవు లేచి నిలబడింది. మావారు నాకు ఫోన్ చేసి, "ఆవు లేచి నిలబడింద"ని చెప్పారు. నేను వెంటనే ఇంటికి వచ్చి మళ్ళీ డాక్టర్ను పిలిపించి ట్రీట్మెంట్ చేయించాం. బాబా ఊదీ నీళ్లలో కలిపి ఆవు చేత తాగించాను. బాబా దయవల్ల ఆవు కోలుకుంది. కానీ దాన్ని నా దగ్గరకు ఉంచుకోవడానికి నాకు ధైర్యం సరిపోలేదు. ఆ విషయం మా తమ్ముడితో చెప్తే, తను వేరే వాళ్ళతో మాట్లాడి ఆవును చూసుకునే ఏర్పాటు చేశాడు. ఆవును వాళ్లతో తోలేసాక 'దాన్ని కొనడానికి 60,000 పెట్టాను, దాని వైద్యానికి మరో 30,000 రూపాయలదాకా పెట్టాన'ని మొదట బాధేసింది. కానీ, "ఏ వస్తువైనా, వ్యక్తి అయినా, ప్రాణి అయినా ఋణం తీరేవరకే నీ దగ్గర ఉంటుంది" అన్న బాబా మాటలు గుర్తొచ్చి ఏ జన్మలోనో ఆ అవుకు నేను ఋణపడి ఉంటానని, ఈ జన్మలో ఇలా తీరిందని నన్ను నేను సమాధానపరుచుకున్నాను. దాంతో నాకు చాలా మనశాంతిగా అనిపించింది. రెండు నెలల తర్వాత ఆవు ఎలా ఉందో చూద్దామని వెళితే, వాళ్ళు దానికి సరిగా తిండి పెట్టకుండా బాగా పాడుచేశారు. ఆవును చూసి వచ్చిన తర్వాత నాకు మళ్ళీ మనసులో భయం మొదలైంది. ఫోన్ రింగ్ అయితే గుండెలో దడగా ఉండేది. అప్పుడు మా తమ్ముడితో, "ఎంతకైనా ఆవును అమ్మేయమ"ని చెప్పాను. కానీ ఆవు పరిస్థితి చూసి ఎవరూ కొనడానికి ముందుకు రాలేదు. అప్పుడు నేను, "ఎటువంటి ఆటంకాలు లేకుండా అవు అమ్మేసేటట్లు చూడమ"ని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల మా అమ్మాయి మామగారు ఎవరితోనో మాట్లాడి ఆవును 15,000 రూపాయలకు అమ్మేసారు. ఇలా బాబా ఆ సమయంలో నాకు తోడుగా ఉన్నారు. ఆయన ఎప్పుడూ నాతో ఉన్నారని, ప్రతి పని ఆయనే చూస్తున్నారని నేను నమ్ముతాను. అదే నిజం. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

సర్వం సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు.

రెండురోజుల్లో ఉద్యోగం వచ్చేలా అనుగ్రహించిన బాబా

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. నా పేరు విజయశ్రీ. ముందుగా సాయితండ్రికి, సాయిబంధువులకు నా నమస్కారములు. 2023, సెప్టెంబర్ నెలలో మావారికి ఉద్యోగంలో ఒక సమస్య వచ్చింది. నేను చాలా చాలా వేదన అనుభవించి, "తండ్రీ! దయ చూపు" అని బాబాను వేడుకున్నాను. తర్వాత ఫేస్బుక్‌లో "నీ భర్తకు వేరే ఉద్యోగం వస్తుంది. కంగారుపడకు" అని ఒక సందేశం వచ్చింది. తరువాత మావారు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు. నేను, "ఆ ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయ్యేలా అనుగ్రహించండి" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల రెండు రోజుల్లో ఆ ఉద్యోగంలో చేరమని మావారికి ఉత్తర్వులు వచ్చాయి. "ధన్యవాదాలు బాబా. ఎల్లవేళలా మీ పాదాల దగ్గర నాకు చోటు ఇవ్వు తండ్రీ. మీకు శతకోటి వందనాలు సాయి".

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo