- ఖచ్చితంగా బాబా ఉన్నారు - మనల్ని చూస్తున్నారు, మన ప్రార్థనలు వింటున్నారు
నా పేరు జగదీశ్వర్. 2026, ఏప్రిల్ 2న మా చిన్నమ్మాయి పెళ్లి కరీంనగర్లో, ఏప్రిల్ 29న మా అబ్బాయి పెళ్లి విశాఖపట్నంలో జరిగాయి. వేసవికాలం, ఒక్క పెళ్లికే అలసిపోయే రోజులు. అలాంటిది రెండు పెళ్లిళ్లు. ఎలా చేయగలనో అని మొదట్లో కొంచెం టెన్షన్ పడ్డాను కానీ, తర్వాత మొత్తం భారం బాబా మీద వేసి, "బాబా! నేను నిమిత్తమాత్రుణ్ణి, రెండు పెళ్లిళ్లు ఏ ఇబ్బందులు రాకుండా మీరే దగ్గరుండి జరిపించి ఆశీర్వదించండి" అని వేడుకున్నాను. బాబా దయవల్ల పెళ్లి కార్యక్రమాలు మొదలు పెట్టినప్పటినుంచి అమ్మాయి పెళ్లి కరీంనగర్లో, అబ్బాయి పెళ్లి విశాఖపట్నంలో, తన రిసెప్షన్ కరీంనగర్లో అయ్యేవరకు ఎలాంటి టెన్షన్ లేకుండా అన్నీ సక్రమంగా అనుకున్న విధంగా పూర్తయ్యాయి. అమ్మాయి పెళ్లిలో, అబ్బాయి రిసెప్షన్లో ఎవరో ఇద్దరు బ్రాహ్మణులు వచ్చి ఆశీస్సులు ఇచ్చి వెళ్ళారు. వాళ్ళు సాధారణంగా వచ్చేవాళ్ళో, బాబా దయ చూపి అలా వచ్చారో నాకైతే తెలియలేదు. ఇంకా డబ్బుల విషయానికి వస్తే, అప్పట్లో సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్న మా అబ్బాయి, హఠాత్తుగా మనసు మార్చుకొని యుఎస్ వెళ్లి MS పూర్తి చేసి, NVedia అనే పెద్ద కంపెనీలో సూపర్ జీతంతో జాయినయ్యాడు. ఈ పెళ్లిళ్ల ఖర్చులు తనే సర్దుబాటు చేసుకున్నాడు. ఇదంతా బాబా ముందస్తు ప్రణాళిక.
నాకు ఒక సాయిబాబా బంగారు ఉంగరం ఉంది. నేను దాన్ని అప్పుడప్పుడు పెట్టుకొని, తిరిగి లోపల దాచేస్తుంటాను. 2026, ఏప్రిల్ 2న మా చిన్నమ్మాయి పెళ్లి ఉందని వారం ముందు ఆ ఉంగరం కోసం చూస్తే, అది కనిపించలేదు. అన్నీ చోట్లా వెతికినా కానీ దొరకలేదు. నేను చాలా టెన్షన్ పడిపోయి బాబాకి దణ్ణం పెట్టుకొని, "ఎలాగైనా ఆ ఉంగరం దొరికేలా చేయమ"ని వేడుకున్నాను. ఐదు రోజుల తర్వాత మా ఆవిడ ఏదో మందు కొరకు వెతుకుతుంటే, విచిత్రంగా టాబ్లెట్ల బాక్స్లో బాబా ఉంగరం ఉంది.
ఇకపోతే, పెళ్ళైన తర్వాత, ఏప్రిల్ 6న భోజనాల అనంతరం మా అమ్మాయి చేతి వేలికి ఉండాల్సిన వంకి ఉంగరం లేదు. ఫోటోలలో చేస్తే భోజనం చేసేటప్పుడు తన వేలికి ఉంగరం ఉంది. ఇంకా అందరం అన్నీ చోట్లా వెతికాము కానీ, ఎక్కడా ఆ ఉంగరం దొరకలేదు. మా చిన్నమ్మాయి ఏడుస్తూ అత్తవారింటికి హైదరాబాద్ వెళ్ళింది. నేను బాబాకి దణ్ణం పెట్టుకొని, "ఎలాగైనా ఆ ఉంగరం దొరకాల"ని వేడుకున్నాను. మర్నాడు ఉదయం మా చిన్నమ్మాయి ఫోన్ చేసి, ఒక బ్యాగులో ఉంగరం ఉందని చెప్పింది. అందరం చాలా సంతోషించాం.
పెళ్లిళ్లు అయిన తర్వాత, 2026, మే 8న అందరం అంటే మా ఇద్దరు అమ్మాయిలు, అల్లుళ్లు, మనవరాలు, అబ్బాయి, కోడలు, నేను, నా భార్య బయలుదేరి ఫ్లైట్లో శిరిడీ వెళ్లాము. అదే రోజు ధూప్ ఆరతిలో మేము పాల్గొన్నాము. మర్నాడు 9వ తేదీ మధ్యాహ్నం 3.40కి మా రిటర్న్ ఫ్లైట్ ఉండగా నేను పొద్దున్నే బాబా దర్శనం చేసుకున్నాను. తర్వాత 10 గంటలకు అందరం టిఫిన్ చేసి దర్శనానికి సీనియర్ సిటిజన్ లైన్లో వెళ్ళడానికి ప్రయత్నిస్తే నన్ను, నా భార్యను అనుమతించి మిగతా వాళ్లను అనుమతించలేదు. దాంతో వాళ్ళు స్పెషల్ ఎంట్రీ దర్శనం టిక్కెట్టు తీసుకుని వస్తామని వెళ్లారు. అప్పటికి దాదాపు 11.10 అవుతుంది. నాకు, నా భార్యకి 20 నిమిషాల్లో దర్శనం అయింది కానీ, పిల్లలు రాలేదు. మేము ముందుగా భయపడ్డట్టే ఆరతికోసం లైన్లు ఆపేసారు. దాంతో ఒకవైపు మేము కనీసం 2 గంటలకి ఎయిర్పోర్ట్లో ఉండాలన్న టెన్షన్, ఇంకో వైపు పిల్లలు ఎప్పుడు బయటికి వస్తారో తెలియని పరిస్థితి. బాబానే ప్రార్థించి ఆయన మీదే భారమేసాను. బాబా దయవల్ల వాళ్ళు సరిగ్గా 1:30కి బయటకు వచ్చారు. మేము ఇంకా ఆలస్యం చేయకుండా రూమ్కి వెళ్లి, లగేజ్ సర్దుకొని సమయానికి ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వచ్చాము. అక్కడ వేరే ఫ్లైట్ ఎక్కి తిరుపతి వెళ్ళాము. మే 10వ తేదీన పద్మావతి అమ్మవారి కళ్యాణం జరిపించాము. మర్నాడు 11వ తేదీ రాత్రి 9 గంటలకి మా తిరుగు ప్రయాణానికి ఫ్లైట్ ఉంది. స్వామివారి దర్శనానికి నా దగ్గర విఐపి లెటర్స్ ఉన్నా వాటిని యాక్సెప్ట్ చేయని పరిస్థితి ఎదురైంది. ఇంకా తప్పనిసరై నేను, నా భార్య మళ్లీ వచ్చి దర్శనం చేసుకుంటామని అనుకున్నాము. కానీ పిల్లలు విదేశాలకు వెళ్ళిపోతారు కాబట్టి, స్వామివారికి దణ్ణం పెట్టుకొని 11వ తేదీకి శ్రీవాణి టిక్కెట్లు తీసుకున్నాం. ఆరోజు మేము కూడా కొండపైకి వెళ్లి స్వామివారికి బయటనుండి దణ్ణం పెట్టుకొని, రాత్రి 7 కల్లా విమానాశ్రయం చేరుకున్నాము కానీ, 4 గంటలకి శ్రీవాణి బ్రేక్ దర్శనానికి లోపలికి వెళ్లిన పిల్లలు రావడానికి ఎంత టైం పడుతుందో, వాళ్లకి ఫ్లైట్ అందుతుందో, లేదో అని టెన్షన్ పడ్డాం. అయినా నాకు బాబా ఉన్నారన్న ధైర్యం మాత్రం పోలేదు. బాబా దయవల్ల వాళ్ళు మొదటి గడప దర్శనం చేసుకొని 6.30కి బయటకు వచ్చి, ఎయిర్ పోర్ట్కి 8 గంటల కల్లా చేరుకున్నారు. సురక్షితంగా ప్రయాణం చేసి ఇంటికి చేరుకున్నాము.
మా పెద్దమ్మాయి, అల్లుడు, మనుమరాలు పోలాండ్కి వెళ్ళడానికి మే 16కి టికెట్లు బుక్ చేసుకున్నారు. కానీ 5 రోజుల ముందు వాళ్ళు దుబాయ్కి బుక్ చేసుకున్న ఫ్లైట్ క్యాన్సిల్ అయినట్టు మెసేజ్ వచ్చింది. దాంతో వాళ్ళు తప్పనిసరై హైదరాబాద్ నుండి ఢిల్లీకి, ఢిల్లీ నుండి వియన్నాకి ఫ్లైట్, వియన్నా నుండి పోలాండ్ దేశంలోని క్రకౌకి బస్సు బుక్ చేసుకున్నారు. బస్ ఫ్లైట్కి లింక్ సర్వీస్ కాదు కాబట్టి, బస్సు బయలుదేరే లోపు వీళ్ళు వియన్నా చేరుకోవాలి. కానీ ఢిల్లీ నుండి వియన్నా వెళ్లే ఫ్లైట్ ఆలస్యం అయింది. దాంతో అక్కడ బస్ మిస్ అవుతుందేమో అని భయపడ్డాము. ఇక్కడ నేను బాబాకి దణ్ణం పెట్టుకొని, "పిల్లలు బస్సుకి అందేలా చూడమ"ని వేడుకున్నాను. వాళ్ళు వియన్నా చేరుకున్నాక మా పెద్దమ్మాయి చాలా ఉత్సాహంగా ఫోన్ చేసి, "బస్ అందుకున్నాము. ఒక్క నిమిషం ఆలస్యమైనా బస్సు వెళ్లిపోయేది" అని చెప్పడంతో 'మనకు బాబా ఉన్నారు కదా!' అనుకోని మనసులోనే వారికి దణ్ణం పెట్టుకున్నాను. ఆయన దయవల్ల మా పెద్దమ్మాయివాళ్ళు క్రకౌలోని వాళ్ళ ఇంటికి సురక్షితంగా చేరుకున్నారు.
తర్వాత 14వ రోజు మా అబ్బాయి, కోడలు బయలుదేరి బాబా దయవల్ల ఇమ్మిగ్రేషన్లో ఎటువంటి సమస్య లేకుండా యుఎస్ చేరుకోని, వాళ్ళవాళ్ళ ఉద్యోగాల్లో చేరారు. తర్వాత మా చిన్నమ్మాయి, అల్లుడు స్లీపర్ బస్సులో గోవా వెళ్లారు. వాళ్ళ క్షేమం గురించి నేను బాబాను ప్రార్థించాను. బాబా అనుగ్రహంతో వాళ్ళు క్షేమంగా వెళ్లొచ్చారు. 100కి 200% బాబా దయవల్లనే అన్నీ సక్రమంగా జరిగాయి. నేను అందరికీ చెప్పేది ఒక్కటే, 'ఖచ్చితంగా బాబా ఉన్నారు. మనల్ని చూస్తున్నారు, మన ప్రార్థనలు వింటున్నారు. ఇది నూటికి నూరుపాళ్లు నిజం.
ఓం శ్రీసాయి సర్వభారాభృతే నమః.
బాబా సాయి చరణం
సర్వదా శరణం శరణం.

Om Sai Ram 🙏🙏🙏
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm sai ram tandri ilaage naaku thodu undandi tandri na problems teerchandi tandri pls. Na kutumbanni alage andarni anni velala ayur arogyalatho kshamam ga kapadandi tandri pls.
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om Sai Ram 🙏🙏
ReplyDeleteOm Sai Ram 🙏🙏🙏🙏
ReplyDeleteOm Sai Ram 🙏🙏🙏🙏
ReplyDelete