సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 648వ భాగం.....




ఈ భాగంలో అనుభవాలు:
  1. సాయితండ్రిని నమ్ముకుంటే అంతా మంచే జరుగుతుంది
  2. కరోనా పరీక్ష అవసరం లేకుండా ఆరోగ్యాన్ని చేకూర్చిన బాబా

సాయితండ్రిని నమ్ముకుంటే అంతా మంచే జరుగుతుంది


సాయిభక్తుడు వై.శ్రీనివాసరావు తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.


సాయిభక్తులకు నమస్కారం. గతంలో సాయితండ్రి నాకు ప్రసాదించిన అనుభవాలను మీ అందరితో పంచుకున్నాను. అలాగే, నా కుమారుని విషయంలో సాయితండ్రి చేసిన అద్భుతమైన మిరాకిల్‌ను ఇప్పుడు మీ అందరితో పంచుకుంటున్నాను. నా అనుభవాలను అందరితో పంచుకునే అవకాశం ఇచ్చిన సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్ వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.                                     


నా పెద్దకుమారుడు B.Tech (మెకానికల్) పూర్తయిన తరువాత తనకు జర్మనీలో M.S చేయాలని ఉందని మాతో చెప్పాడు. మేము అందుకు అంగీకరించి అందుకు సంబంధించిన ప్రయత్నాలు ప్రారంభించాము. ఈ విషయంలో సాయితండ్రి సహాయం కోరుతూ 5 వారాలు ‘సాయి దివ్యపూజ’ చేద్దామనే తన ఆలోచనను నా భార్య పద్మావతి నాతో చెప్పింది. వెంటనే మేము సాయి దివ్యపూజ 5 వారాలు చేద్దామని నిర్ణయించుకొని, సాయి తండ్రికి ముడుపు కట్టి, ‘పూజ ముగిసేలోపు మా కుమారునికి జర్మనీలో మంచి యూనివర్సిటీలో, మంచి కోర్సులో M.S సీటు వచ్చేటట్లు చేయమ’ని బాబాను ప్రార్థించాము. వెంటనే M.S సీటు కొరకు జర్మనీలోని యూనివర్సిటీలకు దరఖాస్తు చేయటం ప్రారంభించాము. ఒక మంచి యూనివర్శిటీ వాళ్ళు మా కుమారునికి "Space Engineering" కోర్సులో అడ్మిషన్ ఇవ్వడానికి అంగీకరిస్తూ, జర్మనీ భాషలో B1 సర్టిఫికెట్ తప్పనిసరిగా కావాలని షరతు విధించారు. కానీ మా కుమారునికి B1 సర్టిఫికెట్ పూర్తికాలేదు. అందువలన ఆ యూనివర్సిటీవాళ్ళు మా కుమారుని దరఖాస్తుని తిరస్కరించారు. అప్పటికి సాయి దివ్యపూజ 5 వారాలు పూర్తయ్యాయి. “మా కుమారుని M.S విషయంలో సహాయం చేయమ”ని మేము సాయితండ్రిని ఆర్తిగా ప్రార్థించాము. అందరినీ శ్రద్ధ, సబూరిలతో ఉండమని, ఏమి జరిగినా మన మంచికే అనుకొని ముందుకు వెళ్ళమని మన సాయితండ్రి చెప్పిన మాటలు గుర్తుచేసుకుని మా కుమారుని విషయంలో బాబా అంతా మంచే చేస్తారని నమ్మకంతో ఉన్నాము. మేము నమ్మినట్లే బాబా గొప్ప మిరాకిల్ చేశారు. ఏ యూనివర్సిటీ అయితే జర్మనీ భాషకు సంబంధించిన B1 సర్టిఫికెట్ లేదని మా కుమారుని దరఖాస్తుని తిరస్కరించిందో, అదే యూనివర్సిటీ ‘B1 సర్టిఫికెట్ అవసరం లేదని, మా కుమారుని M.S సీటు కేటాయిస్తున్నామ’ని మాకు ఇ-మెయిల్ చేశారు. బాబా చేసిన అద్భుతానికి మేమంతా ఆశ్చర్యానందాలకు లోనయ్యాము. తరువాత మా కుమారుడు ఆ యూనివర్సిటీలో "Space Engineering" కోర్సులో చేరి ఆన్లైన్ క్లాసులకు కూడా హాజరవుతూ ఉన్నాడు. ఆ తరువాత, 2020, డిసెంబరు 12వ తేదీన మరొక జర్మన్ యూనివర్సిటీలో "Material Science" కోర్సులో మా కుమారుడికి M.S సీటు వచ్చింది. ఈ యూనివర్సిటీ జర్మనీలోని టాప్ 10 యూనివర్సిటీలలో 5,6 స్థానాలలో ఉంటుందట. మాకు చాలా చాలా సంతోషం కలిగింది. సాయితండ్రిని నమ్ముకుంటే అంతా మంచే జరుగుతుంది. తనను నమ్ముకున్నవారిని సాయితండ్రి ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటారు. కేవలం మనం కొద్దిగా శ్రద్ధ, సబూరి కలిగివుంటే చాలు. “సాయితండ్రీ! ఎల్లప్పుడూ ఇలాగే నీ బిడ్డలను కనిపెట్టుకొని ఉండమని, మా కుమారుల చదువు విషయంలో సహాయం చేస్తూ వారికి తోడుగా ఉండమని మీ దివ్యచరణాలను వేడుకుంటున్నాము”.


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!


కరోనా పరీక్ష అవసరం లేకుండా ఆరోగ్యాన్ని చేకూర్చిన బాబా


సాయిభక్తుడు కె.శ్రీనివాసరావు తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.


సాయిభక్తులకు, ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారాలు. నా పేరు శ్రీనివాసరావు. ఇంతకుముందు బాబా నాకు ప్రసాదించిన రెండు అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడు బాబా నాకు, నా కుటుంబానికి ప్రసాదించిన మరొక అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను.


నా భార్య టిబి కోసం కొంతకాలంగా మందులు వాడుతోంది. ఇటీవల కరోనా సమయంలో తన ఆరోగ్యం బాగాలేక తనను డాక్టరు వద్దకు తీసుకువెళ్ళాను. డాక్టరు ముందుగా, “మీకు జ్వరం, జలుబు ఉన్నాయా?” అని అడిగి, అవేమీ లేవని చెప్పిన తర్వాత లోపలికి రమ్మన్నారు. నేను, నా భార్య లోపలికి వెళ్ళాము. డాక్టరు తనను పరీక్షించిన మీదట, “టిబి పూర్తిగా తగ్గిపోయింది. కాబట్టి ఆ మందులు ఇక వాడొద్దు” అని చెప్పారు. ఆ మాట వింటూనే బాబా దయతో నా భార్యకు టిబి తగ్గిపోయిందని చాలా సంతోషించాను. తరువాత, “నా భార్యకు నొప్పులు (గొంతునొప్పి, ముక్కునొప్పి మొదలైనవి) ఎక్కువగా ఉన్నాయ”ని డాక్టరుతో చెప్పాను. అందుకు డాక్టరు, “కరోనా పరీక్ష చేయించుకొని రండి, లేకపోతే చూడను” అని చెప్పి మమ్మల్ని బయటకు పంపేశారు. ఇక చేసేదిలేక మరుసటిరోజు ఉదయం మేము కరోనా పరీక్ష చేయించుకోవడానికి బయలుదేరాము. అక్కడికి వెళ్లేముందు బాబా గుడికి వెళ్ళాము. బాబా దర్శనం చేసుకొని, ఆయనను ప్రార్థించాము. తరువాత గుడి నుండి బయటకు వస్తున్నంతలో బాబా గుడి సభ్యులలో ఒక డాక్టరు కనిపించారు. నేను వారితో విషయం చెప్పాను. బాబా అనుగ్రహం వలన ఆయన, “కరోనా పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేద”ని కొన్ని మందులు వ్రాసిచ్చి, “రెండు రోజులు ఇవి వాడండి, బాబా దయతో తగ్గిపోతుంది” అని అన్నారు. బాబాను ప్రార్థించినంతనే ఈ విధంగా కృప చూపారని మేము చాలా సంతోషించాము. తరువాత మేము బాబాను ప్రార్థించి, ఊదీని నీళ్లలో కలుపుకొని త్రాగుతూ మందులు కూడా వాడాము. బాబా దయతో రెండురోజులలో నా భార్యకు గొంతునొప్పి, ముక్కునొప్పి అన్నీ తగ్గిపోయాయి. ప్రస్తుతం నా భార్యకు ఒక సమస్య ఉంది. బాబా దయవలన ఆ సమస్య తీరితే ఆ అనుభవాన్నీ మీతో పంచుకుంటాను. జై సాయిరాం!


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!



సాయిభక్తుల అనుభవమాలిక 647వ భాగం....



ఈ భాగంలో అనుభవాలు:
  1. ఎన్ని ఇబ్బందులు వచ్చినా బాబా నామస్మరణ మాత్రం వదలకూడదు
  2. సాయితండ్రి నా మొర విన్నారు
  3. సాయి చాలాసార్లు రక్షణనిచ్చారు

ఎన్ని ఇబ్బందులు వచ్చినా బాబా నామస్మరణ మాత్రం వదలకూడదు 


బెంగుళూరు నుండి ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.


సాయిబంధువులందరికీ నా నమస్కారం. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారందరికీ నా నమస్కారాలు. నేను బెంగళూరులో నివసిస్తున్నాను. బాబా దయవల్ల నేను సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాను. ప్రతిరోజూ ఆఫీసుకి వెళ్ళి వచ్చాక మా ఇద్దరబ్బాయిల స్కూల్ విశేషాలు అడిగి తెలుసుకుంటూ, వాళ్ళను చదివిస్తూ ఉంటాను. బాబా దయవల్ల జీవితం సాఫీగా గడుస్తూ ఉండేది. ఒకరోజు ఆఫీసులో, “రాబోయే 6 నెలల్లో ఆఫీసును వేరేచోటికి తరలిస్తున్నామ”ని చెప్పారు. ఆఫీసును తరలించబోయే ప్రదేశం మా ఇంటికి చాలా దూరం. బెంగళూరు ట్రాఫిక్‌లో అంత దూరం ప్రయాణించాలంటే చాలా సమయం పడుతుంది. దాంతో నాకు చాలా బాధేసింది. కానీ, ఏదో నమ్మకం, ‘బాబా ఉన్నారు, చూసుకుంటారు’ అని. ఎప్పుడు సమయం దొరికినా సాయి నామాన్ని స్మరిస్తూ ఉండేదాన్ని. “నువ్వే దారి చూపించాలి తండ్రీ!” అంటూ బాబాను వేడుకునేదాన్ని. సరిగ్గా ఆఫీసు తరలించబోయే సమయానికి కరోనా కారణంగా లాక్‌డౌన్ మొదలైంది. నాకు ఇంటినుంచి పనిచేసే అవకాశం ఇచ్చారు ఆఫీసువాళ్ళు. సాయి చూపిన ప్రేమకు మనసులోనే సాయికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నానో నేను. సాయిని తలచుకోగానే కన్నీళ్ళు వచ్చేవి. 


ఇటీవల ఒకసారి ఆర్థికంగా కొంచెం ఇబ్బంది వచ్చింది. అప్పుడు కూడా బాబాను తలచుకోగానే సహాయం చేశారు. తనను నమ్మినవారికి తానెప్పుడూ తోడుగా ఉంటానని బాబా నా విషయంలో ఎన్నోసార్లు ఋజువు చేశారు. నా అనుభవం ద్వారా నాకు తెలిసింది ఒక్కటే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా బాబా నామస్మరణ మాత్రం వదలకూడదని. నేను ఎప్పుడూ బాబాను కోరుకునేది ఒక్కటే, “ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని కష్టాలైనా ఇవ్వు స్వామీ. కానీ, నీ నామస్మరణ మాత్రం నా చివరి ఊపిరి వరకు నా మనసులో నడిచేలా చూడు” అని. “నా అనుభవాన్ని పంచుకోవడం ఆలస్యమైనందుకు నన్ను క్షమించు బాబా. ఎల్లప్పుడూ అందరికీ తోడునీడగా ఉంటూ అందరినీ కాపాడాలని మనసారా కోరుకుంటున్నాను తండ్రీ! అందరికీ సాయిరాం!


సాయితండ్రి నా మొర విన్నారు


విశాఖపట్నం నుండి సాయిభక్తురాలు శ్రీమతి శ్రీలత తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.


సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి మరియు సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు శ్రీలత. మేము విశాఖపట్నంలో నివసిస్తున్నాము. నాకు బాబాతో చాలా అనుబంధం ఉంది. బాబా నాకు ప్రసాదించిన అనుభవాలు ఎన్నెన్నో ఉన్నాయి. వాటిలో నుండి ఇటీవల బాబా చేసిన ఒక అద్భుతాన్ని ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాను.


2020 సంవత్సరం, దీపావళిరోజు సాయంకాలం హఠాత్తుగా నాకు కొద్దిగా జ్వరం, జలుబు, దగ్గు, విపరీతమైన నీరసం వచ్చేశాయి. జ్వరం, జలుబు తగ్గటానికి రెండు రోజుల పాటు ఏవో మందులు వేసుకున్నాను. కానీ, కొంచెం కూడా తగ్గలేదు. దాంతో నన్ను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళారు మావారు. డాక్టర్ నన్ను ముందుగా కోవిడ్ టెస్ట్ చేయించుకోమన్నారు. నాకు చాలా భయమేసింది. తరువాత కోవిడ్ టెస్ట్ కోసం శాంపిల్స్ ఇచ్చి ఇంటికి వచ్చాను. కానీ, భయంతో ఆ రాత్రి నాకు నిద్రపట్టలేదు. “సాయి తండ్రీ! కోవిడ్ టెస్ట్ రిపోర్టు నెగిటివ్ వచ్చేలా చేయండి” అని అనుక్షణం సాయిని వేడుకుంటూనే ఉన్నాను. నా సాయితండ్రి నా మొర విన్నారు. తన బిడ్డలు బాధపడుతుంటే చూడలేని నా సాయితండ్రి తన లీల చూపించారు. ఆ రాత్రి నా కోవిడ్ టెస్ట్ రిపోర్టు వచ్చింది. ఆశ్చర్యం! టెస్ట్ రిపోర్టు నెగిటివ్ వచ్చింది. ఎంతో సంతోషంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. కోవిడ్ పరీక్షలో నెగిటివ్ వచ్చినట్లయితే నా అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకుంటానని బాబాకు చెప్పుకున్నాను. “ఈ అనుభవాన్ని పంచుకోవడంలో ఆలస్యమైనందుకు నన్ను క్షమించండి బాబా! ఎల్లప్పుడూ ఇలానే మమ్మల్ని కాపాడు తండ్రీ. మాతోనే ఉండు, మాలోనే ఉండు. ఎల్లప్పుడూ నీ నామం జపించుకునేలా మమ్మల్ని ఆశీర్వదించు తండ్రీ. నీకు శతకోటి నమస్కారాలు తండ్రీ!”


సాయి చాలాసార్లు రక్షణనిచ్చారు

USA నుండి అజ్ఞాత సాయి భక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

ఈ వైరస్ కాలంలో రక్షణ కోసం నేను "సాయి రక్షక శరణం దేవ" అను మంత్రాన్ని జపిస్తున్నాను. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. దాంతో నేను, నా భర్త మా ఉగ్యోగాలను కోల్పోతామేమోనని భయపడ్డాము. మేము సచ్చరిత్ర చదివి, "మా ఉద్యోగాలను కాపాడమ"ని బాబాను వేడుకున్నాము. బాబా కృప చూపించారు. ఆఫీసు నుండి మావారికి ఫోన్ చేసి, "ఎటువంటి తొలగింపు చర్యలు తీసుకోవడం లేదని, అందుకు బదులుగా జీతంలో కొంత శాతాన్ని తగ్గిస్తున్నామ"ని చెప్పారు. ఇది ఖచ్చితంగా ఎంతో మంచి నిర్ణయం. ఆ వార్త విన్న తరువాత సంతోషంగా బాబా చేసిన లీలాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాము.

ఈ వైరస్ సమయంలో ఒకసారి నా భర్త జ్వరంతో అనారోగ్యం పాలయ్యారు. నేను భయపడి బాబాను ప్రార్థించాను. ఆయన దయవలన జ్వరం తగ్గింది కానీ కొన్నిరోజులపాటు దగ్గు ఉంది. నేను బాబాను ప్రార్థించి, ఊదీ నీటిలో కలిపి ఇచ్చాను. దాంతో మావారు పూర్తిగా కోలుకున్నారు. "ధన్యవాదాలు బాబా".

నా సోదరి కుటుంబం తమ ఉద్యోగరీత్యా ఈ వైరస్ సమయంలో ప్రయాణించాల్సిన అవసరం ఏర్పడింది. ఆ ప్రయాణాన్ని తప్పించుకోలేని పరిస్థితి. అప్పుడు నేను, "వాళ్ళకి ఏ కష్టం లేకుండా రక్షించమ"ని బాబాను ప్రార్థించాను. 15 రోజులు విమానాల్లో ప్రయాణం చేసి, హోటళ్లలో ఉండి వచ్చిన తరువాత కూడా వాళ్ళు క్షేమంగా ఉన్నారు. బాబానే వాళ్ళని ఈ వైరస్ బారినుండి రక్షించారు. ఆయన ఎల్లప్పుడూ తన భక్తులను రక్షిస్తారు. మనం చేయవలసినది ఆయనపై విశ్వాసాన్ని కలిగి ఉండటమే.



శ్రీ జోగ్లేకర్



శ్రీ జోగ్లేకర్ ఇండోర్ నివాసి. అతను గరుడేశ్వర్‌కి చెందిన శ్రీటెంబేస్వామి (శ్రీవాసుదేవానంద సరస్వతి) భక్తుడు. భాగ్యంకొద్దీ అతని ఉపనయనం శ్రీటెంబేస్వామి ఆశీస్సులతో గరుడేశ్వర్‌లో జరిగింది. టెంబేస్వామి సమాధి చెందిన తరువాత జోగ్లేకర్ తాను ఒంటరివాడినైపోయానని, ఇక ఆధ్యాత్మిక మార్గంలో దారిచూపడానికి, పారమార్థిక అవసరాలు చూసుకోవడానికి తనకెవరూ లేరని దిగులుపడుతుండేవాడు. పగలు, రాత్రి అతనికి అదే చింత. ఒకరాత్రి అతనికి శ్రీటెంబేస్వామి స్వప్నదర్శనమిచ్చి, “కోపర్‌గాఁవ్ వెళ్ళు!” అని ఆదేశించారు. అంతే, కుటుంబసభ్యులతోగానీ, పనిచేసే కార్యాలయంలోగానీ ఒక్కమాటైనా చెప్పకుండా మరుసటిరోజు వేకువఝామునే అతను ఇంటినుండి బయలుదేరాడు.

కోపర్‌గాఁవ్ చేరుకున్నాక అక్కడొక గది అద్దెకు తీసుకొన్నాడు జోగ్లేకర్. అప్పటినుండి అతను ఆరునెలలపాటు ప్రతిరోజూ ఉదయాన్నే కాలినడకన శిరిడీ వెళ్లి మసీదులో బాబా ముందు కూర్చునేవాడు. అతను బాబాతో ఏమీ చెప్పలేదు, బాబా కూడా ఒక్కమాటైనా మాట్లాడలేదు. అతను చేసిందల్లా ఒక్కటే, తన హృదయాంతరాళాలలోనుండి పొంగిపొరలే గురుభక్తితో ప్రేమపూర్వకంగా బాబాను చూస్తూ ఉండటమే. ఆరునెలల తరువాత, తాను తెచ్చుకున్న డబ్బంతా అయిపోయిందని, కేవలం ఆరు అణాలే చేతిలో మిగిలాయని గుర్తించాడు జోగ్లేకర్. ఆరోజు అతను మసీదుకి వెళ్ళినప్పుడు బాబా అతనితో, “నీ పని పూర్తయింది. ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళు. ఇక ఇక్కడ క్షణమైనా ఉండకు” అని అన్నారు. దాంతో అతను ఇంటికి తిరిగి వెళ్ళడానికి నిర్ణయించుకొని కోపర్‌గాఁవ్ వైపు నడకసాగించాడు.

జోగ్లేకర్ కోపర్‌గాఁవ్ రైల్వేస్టేషన్ సమీపిస్తుండగా వెనకనుండి ఎవరో వ్యక్తి అతని చొక్కా పట్టుకొని లాగి, ప్రయాణానికి అవసరమైన టికెట్, కొంత డబ్బు ఇచ్చాడు. జోగ్లేకర్ వాటిని తీసుకోవడానికి నిరాకరించాడు. కానీ ఆ వ్యక్తి బలవంతపెట్టడంతో వాటిని తీసుకుని రెండడుగులు ముందుకు వేసిన తరువాత ఆ వ్యక్తికి కృతజ్ఞతలు తెలియజేసుకుందామని జోగ్లేకర్ వెనక్కి తిరిగి చూసేసరికి అతను అదృశ్యమయ్యాడు. జరిగిన సంఘటనకు ఆశ్చర్యపోతూనే జోగ్లేకర్ రైలు ఎక్కి ఇంటికి చేరుకున్నాడు. కుటుంబసభ్యులు అతన్ని, “ఇన్ని రోజులు ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు?” అని ప్రశ్నించసాగారు. అంతలోనే అతను పనిచేసిన కార్యాలయం నుండి ఒకతను వచ్చి, ‘యజమాని తనకోసం ఎదురుచూస్తున్నాడ’ని చెప్పాడు. తనను ఖచ్చితంగా ఉద్యోగం నుండి తొలగిస్తారని అనుకుంటూనే కార్యాలయానికి వెళ్ళాడు జోగ్లేకర్. ఆశ్చర్యంగా అక్కడ అందరూ అతనికి స్వాగతం పలికారు. ఆ మధ్యాహ్నం అతని యజమాని అతనికొక ప్యాకెట్ ఇచ్చాడు. అది తెరిచి చూస్తే అందులో పెద్ద మొత్తంలో డబ్బు ఉంది. జోగ్లేకర్, “ఇది నేను న్యాయంగా సంపాదించింది కాదు” అని ఆ డబ్బును యజమానికి తిరిగి ఇచ్చేశాడు. అప్పుడతని యజమాని, “నువ్వు చూసుకోవడానికి నీకొక కుటుంబం ఉంది. గత ఆరునెలల సంపాదనగా భావించి దీనిని తీసుకో! ఇప్పుడు ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకొని, రేపు ఉదయం వచ్చి నీ విధులలో చేరు” అని చెప్పి ఒప్పించి ఆ డబ్బును జోగ్లేకర్‌కు ఇచ్చాడు.    

source సాయి ప్రసాద్ పత్రిక, 2003, దీపావళి సంచిక (బాబా'స్ డివైన్ సింఫనీ బై విన్నీ చిట్లూరి)

సాయిభక్తుల అనుభవమాలిక 646వ భాగం.....



ఈ భాగంలో అనుభవాలు:

  1. సకాలంలో నా డిగ్రీ పూర్తయ్యేటట్టు ఆశీర్వదించారు బాబా
  2. బాబా నాతోనే, నాకు తోడుగా ఉన్నారు


సకాలంలో నా డిగ్రీ పూర్తయ్యేటట్టు ఆశీర్వదించారు బాబా


ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.


సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. ముందుగా, ఈ బ్లాగును ఇంత చక్కగా నడిపిస్తున్న సాయికి నా నమస్కారాలు. ఈ బ్లాగ్ వలన నేను బాబాకు చాలా దగ్గరయ్యాను. బ్లాగులో వచ్చే బాబా సందేశాల వలన బాబాపై విశ్వాసం, నమ్మకం పెరిగాయి. బాబా నా జీవితంలోకి వచ్చిన తరువాత ఎన్నో అద్భుతాలను చేశారు. నన్ను సంస్కరించి ధర్మం వైపు నడిపిస్తున్నారు. బాబా కృపకు పాత్రురాలైనందుకు నేనెంతో ధన్యురాలిని. 2020, డిసెంబరు 12వ తేదీన నాకు కలిగిన అనుభవాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. 


నేను డిగ్రీ రెండవ సంవత్సరంలో ఉన్నప్పుడు బాబా నా జీవితంలోకి వచ్చారు. అప్పటినుండి నేను బాబా కృపను తెలుసుకుంటూ ఉన్నాను. బాబా దయవలన డిగ్రీ రెండవ సంవత్సరం మరియు చివరి సంవత్సరం పరీక్షల్లో చక్కని విజయం సాధించాను. అయితే, నేను డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు జరిగిన రెండవ సెమిస్టరు పరీక్షల్లో నేను ఒక సబ్జెక్టులో ఫెయిలయ్యాను. ఆ సబ్జెక్టులో రెండవసారి పరీక్ష రాసినా పాస్ కాలేకపోయాను. బాబా దయవలన ఈ సంవత్సరంలో (డిగ్రీ చివరి సంవత్సరంలో) మళ్ళీ ఆ పరీక్ష వ్రాయడానికి సిద్ధమయ్యాను. “ఎవరైతే కష్టపడి పనిచేస్తారో పాలకుండతో నేను వారివద్ద ఉంటాను. కష్టపడకుండా బాబా ఉంటారని ఆశించవద్దు” అని బాబా చెప్పారు కదా! అందువల్ల నేను పరీక్షకు బాగా ప్రిపేరై వెళ్ళాను. అడుగడుగునా బాబా తన నిదర్శనాలను నాకు చూపించారు. కానీ, పరీక్ష పేపరు చాలా కఠినంగా వచ్చింది. నేను మళ్ళీ పెయిలవుతానేమో అనుకున్నాను. పరీక్ష పేపరు కఠినంగా వచ్చినప్పటికీ బాబాపై నమ్మకంతో ధైర్యంగా పరీక్ష వ్రాశాను. కొద్ది రోజుల తరువాత, డిసెంబరు 12వ తేదీన పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి. పరీక్షా ఫలితాలు తెలుసుకుందామని వెబ్‌సైట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తే ఎంతసేపైనా లింక్ ఓపెన్ కాలేదు. దాంతో నేను బాబాకు నమస్కరించుకుని, “వెబ్‌సైట్ ఓపెన్ అయి నేను పాసైతే బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటాన”ని అనుకున్నాను. ఆ తరువాత కొద్దిసేపటికే వెబ్‌సైట్ ఓపెన్ అయింది. అలాగే నేను పాసయ్యాను కూడా. నేను ఈ పరీక్ష ఫెయిలై వుంటే నాకు ఈ సంవత్సరం డిగ్రీ సర్టిఫికెట్ రాదు. దీనివలన ఎన్నో సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ఒక సంవత్సరం కూడా వృధా అవుతుంది. అదే ఆలోచనతో నేను ఎంతో భయపడ్డాను. అయినప్పటికీ, బాబాపై ఉన్న భక్తివిశ్వాసాల కారణంగా నేను పాసవుతాననే నమ్మకం ఉండేది. నేను నమ్మకం పెట్టుకున్నట్లే సకాలంలో నా డిగ్రీ పూర్తయ్యేటట్టు చేశారు బాబా.


నా డిగ్రీ చివరి సంవత్సరంలో జరిగిన అయిదవ సెమిస్టర్ పరీక్షల సమయంలో కూడా నేను మానసికంగా ఎంతో కృంగిపోయి ఉన్నాను. కేవలం బాబా దయవల్ల మాత్రమే ఆయనపై భారం వేసి పరీక్షలు వ్రాశాను. ఆ పరీక్షా ఫలితాల గురించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వెబ్‌సైట్‌లో బాబాను అడిగితే, ‘నీవు పరీక్ష పాసవుతావు’ అని సమాధానం వచ్చింది. నేను పరీక్షలు అంత బాగా వ్రాయనప్పటికీ కేవలం బాబా దయవల్లనే నేను డిగ్రీ పాసయ్యాను. “మీకు చాలా చాలా కృతజ్ఞతలు బాబా!”


బాబా నాతోనే, నాకు తోడుగా ఉన్నారు

తెనాలి నుండి ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

సాయిభక్తులందరికీ సాయిరాం! ఈ సాయిభక్తుల అనుభవాల బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి నా ధన్యవాదాలు. మాది తెనాలి. మాకు సర్వస్వం బాబానే. బాబా నన్ను, నా భర్తను దగ్గరుండి నడిపిస్తూ కాపాడుతున్నారు. ఆ తండ్రి దయ లేకపోతే మనం ఏం చేయగలం? ఆయన దయవల్ల నేను ఎన్నో సమస్యల నుండి బయటపడ్డాను. నా వివాహ సమయంలో బాబా నాకెంతో సహాయం చేశారు. వివాహమయ్యాక నేను అత్తవారింటికి వెళుతున్నప్పుడు, "నాకు తోడుగా ఉండమ"ని బాబాను ప్రార్థించాను. అత్తవారింటికి వెళ్ళగానే ఫోటో రూపంలో నాకు దర్శనమిచ్చారు బాబా. అంతేకాదు, అక్కడ చుట్టాల ఇంట్లో కూడా బాబా దర్శనమిచ్చారు. ఆవిధంగా బాబా నాతోనే, నాకు తోడుగా ఉన్నానని నిదర్శనమిచ్చారు.

అయితే మా కాపురంలో ఏర్పడిన అవాంతరాలను చూసి నేనెంతో భయపడ్డాను. ఆ సమస్యల నుండి ఒడ్డెక్కించి నన్ను నా భర్త దగ్గరకు క్షేమంగా చేర్చారు బాబా. వివాహమైన తరువాత నాకు ఒక ఆరోగ్య సమస్య వచ్చింది. దాంతో నేను విజయనగరంలోని మా పుట్టింటికి వచ్చాను. నా అనారోగ్యం కారణంగా తిరిగి మావారి దగ్గరకు వెళ్లలేనేమోనని నేను చాలా ఆందోళన చెంది, "నన్ను క్షేమంగా నా భర్త వద్దకు చేర్చి, నా ఆరోగ్య సమస్యను పరిష్కరిస్తే నా అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకు మ్రొక్కుకున్నాను. తరువాత ఒకరోజు విజయనగరం నుండి తెనాలి బయలుదేరాను. అనుకున్నట్లుగానే సమయానికి నన్ను తెనాలి చేర్చారు బాబా. విజయనగరంలో ఉన్నప్పుడు, అలాగే తెనాలి వచ్చాక కూడా బాబానే ఎంతో కృపతో నా ఆరోగ్య సమస్యను తగ్గించారు. బాబా ఎల్లప్పుడూ మనతో ఉంటారు. మనకు శ్రద్ధ, సబూరి ఉండాలి. “ఈ అనుభవం పంచుకోవడంలో ఆలస్యమైనందుకు నన్ను క్షమించండి బాబా! ఇప్పుడు నేను చిత్రమైన బాధలో ఉన్నాను. ఆ బాధవల్ల మరియు నాకు, మావారికి ఉన్న ఆరోగ్యపరమైన ఇబ్బందుల వల్ల చాలా సమస్యగా ఉంది బాబా. ప్రస్తుతం మావారు జ్వరంతో బాధపడుతున్నారు బాబా. నా ఈ సమస్యలన్నిటినీ మీరే తీర్చగలరు. దయచేసి నన్ను ఆశీర్వదించండి బాబా. నా తప్పులేమైనా ఉంటే నన్ను మన్నించి సత్వరమే ఆదుకోవా బాబా! మాకు అన్నీ నువ్వే కాదా నా తండ్రీ! నన్ను ఆశీర్వదించి కాపాడు బాబా! నీ దయ మాపై నిరంతరం వర్షించనీ తండ్రీ!”



సాయిభక్తుల అనుభవమాలిక 645వ భాగం.....


ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబాకు మాటిచ్చి అశ్రద్ధ చేయకూడదు
  2. ఎంతో కరుణతో మా సమస్యలన్నిటినీ తీర్చారు బాబా

బాబాకు మాటిచ్చి అశ్రద్ధ చేయకూడదు


ఒక సాయి భక్తుడు బాబా తనకి ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:


ఓం సాయిరాం! ముందుగా ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి నా ధన్యవాదాలు. ఆ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడి లీలలు అనంతము, వర్ణనాతీతము. వాటిలోనుండి ఒక చిన్న లీలను మీతో పంచుకుంటాను. నేను గత 20 సంవత్సరాల నుండి బాబా భక్తుణ్ణి. నాలో అంచెలంచెలుగా ఆ బ్రహ్మాండనాయకుడిపై ప్రేమ పెరుగుతూ వచ్చింది. లాక్‌డౌన్‌లో ఒకరోజు నా భార్యకు హఠాత్తుగా ఛాతీలో నొప్పి వచ్చింది. అదే తనకు మొదటిసారి ఛాతీనొప్పి రావడం. దాంతో కొంచెం భయపడ్డాను. ఆ తరువాత తనకు బి.పి. చెక్ చేయిస్తే 170 ఉంది. నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! నీ బిడ్డను ఇబ్బందిపెట్టకు. తనకు ఛాతీనొప్పి తగ్గి ఆరోగ్యం బాగుంటే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను” అని చెప్పుకున్నాను. బాబా దయవలన నా భార్య త్వరలోనే మంచి ఆరోగ్యవంతురాలైంది. ఎంతో సంతోషంతో బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఏమి చేసినా ఆ సాయినాథుని ఋణం తీర్చుకోలేము.


నా అనుభవం:


బాబా సర్వాంతర్యామి. నా భార్య ఆరోగ్యం కుదుటపడితే బ్లాగులో పంచుకుంటానని బాబాకు చెప్పుకున్నాను కదా! కానీ, ఆ లీలను పంచుకోవటంలో కొంచెం ఆలస్యం చేశాను. తరువాత నాకు కొంచెం ఆరోగ్య సమస్య వచ్చింది. బి.పి. చెక్ చేయిస్తే ఎక్కువగా ఉందని చెప్పారు. అప్పుడు గుర్తుకొచ్చింది, నేను బాబాకు ఇచ్చిన మాట. ఆలస్యం చేసినందుకు క్షమించమని బాబాను వేడుకుని, నా ఆరోగ్యం బాగుండేలా అనుగ్రహించమని ప్రార్థించి, నా ఆరోగ్యం బాగుంటే ఈ రెండు లీలలను బ్లాగులో పంచుకుంటానని బాబాకు చెప్పుకున్నాను. బాబా దయవల్ల నేనిప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను. మనం తెలుసుకోవలసిన విషయమేమిటంటే, బాబాకు మాటిచ్చి అశ్రద్ధ చేయకూడదు. బాబా ప్రేమమయుడు, సర్వాంతర్యామి. నన్ను, నా భార్యను, నా బిడ్డలను బాబా ఎల్లప్పుడూ క్షేమంగా చూసుకోవాలని, మేము ఎల్లప్పుడూ బాబా సేవ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాబా పాదాలకు అనంతకోటి వందనాలు.


ఎంతో కరుణతో మా సమస్యలన్నిటినీ తీర్చారు బాబా


సాయిభక్తుడు శ్రీసత్యనారాయణ తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.


సాయిబంధువులకు మరియు ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారాలు. కోవిడ్-19 వలన సుమారు గత 8 నెలల నుంచి మా కుటుంబం కూడా చాలామంది వలె ఎన్నో ఇబ్బందులుపడ్డాము. కానీ, శ్రీసాయిబాబా మమ్మల్ని కంటికి రెప్పవలె కాపాడి ఆ సమస్యలన్నిటినీ పరిష్కరించారు. 


1. కోవిడ్ కారణంగా నెలకొన్న ప్రస్తుత పరిస్థితులలో ఒకసారి నా శ్రీమతికి కాళ్ళు, తొడలు తీవ్రంగా నొప్పిపుట్టసాగాయి. 


2. నా కుమారునికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. కోవిడ్ నుండి కోలుకున్న తరువాత కూడా అది తగ్గిన తరువాత వచ్చే సమస్యల (post Covid-19 problems) వల్ల తనెంతో ఇబ్బందిపడ్డాడు.

 

3. మా సోదరికి సంతానం లేకపోవటం వలన నేను, మా అన్నదమ్ములు కలిసి తనకు కావలసిన అన్ని వసతులూ కల్పించాము. మేమంతా మా బాధ్యతలను పూర్తిగా నిర్వహించాము. కానీ మా సోదరి యొక్క అత్తవారి తరఫు బంధువులు మాపై ఎన్నోరకాల నిందలు వేసి మాకు చాలా ఇబ్బందులు కలుగజేశారు. దానివల్ల మాకు భౌతికపరమైన ఇబ్బందులెన్నో వచ్చాయి. 


వాటినన్నిటినీ నేను ధైర్యంతో సహిస్తూ, మా సమస్యలను పరిష్కరించమని శ్రీసాయిబాబాను ప్రార్థిస్తూ సాయి చరిత్ర పారాయణలు చేశాను. బాబా ఎంతో కరుణతో మా సమస్యలన్నిటినీ తీర్చేశారు. బాబాను నమ్ముకుంటే మనకు తప్పకుండా మంచి జరుగుతుందని అనటానికి ఇవే పూర్తి నిదర్శనాలు


బొడ్డు సత్యనారాయణ 

అడ్వకేట్ 

విజయనగరం.



సాయిభక్తుల అనుభవమాలిక 644వ భాగం.....



ఈ భాగంలో అనుభవాలు:
  1. సాయినాథుని కృప
  2. బాబా అనుగ్రహంతో నిముషంలో తగ్గిన కడుపునొప్పి
  3. రహస్యంగా చేసిన పనికి బాబా సహాయం

సాయినాథుని కృప


సాయిభక్తుడు శ్రీధర్ తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:


అందరికీ సాయిరామ్! నా పేరు శ్రీధర్. నేను ఒక ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసరుగా పనిచేస్తున్నాను. నాకు 30 సంవత్సరాల నుండి సాయితో అనుబంధం ఉంది. కానీ, రెండు సంవత్సరాల క్రితమే నాకు శిరిడీ వెళ్ళే అవకాశం వచ్చింది. అప్పటికి నేను పి.హెచ్.డి థీసిస్ సబ్మిట్ చేసి సంవత్సరమైంది. కానీ ఫారిన్ ఎవాల్యుయేషన్ అవలేదు. శిరిడీ ప్రయాణంలో కోపర్గాఁవ్ వద్ద ఉండగా కూడా ఇంకా ఎవాల్యుయేషన్ అవలేదని నాకు ఫోన్ వచ్చింది. నేను సాయిని సర్వస్య శరణాగతి చేసి ప్రతివారిలోనూ సాయిని దర్శించాను. శిరిడీ నుండి తిరిగి రాగానే యూనివర్సిటీ నుండి పి.హెచ్.డి రిపోర్టులు వచ్చాయని నాకు ఫోన్ వచ్చింది. ఎంతో ఆనందంగా బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను.  అప్పుడు నా జాతకం ప్రకారం శని మహర్దశ నడుస్తుండటం వలన చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనవలసి వచ్చినప్పటికీ నాకు పి.హెచ్.డి అవార్డు వచ్చింది. అది ఆ సాయినాథుని కృపే!


మరొక అనుభవం:


మా పెద్దమ్మాయి సాయికి యు.ఎస్.ఏ లో ఎమ్.ఎస్ చేయాలని కల. బాబా దయవలన తనకి స్కాలర్‌షిప్ కూడా వచ్చింది. తను టెక్సాస్ వెళ్లాల్సి ఉండగా కరోనా వలన అది కాస్తా ఆగిపోయింది. రెండవసారి స్కాలర్‌షిప్ రాకపోయినప్పటికీ బాబా దయవల్ల వేరే యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చింది. కానీ, అందుకు సంబంధించిన అన్ని పనుల్లో చిన్న చిన్న ఇబ్బందులెన్నో వచ్చాయి. "నీవే మాకు దిక్కు" అని బాబాపైనే ఆధారపడ్డాము. బాబా ఎంతో ప్రేమతో మాకు దారి చూపిస్తూ అన్ని ఇబ్బందులనూ అధిగమింపజేశారు. వీసా ప్రక్రియలో ఎటువంటి ఇబ్బందికరమైన ప్రశ్నలు లేకుండా అంతా సజావుగా పూర్తయ్యేలా సాయి కృప చూపారు. "బాబా! మీరు మా పాపతో ఉన్నారని మా నమ్మకం. తోడుగా తనతో యు.ఎస్.ఏ వెళ్లి తనకు అండగా ఉండండి. పాప భవిష్యత్తు అంతా మీకే అప్పగించాము బాబా".


ఇంకో అనుభవం:


ఒకసారి మా ఇంటి లోపలికి తేనెటీగలు వచ్చాయి. వాటివలన మాకు ఏమైనా ప్రమాదం కలుగుతుందేమోనని భయమేసింది. అప్పుడు మేము బాబాకు నమస్కరించుకుని, "బాబా! వాటిని బయటకు తరిమివేయడం చాలా కష్టం. నీదే భారం" అని చెప్పుకొని బాబా స్మరణ చేయసాగాము. అరగంటలో ఆ తేనెటీగలు వాటంతట అవే వెళ్లిపోయాయి. ఇది చిన్న సంఘటనే అయినా బాబా మాకు రక్షణ కల్పించారు. "థాంక్యూ బాబా!"


బాబా అనుగ్రహంతో నిముషంలో తగ్గిన కడుపునొప్పి


సాయిభక్తురాలు శ్రీమతి అంజలి తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.


సాయిబంధువులకు నమస్కారం. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి ప్రత్యేక కృతజ్ఞతలు. నా పేరు అంజలి. బాబా అనుగ్రహంతో ఇటీవల కలిగిన అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. డిసెంబరు 7వ తేదీన మేము శ్రీశైలం వెళ్ళాము. నిజానికి డిసెంబరు 8వ తేదీన మా అబ్బాయి పుట్టినరోజు. అందువల్ల ఆరోజు శ్రీశైలం వెళదామని నేను అనుకున్నాను. కానీ మావారు డిసెంబరు 7, సోమవారంనాడు వెళదామన్నారు. సరే, తనెందుకలా అంటున్నారో అనిపించి బాబాకు చెప్పుకుని, “ఏదైనా నీ ఇష్టం బాబా” అనుకున్నాను. సోమవారం తెల్లవారుఝామున మేమంతా శ్రీశైలం బయలుదేరాము. బాబా దయవల్ల ఉదయం 10 గంటలకల్లా శ్రీశైలం చేరుకున్నాము. ఆరోజు కార్తీక సోమవారం కావడం వల్ల ఆలయం భక్తులతో చాలా రద్దీగా ఉంది. దాంతో 150 రూపాయల టికెట్ తీసుకుని స్వామి దర్శనం కోసం వెళ్ళాము. అంతలో నాకు బాగా కడుపునొప్పి వచ్చి చాలా అనీజీగా అనిపించింది. నాకు వేరుశనగపప్పు సరిపడదు. కానీ, ఆరోజు ఉదయం ప్రయాణంలో వేరుశనగపప్పు కొంచెం ఎక్కువగానే తిన్నాను. ఆ కడుపునొప్పి నాకు వేరుశనగపప్పు తినటం వల్లనే వచ్చింది. అవి నాకు సరిపడవని తెలిసినా తిన్నాను. దాంతో నేను బాబాను తలచుకుని, “ఎలాగైనా నాకు కడుపునొప్పి తగ్గించి స్వామి దర్శనం చక్కగా జరిగేలా చేయమ”ని కోరుకున్నాను. బాబాను అలా ప్రార్థించిన వెంటనే, కేవలం ఒక్క నిమిషంలోనే బాబా అనుగ్రహంతో నా కడుపునొప్పి తగ్గిపోయింది. బాబా దయవల్ల స్వామి దర్శనం కూడా బాగా జరిగింది. అంత రద్దీలో కూడా ఆలయంలో నేను దీపం వెలిగించాను. నిజంగా అది మర్చిపోలేని అనుభూతి. అది కేవలం బాబా అనుగ్రహమే. బాబా దయవల్ల దర్శనమంతా చక్కగా జరిగి మేము క్షేమంగా ఇంటికి చేరుకున్నాము. బాబా ప్రసాదించిన మరో అనుభవంతో త్వరలో మీ ముందుకు వస్తాను. జై సాయిరాం!


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


రహస్యంగా చేసిన పనికి బాబా సహాయం


ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

ఓం సాయిరామ్. కరోనా కారణంగా నేను మా ఇంటికి చేరుకున్నాను. చదువుకోవడానికి అనువుగా మా గదిలోని ఫర్నిచర్ సర్దుబాటు చేద్దామని నేను, నా సోదరి అనుకున్నాము. చిన్న సమస్యలకి సైతం మా నాన్న చాలా కోప్పడుతుంటారు. అందువలన మేము ఎప్పుడూ చాలా భయపడుతుంటాం. ఆయన లేని సమయంలో మేము అనుకున్నట్లు సర్దుబాటు చేద్దామంటే, లాక్ డౌన్ కారణంగా ఆయన ఇంట్లోనే ఉంటున్నారు. కాబట్టి రాత్రి అందరూ నిద్రపోయాక ఫర్నిచర్ మారుద్దామని అనుకున్నాము. అయితే రాత్రి వేళలో నిశబ్దంగా ఉంటుంది, ఏ చిన్నశబ్దం అయిన నిద్రాభంగం అవుతుంది. మేము ఫర్నిచర్ కదుపుతున్నప్పుడు వచ్చే శబ్దాలకు నాన్న లేదా కుటుంబంలోని ఇతర సభ్యులెవరైనా మేలుకుంటారేమోనని మేము చాలా భయపడ్డాము. సాయిబాబాపై విశ్వాసమున్న నేను "ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా సహాయం చేయమ"ని బాబాను ప్రార్థించాను. నా సోదరి తను నమ్ముకున్న గ్రామదేవతను ప్రార్థించింది. తరువాత మేము మా పనిని ప్రారంభించాము. బాబా దయవల్ల మేము అనుకున్నట్లు మా పని పూర్తి చేసాము. ఉదయం నాన్న నిద్రలేచి మా గది చూసి, 'నాకు మెలుకువ రాకపోవడమేమిటి?, నాకెప్పుడూ అంత గాఢ నిద్రపట్టదే' అని చాలా ఆశ్చర్యపోయారు. నేను ఆనందంతో ఫర్నిచర్‌ను మార్చడంలో చేసిన సహాయానికి బాబాకి కృతజ్ఞతలు తెలుపుకున్నాను.

"ఓ దేవా! దయచేసి నా చదువుకి అనుకూలమైన వాతావరణాన్ని ఇంటిలో కల్పించండి. అకస్మాత్తుగా ఇంటికి రావడం అనేది నా చదువును ప్రభావితం చేయకుండా చూడండి. దయచేసి రైళ్ళు తిరిగి నడిచేలా అనుగ్రహించి, నేను నా క్యాంపస్‌కు తిరిగి వెళ్ళేలా సహాయం చెయ్యండి. నేను అనుకున్నట్లు జరిగితే ఆ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను. ఇక మీ దయ బాబా".



సాయిభక్తుల అనుభవమాలిక 643వ భాగం.....



ఈ భాగంలో అనుభవం:
  1. సర్జరీ విషయంలో బాబా అనుగ్రహం
  2. బాబా చికిత్స ఎంత చిత్రం!

సాయిభక్తురాలు శ్రీమతి శ్రావణి తనకు బాబా ప్రసాదించిన మరికొన్ని అనుభవాలను మనతో పంచుకుంటున్నారు

సర్జరీ విషయంలో బాబా అనుగ్రహం

ఈ మధ్య మా నాన్నగారికి మరియు మా బాబుకి జరిగిన సర్జరీల విషయంలో బాబా నాకెలా సహాయం చేసి అనుగ్రహించారో నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

మా నాన్నగారి కంట్లో శుక్లము ఉండేది. రెండు సంవత్సరాల క్రితమే ఆపరేషన్ చెయ్యాలని డాక్టర్ చెప్పారు. అయితే నాన్న భయపడుతుండటంతో మేము సర్జరీ గురించి అంతగా పట్టించుకోలేదు. కానీ 2020, నవంబరులో ఆ సమస్య కాస్తా తీవ్రమవ్వడంతో మరలా డాక్టరుని సంప్రదించాము. డాక్టరు నాన్నను పరిశీలించి, “ఆలస్యం చేయకుండా తొందరగా సర్జరీ చేయాలి, నవంబర్ 19వ తేదీన స్లాట్ ఖాళీ ఉంది. ఆరోజు సర్జరీ చేద్దామ”ని చెప్పారు. అంతేకాదు, “సర్జరీకి ఒకరోజు ముందుగా హాస్పిటల్లో అడ్మిట్ అవాలి. పేషెంట్ యొక్క ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తీసుకురావాలి. ముఖ్యంగా EHS పాలసీననుసరించి సర్జరీ చేయబోతున్నాం కాబట్టి సర్జరీ తేదీని మార్చలేము. అందుకే బాగా ఆలోచించుకొని ఆ తేదీ మీకు సమ్మతమో కాదో చెప్పండి” అని అన్నారు. ఆ సమయంలో మాకు ఎటువంటి ఇబ్బందులు కనిపించకపోవడంతో అన్నింటికీ అంగీకరించి ఇంటికి వచ్చేశాము.

ఇకపోతే, గత 3 నెలలుగా మా బాబు మూత్రవిసర్జన చేసేటప్పుడు ఇబ్బందిపడుతుండేవాడు. డాక్టరుకి చూపిస్తే, ‘బాబుకి సున్తీ చేయాల’ని చెప్పారు. ప్రస్తుతం కరోనా సమయం కావటంతో మేము భయపడ్డాము. దాంతో, సమస్యను మందులతో తగ్గించటానికి ప్రయత్నిద్దామని డాక్టర్ కొన్ని మందులు వ్రాసిచ్చారు. కానీ మందులతో సమస్య తగ్గకపోవడంతో మళ్ళీ డాక్టరుని సంప్రదించాము. ఆయన వేరే డాక్టరు గురించి చెప్పి ఆయనను కలవమని చెప్పారు. సరేనని, నవంబర్ 13న ఆ డాక్టరుని కలవడానికి వెళ్ళాము. అక్కడికి వెళుతూనే, నేనున్నానుఅంటూ పెద్ద క్యాలెండరు రూపంలో బాబా దర్శనమిచ్చారు. ఇక అంతా బాబా చూసుకుంటారని తలచి డాక్టరుని కలిశాము. బాబును పరీక్షించిన డాక్టరు, “వెంటనే ఆపరేషన్ చెయ్యాల”ని చెప్పారు. మేము దీపావళి తరువాత చేయించుకుంటామని చెప్పాము. ఆయన నవంబరు 16వ తేదీన ఆపరేషన్ చేస్తానన్నారు. అయితే నవంబరు 19న నాన్న ఆపరేషన్ కూడా ఉండటంతో, “ఇద్దరికీ ఒకేసారి ఆపరేషన్ అంటే కష్టమవుతుంది, కాబట్టి బాబుకి సర్జరీ ఇప్పుడు చేయించొద్దు” అన్నారందరూ. పైగా ఆ సమయంలో బాగా వర్షాలు పడుతున్నాయి. అయినా నేను ఎవరి మాటా వినకుండా బాబాపై విశ్వాసముంచి ఆయన మీద భారం వేశాను. నేను, మావారు వానలోనే బాబుని తీసుకొని వెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. కానీ నేను చాలా టెన్షన్ పడ్డాను. ఎందుకంటే, ఆపరేషన్ తరువాత బాబు కదలకుండా కుదురుగా మంచం మీద విశ్రాంతి తీసుకోవాలి. కానీ మా బాబు చాలా అల్లరివాడు, ఒక్కక్షణం కూడా కుదురుగా ఉండడు. అలాంటి వాడిని కదలకుండా ఉండేలా ఎలా చూసుకోవాలో అర్థం కాలేదు. పైగా చిన్నపిల్లాడు, ఆపరేషన్ తరువాత నొప్పిని ఎలా తట్టుకుంటాడోనని నాకు చాలా భయమేసింది. నా బాధను బాబాకే చెప్పుకొని, “బాబుకి తోడుగా ఉండి జాగ్రత్తగా చూసుకోమ”ని బాబాను వేడుకున్నాను. బాబు ఏ మాత్రమూ ఇబ్బందిపడకుండా బాబా ఎంతో చక్కగా చూసుకున్నారు. ఆరోజు సాయంత్రం నేను ఏదో పనిలో ఉంటే, మా బాబు ఎటువంటి మారాం చేయకుండా, భయపడకుండా నర్సులతో కలిసి ధైర్యంగా ఆపరేషన్ థియటర్‌కి వెళ్ళాడు. బాబా దయవలన ఆపరేషన్ బాగా జరిగింది. ఆపరేషన్ తరువాత బాబు చిన్న నొప్పి అని కూడా అనలేదు. మరుసటిరోజు బాబు, “బాబా ఫోటో ఇవ్వు మమ్మీ. బాబాను పట్టుకొని పడుకుంటాను” అని అడిగాడు. “ఎందుకు రా?” అని అడిగితే, “బాబానే కదా నాకు నొప్పి లేకుండా చూసుకొనేది” అని అన్నాడు. అది విని, 'వాడికి నొప్పి తెలియకుండా బాబా చూసుకుంటున్నార'ని తెలిసి మేము చాలా సంతోషించాము. కనీసం మూడురోజులు మంచం మీదే ఉండాలని డాక్టరు చెప్పారు. కానీ వాడు తిరుగుతూనే ఉన్నాడు. అయినప్పటికీ వాడికి ఎటువంటి ఇబ్బందీ కలగలేదు. బాబా కృప వలన త్వరగానే వాడికి నయమైంది. అంతలా బాబా వాడిని జాగ్రత్తగా చూసుకున్నారు.

ఇక నాన్న విషయానికి వస్తే, మా బాబు సర్జరీ టెన్షన్‌లో పడి ముందుగా కావాలని చెప్పిన నాన్న ఫిట్‌నెస్ సర్టిఫికెట్ సంగతి నేను పూర్తిగా మర్చిపోయాను. మరునాడు నాన్నను హాస్పిటల్లో అడ్మిట్ చేయాలనగా ఆ విషయం గుర్తొచ్చి, సర్టిఫికెట్ కావాలని మాకు తెలిసిన ఒక అబ్బాయిని అడిగాను. అతను చివరి నిమిషందాకా తెచ్చిస్తానని చెప్పి, ఆఖరులో వర్షం వల్ల ఆ సర్టిఫికెట్ ఇచ్చేవాళ్ళెవరూ దొరకలేదని చెప్పాడు. ఇక బాబా మీద భారం వేసి నాన్నను హాస్పిటల్లో అడ్మిట్ చేసేందుకు తీసుకెళ్తూనే ఫిట్‌నెస్ సర్టిఫికెట్ చేయించుకునేందుకు దారిపొడుగునా హాస్పిటల్ కోసం వెతకసాగాను. సాధారణంగా మా ఊరిలో ఉదయం 9 గంటలకే ఎవరూ హాస్పిటల్ తెరవరు. అందువలన దారిలో ఒక్క డాక్టర్ కూడా దొరకలేదు. ఆలోగా నాన్నను చేర్చాల్సిన హాస్పిటల్ వచ్చేసింది. అమ్మను అక్కడే కూర్చోబెట్టి, “బాబా! ప్లీజ్ మీరే నాకు దారి చూపి సహాయం చేయండి” అనుకుంటూ నాన్నతో కలిసి దాదాపు 5 హాస్పిటల్స్ తిరిగాను. కానీ పని జరగలేదు. అప్పుడు “ఏ ఆటంకం లేకుండా నాన్న హాస్పిటల్లో అడ్మిట్ అయిపోతే నా అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాను” అని బాబాకు చెపుకున్నాను. అంతే! మరుక్షణంలో నాకు “సాయి దీక్షిత” అనే హాస్పిటల్ కనిపించింది. బాబా పిలుస్తున్నట్టుగా అనిపించి నాన్నను తీసుకొని ఆ హాస్పిటల్‌ వెళ్లి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కావాలని రిసెప్షన్‌లో అడిగాను. అందుకు వాళ్ళు, “డాక్టరుగారు ఇలాంటివి ఇవ్వరు” అని అన్నారు. అంతలో ఒక నర్సు వచ్చి, విషయం తెలుసుకొని, డాక్టరుతో మాట్లాడి వస్తానని వెళ్ళింది. ఆమె లోపలికి వెళ్లి విషయం చెప్పగానే డాక్టరు మమ్మల్ని లోపలకి రమ్మని పిలిచారు. మేము లోపలికి వెళ్తూనే ఆశ్చర్యపోయాము. కారణమేమిటంటే, అక్కడ డాక్టర్ టేబుల్ మీద వివిధ ఆకృతుల్లో ఉన్న పది బాబా విగ్రహాలు దర్శనమిచ్చాయి. ఇంకా అక్కడున్న స్లైడర్ విండో కర్టెనుపై కూడా బాబా ఉన్నారు. బాబా క్యాలెండర్లు గదిలో అన్నివైపులా ఉన్నాయి. నాకు చాలా సంతోషంగా అనిపించింది. తరువాత  సర్టిఫికెట్ కోసం డాక్టర్ని బాగా రిక్వెస్ట్ చేశాక ఆయన అందుకు అంగీకరించి, నా ఫోన్ బ్యాక్ కవరుపై ఉండే బాబాను చూస్తూ సర్టిఫికెట్‌పై సంతకం పెట్టారు. “నేనున్నాను. అంతా సవ్యంగా జరుగుతుంది. ధైర్యంగా ముందుకి వెళ్ళు” అని బాబా చెప్తున్నట్టుగా నా మనసుకి అనిపించింది. తరువాత బాబా అనుగ్రహంతో నాన్న ఆపరేషన్ బాగా జరిగింది, త్వరగానే కోలుకున్నారు కూడా. “బాబా! మీకు అనేకానేక కృతజ్ఞతలు".

బాబా చికిత్స ఎంత చిత్రం!

స్వప్నంలో బాబా నాకు ఒక ఫోటో మాధ్యమంగా ఎలా వైద్యం చేశారో ఇప్పుడు మీకందరికీ తెలియజేస్తాను.

2020, డిసెంబరు నెల రెండవవారంలో నాకు కాస్త తల తిరుగుతునట్లుగా అనిపిస్తూ ఉండేది. పడుకొని పైకి లేచినప్పుడు ఆ సమస్య మరీ ఎక్కువగా ఉండేది. ఇదిలా ఉంటే, మా బాబుకి సున్తీ ఆపరేషన్ అయ్యాక వాడు కుదురుగా ఉండకుండా కాస్త పరుగులు పెడుతుండేవాడు. దాంతో ఒకరోజు కుట్లు వేసిన చోట కొంచెం బ్లీడింగ్ కనిపించింది. నాకు చాలా కంగారుగా అనిపించి, "బాబుకి త్వరగా నయం అయ్యేలా చెయ్యమ"ని బాబాను ప్రార్థించి, "దివ్యపూజ చేస్తాన"ని చెప్పుకున్నాను. బాబా కృపతో బాబుకి త్వరగా నయమవడంతో డిసెంబరు 10వ తేదీ నుండి నేను దివ్యపూజ ప్రారంభించాను. ఆరోజు ఎందుకో కొంచెం అలసిపోయినట్లుగా ఉండడంతో త్వరగా నిద్రపోయాను. వేకువఝామున 4.30 గంటల సమయంలో నాకు ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో మా ఇంట్లో ఉండే లావెండర్ రంగు దుస్తుల్లో ఉన్న బాబా ఫోటో కనిపించింది. 2018లో నేను శిరిడీ వెళ్ళినప్పుడు నాకిష్టమైన లావెండర్ రంగు దుస్తుల్లో ఉన్న తమ ఫోటోను బాబా నాకు అనుగ్రహించారు. ఆ అనుభవాన్ని చదవాలనుకునేవారికోసం దానికి సంబంధించిన లింక్‌ను ఈ క్రింద జతపరుస్తున్నాను.



ఇకపోతే కలలో లావెండర్ రంగు దుస్తుల్లో ఉన్న ఫొటోలోని బాబా అకస్మాత్తుగా పైన ఇవ్వబడిన బాబా ఒరిజినల్ ఫోటో రూపంలోకి మారిపోయారు. దాంతో నేను, "బాబా! ఇదేంటి? మీరు నా దగ్గరున్న ఫోటోలో ఉన్నట్లు లావెండర్ రంగు దుస్తుల్లో ఉండాలి కదా, ఇలా మారిపోయారేమిటి?" అని బాబాను అడిగాను. అందుకు బాబా, "అయితే నేను ఆ ఫోటోలో లాగా మారిపోవాలని అంటున్నావా?" అని అన్నారు. మరుక్షణం బాబా ఫోటో గుండ్రంగా తిరగడం మొదలుపెట్టింది. ఫోటోతో పాటు నేను కూడా తిరుగుతూ ఉన్నాను. అది కలే అయినా నిజంగా తిరుగుతున్న అనుభూతి నాకు కలిగింది. అలా తిరుగుతూ తిరుగుతూ ఉండగా నాకు భయమేసి, "ఆపండి బాబా, నాకు భయమేస్తోంది" అని అరుస్తున్నాను. కొంతసేపు అలా తిరిగాక నా దగ్గరున్న లావెండర్ రంగు దుస్తుల్లో ఉన్న ఫోటో రూపంలోకి బాబా మారిపోయారు. వెంటనే నేను కళ్ళు తిరిగి క్రిందపడుతున్న అనుభూతితో మేలుకొన్నాను. భయంగా బాబా ఫోటో వంక ఒకసారి చూసి అదంతా కల అనుకొని మళ్ళీ నిద్రపోయాను. తరువాత ఆ కల గురించి నేను పూర్తిగా మరచిపోయాను. కానీ ఆ కలలో బాబా నాకు వైద్యం చేశారని ఆ సమయంలో నేను గుర్తించలేకపోయాను. వారం రోజుల తరువాత మా అత్తయ్య తనకు కళ్ళు తిరుగుతున్నాయని చెప్పేసరికి కొన్నిరోజుల క్రితం నాకు కళ్ళు తిరుగుతుండిన సంగతి గుర్తొచ్చింది. ఆ కళ్ళు తిరగడం ఎప్పుడు తగ్గిపోయిందని ఆలోచిస్తే, ఆ స్వప్నం వచ్చినప్పటి నుండి ఆ సమస్య లేదని అర్థమై ఆశ్చర్యపోయాను. 'కలలో బాబా చుట్టూ తిరగడం-కళ్ళు తిరిగి పడిపోవడం, ఇలలో కళ్ళు తిరగడం తగ్గిపోవడం' నాకు ఎంతో అద్భుతంగా అనిపించి బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. బాబా చికిత్స ఎంత చిత్రమో చూశారా! 


సాయిభక్తుల అనుభవమాలిక 642వ భాగం.....



ఈ భాగంలో అనుభవాలు:
  1. అయోమయస్థితిలో మార్గాన్ని చూపి ఆరోగ్యాన్ని ప్రసాదించిన బాబా
  2. ఊదీ మహిమ
  3. బాబా ప్రేమ

సాయిభక్తురాలు శ్రీమతి శ్రావణి తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో ఇలా పంచుకుంటున్నారు:

అయోమయస్థితిలో మార్గాన్ని చూపి ఆరోగ్యాన్ని ప్రసాదించిన బాబా

రెండు నెలల క్రితం ఒకరోజు సాయంత్రం మా బాబు అనికేత్ ఆడుకుంటూ శానిటైజర్ త్రాగేశాడు. ఆ విషయం చెబితే మేము తనను కోప్పడతామేమోననే భయంతో వాడు ఆ విషయాన్ని మాతో చెప్పలేదు. ఆరోజు రాత్రి సుమారు గం.10:30కు తనకు ఛాతీ దగ్గర నొప్పిగా ఉందని ఏడవటం మొదలుపెట్టాడు. గ్యాస్ట్రిక్ సమస్యేమోనని అనుకుని అది తగ్గటానికి మందులు వేశాము. ఆ తరువాత రాత్రి 12 గంటల సమయంలో నన్ను దగ్గరకు పిలిచి తాను శానిటైజర్ త్రాగానని అసలు విషయం చెప్పాడు. అది వింటూనే నాకు చాలా భయమేసింది. ఆ శానిటైజర్‌లో ఆల్కహాల్ శాతం చాలా ఎక్కువగా ఉండటంతో ఆందోళనగా అనిపించి బాబాను ప్రార్థించి, బాబా ఊదీని తన ఛాతీ భాగమంతా రాశాను. మరుసటిరోజు బాబుని హాస్పిటల్‌కి తీసుకొని వెళదామనుకున్నాము. కానీ, మేము ఎప్పుడూ మా బాబుని చూపించే డాక్టర్ సెలవులో ఉన్నారని తెలిసింది. కరోనా సమయం కావడంతో వేరే డాక్టర్ వద్దకు బాబుని తీసుకొని వెళ్ళడానికి భయమేసింది. అందువలన ప్రతిరోజూ వాడికి అసిడిటీ టాబ్లెట్ ఇస్తూ, నొప్పిగా ఉందంటున్న ప్రాంతంలో ఊదీ రాస్తూ ఉండేదాన్ని. అయినా వాడు ‘నొప్పి, నొప్పి’ అంటూ ఉండేవాడు. దాంతో మావారు కూడా చాలా భయపడుతుండేవారు. డాక్టరుకి చూపిద్దామంటే ఆయన ఎప్పుడు వస్తారో తెలియలేదు. ఏమి చేయాలో తెలియక అయోమయంలో ఉండగా బాబానే మార్గం చూపారు

ఒకరోజు రాత్రి నేను సచ్చరిత్ర చదువుతూ, “ప్లీజ్ బాబా! ఎలాగైనా అనికేత్‌కి నొప్పి తగ్గించండి. వాడు అలా నొప్పితో బాధపడుతుంటే మాకు చాలా భయమేస్తోంది” అని బాబాను దీనంగా వేడుకున్నాను. తరువాత బాబుకి ఊదీ పెడుతూ, “ఊదీ ప్యాకెట్లు అయిపోవచ్చాయి, ఇప్పుడెలా బాబా?” అనుకున్నాను. పిలిచిన పలికే దైవం కదా మన బాబా. వెంటనే తమదైన శైలిలో బదులిచ్చారు. మా నాన్నగారికి ఆ ముందురోజే ఒక సాయిబంధువు క్రొత్తగా పరిచయమయ్యారు. ఆయన మొదటిసారి మా ఇంటికి వచ్చి, నన్ను పిలిచి నా చేతిలో కొన్ని ఊదీ ప్యాకెట్లు, బాబా సమాధికి తాకించిన పువ్వులు, తాళ్ళు ఇచ్చారు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. తరువాత ఆ అంకుల్ నాతో, “ఒక 18 రోజులపాటు ప్రతిరోజూ ఉదయం, రాత్రి బాబా ముందు ఒక గ్లాసుతో నీళ్ళు పెట్టి, అందులో కొంచెం ఊదీ వేసి, ఉదయం పెట్టిన నీళ్లు సాయంత్రం, రాత్రి పెట్టిన నీళ్లు ఉదయం త్రాగండి. అలా చేస్తే, నీ మనసులో ఉండే బాధలన్నీ బాబా తీరుస్తారు” అని చెప్పారు. నేను మా బాబు నొప్పిని తగ్గించమని బాబాను ప్రార్థించి, గురువారం నుండి ఆ అంకుల్ చెప్పిన విధంగా చెయ్యడం ప్రారంభించాను. ఇక్కడ బాబా చేసిన మరో అద్భుతం గురించి కూడా చెప్పాలి. 

మా నాన్నగారికి బి.పి, రక్తపరీక్షలు చేయించమని డాక్టర్ చెప్పడంతో అవి చేయించేందుకు తెలిసిన ఒక అబ్బాయిని నేను మా ఇంటికి పిలిపించాను. మాటల మధ్యలో మా అమ్మ ఆ అబ్బాయితో మా బాబు సమస్య గురించి చెప్పింది. అతను ఒక మందు పేరు సూచించి దానిని వాడమని చెప్పాడు. నేను అతనితో, “బాబుని చూసే డాక్టరు అందుబాటులో లేర”ని అన్నాను. ఆ డాక్టరు పేరేమిటని అడిగాడతను. నేను డాక్టర్ పేరు చెప్పగానే, “ఆయన మా గురువుగారే”నని చెప్పి నాకు డాక్టరుగారి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాడు. అంతేకాదు, అతనే డాక్టరుగారికి ఫోన్ చేసి, మా బాబు పేరు, బాబు అనుభవిస్తున్న బాధ గురించి చెప్పి, ఏ మందులు వాడాలో కనుక్కుని, ఆ మందుల పేర్లు నాతో చెప్పాడు. ఆ మందులు వాడుతూ, ప్రతిరోజూ బాబా ఊదీతీర్థం సేవిస్తుండటంతో 15 రోజుల్లో మా బాబు నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. నేను అనుకున్న 18 రోజుల్లోపే బాబా నా సమస్యను తీర్చేశారు. బాబాపై ఆధారపడితే అన్నీ తానై నడిపించి మన కష్టాలను అధిగమింపజేస్తారు. “థాంక్యూ సో మచ్ బాబా!”

ఊదీ మహిమ

2020, అక్టోబరు రెండవవారంలో నాలుగురోజులపాటు నా ఒంట్లో చాలా నలతగా ఉంది. ఒక ముఖ్యమైన విషయమై ఎక్కువగా ఆందోళన చెందుతుండటం వలన వైట్ డిశ్చార్జ్ (తెల్లబట్ట) మొదలైంది. దానివల్ల కాళ్ళనొప్పులొచ్చి నడవడం కూడా కష్టమైంది. సమస్య తీవ్రంగా ఉండడంతో డాక్టరుకి చూపించుకుందామంటే, నేను అలవాటుగా చూపించుకొనే డాక్టరుగారి భర్తకి కరోనా వచ్చింది. అందువలన నేను బాబాపై భారం వేసి, బాబా ఊదీని నీళ్లలో కలుపుకొని త్రాగుతూ, గుర్తొచ్చినప్పుడల్లా ఊదీని నోట్లో వేసుకుంటూ ఉండేదాన్ని. దాంతోపాటు, అదివరకు నేను వేసుకున్న ఒక హోమియోమందు ఉంటే అది వేసుకొని, “ఈరోజు సాయంత్రానికల్లా నా సమస్య తగ్గినట్లయితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన”ని బాబాకు చెప్పుకున్నాను. బాబా దయవల్ల అక్టోబరు 11వ తేదీన నేను పనిమీద బయటికి వెళ్లి ఎంతసేపు తిరిగినప్పటికీ కాళ్ళనొప్పులు రాలేదు, పూర్తిగా తగ్గిపోయాయి.

బాబా ప్రేమ

2020, అక్టోబరు 20వ తేదీన మా బాబుకి కాస్త జలుబు చేసింది. నేను బాబాని ప్రార్థించి, బాబా ఊదీతో పాటు జలుబు తగ్గడానికి మందులు వేశాను. ఆ రాత్రంతా వాడు నిద్రలో కదులుతూ మూలుగుతూనే ఉన్నాడు. నేను ‘సాయిబాబా, సాయిబాబా’ అనుకుంటూ బాబుపై చేయివేసి అలానే నిద్రపోయాను. కాసేపటికి ఒక కల వచ్చింది. ఆ కలలో మా బాబు ఒక చిన్న గిన్నె పట్టుకొని, “మమ్మీ నాకు 101 రూపాయలు ఇవ్వు, బాబాకి ఇవ్వాలి” అని అడుగుతున్నాడు. నేనేమో, “నీకు ఇవ్వను, బాబాకే ఇస్తాను” అని చెప్తున్నాను. అంతలో నాకు మెలకువ వచ్చింది. “బాబాకు ఎలాగైనా రేపు 101 రూపాయలు దక్షిణ ఇవ్వాలి” అని అనుకుంటూ మరలా నిద్రపోయాను. అయితే ఆ విషయం నాకు మరుసటిరోజు సాయంత్రం 4 గంటల వరకు గుర్తురాలేదు. ఆ సమయంలో నేను ఇన్‌స్టాగ్రామ్‌లో సాయి మిరాకిల్స్ చదువుతుండగా ఒకసారి గుర్తువచ్చింది. కానీ మళ్ళీ అంతలోనే మరచిపోయాను. ఇక బాబా లీల చూడండి. రాత్రి గం.7.30ని.ల సమయంలో మా చెల్లి ఫోన్ చేస్తే తనతో మాట్లాడాను. కాల్ కట్ చేసిన తరువాత చూస్తే, శిరిడీ సంస్థాన్ డొనేషన్ వెబ్‌సైట్ దానంతట అదే ఓపెన్ అయివుంది. నాకెంతో ఆశ్చర్యంగా అన్పించి, 'నేను మరచిపోయినా బాబా ఊరుకోరు, మన క్షేమం కోసం ఎంతో శ్రద్ధ వహిస్తారు' అని అనుకున్నాను. బాబా చూపుతున్న ప్రేమకు చాలా సంతోషంగా అనిపించింది. ఆలస్యం చేయకుండా బాబా అడిగిన 101 రూపాయల దక్షిణ సమర్పించాను. ఆశ్చర్యంగా మా బాబు జలుబు వెంటనే తగ్గిపోయింది. ఆ మరునాడు బాబా ప్రేమకు చిహ్నంగా ‘శ్రీసాయిసచ్చరిత్ర’ కొరియర్‌లో వచ్చింది. ప్రత్యేకించి ప్రేమ చిహ్నంగా అని ఎందుకు చెప్పానంటే, గతంలో రెండుసార్లు మా బాబుకి ఆరోగ్యం బాగోలేనప్పుడు, మరోసారి శిరిడీకి వెళ్లాలని వాడు బాబాను తీవ్రంగా ప్రార్థించినప్పుడు సాయి లీలా మరియు సద్గురు లీలా మ్యాగజైన్ రూపంలో బాబా మా ఇంటికి వచ్చారు. ఈవిధంగా మా బాబుపై బాబా ప్రేమను చూపుతూ వాడిని జాగ్రత్తగా చూసుకుంటున్నామని నిదర్శనం ఇస్తున్నారు. "బాబా! మీ ప్రేమ ఎప్పుడూ మా బాబుపై, మాపై సదా ఉండాలి. మీ నీడలో మేము సంతోషంగా ఉండాలి. చాలా చాలా ధన్యవాదాలు బాబా!" 

ఓం సాయిరామ్!!!

రేపటి భాగంలో మరికొన్ని అనుభవాలు పంచుకుంటాను...


సాయిభక్తుల అనుభవమాలిక 641వ భాగం.....










కొత్త సంవత్సరంలో మనమంతా బాబాకు మరింత చేరువకావాలని, వారి అనుగ్రహాన్ని ఎన్నోరెట్లు అధికంగా పొందాలని మనసారా కోరుకుంటూ ... అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

ఈ భాగంలో అనుభవం:
  • మన బాధ్యత బాబా తన భుజాలమీద ఎలా మోస్తున్నారో!

సాయిభక్తుడు రాజశేఖర్ తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.


సాయిబంధువులకు నమస్కారం. నా పేరు రాజశేఖర్. ‘సాయి’ అంటే ‘సాయం చేసే చేయి’ అని నేను నమ్ముతాను. మన జీవితంలోని ఒడిదుడుకులను దాటడానికి సాయిబాబా మనకు చేసే సహాయాన్ని తోటి సాయిబంధువులతో పంచుకోవటానికి సహాయపడే ఈ వేదికను సృష్టించిన సాయికి నా తరఫున, సాటి సాయిభక్తుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.


నా అనుభవాలను సాయిబంధువులతో పంచుకునేముందు, నా జీవితంలో బాబాను నాకు పరిచయం చేసిన శనివారపువాళ్ళకి సదా కృతజ్ఞుడిని. మాకు బాబా అంటే ఎవరో కూడా తెలియనిరోజుల్లో మమ్మల్ని ప్రతి గురువారం కొవ్వూరు (పశ్చిమగోదావరి జిల్లా) నుండి ధవళేశ్వరంలోని సాయిబాబా గుడికి తీసుకెళ్ళి బాబా యొక్క సాన్నిహిత్యాన్ని మాకు పంచిన ఆ కొబ్బరిచెట్టువారికి (ఇంటిపేరు శనివారపు) ఎంతో ఋణపడివున్నాము. సుమారుగా 1988వ సంవత్సరం నుండి నేను బాబా గుడికి వెళ్ళటం, బాబాను దర్శించుకోవడం జరిగేది. చాలా తక్కువ సమయంలోనే బాబా నన్ను చేరదీయడం వలన నాకు బాబా మీద చాలా నమ్మకం పెరిగింది. నా 14వ సంవత్సరంలోనే (1991) ప్రతిరోజూ బాబా సచ్చరిత్ర పారాయణ చేసేవాణ్ణి. ప్రతిరోజూ నాతోపాటు బాబాకు కూడా టీ పెట్టమని అమ్మను ఒప్పించాను. అలా ఎవరు నన్ను ఏమనుకున్నా, ‘ఇతనికి బాబా అంటే పిచ్చి’ అని అనుకున్నా నవ్వి ఊరుకునేవాడిని. ఎందుకంటే, ‘బాబా మీద నా నమ్మకం వమ్ముకాదు’ అని నేను చాలా దృఢంగా నమ్మేవాడిని. నా జీవితంలోని ఎన్నో సాయి సాక్ష్యాలను పంచుకునేముందు ఈమధ్యనే జరిగిన ఒక సాయిలీలను ముందుగా మీతో పంచుకుంటాను.


నేను యు.ఎస్.ఏ లో ఉద్యోగం చేస్తున్నాను. ఒకరోజు నా స్నేహితుడు తను ఉద్యోగం చేసే కంపెనీలో ఒక పొజిషన్ ఖాళీగా ఉందని, దానికి దరఖాస్తు చేయవలసిందిగా నన్ను కోరాడు. పొజిషన్ మరియు కంపెనీ మంచిది కావడం వల్ల నేను నా స్నేహితుడికి నా CV (Curriculum Vitae) పంపించాను. వెంటనే ఇంటర్వ్యూ ఏర్పాటైంది. ఇంటర్వ్యూ జరిగేరోజు గురువారం వచ్చింది. నాకు వచ్చిన ఇ-మెయిల్‌లో నన్ను ఇంటర్వ్యూ చేసేవాళ్ళ పేరు చూసి ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యాను. ఎందుకంటే, నన్ను ఇంటర్వ్యూ చేసే అతని పేరు ‘సాయి’. అది చూస్తూనే చాలా ఆనందంగా అనిపించింది. ఎటువంటి నిర్లక్ష్యానికీ తావులేకుండా ముందురోజు ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అయ్యాను. గురువారం ఇంటర్వ్యూకి హాజరై 70 శాతం బాగానే చేశాను.


నేనిక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. బాబా మనకు సహాయం చేస్తారన్నది ఎంత సత్యమో, మనం కూడా ఏదైనా పనిని మనవైపు నుండి ఎటువంటి నిర్లక్ష్యానికీ తావులేకుండా పూర్తి శక్తిసామర్థ్యాలతో ప్రయత్నిస్తే బాబా మనకు విజయం అందించడం తథ్యం. మన ప్రయత్నంలో లోపం ఉండవచ్చుగానీ, బాబా సహాయంలో మాత్రం ఎటువంటి నిర్లక్ష్యమూ ఉండదు


ఇంటర్వ్యూ అయిన తరువాత నేను ఉద్యోగానికి ఎంపికైనట్లు కంపెనీవాళ్ళు నాకు ఇ-మెయిల్ చేశారు. అయితే ఇక్కడే ఒక చిక్కు వచ్చిపడింది. కనీసం 3 సంవత్సరాలు యు.ఎస్.ఏ లో ఉన్నవాళ్ళకే ఈ ఉద్యోగం ఇవ్వాలనే నిబంధన ఉంది. కానీ, నేను యు.ఎస్.ఏ వచ్చి అప్పటికి కేవలం 2 సంవత్సరాల 3 నెలలు మాత్రమే అయింది. అందువలన ఈ ఉద్యోగం నాకు రాదని అనుకున్నాను. కానీ, ఎక్కడో బాబాపై నమ్మకంతో ఆయన మీద భారం వేసి ఉన్నాను. రెండు వారాల తరువాత డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయమని కంపెనీ నుండి ఇ-మెయిల్ వచ్చింది. డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసిన తరువాత కూడా, “వాళ్ళు ఇంకా 3 సంవత్సరాల కండిషన్ చూసుకొని ఉండరు, అందుకే డాక్యుమెంట్స్ అడుగుతున్నారు” అని అనుకున్నాను. రెండు వారాల తరువాత ఐడి కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోమని నాకు ఇ-మెయిల్ వచ్చింది. ఒక్కొక్క దశ దాటుతున్నకొద్దీ నాలో టెన్షన్ కూడా అలాగే ఉండేది. ఒకవైపు బాబాపై నమ్మకం, మరోవైపు ఏ నిమిషంలోనైనా ‘మీరు అమెరికా వచ్చి 3 సంవత్సరాలు పూర్తికాలేదు కదా, అందుకే రిజెక్ట్ చేస్తున్నాము’ అనే మాట వినాల్సి వస్తుందేమోనని భయం. ఏదైతే ఏంటి, విజయవంతంగా ఐడి కార్డ్ కోసం దరఖాస్తు చేశాను. ఇక్కడినుంచి ఈ మొత్తం పనిని బాబా తన భుజాలమీద ఎలా మోస్తున్నారో నాకు అనుభవపూర్వకంగా తెలిసింది.


ఐడి కార్డుకి దరఖాస్తు చేసిన ఒక వారంరోజుల తరువాత ఐడి కార్డ్ తీసుకోవడానికి రమ్మని కంపెనీవాళ్ళు ఫోనుగానీ, ఇ-మెయిల్ గానీ చేస్తారు. కానీ, నా విషయంలో అది జరగలేదు. ఒక వారం అయిన తరువాత కూడా నేను ఎటువంటి మెయిల్ రిసీవ్ చేసుకోలేదు. ఆ తరువాత యు.ఎస్.ఏ లో ఎన్నికల మూలంగా మరో 2 వారాలు గడిచినా కూడా నాకు ఎటువంటి ఇ-మెయిల్ రాలేదు. ఇంక నాకున్న ఆశ పోయింది. “నా అప్లికేషన్ రిజెక్ట్ అయింది, అందుకే కంపెనీ నుండి రెస్పాన్స్ రాలేద”ని అనుకున్నాను. కానీ 4 వారాల తరువాత, హెడ్ ఆఫీస్ నుండి ఐడి కార్డ్ జారీ చేయబడిందనీ, బ్రాంచ్ ఆఫీసుకి వెళ్ళి కార్డ్ తీసుకోవాలని మెయిల్ వచ్చింది. కానీ, బ్రాంచ్ ఆఫీస్ నుండి కూడా మనకు ఇ-మెయిల్ వస్తే దానిని ప్రింటవుట్ తీసుకుని వెళ్ళి అడగవచ్చు కదా అనే ఉద్దేశ్యంతో వెంటనే బ్రాంచ్ ఆఫీసుకి వెళ్ళలేదు. కానీ, నా స్నేహితుడు “ఇంకా వెయిట్ చేయడం మంచిది కాదు, మనమే నేరుగా బ్రాంచి ఆఫీసుకి వెళదాం” అన్నాడు. “ఐడి కార్డ్ కోసం గురువారం వెళదాము” అని చెప్పే ధైర్యం లేక, “సరే, రేపు మీ ఇంటికి వస్తాను, అక్కడనుండి ఇద్దరం కలిసి వెళదాం” అని అన్నాను. కానీ నా మనస్సులో మాత్రం ఆరోజు ససేమిరా వెళ్ళే ఉద్దేశ్యం లేదు. ఎందుకంటే, మరుసటిరోజు బుధవారం. ఒక్కరోజు ఆగితే గురువారం. గురువారంరోజు బాబా రోజని మనందరికీ ఉన్న నమ్మకం. కానీ నా స్నేహితునికి ఈ విషయం చెప్పడం ఎందుకులే అని ఏమీ చెప్పలేదు. అయితే ఒక గంట తరువాత నా స్నేహితుడు ఫోన్ చేసి, మరుసటిరోజు బుధవారం బ్రాంచ్ ఆఫీసుకి సెలవు కావడం వలన నన్ను గురువారం రమ్మని చెప్పాడు. ఇక నా ఆనందం చూడండి. 


ఇక గురువారం ఉదయం 8.30 కి బాబా సచ్చరిత్ర చదివిన తరువాత నా స్నేహితుని ఇంటికి వెళ్ళాను. తనకు 10 గంటలకు ఒక మీటింగ్ ఉందని, ఆ మీటింగ్ అయిన తరువాత వెళదామన్నాడు నా స్నేహితుడు. తరువాత ఇద్దరం కలిసి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఎందుకో నా దృష్టి వాళ్ళింట్లో ఉన్న దీపంపై పడింది. “ఈరోజు గురువారం కదా, పూజేమైనా చేశారా?” అని నా స్నేహితుడిని అడిగాను. నా స్నేహితుని కుటుంబం ఒరిస్సాకు చెందినవాళ్ళు కావడం వలన వాళ్ళు బాబా గురించి చెబుతారని నేను ఊహించలేదు. ఆశ్చర్యంగా నా స్నేహితుడు నాతో, తన భార్య బాబా భక్తురాలని, గురువారంరోజు ఉపవాసం ఉండి, బాబాకు ఆరతి చేసిన తరువాత సాయంత్రం భోజనం చేస్తుందని చెప్పడంతో నాకు ఒక్కసారి ఒళ్ళంతా జలదరించింది. ఎంతో ఆనందంగా బాబా విషయాలు నేను వాళ్ళతో పంచుకున్నాను. ఇంతలో నా స్నేహితునికి మీటింగ్ పూర్తికావడంతో ఇద్దరం బ్రాంచి ఆఫీసుకి బయలుదేరాము. కానీ, బ్రాంచి ఆఫీసులో ఎవరిని, ఎలా సంప్రదించాలో ఇద్దరికీ తెలియదు. ఎందుకంటే నేను ఎటువంటి ఇ-మెయిల్ వాళ్ళనుండి రిసీవ్ చేసుకోలేదు కదా. బ్రాంచి ఆఫీసుకి వెళ్ళి మేము ఐడి కార్డ్ కోసం వచ్చామని చెప్పాము. “మీకు ఎవరు కావాలి?” అని అడిగారు . నా ఫ్రెండ్ తానిదివరకు ఐడి కార్డ్ తీసుకున్న వ్యక్తి పేరు చెప్పమన్నాడు. నేను అదే చెప్పాను. వాళ్ళు మమ్మల్ని కాసేపు వేచివుండమన్నారు. ఇంతలో అనూహ్యంగా మా వెనుకనుంచి ఒక వ్యక్తి వచ్చి ఆఫీసులోకి వెళ్తున్నాడు. నా ఫ్రెండ్ అతనిని చూసి విష్ చేసి, “మీరే కదా ఐడి కార్డ్ ఇచ్చేది?” అని అడిగాడు. అతను ‘అవున’న్నాడు. వెంటనే మా సంగతి అతనికి చెప్పాము. “మీకు నేను ఇ-మెయిల్ పంపానా?” అని అడిగాడతను. మేము ‘పంపలేద’ని చెప్పాము. వెంటనే అతను ఆఫీసులోకి వెళ్ళి ఇ-మెయిల్స్ చెక్ చేసి, బయటకు వచ్చి మాకు సారీ చెప్పి, “నా వల్లనే ఆలస్యమైంది, మీ ఐడి కార్డ్ హెడ్ ఆఫీసు నుండి 3 వారాల క్రితమే వచ్చింది” అని చెప్పి ఐడి కార్డును నా చేతికి ఇచ్చాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అతను 4 వారాలు సెలవులో ఉన్నాడట. కానీ, ఆఫీసులో ఏదో పనివుందని, ఒక గంటకోసం ఆరోజు రమ్మని ఆఫీసువాళ్ళు రిక్వెస్ట్ చేశారని, అందుకే వచ్చానని, మీరు చాలా లక్కీ అని మాతో అన్నాడు. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే, నా స్నేహితునికి ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు మీటింగ్ ఉంటుంది. ఎందుకో ఆరోజు 10 గంటలకు మార్చటం, దానివలన మేము 10.30 కి బ్రాంచి ఆఫీసుకి రావటం, సరిగ్గా అదే సమయానికి సెలవులో ఉన్న అతను ఒక గంటసేపటి కోసం ఆఫీసుకి రావటం... ఇవన్నీ బాబా చేసిన ఏర్పాటు కాకపోతే మరేంటి?


ఇక చివరగా, ల్యాప్‌టాప్ నాకు పంపడం కోసం ఆఫీసువాళ్ళు నా అడ్రస్ తీసుకున్నారు. ఐడి కార్డ్ వచ్చిన ఒక వారానికి ల్యాప్‌టాప్ వస్తుంది. కానీ 3 వారాలైనా నాకు ల్యాప్‌టాప్ రాలేదు. చెప్పానుగా, ఏమో, ఏ నిమిషంలోనైనా ఏదైనా జరగవచ్చు. అందుకు సిద్ధంగానే ఉన్నాను. 3 వారాల తరువాత, ల్యాప్‌టాప్ పంపామని, మంగళవారం నాకు చేరుతుందని మెయిల్ వచ్చింది. నాకేమో ల్యాప్‌టాప్ గురువారంరోజు వస్తే బాగుండని ఉంది. ఇంతలోనే ఆశ్చర్యంగా, కోవిడ్ కారణంగా ల్యాప్‌టాప్ పంపడం ఆలస్యమవుతుందని, గురువారంరోజు నాకు చేరుతుందని మెయిల్ వచ్చింది. ఇంక నా పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో మీరు ఊహించవచ్చు. ల్యాప్‌టాప్ గురువారం మధ్యాహ్నం 2 గంటలకు వస్తుందని నా ఫోనుకి మెసేజ్ వచ్చింది. ‘ఇంకేముంది, వచ్చేస్తుందిలే’ అని ఇంట్లోనే వుండి ల్యాప్‌టాప్ కోసం ఎదురుచూస్తూ నిద్రలోకి జారుకున్నాను. కాసేపట్లో ఎందుకో ఉలికిపడి లేచి టైం చూసుకుని మొబైల్లో మెసేజ్ చూసి ఆశ్చర్యపోయాను. “ల్యాప్‌టాప్ రిటర్న్ అడ్రసుకి పంపిస్తున్నామ”ని అందులో ఉంది. వెంటనే తేరుకుని, పోస్టాఫీసుకి వెళ్ళి ఐడి చూపించి ల్యాప్‌టాప్ తెచ్చుకుందామని బయలుదేరాను. ఇంట్లోంచి బయటికి వచ్చిన తరువాత మళ్ళీ వెనక్కు వెళ్ళి బాబా సచ్చరిత్రను చేతిలోకి తీసుకుని కారులో బయలుదేరాను. పార్కింగ్ నుంచి బయటకు వచ్చిన వెంటనే నా ఎదురుగా కొరియర్ ట్రక్ కనిపించింది. వెంటనే కారును ప్రక్కన పార్క్ చేసి నా ల్యాప్‌టాప్ గురించి వాళ్ళను అడిగాను. వాళ్ళు నన్ను అడ్రెస్ చెప్పమని అడిగి నేను అడ్రస్ చెప్పిన వెంటనే ల్యాప్‌టాప్‌ను నాకు ఇచ్చారు.

 

ఇక్కడ నేను చేసిన, మనమందరం గుర్తుంచుకొనవలసిన విషయం ఏమిటంటే, నేను బయటికి వచ్చేటప్పుడు సాయిసచ్చరిత్రను చేతిలో పట్టుకుని రావడం. ఎటువంటి విపత్కర పరిస్థితులలోనూ బాబాను విడువరాదని మనం గుర్తుపెట్టుకోవాలి. “సాయీ! మీరు లేని లోకం మాకు శూన్యసమానం. సదా మీ సేవలో ఉండేలా మమ్మల్ని అనుగ్రహించండి”.



సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo