సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

నరహరి వాసుదేవ్ రాయికర్ - డాక్టర్ శశికాంత్ జి.జవేరి - రెండవ భాగం..



9వ రోజు ఉదయం నరహరి కడుపు ఆకలితో నకనకలాడసాగింది. అంతలో శ్రీమతి బాయిజాబాయి తాజాగా తయారుచేసిన వేడివేడి భాక్రీలు(జొన్నరొట్టెలు) ఒక బుట్టతో తీసుకొని అక్కడికి వచ్చింది. నరహరి పళ్ళు కూడా తోముకోకుండా ఆ భాక్రీలను ఆత్రంగా తినడం మొదలుపెట్టాడు. అప్పుడు బాబా, “ఆకలి ఒక వ్యక్తిని ఎలా నిరాశకు గురిచేస్తుందో, అతని నిబ్బరాన్ని, ఉనికిని ఎలా కోల్పోయేలా చేస్తుందో చూడు. కడుపులో ఆకలి బాధిస్తుంటే అతను అంధుడవుతాడు. జ్ఞాని క్రూరుడిగా మారతాడు. తన కడుపు ఎలా నింపుకోవాలా అని మాత్రమే ఆలోచిస్తాడు. చివరికి పిల్లల చేతిలోని ఆహారాన్ని లాక్కోవడానికి కూడా అతను వెనుకాడడు. రాబోయే రోజుల్లో మనిషి డబ్బుకోసం ఆరాటపడతాడు. కుటుంబాన్ని, ఆత్మీయులను పట్టించుకోడు. డబ్బు సంపాదించే విషయానికి సంబంధించి అతని చర్యలు రాక్షసులను కూడా సిగ్గుపడేలా చేస్తాయి" అని అన్నారు. (బాబా మాటలు ఎంత నిజమో ఈరోజు ఋజువవుతోంది. ప్రపంచంలో విపరీతమైన ఆకలి, పోషకాహార లోపం ఉంది. ప్రజల ఆకలి తీర్చడానికి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంస్థలు ఏర్పడ్డాయి. భారతదేశంలో అనేకమంది సాయిభక్తులు 'సాయి రోటీ’, 'సాయి భరోసా’ వంటి కార్యక్రమాలతోనూ, ఇతర భక్తులు దేవాలయాలలోనూ, గురుద్వారాలలోనూ కులమతాలకు అతీతంగా అన్నదానాలు చేస్తూ ప్రజల ఆకలి బాధలు తీర్చడానికి తమదైన రీతిలో ప్రయత్నిస్తున్నారు.)

నరహరి శిరిడీలో బాబా సన్నిధిలో ఉన్న 11వ రోజు తెల్లవారుఝామున బాబా అతనిని కుదిపి నిద్రలేపి, “అరే! లేచి నాతో రా” అని అన్నారు. వెంటనే నరహరి నిద్రలేచి బాబాను అనుసరించాడు. బాబా వడివడిగా నడుస్తూ కొద్దిదూరంలో ఉన్న చిన్న మారుతి మందిరానికి వెళ్లారు. అక్కడ ఒక రావిచెట్టు, దానిక్రింద సింధూరం పూసివున్న మారుతి ప్రతిమ ఉన్నాయి. దాని చుట్టూ 11 ప్రదక్షిణలు చేయమని బాబా నరహరిని ఆజ్ఞాపించారు. అతను బాబా చెప్పినట్లే చేశాడు. ఆ తర్వాత బాబా అతన్ని, ‘అక్కడున్న పిట్టగోడ దిగువన ఒక పిడికెడు మట్టి ఉంచి, దానిపై అక్కడ వెలుగుతున్న దీపాన్ని ఉంచమని’ అన్నారు. ఆపై బాబా అతన్ని ‘ఆ పిడికెడు మట్టిని తిరిగి యథాస్థానంలో ఉంచమని’ చెప్పారు. ఆ తరువాత వారిరువురు చావడికి తిరిగి వచ్చారు. అప్పుడు బాబా అతనిని స్నానం చేయమని చెప్పారు. ఇంతలో ఒక గ్రామస్థుడు వారిరువురికోసం టీ తీసుకొచ్చాడు. బాబా నరహరితో, "టీ త్రాగి వెళ్ళు. సాయంత్రం వరకు తిరిగి రావద్దు. రోజంతా గ్రామంలో ఎక్కడో ఒకచోట గడిపి సాయంత్రం వచ్చి మసీదులో నన్ను కలుసుకో!" అని అన్నారు. బాబా ఆజ్ఞ ప్రకారం నరహరి వెళ్ళిపోయి సాయంత్రం తిరిగి మశీదుకు వచ్చాడు. బాబా అతన్ని దగ్గరకు రమ్మని పిలిచి, ధునిలో నుండి పిడికెడు ఊదీ తీసి అతనిపై చల్లారు. ఆ సమయమంతా బాబా మెల్లగా ఏదో గొణుగుతూ ఉన్నారు. ఆ తర్వాత నరహరిని ధుని దగ్గర ప్రశాంతంగా కూర్చోమని చెప్పారు. చాలా సమయం తర్వాత ఇద్దరూ మసీదు విడిచి చావడికి వెళ్లారు. చివరిగా బాబా, “ఇప్పుడు నీ పని ప్రారంభమైంది. నువ్వు దేనిగురించీ చింతించకు" అని అన్నారు. జరుగుతున్నదంతా గమనిస్తున్న నరహరి తన భవిష్యత్తు గురించి ఆందోళన చెంది, అందులో ఏదో తనకి ఎంత మాత్రం మంచిది కాదని అనుమానించి, బహుశా దానికోసం బాబా ఈవిధంగా నివారణ చేసారని భావించాడు. బాబా ఏం చేస్తారో, ఎందుకు చేస్తారో ఎవరు ఊహించగలరు?

18వ రోజు మధ్యాహ్నం దాటిన తర్వాత బాబా నరహరిని వెంటబెట్టుకొని కొండచిలువను సమాధి చేసిన ప్రదేశానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక బాబా తమ రెండు చేతులు పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ, “ఓ ప్రభూ! ఈ బిడ్డపై కరుణ చూపండి. అతని జీవితపర్యంతం అతనికి రోజుకు రెండింతల ఆహారాన్ని సమకూర్చండి, అతని అవసరాలు తీర్చండి" అని అన్నారు. తర్వాత బాబా నరహరిని కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోమని చెప్పారు. అతను బాబా ఆజ్ఞానుసారం కళ్లు మూసుకుని కూర్చున్నాడు. కొద్దిసేపటి తర్వాత ఒక అలౌకికమైన ఘటన జరిగింది. నరహరికి తన తలలో సుడిగాలి రేగుతున్నట్లు, ఆపై శరీరమంతా కంపించిపోతున్నట్లు అనుభూతి కలిగింది. ఆ అనుభూతి యొక్క తీవ్రత క్రమంగా పెరగడం మొదలై అతను భయంతో బిగుసుకుపోయాడు. అంతలో తనని ఏదో శక్తి క్రిందికి లాగుతున్నట్లు అనిపించింది. ఆ మొత్తం ప్రక్రియ భయానకంగా ఉన్నందున అతను బాగా అలసిపోయాడు. తనకేం జరుగుతోందో అతనికి అర్థం కాలేదు. కానీ అతను తన జీవితాన్ని, భవిష్యత్తును బాబా చేతికి అప్పగించాడు. అందువల్ల అతను చేయగలిగిందేమీ లేదు. కాబట్టి అతను అలాగే నిద్రలోకి జారుకున్నాడు. అతనికి మెలకువ వచ్చి లేచి చూసేసరికి చీకటి పడింది. బాబా కోసం చుట్టుప్రక్కల చూశాడు, కానీ బాబా ఎక్కడా కనిపించలేదు. దాంతో అతను ఆత్రుతగా పరిగెత్తుకుంటూ మసీదుకి వెళ్లి చూస్తే, అక్కడ బాబా ఉన్నారు. బాబా అతడిని చూస్తూనే సంతోషంగా, "రా బిడ్డా! ఈరోజు నుండి నీ జీవితం మెరుగుపడనారభించింది" అని అన్నారు. నిజానికి నరహరి శిరిడీ వచ్చినప్పటినుండి బాబా తరచూ అతనితో, "నీ ప్రారబ్ధం తుచ్ఛమైనది. నీ జీవితచరిత్రలో వ్రాసినది చాలా తక్కువ" అని అంటుండేవారు. అయితే, “నా భక్తుని జీవితంలో తిండికి, బట్టకు కొరత ఉండదు” అని బాబా ప్రతిజ్ఞ చేశారు కదా! అందుచేత, ఒంటరిగా శిరిడీ వచ్చి తమను ఆశ్రయించిన ఆ కుర్రవాడి తలరాతను(ప్రారబ్ధాన్ని) బాబా తమ అనుగ్రహంతో మార్చివేశారు.

నరహరి శిరిడీలో బసచేసిన 19వ రోజంతా బాబా ఉల్లాసంగా ఉన్నారు. ఆ రాత్రి బాబా అందరినీ మసీదు నుండి పంపించి నరహరిని పడుకోమనీ, తాము చెప్పినప్పుడే లేవమనీ అన్నారు. రాత్రి మధ్యమధ్యలో బాబా అతన్ని నిద్రలేపి, “నేను చెప్పేది బాగా శ్రద్ధగా విను” అంటూ ఎన్నో విషయాలు చెప్పారు. ఆ తర్వాత ధుని నుండి కొంత ఊదీ తీసి నరహరి ముందు నేలపై పరచి, దానిపై ఒక చేయి ఆకారాన్ని చిత్రించి, “ఇది ఒక వ్యక్తి యొక్క కుడి అరచేతి ముద్ర. ఇందులో వీనస్ పర్వతం అంటే బొటనవేలు మొదలులో కండవంటి భాగం ప్రక్కన ఒక చేప ఆకారాన్ని ఏర్పరిచే రేఖలు ఉన్నాయి. ఒక సరళరేఖ దానిగుండా చూపుడువ్రేలికి, మధ్యవ్రేలికి మధ్యగా వెళుతోంది. నేను చూపిస్తున్నది నీకు అర్థమైందా?" అని స్పష్టంగా అడిగారు. నరహరి తనకు అర్థం కాలేదన్నట్టుగా తల అడ్డంగా ఊపాడు. అప్పుడు బాబా, “గాడిదా! ఇది ఆ వ్యక్తి యొక్క గుర్తింపు. కాబట్టి దీనిని జాగ్రత్తగా చూసి, ఇది నీ బుర్రలో స్థిరపడిపోయేలా మనస్సులో మననం చేస్తూ ఉండు. ఆ వ్యక్తి నా స్నేహితుడు. నీ అవసాన సమయంలో సముద్రానికి దగ్గరగా ఉన్న ఆసుపత్రిలో అతను నిన్ను కలుస్తాడు. అతని చేతిని క్షుణ్ణంగా పరిశీలించిన మీదట, నేనిప్పుడు నీకు ఇవ్వబోయేది అతనికివ్వు, మర్చిపోవద్దు. ఇప్పుడు నా మాట జాగ్రత్తగా, అత్యంత శ్రద్ధగా విను. ఆ యువకుడు(నా స్నేహితుడు) భగవంతుడిని విశ్వసించడు. కాబట్టి అతను నువ్వు చెప్పేది నమ్మడు. అందువల్ల నువ్వు అతనితో ‘ఈరోజు నుండి మూడవరోజున అతనొక పోట్లాటలో పాల్గొంటాడని, 4వ రోజున అతను తిండి తినకుండా రాత్రి పొద్దుపోయేవరకు ఆకలితో అలమటిస్తాడని’ చెప్పు. ఈ రెండు విషయాలు జరిగిన తరువాత నేనిప్పుడు నీకు ఇచ్చేది అతనికి ఇవ్వు” అని వివరంగా చెప్పారు.

బాబా ఇంకా ఇలా చెప్పారు: “నేను నా శరీరాన్ని విడిచిపెట్టిన 20 సంవత్సరాల తర్వాత ఆ యువకుడు జన్మిస్తాడు. అతని కుడి అరచేతిలో నేను నీకు చూపించినట్లుగా రేఖలు ఉండటం నువ్వు గమనిస్తావు. అదే అతని గుర్తింపు. అతను నీ మరణానికి ముందు నిన్ను కలుస్తాడు. నీ మరణానంతరం నీ అంత్యక్రియలు చేస్తాడు. అంత్యక్రియలు అత్యంత ఆవశ్యకం. ఎందుకంటే, వ్యక్తి మరణించినప్పుడు బాధల నుండి విముక్తి పొంది ఆనందకరమైన ఘడియల్లోకి వెళ్తాడు. ఆ సమయంలో అతను చాలా స్వచ్ఛంగా ఉంటాడు. కారణం అతను ఈ లౌకిక జీవితం నుండి ఏమీ తీసుకొనిపోడు. అతని శరీరం కూడా కాలి బూడిద అవుతుంది, అది కూడా ఇక్కడే ఉండిపోతుంది. ఇకపై, నువ్వు హస్తసాముద్రికాన్ని అభ్యసిస్తావు, అందులో జ్ఞానాన్ని పొందుతావు. నువ్వు మరణించేరోజు వరకు నీకు అవసరమైన ఆహారం, బట్టలు పొందగలిగేంత జ్ఞానాన్ని మాత్రమే నువ్వు సంపాదిస్తావు. నా అనుగ్రహం వల్ల నువ్వు ఎన్నటికీ ఆకలితో ఉండవు".

తర్వాత బాబా నరహరిని తమ గుండెలకు హత్తుకొని, అతని తల నిమురుతూ, "కాసేపు ప్రశాంతంగా కూర్చో!" అని చెప్పి వడివడిగా ఎక్కడికో వెళ్ళారు. కొంతసేపటికి తిరిగి వచ్చిన బాబా తమ పాదాలు కడుక్కొని, ధుని చుట్టూ మొత్తం 7 సార్లు ప్రదక్షిణ చేశారు. తర్వాత తమ తలకు కట్టుకున్న గుడ్డను తీసి, దాన్ని రెండు ముక్కలుగా చేసి, ఒక ముక్కను రాశిగా పోసివున్న ఊదీపై వేసి, దానిపై కొద్దిసేపు నిలబడ్డారు. దాంతో ఆ గుడ్డపై బాబా పాదముద్రలు ముద్రితమయ్యాయి. అప్పుడు బాబా ఆ గుడ్డను చక్కగా మడిచి, తమ తలపాగా యొక్క మరో గుడ్డముక్కలో భద్రంగా చుట్టి నరహరికి ఇచ్చి, "ఈ పాదముద్రల ఆధారంగా రాతితో ఒక జత పాదుకలు, ఇత్తడితో మరో జత పాదుకలు చేయించి, వాటిలో ఒక జత పాదుకలను నా భక్తుల దర్శనార్థం, రెండవ జత పాదుకలను అభిషేకం కోసం ఉపయోగించమని ఆ యువకుడితో చెప్పు. ఆ పాదుకలు నా భక్తుల కోరికలు నెరవేరుస్తాయి, వాళ్ళను ఉద్ధరిస్తాయి. వారి వారి విశ్వాసం, పూర్వజన్మలలో వారు చేసుకున్న సత్కర్మలననుసరించి విశేషమైన ప్రయోజనాన్ని పొందుతారు. నా పాదుకలను అభిషేకించిన జలం అమృతం వంటిది. అది అసాధారణ వ్యాధులను నిర్మూలిస్తుంది, సంతానం లేనివారికి సంతానాన్ని ప్రసాదిస్తుంది, పురిటి నొప్పులు, ప్రసవ బాధల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాదు, ఆ అభిషేకజలం ఏ స్థలాన్నయినా పవిత్రం చేస్తుంది" అని చెప్పారు. తరువాత బాబా నరహరి ఎడమచెవిలో ఒక మంత్రం చెప్పి, దాన్ని ఆ యువకుడి కుడిచెవిలో చెప్పమన్నారు. తర్వాత, "ఈ మంత్రాన్ని అతను 30 సంవత్సరాల పాటు రాత్రి ఒంటిగంట సమయంలో ఒకే ఒక్కసారి మనసారా పఠించాలి. 30 సంవత్సరాలు పఠించడం పూర్తయిన తరువాతే నా పాదుకలు పవిత్రతను సంతరించుకొని సజీవంగానూ, శక్తివంతంగానూ అవుతాయి. ఆ తర్వాత వాటిని నా భక్తుల ప్రయోజనార్థం ఉపయోగించవచ్చు. ఆ రోజున ఆ కాల నాగరికత, సామాజిక విలువలు అత్యల్పంగా ఉంటాయి. మనుషులు సంపదననుసరించి, అంటే వారి వద్ద ఉన్న ధనం ఆధారంగా గుర్తింపబడతారు, మానవతా లక్షణాలను బట్టి కాదు. జనాభా విస్ఫోటనం జరిగి ప్రజలు చీమల్లా ఉంటారు. వాళ్ళు ఒకరిపట్ల ఒకరు సానుభూతి కలిగివుండరు. కేవలం డబ్బు మాట్లాడుతుంది. అటువంటి పరిస్థితుల్లో నా భక్తులకు భరోసా ఇవ్వడానికి నా పాదుకలు ఆశ్రయంగా ఉంటాయి. కాబట్టి సరైన సమయం వచ్చినప్పుడు ఈ మూటను నా మిత్రునికి ఇవ్వు. అతను నేను చెప్పినట్టు ఖచ్చితంగా చేస్తాడని నేను నీకు హామీ ఇస్తున్నానునరహరీ! ఇది బాగా గుర్తుంచుకో, 'ఈ మంత్రం నీ మస్తిష్కము నుండి నిర్ణిత సమయం వరకు చెదిరిపోతుంది. నీకు అది గుర్తుండదు. కానీ, నువ్వు అతని కుడి చెవిలో చెప్పవలసి వచ్చినప్పుడు నీకు అది తిరిగి జ్ఞాపకమొచ్చి, నువ్వు స్పష్టంగా ఉచ్ఛరిస్తావు" అని చెప్పారు.

మరుసటిరోజు ఉదయానికి, ఆ మంత్రంలోని ఒక్క పదం కూడా నరహరికి గుర్తు రాలేదు. ఆ మరుసటి రోజు అంటే 21వ రోజున అతను తిరిగి బయలుదేరాలని బాబా నిర్ణయించి ఉన్నందున నరహరి బాబాకు వీడ్కోలు పలికే సమయం దగ్గర పడింది. అందువల్ల అతను 20వ రోజున బాబా చెప్పిన ఆ మంత్రాన్ని గుర్తుచేసుకోవాలని ఎంత ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అప్పుడు బాబా అతనిని తమ దగ్గర కూర్చుండబెట్టుకొని, "నువ్వు ఆ మంత్రాన్ని నిర్ణిత సమయం వరకు మర్చిపోతావని చెప్పాను. అది భగవంతుని సంకల్పం. దాని గురించి చింతించకు. ఆయన పనిని ఆయన్ని చేయనివ్వు. ఇది ఆయన దివ్య నాటకం. మనం అర్థం చేసుకోలేము. మనం భగవంతుని సేవకులం. ఆయన సంకల్పానుసారం మనం జీవనం సాగించినట్లైతే, మనం సంతోషంగా ఉంటాము. మనమందరం యాచకులం. ఎందుకంటే, మనం ఆయనని అనేక విషయాలు అడుగుతాము. అయితే, ఎవరికి ఏమి ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో ఆయనకి తెలుసు. నేను ప్రతిరోజూ భిక్షకు వెళ్తాను, నేను చనిపోయేవరకు అలా చేస్తాను. ఇది ఈ బ్రతుకు నాటకంలో భక్తులు ఎక్కడ, ఎలా నిలబడ్డారో చూపించడానికే. వాళ్ళు అభాగ్యులకు సహాయం చేస్తే, అణగారిన ప్రజలకు కాస్తైనా సేవ చేస్తే అదే భగవంతునిపట్ల నిజమైన భక్తి. ఇతరుల కన్నీళ్ళు తుడవడం, వారితో ప్రేమగా మాట్లాడటం, ఇదే నిజమైన గురుసేవ. ఇది నా గురువు నాకు బోధించినది, ఇది ఆయన నాకిచ్చిన ఆయన ఖజానా తాళంచెవి. అది నేను నీకు అప్పగిస్తున్నాను. ఇది బ్రతుకు మంత్రం" అని చెప్పారు.

ఆఖరి రోజు అంటే బాబా నరహరితో శిరిడీ విడిచి వెళ్లాలని చెప్పిన 21వ రోజు రానే వచ్చింది. నరహరి బాబాని విడిచి వెళ్ళడానికి చాలా బాధపడ్డాడు. అప్పుడు బాబా అతనిని ఆలింగనం చేసుకొని, “జీవనప్రయాణంలో సుఖదుఃఖాలు ఎప్పుడూ ఉంటాయి. ఎలాంటి క్లిష్టపరిస్థితి ఎదురైనా నువ్వు దాన్ని శాంతంగా, ధైర్యంగా ఎదుర్కొంటే దానిని అధిగమిస్తావు. శ్రద్ధ-సబూరిలు కలిగి ఉండి నీకు ఎదురైన పరిస్థితి/ఘటన గురించి ఆలోచిస్తే, నువ్వు ఖచ్చితంగా సరైన మార్గాన్ని ఎంచుకుంటావు. నా ప్రతి భక్తుడు ఈ ప్రపంచంలో ఇలా జీవించాలి. ఇది అంటే 'శ్రద్ధ-సబూరీ' నా గురువు యొక్క బోధ అని నువ్వు కలిసే ప్రతి భక్తుడికి చెప్పాలని నేను కోరుకుంటున్నాను" అని అన్నారు. తర్వాత బాబా అతనిని కోపర్‌గావ్‌ వెళ్లే భక్తులకోసం వేచి ఉన్న టాంగా దగ్గరకు తీసుకెళ్లి, అతని శిరస్సుపై తమ అమృత హస్తన్నుంచి, అతని ముఖాన్ని ముద్దాడి ఆశీర్వదించారు. ఆపై బాబా అతనికి 16 రూపాయలిచ్చి, “ఈ లక్ష్మిని నీ దగ్గర ఉంచుకో! నీ తిండికి, ఖర్చులకు అవసరమైన ధనానికి లోటుండదు” అని చెప్పి టాంగాలో కూర్చోమన్నారు. ఆవిధంగా శిరిడీలో బాబాతో నరహరి గడిపిన 21 గోల్డెన్ డేస్(సువర్ణ దినాలు) ముగిశాయి. ఐదు, ఆరు సంవత్సరాల తరువాత బాబా మహాసమాధి చెందారు. ఆ సమయంలో నరహరి శిరిడీ సందర్శించలేకపోయాడు. తాను శిరిడీలో బస చేసిన చివరిరోజున బాబా అతనితో చెప్పిన 'శ్రద్ధ - సబూరీ' గురించి, జీవితాన్ని ఎలా జీవించాలో అందరికి చెప్తుండేవాడు. చాలామంది జనం అతనిని కలవడానికి వచ్చేవారు. వాళ్ళు బట్టలు, తినుబండారాలు, కిరాణా సామాన్లు, పండ్లు తెచ్చి అతనికి ఇచ్చేవారు. అతనికి ఇబ్బందిగా అనిపించినప్పటికీ బాబా ఆశీర్వాదంగా భావించి స్వీకరిస్తుండేవాడు. అలా సంవత్సరాలు దొర్లిపోయాయి.

మిగతాది తరువాయి భాగంలో .. 

మూలం: బాబా స్ డివైన్ మేనిఫెస్టేషన్స్ బై విన్నీ చిట్లూరి.

నరహరి వాసుదేవ్ రాయికర్ - డాక్టర్ శశికాంత్ జి.జవేరి - మొదటి భాగం..


శ్రీసాయినాథుని దివ్య ఆశీస్సులతో 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ 7వ వార్షికోత్సవ శుభాకాంక్షలు


"బాబా! మీ ఆశీస్సులతో ప్రారంభమైన ఈ 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ మీ ప్రేమలో ఆరు వసంతాలు పూర్తి చేసుకుని ఏడవ వసంతంలోకి అడుగిడుతున్న శుభసందర్భంలో.. మీ ప్రేమను పంచుకుంటూ, ఆస్వాదిస్తూ సదా మీ స్మరణలో ఆనందంగా ఉండేలా మీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి."

నరహరి వాసుదేవ్ రాయికర్

ఇది 21 రోజుల పాటు శిరిడీలో బాబా ప్రత్యక్ష సన్నిధిలో గడిపే మహద్భాగ్యాన్ని పొందిన ఒక యువకుడి కథ. ఆ యువకుని పేరు నరహరి వాసుదేవ్ రాయికర్. తనకు 16 సంవత్సరాల వయస్సున్నప్పుడు తాననుభవిస్తున్న దౌర్భాగ్య జీవితంతో విసుగు చెందిన నరహరి శిరిడీ వెళ్లి బాబా పాదాలను ఆశ్రయించాలని నిర్ణయించుకొని, 1912, డిసెంబర్ నెలలో ఒక సోమవారంనాడు ఒంటరిగా బొంబాయి నుండి బయలుదేరి ప్రయాసతో కూడుకున్న సుదీర్ఘ ప్రయాణం చేసి చివరికి సుమారు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో శిరిడీ చేరుకున్నాడు.

శిరిడీ ఒక కుగ్రామం. ఆ గ్రామంలోకి వెళ్లే మట్టిమార్గమంతా గుంటలతోనూ, అక్కడక్కడ చెత్తాచెదారంతోనూ నిండి ఉంది. ఆ మార్గంలో వెళ్తున్న నరహరి ఎదురుగా వస్తున్న ఒక మహిళను చూసి, "బాబా ఎక్కడ ఉంటారు?" అని అడిగాడు. ఆమె మౌనంగా ఒక దిక్కుగా చూపించింది. ఆమె చూపిన వైపుగా కాస్త ముందుకు వెళ్లిన నరహరి ఒక గుడిసె ముందు నిల్చొని ఉన్న మహిళతో, తనకు చాలా దాహంగా ఉందని, త్రాగడానికి మంచినీళ్ళు ఇమ్మని అడిగాడు. ఆమె ఎంతో వాత్సల్యంగా, "నువ్వు ఎక్కడనుండి వస్తున్నావు?" అని అడిగింది. అందుకు నరహరి, “నేను బాబాను దర్శించుకోవాలని ముంబాయి నుండి వస్తున్నాను” అని బదులిచ్చాడు. అది విని ఆశ్చర్యపోయిన ఆమె అతన్ని కూర్చోమని చెప్పి, వడివడిగా లోపలికి వెళ్లి, ఒక పళ్లెంలో వేరుశెనగలు, కొద్దిగా బెల్లం, వాటితోపాటు ఒక గ్లాసుతో మంచినీళ్లు తీసుకొచ్చి, వాటిని అతనికిచ్చి తినమని చెప్పింది. నరహరి ఆమె ఇచ్చిన ఆహారాన్ని తిని, మంచినీళ్ళు త్రాగి కుదుటపడిన తర్వాత ఆమె అతని వద్ద కూర్చొని, ముంబాయిలో అతని జీవన విధానం గురించి అడిగింది. అందుకతను, "నేనొక అనాథను. నా తల్లిదండ్రులు ఎప్పుడు మరణించారో నాకు గుర్తులేదు. టెక్స్‌టైల్ మిల్లులో పనిచేసే మా మామయ్య నన్ను తమ ఇంటికి తీసుకెళ్లాడు. ఆయన రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు ఇద్దరు పిల్లలు. ఆమె నన్ను చూడటానికి కూడా ఇష్టపడేది కాదు. ఉదయం నుండి రాత్రి బాగా పొద్దుపోయేవరకు నా చేత ఎంతో పని చేయించుకొని కూడా సరిగా ఆహారం పెట్టేది కాదు. అందరూ తినగా మిగిలిన ఆహారాన్ని, అది కూడా చాలా స్వల్పంగా మాత్రమే పెట్టేది. అదీ చాలక, నేను ఉత్తపుణ్యానికే అన్నం తింటూ తన కుటుంబానికి భారంగా మారానని సూటిపోటి మాటలు అంటుండేది. ఆ మాటలు నన్ను చాలా బాధించేవి. మా మామయ్య తరచూ శ్రీసాయి సచ్చరిత్ర రచించిన శ్రీదభోల్కర్ ఇంటికి వెళ్తుండేవారు. నేను కూడా ఆయనతో కలిసి తరచూ అక్కడికి వెళ్ళేవాడిని. అక్కడ బాబా దైవత్వం గురించి విన్న నేను ఎలాగైనా శిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకుని, నాకు చక్కని భవిష్యత్తును ప్రసాదించమని బాబాను ప్రార్థించి, ఆయన ఆశీస్సులతో నా కాళ్లపై నేను జీవించాలని నిర్ణయించుకొని కేవలం మూడు అణాలు జేబులో పెట్టుకొని శిరిడీ వచ్చే ధైర్యం చేశాను" అని చెప్పాడు. అదంతా విన్న దయామయి అయిన ఆ తల్లి, "అయ్యో, నాయనా! నీ కథ విని నా హృదయం ద్రవించిపోతోంది. ఆ భగవంతుడు నీకు మంచి భవిష్యత్తును ప్రసాదిస్తాడు. రాత్రి భోజనానికి మా ఇంటికి రా. నేను పేదరాలినైనప్పటికీ నాకు ఉన్నంతలో నీకు తప్పక భోజనం పెడతాను. నువ్వు మా ఇంటి ముందున్న అరుగు మీద పడుకోవచ్చు" అని అంది. ఆమె మాటలు విన్న నరహరి నయనాలు అశ్రువులతో నిండిపోగా అపరిచితురాలైన ఆ స్త్రీ ప్రవర్తనకు, తన అత్త ప్రవర్తనకు మధ్యనున్న అంతరాన్ని పోల్చుకోకుండా ఉండలేకపోయాడు.

తర్వాత నరహరి నేరుగా మసీదుకు వెళ్ళాడు. అక్కడ గోడకు అభిముఖంగా ముఖం పెట్టి పడుకొనివున్న ఒక వ్యక్తిని చూశాడు. ఆ వ్యక్తి మాసిన తెల్లని చింకి కఫినీ ధరించి ఉన్నారు. తలకు మాసిన ఒక తెల్లని వస్త్రం చుట్టి ఉంది. ఆయన సుమారు ఆరు అడుగుల ఎత్తు ఉన్నారు. సన్నగా ఉన్నప్పటికీ దృఢంగా ఉన్నారు. ఆయన లేచేవరకు వేచి ఉండదలచి అక్కడే మశీదు మెట్ల మీద కూర్చున్నాడు నరహరి. అరగంట తర్వాత ఆయన లేచి, "అబ్దుల్! నాకు కొంచెం నీళ్లు ఇవ్వు" అని అన్నారు. వెంటనే నరహరి లేచి నిలబడి, చుట్టూ ఎవరూ లేకపోవడం చూసి తనే స్వయంగా సమీపంలో ఉన్న ఒక బకెట్‌లోంచి నీళ్ళు తెచ్చి ఆయన ముందుంచాడు. ఆయన ఏదో గొణుగుతూ నరహరిని చూసి, "ఎవరు నువ్వు?" అని అడిగారు. దానికి నరహరి, "నేను సాయిబాబాని దర్శించుకోవాలని ముంబాయి నుండి వచ్చాను. ఆయన ఎక్కడ ఉంటారు?" అని అడిగాడు. అందుకాయన, "గాడిదా! నీ ముందు ఎవరిని చూస్తున్నావ్?" అని గద్దించారు. దాంతో నరహరికి తన ఎదురుగా ఉన్న ఆ వ్యక్తి ఎవరో కాదు, సాయిబాబానేనని అర్థమై బాబా పాదాలపై తన శిరస్సును ఉంచాడు. బాబా అతనిని ఆశీర్వదించి మసీదులో తమ వద్దనే మూడు వారాలు ఉంచుకున్నారు.

నరహరి మసీదులో బసచేసిన 5వ రోజు అతను ఒక విచిత్రమైన దృశ్యాన్ని చూశాడు. దాని గురించి అతనిలా చెప్పాడు: "ఆ రోజంతా బాబా చాలా అశాంతిగా ఉన్నట్టు కనిపించారు. చీకటిపడ్డాక బాబా అందరినీ తమతమ ఇళ్ళకి వెళ్ళమన్నారు. తర్వాత అబ్దుల్‌ను కూడా వెళ్ళమని చెప్పి, "ఈరోజు ఎవ్వరూ ఇక్కడ ఉండొద్దు, రాత్రివేళ ఇక్కడికి రావద్దు. రేపు ఉదయం రావచ్చు. కానీ సూర్యోదయం తర్వాత మాత్రమే" అని కఠినంగా అన్నారు. తర్వాత బాబా నా వైపు తిరిగి, "నువ్వు ఇక్కడే పడుకో" అని అన్నారు. అది విని మిగతా భక్తులందరూ నా వైపు తీవ్రంగా చూస్తూ, అయిష్టంగానే మసీదు నుండి వెళ్ళిపోయారు. బాబా నన్ను తమ దగ్గర కూర్చుండబెట్టుకొని త్రాగడానికి కొంచెం పాలు ఇచ్చారు. ఆ తర్వాత బాబా నాతో, "నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వేమీ భయపడకు. ఏమి చూసినా నువ్వు లేవకూడదు, కదలకుండా పడుకొని చూస్తూండు. లేచి నిలబడితే నువ్వు ఖచ్చితంగా మరణిస్తావు. ప్రశాంతంగా పడుకో! శబ్దంచేయకు, అరచి గోలచేయకు. ఏది వచ్చినా, ఏ రూపంలో వచ్చినా నువ్వు మాత్రం నీ పడక మీద నుండి లేవకు. ప్రశాంతంగా పడుకుని చూడు, అర్థమైందా?" అని అన్నారు. తర్వాత నన్ను నా గోనెసంచి పడక మీద పడుకోమని ఆదేశించి, తమ సట్కాను పాత్రలోని పాలలో ముంచి, దానితో గోనెసంచి చుట్టూ ఒక గీత గీసి, "నా సూచనలను పాటించు. కదలకు! లేవకు!" అని మళ్ళీ చెప్పారు. నేను ప్రశాంతంగా పడుకున్నాను. చాలాసేపటి తర్వాత కళ్ళు తెరచి బాబా వైపు చూశాను. బాబా ధునికి ఎదురుగా గోడ ప్రక్కన కూర్చొని ఉన్నారు. ఆయన ప్రక్కన కుండతో నీళ్లు, ఒక చిన్న గిన్నెతో పాలు, రుద్రాక్షమాల ఉన్నాయి. బాబా ప్రశాంతంగా కూర్చొని అల్లా నామాన్ని జపిస్తున్నారు. అదంతా చూశాక నేను గాఢంగా నిద్రపోయాను. అర్థరాత్రి సమయంలో ఏదో ప్రాకుతున్న శబ్దానికి నేను ఉలిక్కిపడి మేల్కొన్నాను. కానీ బాబా ఆదేశం నా చెవులలో మారుమ్రోగుతున్నందువల్ల చనిపోయినట్లు అలాగే పడుకున్నాను. ఒక పెద్ద నల్లటి కొండచిలువ నా పాదాల దగ్గర జరజరా ప్రాకుతూ కనిపించింది. కానీ అది నా పడక చుట్టూ బాబా గీసిన గీతను దాటే ధైర్యం చేయలేదు. ఆ కొండచిలువ ప్రాక్కుంటూ వచ్చి నా తల వద్ద తన శరీర సగభాగాన్ని నిటారుగా పైకి లేపి పడగవిప్పి కాటేయడానికి సిద్ధంగా ఉన్నట్లు నిల్చుంది. దాని పడగ దాదాపు 3, 4 అడుగుల పొడవుతో చాలా పెద్దదిగా వుంది. దాని కళ్ళు ఎర్రటి మణుల్లా ఉన్నాయి. అది కోపంగా బాబా వైపు చూస్తూ, ఆయన్ని కాటేసే ప్రయత్నంలో ఉంది. నిజానికి అది ఉన్న చోటు నుంచి బాబాని సులువుగా కాటు వేయగలదు. కానీ ఎంత ప్రయత్నించినా దానికి అది సాధ్యం కాలేదు. కారణం నాకు అర్థం కాలేదు కానీ, బాబా ముందు వెలుగుతున్న ధుని కారణంగా అది ఆ ధైర్యం చేయలేదని అనిపించింది. బాబా మాత్రం ప్రశాంతంగా అక్కడే కూర్చుని, అల్లా నామాన్ని జపిస్తున్నారు. బాబా తల వెనుక ఒక ప్రకాశవంతమైన వలయం వుంది. ఆ వలయం మరింత ప్రకాశవంతంగా మారి మసీదంతా గొప్ప వెలుగుతో నిండిపోయింది. ఆ కొండచిలువ పదేపదే బాబాను కాటేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ దాని ప్రయత్నాలు ఫలించలేదు. అది ధునిని దాటి వెళ్ళలేక నిరాశతో తన తోకను నేలకేసి కొట్టింది. ఇలా చాలాసేపు కొనసాగింది. చివరగా బాబా ధ్యానం నుండి బయటికి వచ్చారు. బాబా తల వెనుకనున్న కాంతివలయం అదృశ్యమైంది. బాబా కన్నుల నుండి ప్రకాశవంతమైన ఒక కాంతి కిరణం వెలువడి ఆ కొండచిలువపై పడింది; ఆ కొండచిలువ కన్నుల నుండి కూడా ఒక కాంతి కిరణం వెలువడి, బాబా కన్నుల నుండి వచ్చిన కాంతి కిరణాన్ని కలిసింది. ఆ రెండు కిరణాలు కలిసిన చోట ఒక చిన్న బొమ్మవలె ఉన్న బాబా సూక్ష్మరూపం దర్శనమిచ్చింది. ఆ బొమ్మ మెల్లగా ముందుకు కదులుతూ కొండచిలువ నుండి వస్తున్న కాంతి కిరణాన్ని మింగేసింది. తరువాత బాబా సూక్ష్మరూపం మెల్లగా బాబాలోనే ఐక్యమైంది. ఆ తర్వాత ఆ కొండచిలువ నా శరీరం మీదుగా ప్రాక్కుంటూ వెళ్ళిపోయింది. అది ఎక్కడికి వెళ్లిందో భగవంతునికే తెలుసు. నేను భయంతో వణికిపోయాను, నా ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. నేను సగం చనిపోయినట్లు నాకు అనిపించింది. ఆ స్థితిలో నేను ఎప్పుడు నిద్రపోయానో నాకు గుర్తులేదుగానీ మరుసటిరోజు ఉదయం బాబా నన్ను కుదిపి నిద్రలేపారు. ఆ సమయంలో నాకు విపరీతమైన జ్వరం వుంది. బాబా తమ సట్కాను చేతిలోకి తీసుకొని, దానితో నా తలపై మూడుసార్లు మెల్లగా తట్టారు. దాంతో నా జ్వరం తగ్గిపోయింది. బాబా నన్ను ముఖం, చేతులు, కాళ్ళు కడుక్కొని తమతో రమ్మన్నారు. నేను అలాగే చేశాను. బాబా వేగంగా గ్రామంలోకి నడుస్తుంటే నేను వారి వెనుక పరుగెత్తాను. ఆయన ఒక ఇంటి ముందు ఆగి, హరి అనే అతనిని పిలిచి, "మాకు టీ ఇవ్వు" అని అడిగారు. అతను టీ ఇస్తే, మేము త్రాగాము. బాబా హరిని ఆశీర్వదించి, నన్ను వెంటబెట్టుకుని ఒక ఎత్తైన ప్రదేశంలో ఉన్న చెట్టు వద్దకు తీసుకెళ్ళారు. సరిగ్గా ఆ చెట్టు క్రింద మునుపటి రాత్రి కనిపించిన భయంకర దృశ్యంలోని కొండచిలువ చచ్చిపడివుంది. బాబా కన్నీళ్లతో, “బిడ్డా, ఒకరి కోసం నీ ప్రాణాన్ని అర్పించడం కంటే గొప్ప కార్యం ఈ లోకంలో మరేదీ లేదు” అని అన్నారు. తర్వాత బాబా ఒక పెద్ద రాయి తీసుకొని, దానితో గుంట త్రవ్వడం మొదలుపెట్టారు. నేను కూడా వారితో పాటు గుంట త్రవ్వడం మొదలుపెట్టాను. కొద్దిసేపట్లో ఒక పెద్ద గొయ్యి తయారైంది. బాబా ఆ గుంటలో ఆ కొండచిలువను వేసి కొంతసేపు అలాగే నిలబడి, ఆ తర్వాత తమ చేతులను ఆకాశంకేసి చాచి, "అల్లా! ఈ కొండచిలువపై దయచూపండి" అని అన్నారు. తర్వాత ఆ గుంటను మట్టితో కప్పి, పైనున్న చెట్టు ఆకును దానిపై వేశారు. ఇంతలో ఒక్కసారిగా బలమైన గాలి వీచి చిన్నపాటి పెనుగాలిని సృష్టించి మా ఇద్దరినీ దుమ్ముతో కప్పేసింది. దాదాపు 5 నిమిషాలపాటు ఆ స్థితి కొనసాగిన తరువాత వాతావరణం ప్రశాంతించింది. నేను ఆ కొండచిలువ సమాధి వైపు చూశాను. అది పారిజాత పుష్పాలతో కప్పబడివుండటం కనిపించింది. “వెనక్కి తిరిగి చూడవద్దు” అని బాబా నన్ను గట్టిగా హెచ్చరించి వేగంగా శిరిడీ గ్రామం వైపు నడిచారు. నేను వారిని అనుసరించాను. మేము మసీదుకి చేరుకునేసరికి, ముందురోజు రాత్రి ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఆసక్తితో గ్రామస్థులు అక్కడ గుమిగూడి ఉన్నారు. వాళ్లలో చాలామంది నేను వాళ్లకు ఏదైనా చెబుతాననే ఆశతో వస్తువులు లంచంగా ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. కానీ నేను వాళ్ళతో, "రాత్రంతా హాయిగా నిద్రపోయాన"ని మాత్రమే చెప్పాను. అప్పుడు వాళ్ళు కనీసం మేము ఆ ఉదయం ఎక్కడికెళ్ళామో తెలుసుకోవాలనుకున్నారు. అయితే నేను అమాయకంగా, “మేము వాహ్యాళికి వెళ్ళాము” అని మాత్రమే వాళ్లతో అన్నాను”.

నరహరి శిరిడీలో ఉన్న 8వ రోజున బాబా తాత్యాకోతేపాటిల్‌తో, “తాత్యా! నాకు కొత్త జీవితం లభించింది. నేను మరో ఐదారు సంవత్సరాలు జీవిస్తాను. కాబట్టి చింతించాల్సిన అవసరం లేదు” అని చెప్పడం విన్నాడు. అది విన్నాక నరహరి, 'బాబా ఎందుకిలా చెప్పారు? ఆరోజు రాత్రి ఆ కొండచిలువ ధునిని దాటి బాబాను కాటు వేయలేకపోయింది. ఆ రాత్రి ఎవరు చనిపోవాల్సి ఉంది? ఆ కొండచిలువ ఎవరికోసం తన ప్రాణాన్ని విడిచింది?' అని అయోమయంలో పడ్డాడు. కానీ ఆ విధంగా బాబా తమ మహాసమాధి గురించి ముందుగా చెప్పారు. బాబా ఇంకా ఇలా చెప్పారు: "తాత్యా! నువ్వు చింతించకు. నేను సుమారు 1918 వరకు ఉంటాను. నా దగ్గర ఉన్న ఈ ఇటుకరాయి నా జీవితానికి రక్ష. కాబట్టి నేను దీనిని జాగ్రత్తగా చూసుకుంటాను. కానీ ఈ ఇటుక విరిగితే నేను ఎక్కువకాలం జీవించను. పుట్టినవాడు ఖచ్చితంగా మరణిస్తాడు. కాబట్టి నువ్వు దానిగురించి ఎందుకు బాధపడాలి? జనాభా స్థిరస్థాయిలో ఉంచడానికి భగవంతుడు ఒక ప్రత్యేకమైన పద్ధతిని కలిగి ఉన్నాడు; ఇందువల్లనే మానవులు మరణిస్తున్నారు. అయితే మరణానికి కారణాలు భిన్నంగా ఉంటాయి. కొందరు ఆకలితోను, కొందరు అనారోగ్యంతోను, మరికొందరు వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగాను మరణిస్తారు. అయితే, 80-90 ఏళ్ల తర్వాత ప్రపంచవ్యాప్తంగా జనాభా విస్ఫోటనం జరుగుతుంది. అసాధారణ వ్యాధులు ప్రబలుతాయి. పెద్దసంఖ్యలో ప్రజలు ఆ వ్యాధుల బారినపడతారు. ప్రపంచంలోని వివిధ ఖండాలలో క్రొత్త వ్యాధులు పుట్టుకొస్తాయి, వాటికి చికిత్స కనుగొనడం కష్టం. మానవులు ఇతరుల పట్ల సానుభూతిని కోల్పోతారు. ప్రజలు తమ వద్ద ఉన్న సంపద ద్వారా మాత్రమే గుర్తింపు పొందుతారు. ధర్మం చాలా కష్టాల్లో కూరుకుపోతుంది. సత్పురుషులు నానారకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రభుత్వానికి కూడా అనేక సమస్యలు ఉంటాయి. అస్తవ్యస్త పరిస్థితులు నెలకొని న్యాయబద్ధంగా పాలించడం కష్టమవుతుంది. ఇది మానవజాతి ఎదుర్కొనబోయే దుర్భరమైన భవిష్యత్తు". (బాబా చెప్పినవన్నీ నిజం. HIV-AIDS, డెంగ్యూ, చికెన్‌గున్యా, స్వైన్‌ఫ్లూ, ఎబోలా, ఇటీవల కరోనా వంటి వ్యాధులకు కారణమయ్యే అనేక కొత్త వైరస్‌లు పుట్టుకొచ్చాయి). తర్వాత బాబా నరహరితో, "నువ్వు అదృష్టవంతుడివి. నువ్వు ఎన్నటికీ ఆకలితో ఉండవు. నీకు నిద్రించడానికి స్థలం, ధరించడానికి బట్టలు ఉంటాయి. ఇది నీకు నా ఆశీర్వాదం” అని అన్నారు.

మిగతాది తరువాయి భాగంలో .. 

మూలం: బాబా స్ డివైన్ మేనిఫెస్టేషన్స్ బై విన్నీ చిట్లూరి.

సాయిభక్తుల అనుభవమాలిక 1983వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా ఏదైనా మనకి అందకుండా చేస్తే, దానికంటే ఉన్నతమైనది అనుగ్రహించడానికి మాత్రమే!
2. తక్షణమే నిదర్శనమిచ్చిన బాబా
3. బాబా కృపాదృష్టి




సాయిభక్తుల అనుభవమాలిక 1982వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సాయిని తలస్తే కానిదేముంది?
2. నమ్ముకుంటే నిదానంగానైనా అన్ని సమస్యలు తీరుస్తారు బాబా
3. బాబా కృపతో ఆరోగ్యం

సాయిని తలస్తే కానిదేముంది?

సాయి భక్తులందరికీ నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. సాయి నన్ను, నా కుటుంబాన్ని ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడుతున్నారు. 2023, అక్టోబర్ నెలలో దసరా పండగ తర్వాత మావారు అయ్యప్పస్వామి మాల వేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే అప్పటికి కొన్ని నెలల ముందు నుండి నాకు నెలసరి సమయానికి రావట్లేదు. అందువల్ల నాకు ఏం చేయాలో అర్థంకాక, "సాయితండ్రీ! నన్ను మీరే రక్షించాలి. ఆయన స్వామి మాల వేసుకున్నప్పుడు కానీ, ఇరుముడి అప్పుడుగానీ ఏ ఇబ్బంది కలుగకుండా చూడు సాయి" అని బాబాను ప్రార్థించాను. సాయి నా మొర ఆలకించారు. మధ్యలో నెలసరి వచ్చింది కానీ స్వాములకు బిక్ష పెట్టేటప్పుడు గానీ, ఇరుముడి అప్పుడుగానీ ఏ ఇబ్బంది కలగలేదు. ఇంకో విషయం, బిక్ష పెట్టినప్పుడు మా పుట్టింటి తరఫు వాళ్లు రానన్నారు. అప్పుడు నేను, "సాయీ! అందరూ వచ్చి ఏ అరమరికలు, గొడవలు లేకుండా అంతా సక్రమంగా అయ్యేటట్లు చూడండి" అని సాయిని కోరుకున్నాడు. మనం బాధతో అడిగితే బాబా కాదంటారా? ఏ గొడవలూ లేకుండా అంతా సక్రమంగా జరిగింది. ఇకపోతే, తిరుపతి వెళ్లడానికి నాకు కూడా రిజర్వేషన్ చేశారు. అది నా నెలసరి సమయమైనందున "టాబ్లెట్స్ వేసుకోవాలా?" అని బాబాను అడిగితే, 'వద్ద'ని సమాధానమిచ్చారు. ఇంకా నేను ధైర్యంగా తిరుపతి వెళ్లాను. బాబా దయవల్ల తిరుపతి నుండి వచ్చి ప్రసాదాల పంచేవరకు నాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు.

2023లో మా ఏసీ పని చేయలేదు. E5 అని ఎర్రర్ వచ్చేది. ఇద్దరు టెక్నీషియన్ల చూసి, "బోర్డు పోయింద"ని చెపితే, రిపేరు చేయించాం కానీ, ఆ ఎర్రర్ పోలేదు. అప్పుడు నేను, "ఏంటి సాయి ఇలా జరుగుతుంది? ఏదో విధంగా బాగు చేయించండి" అని బాబాను ప్రార్థించి, 'మా ఎదురింటికి వచ్చే మెకానిక్‌తో రిపేర్ చేయించమంటారా?' అని అడిగితే, చేయించమన్నారు. అతన్ని పిలిస్తే అతను వచ్చి ఏసీ ఓపెన్ చేసి, వెంటనే సమస్యను గుర్తించి, ఏదో పార్టు వదులుగా బిగించారని చెప్పి 600 రూపాయలతో రిపేర్ చేశారు. సాయిని తలస్తే కానిదేముంది? "శతకోటి ధన్యవాదాలు బాబా. ఇలాగే మమ్మల్ని ఎప్పుడూ  కంటికి రెప్పలా కాపాడండి"



సాయిభక్తుల అనుభవమాలిక 1981వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. అడిగిన వెంటనే అద్భుతాలు చేస్తారు బాబా
2. బాబా ఊదీ పరమౌషధం
3. మొబైల్ దానంతట అదే ఆన్ అయి మామూలుగా పని చేసేలా దయ చూపిన బాబా 




సాయిభక్తుల అనుభవమాలిక 1980వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. 'నేను మీతో ఉన్నాన'ని అభయమిచ్చిన బాబా
2. బాబా చరణం సర్వదా శరణం శరణం

'నేను మీతో ఉన్నాన'ని అభయమిచ్చిన బాబా  

సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు శిరీష. నేను చాలా రోజుల తర్వాత నా అనుభవాన్ని మీ అందరితో పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. నిజానికి ఈ అనుభవాన్ని ఒక నెల క్రిందటే వ్రాసి బ్లాగుకి పంపితే, 'వివరంగా లేదు. మళ్ళీ వివరంగా వ్రాసి పంపండి" అని బదులిచ్చారు. అది చూసి నాకు చాలా ఆశ్చర్యం కలిగినప్పటికీ, 'జాగ్రత్తగా అనుభవాన్ని చదివి, ఎలా వ్రాశానో విశ్లేషించినందుకు' సంతోషంగా అనిపించింది. నేను మొదటిసారి నా అనుభవం వ్రాసేటప్పుడు కొన్ని విషయాలు అసంపూర్తిగా వ్రాశాను. అందుకే బ్లాగు వారు నన్ను అలా అడిగారు. సరే, ఈసారి పూర్తిగా వ్రాయడానికి ప్రయత్నిస్తాను.

2025, జనవరి నెల మొదటి వారంలో 73 సంవత్సరాల మా అమ్మకు హార్ట్ ప్రాబ్లం ఉందని తెలిసింది. నేను బాబాను, "అమ్మకు ఏమీ కాకూడద"ని ప్రార్థించి విజయవాడలోని కార్డియాలజిస్ట్ దగ్గరకి అమ్మని తీసుకొని వెళ్ళాను. డాక్టర్ అమ్మకి ఎకో టెస్ట్ చేయాలని, ఆ టెస్టు చేసే చోట కూర్చోమన్నారు. నేను అక్కడ ఒక కుర్చీలో కూర్చుని, "బాబా! మాకు తోడుగా ఉండండి. అమ్మకు పెద్ద సమస్యేమీ లేకుండా చూడండి" అని బాబాతో చెప్పుకున్నాను. తర్వాత నేను తలపైకెత్తి చూస్తే, వెనక పెద్ద బాబా ఫోటో దర్శనమిచ్చింది. నేను సరిగ్గా ఆయన పాదాల దగ్గర కూర్చొని ఉన్నాను. నేను అక్కడ కూర్చొనే ముందు నా కుర్చీ వెనకగా ఉన్న ఆ ఫోటోని చూడలేదు. సరిగ్గా ఆయన్ని తలుచుకోగానే ఆయన కనిపించి, 'నేను మీతో ఉన్నాన'ని చెప్తున్నట్లనిపించి నాకు చాలా సంతోషంగా, ధైర్యంగా అనిపించింది. ఎకో టెస్టు చేసిన తర్వాత అదేరోజు మధ్యాహ్నం అమ్మకు యాంజియోగ్రామ్ చేసి, "సమస్య ఉంది. సర్జరీ చేయాలి. హైదరాబాదులో అయితే బాగుంటుంద"ని చెప్పి సాయంత్రం ఇంటికి వెళ్లిపోవచ్చని చెప్పారు. నిజానికి మేము మూడు రోజులు హాస్పిటల్లో ఉండాల్సి ఉంటుందని వెళ్ళాము. కానీ అదేరోజు సాయంత్రానికి డిస్చార్జ్ చేశారు. అంతా బాబా దయ.

తర్వాత రెండు వారాలకి మా తమ్ముడు యుఎస్ నుండి వచ్చి అమ్మను హైదరాబాదులోని కార్డియోథొరాసిక్ సర్జన్ దగ్గరకి తీసుకొని వెళ్ళాడు వెళ్ళాడు. కానీ మేము కలవాల్సిన సర్జన్ ముందురోజు నుంచి సెలవులో ఉన్నారు. దాంతో అతని అసిస్టెంట్ డాక్టరుతో మాట్లాడి అమ్మకి అన్ని టెస్టులు చేయించాడు తమ్ముడు. తర్వాత రోజు అనుకోకుండా మేము కలవాలన్న సర్జన్ హాస్పిటల్‌కి వచ్చి అమ్మను చూసి వారం తర్వాత సర్జరీ చేయడానికి ప్లాన్ చేసి వెళ్లారు. అయితే సర్జరీ చేయాల్సిన రోజు కూడా ఆ సర్జన్ సెలవులో ఉన్నారు. అయినప్పటికీ హాస్పిటల్‌కి వచ్చి సర్జరీ చేసి వెళ్లారు. అలా జరగకపోయుంటే మా తమ్ముడు సెలవులు పొడిగించుకోవాల్సి వచ్చేది. అంతా ఎవరో ముందుగా ప్రణాళికి వేసినట్లు ఏ ఆటంకం లేకుండా సవ్యంగా జరిగిపోయాయి. బాబా దయవల్ల సర్జరీ విజయవంతమై అమ్మ చక్కగా కోలుకుంది. సాధారణంగా అలాంటి ఆపరేషన్ జరిగాక కనీసం ఒక ఆరు వారలు విశ్రాంతి అవసరం ఉంటుంది. కానీ అమ్మ ఆరు రోజుల్లోనే లేచి పనులు చేసుకోగలిగింది. మా ఇంట్లో వాళ్ళు ఎవరూ బాబాను నమ్మనప్పటికీ ఆయన దగ్గర ఉండి అన్నీ చూసుకున్నారనిపించింది. ఎందుకంటే, 'బాబా తమ భక్తుల కుటుంబసభ్యుల బాధ్యత కూడా వహిస్తారు'.

2025, మార్చి మొదటి వారంలో మా అమ్మాయికి ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఆ సమయంలో ఆరోగ్య సమస్య వచ్చి తను చదువుకోలేకపోయింది. నేను 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అని 108 సార్లు జపించి, "అమ్మాయి పరీక్ష బాగా వ్రాయగలిగితే గుడికి వచ్చి కొబ్బరికాయ కొడతాన"ని బాబాను ప్రార్థించాను. ఏమీ చదవకపోయినా మర్నాడు పరీక్ష బాగా వ్రాసానని మా అమ్మాయి చెప్పింది. నేను సంతోషంగా వెంటనే బాబా గుడికి వెళ్లి కొబ్బరికాయ కొట్టి, ఆయనకు ధన్యవాదాలు చెప్పుకొని వచ్చాను.


సాయిభక్తుల అనుభవమాలిక 1979వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఇబ్బంది లేకుండా దయ చూపిన బాబా
2. అడిగితే కాదనకుండా ఏదైనా ఇస్తారు బాబా

ఇబ్బంది లేకుండా దయ చూపిన బాబా

శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాధ్ మహారాజ్ కీ జై. నా పేరు చైతన్య. ముందుగా సాయి బంధువులందరికీ నా నమస్కారాలు. ఈ 'సాయి మహరాజ్ సన్నిధి' బాబా అనుగ్రహ లీలల భాండాగారం. దీనిలో ఎవరికి ఏది కావాలన్నా, ఏ సమస్య ఉన్నా సమాధానం దొరుకుతుంది. బాబా తమ లీలలను తమ భక్తులతో ఈ బ్లాగులో వ్రాయించుకుంటూ తమ భక్తులకు శ్రద్ధ, విశ్వాసాలు పెంపొందేలా అనుగ్రహిస్తున్నారు. ఇక నా అనుభవాల విషయానికి వస్తే.. మా తమ్ముడు విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. తను ఇండియా వచ్చి దాదాపు 6 సంవత్సరాలైంది. అందువల్ల మా తల్లిదండ్రులు తనని చూడాలని ఉందని ఒకసారి ఇండియా రమ్మన్నారు. కానీ కొన్ని కారణాల వల్ల మా తమ్ముడికి, తన భార్యకి మధ్య మనస్పర్థలు వచ్చి మా మరదలువాళ్లు మా తమ్ముడు మీద పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టారు. ఆ కేసు వల్ల తమ్ముడు ఇండియా వస్తే సమస్య అవుతుంది. తను ఇండియా వస్తూనే ఎయిర్‌పోర్ట్‌వాళ్లు కేసు పెట్టబడిన సదరు పోలీస్ స్టేషన్‌కి సమాచారం ఇస్తారు. దాంతో పోలీసులు వచ్చి తమ్ముడిని స్టేషన్‌కి తీసుకెళ్తారు. అయినా మేము బాబా మీద భారమేసి తమ్ముడితో, "నువ్వు ఇండియాకి రా. మనకి సహాయం చేయడానికి బాబా ఉన్నారు" అని చెప్పాము. దాంతో మా తమ్ముడు ఇండియా రావడానికి టికెట్ బుక్ చేసుకున్నాడు. మేము అనుకున్నట్లే తమ్ముడు హైదరాబాద్ రాగానే ఎయిర్‌పోర్ట్‌లో ఇమ్మిగ్రేషన్ చెకప్ వద్ద "మీ మీద పోలీసు కేసు వుంది. కాబట్టి మీరు వెళ్ళడానికి  వీలు లేదు. మీ మీద కేసు పెట్టబడిన సదరు పోలీస్ స్టేషన్‌వాళ్ళు వచ్చి మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తారు" అని చెప్పారు. మేము చాలా కంగారుపడ్డాము. ఎందుకంటే, కేసు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టి ఉన్నందు వల్ల అక్కడినుండి పోలీసులు వచ్చేవరకు ఎయిర్పోర్టులో వేచి ఉండాలి. కాబట్టి మేము, "బాబా! ఎలాగైనా మీరే రక్షించండి. ఇప్పుడు అక్కడికి వెళ్లకుండా తర్వాత పోలీస్ స్టేషన్లో హాజరయ్యేలా చూడండి" అని బాబాని వేడుకున్నాము. బాబాని ప్రార్థిస్తే ఆయన సహాయం ఏదో ఒక రూపంలో అందుతుంది కదా! మేము మాకు  తెలిసినవాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్తే, "ఇప్పుడు పంపించండి. తర్వాత వచ్చి హాజరవవుతార'ని చెప్పి వాళ్ళు మెయిల్ పెట్టారు. దాంతో ఏ ఇబ్బంది లేకుండా మా తమ్ముడు క్షేమంగా ఇంటికి వచ్చాడు. ఇండియా నుంచి తిరిగి విదేశాలకు వెళ్లేటప్పుడు కూడా అదే సమస్య వస్తుందని భయపడ్డాను. కానీ సాయినాథుని దయవల్ల ఏ ఇబ్బంది కలగలేదు. ఇదంతా బాబాకి తప్ప ఎవరికీ సాధ్యం కాదు. అంతా ఆయన దయ. "శతకోటి ప్రణామాలు బాబా".

అడిగితే కాదనకుండా ఏదైనా ఇస్తారు బాబా  

నా పేరు గురుప్రసాద్. నేను గత సంవత్సరం నుంచి బ్యాంకు లోన్ కోసం ప్రయత్నిస్తున్నాను. 2024లో లోన్ కోసం అప్లై చేస్తే, తిరస్కరింపబడింది. బ్యాంకువాళ్ళని కారణమేంటని అడిగితే, ఏమీ చెప్పలేదు. తరువాత 2025, ఫిబ్రవరి నెల చివరివారంలో, 'ఈసారి బాబా దయవల్ల లోన్ రావాలి' అని గట్టిగా అనుకొని మరో ప్రయత్నంగా మళ్ళీ అప్లై చేసి, అపాయింట్‌మెంట్ బుక్ చేసాను. అయితే అప్పోయింట్మెంట్ ఒక బ్రాంచ్‌లో ఉంటే పొరపాటున వేరే బ్రాంచ్‌కి వెళ్ళాను. అక్కడివాళ్ళు "రాంగ్ లొకేషన్‌కి వచ్చారు. ఇక్కడ ఏ అపాయింట్మెంట్లు లేవు" అని చెప్పారు. నేను బాధతో ఇంటికి వెళ్ళడానికి బయలుదేరుతూ మనుసులో, 'ఇలా అయ్యిందేంటి బాబా?' అని అనుకున్నాను. 10 నిమిషాలలో నేను అపాయింట్‌మెంట్ బుక్ చేసిన బ్యాంకువాళ్ళు నాకు ఫోన్ చేసి, "మీరు ఎక్కడ ఉన్నారు?" అని అడిగారు. నేను, "పొరపాటున వేరే బ్రాంచ్‌కి వచ్చాను" అని చెప్పాను. వాళ్ళు, "కలత చెందనవసరం లేదు. నేను ఫోన్లో మీ వివరాలు తీసుకుంటాను" అని చెప్పి అన్ని వివరాలు తీసుకొని, "సాయంత్రం మీకు ఫోన్ చేస్తాను" అని చెప్పారు. అలాగే సాయంత్రం మళ్ళీ కాల్ చేసి కొన్ని వివరాలు అడిగితే, నేను చెప్పాను. కొన్ని నిమిషాల తర్వాత అతను లోన్ ఆమోదింపబడినట్లు నాకు ఇమెయిల్ చేసాడు. నేను చాలా సంతోషించాను. అతని రూపంలో బాబానే అంతా చేసారు. బాబా మేలు నేను ఎన్నటికీ మార్చిపోను. నా బావమరిదికి కూడా ఇలాగే లోన్‌కి అప్లై చేస్తే, రాలేదు. నేను తనకి కూడా లోన్ రావాలని బాబాకి చెప్పుకున్నాను. బాబా దయవల్ల నాకు లోన్ వచ్చేలా చేసిన అతని ద్వారా నా బావమరిదికి కూడా లోన్ వచ్చింది. బాబాని అడిగితే, కాదనకుండా ఏదైనా ఇస్తారు. "ధన్యవాదాలు బాబా".

సాయిభక్తుల అనుభవమాలిక 1978వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సమయానికి ప్రాజెక్టు ఇచ్చి సమస్యను పరిష్కరించిన బాబా
2. బాబాయే వైద్యుడు - ఊదీ నీళ్ళే ఔషధం



సాయిభక్తుల అనుభవమాలిక 1977వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సాయితో చెప్పుకుంటే కానిది ఏదీ లేదు
2. బాబా ఉన్నారని పూర్తి నమ్మకంతో ఉంటే ఆయన మన జీవితంలో వెలుగు నింపుతారు

సాయితో చెప్పుకుంటే కానిది ఏదీ లేదు

నా పేరు మణి. మాది హైదరాబాద్. సాయితో చెప్పుకుంటే కానిది ఏదీ లేదు. సాయి నాకు చాలా అనుభవాలు ఇచ్చారు. మేము మా మనవడి మొదటి పుట్టినరోజు చేసిన తర్వాత మా కులదైవం సత్తెమ్మతల్లి సంబరం చేయడానికి మా ఊరు వెళ్ళాం. అక్కడ అంతా బాగా జరిగిన తర్వాత శనివారంనాడు తిరిగి వచ్చాం. ఆరోజు హఠాత్తుగా మా మనవడికి వాంతులు, విరోచనాలు చాలా ఎక్కువగా అయి బాగా నిరసించిపోయాడు. మర్నాడు ఆదివారం మావారి ఆబ్దికం ఉన్నందున మాకు ఏం చేయాలో తోచలేదు. నేను సాయినే నమ్మి, "బాబా! ఇంటి దైవానికి సంబరం చేసి వచ్చేసరికి ఇలా అయిందేంటి? బాబుకు నీరసంగా ఉంటే ఎవరికీ ఏమీ తోచట్లేదు. రేపు నా కొడుకు తన బాధ్యతను నిర్వర్తించాల్సి ఉంది. ఆ కార్యక్రమం పూర్తి చేయాల్సిన బాధ్యత మీదే తండ్రీ. ఆ సత్తమ్మతల్లి, మీరు కలిసి బిడ్డకు ఆరోగ్యం ప్రసాదించండి. రేపటికి బాబుకు తేలికపడాలి" అని చెప్పుకొని బాబుకు ఊదీ పెట్టి ఆయన మీదే భారం వేసాను. తర్వాత బాబుని హాస్పిటల్‌కి తీసుకెళ్లి వచ్చాము. ఆ రాత్రి బాబు నిద్రపోతాడో, లేదో అని చాలా భయమేసింది. కానీ బాబా దయవల్ల బాబు కొంచెం కోలుకొని బాగానే నిద్రపోయాడు. తెల్లారి జరగాల్సిన కార్యక్రమం సజావుగా సాగింది. ఆ సాయంత్రానికి బాబు బాగా కోలుకున్నాడు. కానీ తర్వాత రోజు నుంచి ఇంట్లో అందరికీ కొంచెం నలతగా అనిపించింది. అప్పుడు నేను, "బాబా! నీదే భారం తండ్రి. శివరాత్రి వస్తుంది. ఆరోజుకి అందరూ కోలుకొని ఆనందంగా శివయ్యను ప్రార్థించుకొనేలా చేయి తండ్రీ" అని బాబాకి చెప్పుకొని, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అని అనుకున్నాను. సాయి పిలిస్తే పలికే దైవం కదా! అన్ని సమస్యలను తొలగించి అందరం ఆనందంగా శివయ్యకు పూజ చేసుకునేలా ఆశీర్వదించారు బాబా. "ధన్యవాదాలు సాయి".


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo