ఈ భాగంలో అనుభవాలు:
1. మనస్ఫూర్తిగా కొలిస్తే ఎంతటి కష్టాన్నైనా తొలగిస్తారు బాబా2. పాపకి జ్వరం తగ్గేలా అనుగ్రహించిన బాబా
3. చావు అంచుల దాకా వెళ్లిన వ్యక్తిని కాపాడిన బాబా
మనస్ఫూర్తిగా కొలిస్తే ఎంతటి కష్టాన్నైనా తొలగిస్తారు బాబా
సాయి భక్తులందరికీ నా నమస్కారాలు. నా పేరు సంధ్యారాణి. నేను, మా చెల్లెలు ఇద్దరం బాబా భక్తులం. నా చెల్లెలి భర్త గవర్నమెంట్ హాస్పిటల్లో తాత్కా లిక లాబ్ టెక్నిషియన్గా చాలాకాలం పని చేసారు. మేము బాబా పెర్మనెంట్ చేస్తారని నమ్మకంతో ఉండేవాళ్ళము. 14 సంవత్సరాలు గడిచాక అనుకోకుండా గవర్నమెంట్ హాస్పిటళ్లలో శాశ్వత ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడింది. నా చెల్లెలి భర్త ఆ పరీక్ష వ్రాసారు. నేను, మా చెల్లి, 'అతనికి శాశ్వత ఉద్యోగం రావాల'ని బాబాని బాగా ప్రార్థించాం..అయితే ఫలితాలు రావడానికి చాలా ఆలస్యమైంది. సుమారు 16 నెలలు గడిచిపోయాయి. మేము బాబాని "త్వరగా ఫలితాలు ఇచ్చి, మమ్మల్ని శిరిడీకి తీసుకెళ్లండి" అని బాగా ప్రార్థించాం. తర్వాత ఫలితాలు రాకపోయినప్పటికీ 2026, సంక్రాంతి సెలవుల్లో శిరిడీ వెళ్లేందుకు ప్లాన్ చేసుకొని జనవరి 13న శిరిడీ వెళ్ళాము. విచిత్రంగా అదే రోజే 'అప్పాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తార'ని కాల్ మాకు వచ్చింది. మేము చాలా సంతోషించి బాబా దర్శనం చేసుకున్నాము. మర్నాడు ఉదయం కాకడ ఆరతికి హాజరై చాలా ఆనందించాము.
మా అబ్బాయి బుల్లెట్ బండి కొనుక్కున్నాడు. ఒకరోజు అనుకోకుండా ఒకతను తన బండికి ఎదురొచ్చి గుద్దుకొని కింద పడ్డాడు. మా బాబు తన సొంత డబ్బులు పెట్టుకొని అతన్ని హైదరాబాద్ తీసుకెళ్లి, చికిత్స చేయించాడు. అయితే అతను 7 రోజులకి చనిపోయాడు. మేము చాలా బాధపడి అతనికోసం బాబాని ప్రార్థించాం. కానీ అతని పిల్లలు 'డబ్బులు కావాలని, పోలీస్ కేసు పెడతామని' బాగా రచ్చ రచ్చ చేశారు. అప్పుడు నేను బాగా భయపడి, "బాబా! చేయని తప్పుకి మాకెందుకు ఈ పరీక్ష? వాళ్ళు శాంతించేలా చేయండి" అని బాబాను ప్రార్థించాను. అంతే, హఠాత్తుగా వాళ్ళు మౌనం వహించారు. బాబా పెద్ద టెన్షన్ నుండి మాకు ఉపశమనం కలిగించారు. ఈ విధంగా ఎన్నో కష్టాలలో అండగా ఉండి ధైర్యాన్నిచ్చారు బాబా. ఆయన్ని మనస్ఫూర్తిగా కొలిస్తే ఎంతటి కష్టాన్ని అయిన తొలగిస్తారు. ఆయన్ని నమ్ముకుంటే అసాధ్యం సుసాధ్యం అవుతుంది.
"ధన్యవాదాలు బాబా. మీ మేలుని, ప్రేమని, నామాన్ని మరువలేం తండ్రీ".
పాపకి జ్వరం తగ్గేలా అనుగ్రహించిన బాబా
సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. నా పేరు మనోజ. నా జీవితంలో బాబా లీలలు ఇన్ని అని చెప్పలేను. ఎందుకంటే, నిత్యం నా వెన్నంటే ఉండి నన్ను ప్రతి విషయంలోనూ నడిపిస్తున్నారు బాబా. ఆయనకి శతకోటి నమస్కారాలు. 2026, జనవరిలో మా మూడు సంవత్సరాల పాపకి వైరల్ ఫీవర్ వచ్చింది. మందులు వాడినప్పటికీ ఆ మందుల ప్రభావం తగ్గగానే మళ్ళీ జ్వరం వస్తూ పాప బాగా ఇబ్బందిపడింది. తను చాలా నీరసించిపోయింది. నేను, మావారు పాపకి తగ్గిపోతే బాగుండు అని ఆలోచిస్తూ ఉండేవాళ్ళం. హాస్పిటల్కి తీసుకెళ్లడం మాకు ఇష్టం లేదు. నాకు తెలిసిందల్లా బాబాకి చెప్పుకోవటం, ఆయన్ని వేడుకోవటం మాత్రమే. కాబట్టి ఆయన్నే ప్రార్థిస్తూ రోజూ ఊదీ పాపకి పెట్టి, కొద్దిగా ఊదీ నీటిలో కలిపి తాగిస్తుండేదాన్ని. అయితే ఐదు రోజులు దాటినా పాపకి తగ్గకపోయేసరికి ఇక అప్పుడు పాపని డాక్టర్ దగ్గరకి తీసుకెళ్లాలని అనుకున్నాం. కానీ బాబా నాకెందుకు పరీక్ష పెడుతున్నారని బాధపడ్డాను. మరుసటిరోజు డాక్టర్ దగ్గరకి వెళ్తుంటే హాస్పిటల్ ఎదురుగా ఉన్న గోడ మీద బాబా ఫోటో కనపడింది. బాబాని చూసి నాకు చాలా ధైర్యంగా అనిపించింది. డాక్టరు దగ్గరకి వెళ్ళడానికి ముందు నర్సు టెంపరేచర్ చెక్ చేసి, "నార్మల్ ఉంది. జ్వరం లేదు" అని చెప్పింది. ఇంకా నేను ఇంటికి తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ మావారు, "ఎలాగూ వచ్చాం కదా! మామూలుగా ఒకసారి చూపించినట్టు ఉంటుంది, డాక్టరుని కలుద్దాం" అన్నారు. బాబానే తిరిగి వెళ్లిపోవద్దని చెప్పినట్టు నాకు అనిపించింది. డాక్టర్ చూసి. "పాపకి సమస్యేమీ లేదు కానీ, మీరు ముందు వాడిన మందుల డోస్ సరిగ్గా వేయకపోవటం వల్ల జ్వరం తగ్గలేదు" అని వేరే మందులు ఇచ్చారు. అవి వేసాక పాపకి జ్వరం మళ్ళీ రావడం ఆగి తగ్గుముఖం పట్టింది. నిజంగా మేము డాక్టరుకి చూపించకుండా వెళ్ళిపోయి ఉంటే పాప ఇబ్బందిపడేది. అలా జరగకుండా బాబానే చూసారు. నేను చాలా సంతోషపడి బాబాకి పరిపరి విధాల కృతజ్ఞతలు తెలుపుకున్నాను. నమ్మిన వారి వెన్నంటే నిలిచి సదా కాపాడే సాయినాథుని చరణాలకు సాష్టాంగ ప్రణామాలు.
చావు అంచుల దాకా వెళ్లిన వ్యక్తిని కాపాడిన బాబా
సాయి కుటుంబసభ్యులకు నమస్కారాలు. నా పేరు సరిత. నా జీవితంలో సాయి చేసిన ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. ఇప్పుడొక అద్భుతాన్ని చెప్తాను. 2025, డిసెంబర్ 2న కోదాడలో మా అన్నయ్య చాలా ఘోర ప్రమాదానికి గురయ్యాడు. చెవిలో నుంచి రక్తం వచ్చి, శరీరంలో పలు ఫ్రాక్చర్లు అయి పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉండింది. అన్నయ్యని దగ్గర్లో హాస్పిటల్కి తీసుకెళితే స్కానింగ్ తీసి, "బ్రెయిన్లో బ్లీడింగ్ స్టార్ట్ అయింది. ఖమ్మం తీసుకెళ్లండి" అన్నారు. సరేనని ఖమ్మం తీసుకెళితే, అక్కడి డాక్టర్లు హైదరాబాద్ తీసుకెళ్ళమన్నారు. దాంతో హైదరాబాద్లోని యశోద హాస్పిటల్లో అన్నయ్యని అడ్మిట్ చేసాము. వాళ్ళు మొదట పరిస్థితి నిలకడగా ఉందని అన్నారుకానీ మర్నాడు, "బ్రెయిన్ సర్జరీ చేయాలి. 15 లక్షల వరకు అవుతుంద"ని అన్నారు. మాకు ఏం చేయాలో తోచలేదు. బాబా మీద భారమేసి అన్నయ్యని అపోలో హాస్పిటల్కి మార్చి, "బాబా! అన్నయ్యకి సర్జరీ అవసరం లేకుండా చేయండి" అని బాబాని వేసుకున్నాము. బాబా దయవల్ల డాక్టర్లు అన్నయ్యని ఐసీయూలో 5 రోజులు పరిశీలించిన మీదట, "పేషెంట్ కండిషన్లో మెరుగుదల వుంది. సర్జరీ అవసరం లేదు" అన్నారు. మరో 2 రోజులలో అన్నయ్యని డిశ్చార్జ్ చేసారు. కొన్నిరోజులకి అన్నయ్య పూర్తిగా మామూలు అయ్యాడు. ఇది బాబా కృపా కాక ఇంకేమిటి? చావు అంచుల దాకా వెళ్లిన అన్నయ్యని బాబా వెనక్కి లాగారు. ఇంత గొప్ప సహాయం చేసిన నా సాయితండ్రికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం?
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి

Om sai ram, amma nannalani Ammamma tatayalani andarni anni velala kshamam ga kapadandi tandri pls, meede badyata, na samasya teerchandi tandri pls, meede baram badyata tandri e tension nunchi bayata padaindi tandri
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteOmsairam
ReplyDelete