సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1990వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. కుక్కల బారినుండి కాపాడిన బాబా
2. బాబా దయవల్ల కిడ్నీలో రాళ్ల సమస్య పరిష్కారం
3. అతి తక్కువ ఖర్చుతో ఫోన్ బాగయ్యేలా దయచూపిన బాబా



అతి తక్కువ ఖర్చుతో ఫోన్ బాగయ్యేలా దయచూపిన బాబా

సాయి బంధువులందరికీ నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తుడిని. బాబా ఎన్నోసార్లు నన్ను రక్షించారు, స్వప్నదర్శన భాగ్యం అనుగ్రహించారు. అందుకు నేను ఎంతో అదృష్టవంతుడిని. నేను ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్న సమయంలో 2025, సంక్రాంతి సెలవుల తరువాత ఒకరోజు రాత్రి బండిపై వస్తుంటే నా జేబులో ఉన్న ఫోన్ కింద పడిపోయి పగిలింది. ఇంటికి వచ్చి 'ఫోన్ లేకుండా ఉద్యోగానికి వెళ్ళలేను, ఫోన్ చూస్తే పగిలిపోయింది, కొత్త ఫోన్ కొనగలిగే స్తోమత లేదు' అని ఆ రాత్రంతా చాలా బాధపడ్డాను. బాబాను తలుచుకుని, "బాబా! నాకు ఎందుకు ఇలా జరిగింది? అసలే ఆర్థికంగా చాలా ఇబ్బందిపడుతున్నాను. ఇప్పుడు ఈ మొబైల్ పనిచేయకపోతే ఎలా?" అంటూ బాబా ఫోటో ముందు కూర్చుని దుఃఖించాను. "తక్కువ ఖర్చుతో ఫోన్ బాగయ్యేలా చూడు తండ్రీ" అని వేడుకొని భారం బాబా మీద వేసాను. మరుసటిరోజు బాబాకి చెప్పుకొని హైదరాబాద్‌లోని జగదీష్ మార్కెట్‌కి వెళ్లి నా మొబైల్ చూపిస్తే, "ఏం కాలేదు. కెమెరా గ్లాసు ఒక్కటే పోయింది" అని చెప్పి, కేవలం 350 రూపాయలకే ఫోన్ బాగు చేసి ఇచ్చారు. నా బాబా, నా తండ్రి అంత తక్కువ ఖర్చుతో మొబైల్ రిపేర్ చేయించిచ్చారని చాలా సంతోషించాను. "ధన్యవాదాలు బాబా".

సాయిభక్తుల అనుభవమాలిక 1989వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సాయిమహరాజ్ ఆశీర్వాదం
2. ఏం పుణ్యం చేసుకుంటే సాయినాన్న తోడు లభిస్తుంది? 

సాయిమహరాజ్ ఆశీర్వాదం

ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. నా పేరు కృష్ణ. మా కులదైవం బాలాజీ ఆశీస్సులతో సుమారు 20 ఏళ్ల క్రితం నా స్నేహితుడి ద్వారా 'సాయిమహరాజ్' నాకు గురువుగా లభించారు. అప్పటినుండి వారు నా జీవితానికి మార్గనిర్ధేశం చేస్తున్నారు. మా అమ్మాయి ఇంటర్ చదివేటప్పుడు బైపీసీ ఇష్టం లేదని చదువును నిర్లక్ష్యం చేసింది. కాలేజీకి కూడా సరిగా వెళ్లలేదు. అందువల్ల నేను తను పరీక్షలు ఎలా వ్రాస్తుందోనని చాలా ఆందోళన చెంది మా కులదైవం, ఆయన ప్రసాదించిన నా గురువు బాబాల మీద విశ్వాసముంచాను. బాబా అద్భుతం చేశారు. మా అమ్మాయి పరీక్షల ముందు శ్రద్ధగా చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణురాలైంది. తర్వాత తను నీట్ పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తు చేసేటప్పుడు వెబ్సైట్‌లో ఎంతసేపటికీ ఫింగర్ ప్రింట్లు, ఫోటోలు అప్లోడ్ కాకుండా ఇబ్బందిపెట్టాయి. మరోపక్క దరఖాస్తు చేయాల్సిన గడువు సమయం ముగియనుంది. అందువల్ల నాలో ఆందోళన పెరగసాగింది. ఆ సమయంలో అకస్మాత్తుగా "నా భక్తులు ఎక్కడున్నా, వారు తలచుకున్న వెంటనే పలుకుతాను, రక్షణనిస్తాను" అన్న సాయి వాగ్దానం గుర్తుకు వచ్చింది. వెంటనే, "వెబ్సైట్‌లో ఫింగర్ ప్రింట్లు, ఫోటోలు ఇబ్బంది లేకుండా అప్లోడ్ అయ్యేలా చూడమ"ని బాబాను ప్రార్ధించాను. ఆంతే, అద్భుతం జరిగింది. అప్పటివరకు అప్లోడ్ కాకుండా ఇబ్బందిపెట్టినా, అప్పుడు మాత్రం వెంటనే అప్లోడ్ అయి దరఖాస్తు ప్రక్రియ పూర్తైంది. బాబా దయ, ఆశీర్వాదంతో మాత్రమే ఇది సాధ్యమైంది. "మీకు చాలా చాలా ధన్యవాదాలు బాబా. ఇదేవిధంగా అమ్మాయి నీట్ పరీక్ష ఎటువంటి ఇబ్బంది, ఆందోళన లేకుండా వ్రాసేటట్లు చేసి మంచి ర్యాంక్ ప్రసాదించి, కోరుకున్న కాలేజీలో ఫ్రీ మెడికల్ సీటు వచ్చేలా చేయండి బాబా. ఎల్లప్పుడూ మీపై భక్తిప్రపత్తులు కలిగి ఉండేలా అనుగ్రహించండి బాబా. మీ భక్తులను, సాధు జనులను ఎల్లప్పుడూ కాపాడండి బాబా".


సాయిభక్తుల అనుభవమాలిక 1988వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా అనుగ్రహం వల్ల పొందిన ఆనందం
2. చెప్పుకుంటే సమస్య లేకుండా చూసుకునే తండ్రి బాబా ఉండగా భయమెందుకు?



సాయిభక్తుల అనుభవమాలిక 1987వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. తల్లిదండ్రుల్లా చూసుకుంటున్న బాబా
2. సాయి దయవలన తీరిన సమస్య


సాయి దయవలన తీరిన సమస్య

నా పేరు వాసంతి. మాది హైదరాబాద్. మేము మా ఇంటిని అవసరానికి ఒక ప్రవేట్ బ్యాంకులో తాకట్టు పెట్టాము. ఆ బ్యాంకు వల్ల మేము EMI సమయానికి కడతామన్నా వాళ్ళు కట్ఠంచుకోకుండా ఆలస్యం చేసి ఫైన్ వేయడం, చెక్ బౌన్స్ అవ్వడం వంటి ఇబ్బందులు వస్తుండేవి. దాంతో మేము వేరొక బ్యాంకుకి మారదలచి ఇంకో బ్యాంకులో లోన్‌కి అప్లై చేసాము. ఆ బ్యాంకువాళ్ళు లోన్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు కూడా. కానీ మొదటి బ్యాంకువాళ్ళు కావాల్సిన పేపర్లు, క్లోజింగ్ లెటర్స్ ఇవ్వడం కష్టమని, అందుకు చాలారోజులు పడుతుందని అన్నారు. అప్పుడు నేను, "త్వరగా ఆ బ్యాంకు నుండి కావాల్సిన పేపర్లు ఇప్పించమ"ని సాయినాథునికి నమస్కరించుకున్నాను. అంతే, ఏ సమస్య లేకుండా కావాల్సిన పేపర్లన్నీ తొందర్లోనే అందాయి. మాకన్నా ముందు ఎప్పటినుండో ఆ పేపర్లో కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇంకా ఆ పేపర్లు అందలేదని వాళ్లే చెప్పారు. సాయి దయవలన మా సమస్య మాత్రం తీరింది. "ధన్యవాదాలు బాబా. మీ కృప అందరిపైనా ఉండాలి తండ్రీ".

ఆధ్యాత్మికోన్నతికి సద్గురువులలో మేటియైన శ్రీసాయినాథుని గురువుగా ఎన్నుకో!!



సాయిబాబా ది మాస్టర్(సాయి లీలామృతం పాత ముద్రణ)లో శ్రీఎక్కిరాల భరద్వాజగారు వ్రాసిన ఒక భక్తుని అనుభవం:
 
మానేపల్లి(హిందూపూర్ తాలూకా, ఆంధ్రప్రదేశ్) గ్రామస్తుడు చిరంజీవి వేణుగోపాల్ రెడ్డి అనే యువకునికి బాల్యం నుండి కనులు మూసుకున్నప్పుడు భుృకుటిలో వెలుగు కనిపించేది. అతను మంత్రముగ్ధుడై తన సమయమంతా ఆ కాంతిని గమనిస్తూ ఉండేవాడు. ఆటలూ, పాటలూ వంటి బాల్యంలో ఉండే కాలక్షేపాలపట్ల అతను ఆసక్తికనబరచకపోవడం, ఎప్పుడూ కనులు మూసుకొని ఉండడం వలన అతనిని భూతం ఏదైనా ఆవహించిందేమోనని ఇంట్లోవాళ్ళు భయపడి ఎందరో భూతవైద్యులను సంప్రదించారు. కానీ వాళ్ళ ప్రయత్నాల వల్ల ఏ మార్పు రాలేదు. చివరికొక సాధువు బాలుడిని భూతం ఆవహించడం వంటిదేమీ లేదు, పూర్వ జన్మ సంస్కారం వలన అతనికి సాధన అబ్బినదని తెలిపి దానిని కొనసాగించేందుకు అతనికి కొన్ని సూచనలు ఇచ్చాడు. కొన్ని సంవత్సరాలు గడిచాక వేణుగోపాల్‌కి వెలుగు మధ్యలో లక్ష్మిదేవి దర్శనమిచ్చి అతనితో మాట్లాడటం, శివలింగాలు, చిన్న విగ్రహాలు, కుంకుమ, విభూతి మొదలైనవి ప్రసాదించడం ఆరంభించింది. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఇలా మహిమలు చేసే స్థాయినతిక్రమించాలని అతడెందరో సాధువులను కలిసాడు కాని, ఫలితం కన్పించలేదు. శ్రీశైలం(హఠకేశ్వరం)కి చెందిన శ్రీపూర్ణానందస్వామి 'సశరీరులుగా ఉన్న గురువు అతనికి అవసరం లేదని, లక్ష్మిదేవే అతన్ని పైస్థాయికి తీసుకువెళ్ళగలదని' చెప్పారు.

నాకు(ఎక్కిరాల భరద్వాజ) వేణుగోపాల్ గురించి తెలిసి సంతోషించాను కానీ, అంతటి స్థితినందిన తర్వాత ఎందరో మహిమల వలయంలో చిక్కి నైతికంగానూ, ఆధ్యాత్మికంగానూ పతనమైన సంగతి తెలిసి ఉంటంవల్ల అతని సరైన ఆధ్యాత్మిక అభివృద్ధి గురించి ఆందోళనపడ్డాను. 1978, జనవరి 2న నేను శిరిడీ వెళ్ళినపుడు అతను గుర్తొచ్చి సాయిని ప్రార్థించి, తిరిగి వచ్చేప్పుడు 8వ తేదీన మానేపల్లిలో అతనిని కలుసుకున్నాను. అతను తన సంగతంతా చెప్పి నా సలహా కోరాడు. 'జ్ఞానానికి సద్గురువును ఆశ్రయించడమవసరమని, కనుక సద్గురువులలో మేటియైన శ్రీసాయినాథుని గురువుగా ఎన్నుకుని ధ్యానించమని' చెప్పాను. అది విని అతనెంతో సంతోషించాడు. కారణం కొద్దిరోజులముందు అతడు లక్ష్మిదేవిని ఉత్తమ ధ్యానస్థితికై ప్రార్ధించగా ఆమె నవ్వి ఊరుకున్నదట. తిరిగి అందుకు మార్గం సూచించమని కోరగా 'శిరిడీ సాయినాథుని గురువుగా ఎన్నుకొని ధ్యానించమని' చెప్పిందట. నేను శిరిడీ నుండి తిరిగి వస్తూ అనుకోకుండా అదే సలహా అతనికి ఇచ్చాను.

తర్వాత 22-3-78న వేణుగోపాల్ నాకిలా జాబు వ్రాశాడు: "నాకు 20వ తారీకు నుండి విద్యానగర్ పోవలెనని తీవ్రమైన కోరిక కలిగింది. కారణం మీ ధ్యానశక్తి అని నేను భావించాను. 21వ తేదీ, మంగళవారం సాయంత్రం గం.7:40ని.లకు నేను ధ్యానం చేస్తుండగా మీ దర్శనమైంది. అప్పుడు నేను ఆమ్మ(లక్ష్మీదేవి)ను తీవ్రంగా ధ్యానిస్తే, అమ్మ దర్శనమిచ్చి "నీవక్కడకి వెళ్ళిరా" అని చెప్పింది. నేను చాలా సంతోషించాను కాని పోవడానికి డబ్బు లేదు కదా అని ఊరుకున్నాను. 22వ తేదీ సాయంత్రం గం.9:10ని.లకు సాయి లీలామృతం తెరిస్తే, మళ్ళీ మీ దర్శనమైంది. మిమ్మల్ని కలవాలని గుర్తొచ్చింది కానీ, ఎలా వెళ్లాలని తీవ్ర ఆలోచనలో పడ్డాను. 23వ తేదీ గురువారం సాయంత్రం గం.5:50ని.లకు గురుచరిత్రలో 4వ అధ్యాయం పూర్తిచేసి 5వ అధ్యాయం మొదలుపెట్టినంతనే, నా మదిలో విద్యనగర్ వెళ్లాలనే ఆలోచన తళుక్కుమంది. వెంటనే, "డబ్బు గురించి చింతించక వెంటనే విద్యానగర్ వెళ్లేందుకు బయల్దేరు" అన్న మాటలు వినిపించాయి. అవి ఆమ్మ మాటలు కావు. ఆ మాటలు చాలా గంభీరంగా, లోతైన అర్థం ఉన్నట్లుగా ఉన్నాయి. అవి శ్రీసాయిబాబా మాటలని నాకు తోచింది. వెంటనే నాకు తీవ్ర సమాధి స్థితి కలిగి నాలుగు గంటలసేపు అలానే ఉండిపోయాను".

తర్వాత వేణుగోపాల్ విద్యానగర్ వచ్చి నాతో వారం రోజులు గడిపాడు. ఆ సమయంలో అతను శ్రీమాణిక్యప్రభు, అక్కల్ కోటస్వామి, మిలారెపావంటి యోగుల చరిత్రలను, నేను దర్శించిన కొంతమంది సత్పురుషుల చరిత్రలు శ్రద్ధగా చదివాడు. ఒకరోజు ధ్యానంలో అమ్మ అతనిని ఇక్కడ విద్యానగర్‍లో నిర్మించనున్న మందిర స్థలానికి వెళ్ళమని ఆజ్ఞాపించి, అక్కడ అతని చేతికి అక్షతలిచ్చి, ఆ ప్రదేశంలో చల్లమని చెప్పి, 'మందిర నిర్మాణం విజయవంతంగా కొనసాగుతుందని, అభివృద్ధిలోకి వస్తుందని' కూడా చెప్పారట.

తరువాత ఒకనాడు నాకు స్వప్నంలో రాగి రేకు మీద తెలుగులో "వేణుగోపాల్ మహిమలలో చిక్కి ఆధ్యాత్మికంగా పతనమయ్యే అవకాశం ఉంది" అన్న అక్షరాలు కన్పించాయి. నేనెంతో ఆలోచించి అతనికా విషయం వ్రాశాను. అతడు 22-5-78న "ఓం శ్రీభరద్వాజగారికి నమస్కరిస్తూ వేణు వ్రాయడము. మందిరం పనులన్నీ సక్రమంగా జరగాలని అమ్మను బాగా వేడుకొన్నాను, 'నా అనుగ్రహమూ, మహాత్ముల ఆశీర్వాదాలూ పూర్తిగా మందిరానికి ఉన్నాయి, త్వరగానే అన్ని కార్యక్రమాలూ జరుగున'ని అమ్మ అన్నారు. మీరు మీ లేఖలో మహిమలవలన పతనమయ్యే ప్రమాదముందని వ్రాసారు. అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మీరు చెప్పింది ముమ్మాటికీ వాస్తవం. సాధనచేస్తే ఒక స్థితిలో మహిమలొస్తాయి. పూర్ణులు కావాలంటే మహిమలు విడిచి ఇంకా పైస్థితినందుకోవాలి. ఆ పైస్థితి నాకు కొంచం అనుభవముంది. కాని ఆ స్థితిలో కొద్దిసేపుంటానో, లేదో మరలా మనస్సు మహిమలస్థితికొస్తుంది. మరలా కొద్దిపాటి ప్రయత్నంతో పైస్థితి కలుగుతుంది. ఆ స్థితిలో మనసు, ప్రపంచం, శరీరం ఏమీ గోచరించవు, శూన్యంగా ఉంటుంది. ఆ స్థితి రోజులో ఒక గంటసేపు మాత్రమే ఉంటుంది. మహాత్ములెప్పుడూ ఆ స్థితిలో ఉంటారని వారి చరిత్రలలో నేను చదివాను. శ్రీపూర్ణానందస్వామి అది నిర్వికల్ప సమాధి అని చెప్పారు. నేను ఆస్థితికోసం ప్రయత్నిస్తున్నాను. ధ్యానంలో ఉన్నప్పుడు అమ్మ దర్శనమౌతుంది. అమ్మ రూపాన్నే తదేకంగా చూస్తూ ఉంటే అమ్మ నాలోనూ, నేను అమ్మలోనూ ఉన్నట్లు తెలుస్తుంది. అట్లా కొద్దిసేపు మాత్రమే అనుభవమౌతుంది. అమ్మ దర్శనమైనప్పుడు మాత్రమే మహిమలు చూవడానికి వీలౌతుంది. కానీ సాధకులకు మహిమల వలన ఏమీ ప్రయోజనం లేదు. అంతకు పైస్థితిలో జరిగే మహిమలు వేరు. నేను అమ్మను పైస్థితి గలిగేటట్లు చేయమని అడిగితే, కొంతకాలం తర్వాత నేను ఆ స్థితిని పొందుతానని ఆమె నాతో చెప్పింది. శ్రీశివబాలయోగి కూడా అదే చెప్పారు. నేను ఆ స్థితి గురించి అమ్మను అడుగుతున్నప్పుడల్లా ఆమె నా మనసును శిరిడీ శ్రీసాయిబాబా వైపుకు మళ్ళిస్తుంది. నేను ఆయనపై దృష్టి పెట్టినప్పుడు పైస్థితిలో ఎక్కువకాలం ఉండగలుగుతున్నాను. నేను తొందరగా పైస్థితినందుకొనేట్లుగా, ఎప్పుడూ ఆ స్థితిలోనే పుండేట్లు మీరు కూడా బాబాను ప్రార్ధించండి. ఇక్కడ సాయిచరిత్ర, గురుచరిత్ర పారాయణం, భజన జరుగుతున్నాయి. సాయిబాబా భజన వ్రాసి పంపండి. వీలు చేసుకుని మీరు రాగలరని ప్రార్థిస్తున్నాను".

తర్వాత వేణుగోపాల్ ఇలా వ్రాసారు: "నేను 1978, జూన్ 1న శిరిడీ వెళ్లి, అక్కడ మూడురోజులున్నాను. బాబా దర్శనం, అక్కడి వాతావరణం ఉత్సాహకరంగా ఉన్నాయి. బాబాను దర్శించినప్పటి నుండీ నా ఆధ్యాత్మిక స్థితిలో మార్పు వచ్చింది. ఇప్పటివరకు నేను ధ్యానంలో కొద్దిసేపు మాత్రమే ఉండగలిగేవాడిని. మిగిలిన సమయం నేను వ్యవసాయం చేసేవాడిని. కానీ బాబా దర్శనమైనప్పటి నుండి నేను చాలా సమయం ధ్యానంలో ఉండగలుగుతున్నాను. ఈ మార్పు అయస్కాంతం వల్ల ఇనుపముక్కలో వచ్చేటటువంటిది. నా మనసుకి వ్యవసాయం చేయాలనిపించడం లేదు. బాబా కృపవల్ల అలా చేయవలసిన అవసరం ఇప్పుడు లేదు. నేను నా ఎక్కువ సమయాన్ని బాబా సేవకే కేటాయించగలుగుతున్నాను".

తర్వాత 30-11-78న వేణుగోపాల్ ఇలా వ్రాశాడు: "1978, జూలై 22, శనివారం నాడంతా నేను ధ్యానంలో గడపాలనుకున్నాను. నేను రాత్రి భోజనానంతరం 9 గంటలకి ధ్యానంలో కూర్చోగా గం.10:46ని.లకు అమ్మ దర్శనమిచ్చి "రేపు తెల్లవారుజామున నీకు గురుప్రసాదం లభిస్తుంది" అని చెప్పింది. నేను, "అమ్మా! నాకు గురువెవరమ్మా మీరు తప్ప!" అని అమ్మను అడిగాను. అందుకు అమ్మ, "ఇంకెవరున్నారు! ఆ సాయిబాబా. వారి సంపూర్ణ దర్శనం, ప్రసాదమూ నీకు లభిస్తాయి" అని బదులిచ్చింది. నేను అలాగే కూర్చున్నాను, నా మనసు బాబానామం వల్లించడంలో నిలిచింది. సుమారు రాత్రి గం.2:20ని.లకు నేను పడుకుంటే, వెంటనే గజ్జల శబ్దం, "గురుప్రసాదం లభించగలదు. ధ్యానమగ్నుడవుకమ్ము!" అని అమ్మ మాటలు వినిపించాయి. రాత్రి సమయమైనందున నాకు భయమేసింది. తర్వాత సరిగ్గా గం.3:30ని.లకు నా గదంతా ఒక దివ్యకాంతితో నిండిపోయింది. నేను ఒకవైపు సంతోషంతో, మరొవైపు ఆశ్చర్యంతో బాబా నామం ఉచ్చరిస్తున్నాను. అకస్మాత్తుగా నా కుడిప్రక్క కొద్దిదూరంలో బాబా నిలబడి కనిపించారు. నేను జాగురూకతతో ఉన్నానో, లేదో తెలుసుకోవడానికి నా శరీరం కొంచం కదిలించాను. బాబా నవ్వుతూ, "అరే, లక్ష్మికా బేటా! ఇది తీసుకో" అని నా చేతిలో ఊదీ వంటిది(గోధుమపిండిలా ఉంది) వేశారు. నేను మౌనంగా ఆయననే చూస్తున్నాను. బాబా కన్నులు ఎఱ్ఱగా, భయంకరంగా వున్నాయికాని వారి ముఖం చిరునవ్వుతో అందంగా ఉంది. ఆయనేదో మాటాడుతున్నారు. ఆ మాటలు మరాఠిలా ఉన్నాయి. నేను వాటిని అర్ధం చేసుకోలేకపోయాను. అప్పుడు బాబా నవ్వుతూ తెలుగులో, "నేను ఇచ్చినదాన్ని పూజలో భద్రంగా ఉంచు. కొద్దిగా పాలలో వేసుకొని తాగితే, అది వ్యాధులను నయం చేస్తుంది" అని చెప్పారు. అంతలో సామూహికముగా భజన చేస్తున్నట్లు విన్నాను, అదీ బహుశా హిందీలో. బాబా ఎడమ చేతిలో భిక్షచేసే జోలెలు రెండున్నాయి. వాటిలో ఒకదానిమీద ఓర్పు, రెండవ దానిమీన నిష్ట అని వ్రాసి ఉన్నాయి. బాబా వాటిని నా(శిరస్సు)పైకి విసిరి, "ఎల్లప్పుడూ ఈ రెండింటిని వృద్ధిపరుచుకో" అని చెప్పారు. బాబా మోకాళ్ళవరకూ జుబ్బా పట్టుకుని ఉన్నారు. ఆయన కుడిచేతిలో ఏమీలేదు. ఆయన ముందు దూపం వంటి పొగ నిదానంగా పైకి వెళ్తుంది. నేను భయభక్తులతో, "బాబా! నేనెప్పుడూ సమాధిస్థితిలో ఉండాలని కోరుకుంటున్నాను" అని అన్నాను. అందుకాయన, "అలా ఉండనవసరం లేదు. రోజుకు ఆరుగంటలు ధ్యానం చేయి. నిరంతరం 'ఓం సాయిబాబా' అని జపిస్తూ ఉండు. అది చాలు. నీకు ధ్యానంలో ఏదైనా అవాంతరం ఎదురైనప్పుడల్లా నీ ఈ అనుభవాన్ని గుర్తుకు తెచ్చుకో" అని చెప్పారు. కొన్ని నిమషాల తర్వాత భక్తులు ఆరతికోసం ఆయన దగ్గరకి వచ్చినట్లు అనిపించింది. వెంటనే బాబా అదృశ్యమయ్యారు. నేను, 'బాబా బాబా!' అని అరుస్తూ కింద పడిపోయాను. గదంతా చీకటి ఆవరించింది. అప్పుడు ఉదయం 5:45 అయింది. బాబా ఇచ్చిన ఊదీ నా చేతిలో చెక్కు చెదరకుండా ఉంది. దానిని పూజలో దాచాను. బాబా ఇంకా కొన్ని రహస్యాలు చెప్పారు. వాటిని వ్రాయడానికి కాని, చెప్పడానికి కాని వీలులేదు. అమ్మ నాకు చాలామార్లు దర్శనమిచ్చింది గాని బాబా దర్శనం మాదిరిగా లేదు. ఈ విషయాన్ని 'వ్రాయి వ్రాయి' అని తీవ్రంగా అనిపించింది. ఎంత రాయకూడదనుకున్నా బాబానే వ్రాయించినట్టు నా మనసుకి తోస్తుంది"....

సాయిభక్తుల అనుభవమాలిక 1986వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సాయి దయుంటే ఏదైనా సాధ్యం!
2. భక్తురాలికోసం సీతారాముల ఊరేగింపును పంపిన బాబా

సాయి దయుంటే ఏదైనా సాధ్యం!  

సాయి భక్తకోటికి నా ప్రణామాలు. నా పేరు దీపిక. సాయినాథ్ మహారాజ్ నా జీవితంలో, నా కుటుంబసభ్యుల జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశారు, ప్రాణభిక్ష పెట్టారు. "నన్ను ఆశ్రయించినవారిని, శరణుజొచ్చినవారిని రక్షించుటయే నా కర్తవ్యం, నాయందు ఎవరికి దృష్టి కాలేదో వారి యందే నా కటాక్షము" అని ఆయన చెప్పిన మాటలు ఋజువు చేశారు. ఒకసారి మా చెల్లికి నెలసరి సమస్య వచ్చి 22 రోజులు బ్లీడింగ్ అయింది. మనకి ఏదైనా సమస్య వస్తే అమ్మ తర్వాత సాయికే చెప్పుకోగలం. అలాగే మేము సాయికి విన్నవించుకొని డాక్టర్ దగ్గరకి వెళ్తే, పరీక్షలు వ్రాసారు. పరీక్షల్లో థైరాయిడ్ అని, అది కూడా చాలా అధికంగా 10 ఉందని తేలింది. ట్రీట్మెంట్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్న మాకు ఏం చేయాలో దిక్కు తోచలేదు. నేను ప్రతిరోజూ సాయినాథునికి పూజ చేస్తూ, "సాయీ! మేము మీ బిడ్డలం. మమ్మల్ని మీరే కాపాడాలి" అని కన్నీళ్లు పెట్టుకుంటుండేదాన్ని. సాధారణంగా నాకు ఏదైనా సమస్య వస్తే, బాబా సోషల్ మీడియా ద్వారా లేదా కలలో సందేశమిస్తారు. ఆరోజు, "మా చెల్లి పరిస్థితి ఏంటి? తనకి ఈ అనారోగ్యం ఏంటి సాయినాన్నా?" అని ఏడుస్తుంటే, 'నా నామజపం చేయమని' ఇంస్టాగ్రామ్ ద్వారా సాయి సందేశమిచ్చారు. నేను ఆయన చెప్పినట్లే నామజపం చేశాను. 3 రోజుల తర్వాత సమస్య తగ్గుముఖం పట్టింది. అప్పుడు బాబా, 'నా గుడికి వచ్చి ప్రసాదం పంచి, మీరు కూడా తినండి' అని సందేశమిచ్చారు. సరేనని మేము ఆరోజు గుడికి వెళ్లి పాలకోవా పంచిపెట్టి, అన్నప్రసాదం తిని వచ్చాం. సుమారు మధ్యాహ్నం ఒంటిగంటకు మా భోజనం అయిపోయింది. తర్వాత 2.30, 3 ప్రాంతంలో మా చెల్లి సమస్య పూర్తిగా తగ్గిపోయింది. ఒక్క మందు, ఒక్క ఇంజక్షన్, అసలు ఏ ట్రీట్మెంట్ లేకుండా సాయి నా చెల్లి సమస్యను తీసేసి, తనని కాపాడారు. 8 రోజుల తర్వాత మళ్ళీ టెస్ట్ చేయిస్తే, మునుపు 10 ఉన్న థైరాయిడ్ ఇప్పుడు నార్మల్ ఉంది. ఆ రిపోర్టు చూసి 'వైద్యం లేకుండా ఇదెలా సాధ్యమని' డాక్టరు షాకయ్యారు. సాయి దయుంటే ఏదైనా సాధ్యమే. 

ఒకసారి నేను తీవ్రమైన కడుపునొప్పితో 3 రోజులు అల్లాడిపోయాను. నాకప్పుడు హాస్పిటల్‌కి వెళ్లే సమయం లేదు. అలాగని నొప్పి భరించడం నా వల్ల కాలేదు. వెంటనే సాయికి దణ్ణం పెట్టుకొని ఊదీ నుదుటన, నొప్పి ఉన్న ప్రాంతంలో రాసి, కాస్త నోట్లో వేసుకున్నాను. అంతే, నొప్పి మాటుమాయమైపోయింది. తర్వాత కొన్ని వారాలపాటు పని ఒత్తిడి వల్ల బాగా నీరసంగా ఉండేది. టాబ్లెట్లు వేసుకున్నా తగ్గేది కాదు. అప్పుడు నేను రెండు పూటలా ఊదీ ధారణ మంత్రం చదివి కాస్త నుదుటున పెట్టుకొని, ఇంకాస్త నోట్లో వేసుకుంటుంటే ఎంతో హుషారుగా ఉండి నీరసం తగ్గిపోయింది. నాకు ఏదైనా అనారోగ్యం లేదా సమస్య వచ్చినా  నా సాయినాన్నకే చెప్పుకొని నా భారం, నా కుటుంబ భారం ఆయనపై వేస్తాను. ఎటువంటి ఇబ్బంది వచ్చినా సాయినాథ్ ఉన్నారు, చూసుకుంటారనే ధైర్యం నన్ను, నా కుటుంబాన్ని కాపాడుతుంది. మా ఇంటి పెద్ద సాయినాథునికి మేము ఎప్పటికీ ఋణపడి ఉంటాము.

భక్తురాలికోసం సీతారాముల ఊరేగింపును పంపిన బాబా

నా పేరు సాయికుమారి. 2025, ఏప్రిల్ 6, ఆదివారం, శ్రీరామనవమినాడు నా ఆరోగ్యం బాగాలేక రాములవారి కళ్యాణంకి వెళ్ళలేకపోయాను. ఉదయం 10:30 అప్పుడు బాబా దగ్గర బాధపడుతూ, "రామునికి నేను అంటే ఇష్టం లేదు కదా! అందుకే నన్ను ఈరోజు కళ్యాణంకి రాకుండా చేశారు. ఆయన దర్శనం కూడా లేదు" అని అనుకున్నాను. తర్వాత 10 నిమిషాలకు మా వీధిలో సన్నాయి మేళాలు వినపడుతుంటే, 'ఏంటా?' అని వెళ్ళి చూస్తే, సీతారాముల ఊరేగింపు వస్తుంది. వెంటనే వెళ్ళి సీతారాముల వారి దర్శనం చేసుకున్నాను. మా వీధిలో రాములవారి గుడి లేదు. వేరే ప్రాంతం నుంచి మా వీధికి సీతారాములని తీసుకొచ్చారు. వాళ్ళు వేరే ఏ వీధికి వెళ్లకుండా మా వీధి వద్దనుండి మళ్ళీ వెనక్కి వెళ్లిపోయారు. నాకోసమే సీతారాముల ఊరేగింపు వచ్చిందనుకున్నాను. అంతా సాయి దయ.

సాయిభక్తుల అనుభవమాలిక 1985వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. 'నేను నా భక్తుల వద్దనే ఉంటాను'
2. దయ చూపిన బాబా



సాయిభక్తుల అనుభవమాలిక 1984వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. అసాధ్యం కూడా సుసాధ్యం చేస్తారు సాయి
2. ఊదీతో బాబా చేసిన అద్భుతం
3. మనసు మార్చి కోరిక తీర్చిన బాబా

అసాధ్యం కూడా సుసాధ్యం చేస్తారు సాయి

ఓం శ్రీసాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని.  మనస్ఫూర్తిగా కోరుకుంటే అసాధ్యం కూడా సుసాధ్యం చేస్తారు నా సాయి. అందుకు సంబంధించి నాకు చాలా అనుభవాలున్నాయి. అందులో నుండి ఒకటి పంచుకుంటాను. మా బాబుకి ఆరేళ్ళ వయసప్పుడు ఒక చిన్న ఆరోగ్య సమస్య వచ్చింది. అది చిన్నదే అయినప్పటికీ బాబు మంచిగా ఎత్తు పెరగకపోవడానికి కారణమైంది. ఒక సంవత్సరంకి 3-4 సెంటీమీటర్లు మాత్రమే పెరిగేవాడు. నాకు చాలా బాధసింది. మేము చాలా మంచి డాక్టరుకి చూపించాము. ఆ డాక్టర్ "ఇది చాలా చిన్న సమస్య" అని చెప్పారు. నేను నా భర్తతో వేరే డాక్టరుకి చూపిద్దామంటే ఆయన, "ఇది చిన్న సమస్యే. ఈ డాక్టర్ సిటీలో పేరున్న డాక్టరు. వేరే డాక్టర్ల దగ్గరకి బాబుని తీసుకెళితే అనవసర హంగామా చేస్తారు. వాడే ఎత్తు పెరుగుతాడు" అని అనేవారు. అలా 6 సంవత్సరాలు గడిచిపోయాయి. నేను మా బాబు ఎత్తు పెరగాలని సచ్చరిత్ర సప్తాహ పారాయణ చేసి రోజూ బాబాను ప్రార్థిస్తూ ఉండేదాన్ని. అనూహ్యంగా బాబా మాకు ఒక డాక్టరుని చూపించారు. ఆమె మా బాబు సమస్యనిగా సరిగా గుర్తించి, "మన ప్రయత్నం మనం చేద్దామ"ని చెప్పి చికిత్స మొదలుపెట్టారు. నేను బాబాని ఒకటే కోరుకున్నాను: "బాబా! తెలియక బాబు 6 సంవత్సరాల కాలాన్ని వృధా చేసాము. వాడు ఈ ఆరోగ్య సమస్య లేకుండా ఉంటే ఎంత ఎత్తు పెరుగుతాడో అంత ఎత్తు పెరిగేలా చూడు తండ్రీ" అని. అది అసాధ్యమని తెలిసినా నేను బాబాని ప్రార్థించాను. ఆశ్చర్యం! రెండు సంవత్సరాల చికిత్సతో మా బాబు చాలా ఎత్తు పెరిగాడు. చివరిసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ఒకటే చెప్పారు: "ఇంత మంచి ఫలితాలు వస్తాయని నేను అనుకోలేదు. ఇది నా చికిత్స వల్లనో, మీ ప్రయత్నాల వల్లనో కాదు. మీ బాబుపై ఆ దేవుడి దయ మెండుగా ఉంద"ని. అది విన్న నా కళ్ళల్లో నీళ్ళు తిరిగి మనసులో బాబాకి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. "బాబా! మా బాబు ఆరోగ్యం మంచిగా ఉండేటట్టు చూడండి".

ఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః.


మనసు మార్చి కోరిక తీర్చిన బాబా

సాయి భక్తులందరికీ నమస్కారాలు. నా పేరు కోమలవల్లి. నేను ఒక ప్రైవేటు స్కూల్లో టీచరుగా పనిచేస్తున్నాను. మా అమ్మవాళ్ళ ఊరు, మా పాపవాళ్ళ ఊరు ఒకటే, ఒకే వీధి కూడా. నేను ఎప్పుడు ఆ ఊరు వెళ్లినా ఉదయం వెళ్లి మధ్యాహ్నం 3 గంటలకు వచ్చేస్తాను. అలాంటిది సంక్రాంతి సెలవులు ఇచ్చాక ఈసారైనా మా అమ్మవాళ్ళ ఇంట్లో ఒకరోజు ఉండాలని కోరిక కలిగింది. ఆ సమయంలో మా అమ్మాయి పుట్టినరోజు కూడా ఉంది. కానీ మావారు ఒప్పుకోరని, "నా భర్త ఒప్పుకునేలా చేయమ"ని బాబాను ప్రార్ధించాను. తర్వాత తిడతారని భయపడుతూనే మావారితో, "నేను ఊరెళ్ళి, ఒకరోజు అక్కడుండి అమ్మాయి పుట్టినరోజు చూసుకొని వస్తాను" అని అన్నాను. దానికి మావారు, "సరే, రేపు(2025, జనవరి 17) వెళ్లి జనవరి 18న వచ్చేయి" అని అన్నారు. అది విని నాకు చాలా సంతోషమేసింది. నిజంగా బాబా నా భర్త మనసు మార్చి నా కోరిక తీర్చారు. "ధన్యవాదాలు బాబా".

నరహరి వాసుదేవ్ రాయికర్ - డాక్టర్ శశికాంత్ జి.జవేరి - 3వ భాగం..



1961, మార్చి నెలలో నరహరి వాసుదేవ్ రాయికర్ కడుపుకు సంబంధించిన అనారోగ్యంతో ముంబాయిలోని KEM(King Edward Memorial) హాస్పిటల్లో చేరాడు. ఆ హాస్పిటల్లో డాక్టర్ బి.ఎన్.పురంధరే ఆధ్వర్యంలో శశికాంత్ జి.జవేరి అనే అతను డాక్టరుగా పనిచేస్తుండేవాడు. జవేరి, అతని స్నేహితులు సాయంత్రం వేళల్లో ఏ సహోద్యోగి ఖాళీగా ఉంటే ఆ వార్డులో అలవాటుగా కలుసుకుని కూర్చుని కబుర్లు చెప్పుకుంటుండేవారు. అలా ఒకరోజు అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉండగా జవేరితో అతని స్నేహితులు, “మన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న నరహరి అనే రోగి హస్తసాముద్రికంలో మంచి నిపుణుడు. అతని అంచనాలు తప్పవు” అని చెప్పారు. తర్వాత వారిలో ఒకరు జవేరిని నరహరికి పరిచయం చేశారు. సాదాసీదాగా, సౌమ్యంగా, ఎవరినైనా పాత స్నేహితుడిలా భావించే అసాధారణ గుణాలను కలిగివున్న నరహరిని జవేరి ఇష్టపడ్డాడు. కానీ జవేరికి హస్తసాముద్రికంపైన, దేవునిపైన నమ్మకం లేనందువల్ల అటువంటి వాటన్నిటికీ దూరంగా ఉండేవాడు. అయినప్పటికీ ఒకరోజు సాయంత్రం కేవలం వినోదం కోసం హస్తసాముద్రికం చెప్పమంటూ తన అరచేతిని నరహరికి చూపించాడు. నరహరి మామూలుకంటే చాలా ఎక్కువ సమయం పాటు జవేరి అరచేతిలోని రేఖలను పరిశీలించి చూశాడు. ఆపై తన వద్దనున్న పాత సంచిలోంచి భూతద్దాన్ని తీసి మళ్ళీ ఏకాగ్రతతో అతని చేతిరేఖలను పరిశీలించి ఎంతో ఆశ్చర్యంతో, “ఆ ఒక్కడివి నువ్వే! ఓ సాయినాథ్ భగవాన్! మీ చర్యలు అగోచరం. చివరికి నేను మీ స్నేహితుడిని కలిశాను" అని అన్నాడు. నరహరి అలా ఎందుకంటున్నాడో జవేరికి అంతుబట్టలేదు. అప్పుడు నరహరి తన పాత డైరీని తీసి 1912లో తాను గీసిన అరచేతి గీతలను అతనికి చూపించాడు. అవి అచ్చం తన చేతిలోని గీతల వలె ఉండటం చూసి జవేరి తీవ్ర గందరగోళానికి గురై ‘ఇది కేవలం యాదృచ్ఛికమ’ని తీవ్రంగా వ్యతిరేకించాడు. అప్పుడు నరహరి అతనితో, "బాబా తాము మహాసమాధి చెందిన 20 సంవత్సరాల తర్వాత నువ్వు పుడతావని నాతో చెప్పారు. అంటే, నువ్వు ఖచ్చితంగా 1938లో పుట్టి ఉంటావు. అవునా?” అని అన్నాడు. దాంతో జవేరి అయోమయంలో పడి, "ఏ బాబా? ఆ బాబాతో నాకు సంబంధం ఏమిటి? ఈ అర్థంలేని మాటలకు ముగింపు పలికితే మంచిది" అనుకుంటూ అక్కడినుండి వెళ్ళిపోయాడు. కానీ అతని మనసు శాంతించలేదు.

మరుసటిరోజు ఆదివారం. ఆరోజు సాయంత్రం జవేరి ఖాళీగా ఉండటంతో వెళ్లి నరహరి వద్ద కూర్చున్నాడు. నరహరి నవ్వి, “మీ చంచలమైన మనస్సు మిమ్మల్ని ప్రశాంతంగా కూర్చోనివ్వలేదు కదా! మీరు నా మాటలను నమ్మరని, అయినప్పటికీ ఇప్పుడు నాతో సరదాగా గడపడానికి వచ్చారని నాకు తెలుసు. నిజమేనా?” అని అన్నాడు. జవేరి అవునన్నట్టు తల ఊపాడు. అప్పుడు నరహరి అతనితో, “ఈరోజు నుండి మూడవరోజున మీరు ఒక కొట్లాటలో పాల్గొంటారు. ఆ మరుసటిరోజు మధ్యాహ్నం మీకు భోజనం ఉండదు. రాత్రి వరకు ఆకలితో ఉంటారు. మీరు ఈ రెండు విషయాలను నిరోధించలేకపోతే(తప్పించుకోలేకపోతే), మీరు శ్రీసాయిబాబా ఆదేశాలను పాటించాలి. అందుకు మీరు అంగీకరిస్తారా?" అని అన్నాడు. జవేరి తనని ఆ నాటకంలోకి ఒక అత్యున్నత శక్తి లాగుతుందని తెలియక దీనినంతా ఒక తమాషాగా భావించి అంగీకరించాడు. అప్పుడు నరహరి అతనిని, "బాబా ఆజ్ఞాపించినట్లు చేస్తానని వాగ్దానం చేయమ"ని అడిగాడు. అతనలాగే వాగ్దానం చేశాడు.

తర్వాత మూడవరోజున జవేరి, అతని స్నేహితులు ఇంటికి తిరిగి వెళ్ళడానికి మధ్యాహ్నం 12 గంటల సమయంలో బస్సు ఎక్కారు. ఆ బస్సు చాలా ఖాళీగా ఉంది. ఒక యువతి చిన్నబిడ్డతో వచ్చి జవేరి ముందు సీటులో కూర్చుంది. ఆ యువతి టిక్కెట్‌ తీసుకుంది. కానీ, ఆమె అల్లరి బిడ్డ దానితో ఆడుకుంటూ కిటికీలోంచి బయటకు విసిరేసింది. తర్వాతి స్టాప్‌లో టిక్కెట్‌లు తనిఖీ చేసే అధికారి బస్సెక్కి బస్సులో ఉన్న అందరి టిక్కెట్లు తనిఖీ చేయనారంభించాడు. జవేరి, అతని స్నేహితులు తమ టిక్కెట్‌లను చూపించారు. తర్వాత ఆ అధికారి ఆ యువతిని టికెట్ అడిగాడు. ఆమె జరిగింది చెప్పగా జవేరి, అతని స్నేహితులు అందుకు సాక్ష్యం చెప్పారు. అధికారి విషయం అర్థం చేసుకొని ఏమీ అనకుండా వెళ్ళిపోయాడు. కానీ బస్సు కండక్టర్ మాత్రం అసభ్య పదజాలంతో ఆ యువతిని దూషించాడు. అప్పుడు జవేరి, అతని స్నేహితులు జోక్యం చేసుకోవడంతో భీకరమైన గొడవ జరిగింది. చివరకు వాళ్ళు బస్సును పోలీసు స్టేషన్‌కి తీసుకెళ్లారు. జరిగిన ఘటనతో జవేరి మనశ్శాంతి కోల్పోయాడు. ఆ విధంగా బాబా చెప్పిన జోస్యంలోని మొదటి విషయం నిజమైంది.

4వ రోజున జవేరి, అతని స్నేహితులు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో భోజనానికి ఇంటికి వెళ్లారు. వాళ్ళు డబ్బు ఆదా చేయదలచి ఒక భోజనం పార్శిల్ తెప్పించుకుని ముగ్గురూ తినాలనీ, పొదుపు చేసిన డబ్బుతో సినిమాకి వెళ్లాలనీ అనుకున్నారు. వాళ్ళు ఉంటున్న ఇల్లు ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఎత్తైన భవనం(municipal chawl)లో ఉంది. ఆరోజు తమ భవనం ముందర రోడ్డు ప్రక్కన ఉన్న కాలిబాట రద్దీగా లేనందున వాళ్ళు భవనం ముందున్న రేకుల షెడ్ కింద మంచం వేసుకొని భోజనం చేయడం మొదలుపెట్టారు. అప్పుడు జవేరి, "రాయికర్‌తో చేసుకున్న ఒప్పందంలోని ఈ భాగం అవాస్తవం. హస్తసాముద్రికం అంతా అవాస్తవం" అని ఆలోచిస్తూ ఆనందంగా మొదటి ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. అంతలో ఏం జరిగిందో చూడండి! జవేరి, అతని స్నేహితులు ఉంటున్న భవనంలో గోవా నుండి వచ్చిన చాలామంది నివసిస్తున్నారు. వాళ్ళకి కాలిబాటకు ప్రక్కనే దుకాణాలు ఉన్నాయి. వాళ్లలో ఒక గోవా మహిళ జవేరి, అతని స్నేహితుల వద్దకి పరుగున వచ్చి, "డాక్టర్! త్వరగా రండి, ఒక యువకుడు వింతగా ప్రవర్తిస్తున్నాడు. అతనికి మీ సహాయం కావాలి" అని అంది. వెంటనే వాళ్లంతా అక్కడినుంచి లేచి సహాయం చేసేందుకు పరుగుతీశారు. అక్కడ దాదాపు 20 సంవత్సరాల వయసున్న ఒక యువకుడు క్రింద పడిపోయి వున్నాడు. అతని నోటినుండి నురగ వస్తోంది. అతనికి మూర్ఛ వచ్చిందని గ్రహించిన ఆ స్నేహితులు వెంటనే క్యాబ్ తీసుకొని ఆ యువకుడిని ఆసుపత్రికి తీసుకెళ్ళి అడ్మిట్ చేసుకొని చికిత్స ప్రారంభించారు. అయితే రోగి పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచాడు. అప్పటికి రాత్రి అయింది. ఈ పరిస్థితుల వల్ల జవేరికి, అతనికి స్నేహితులకి ఆరోజు మధ్యాహ్నభోజనం లేకుండా పోయింది. దాంతో జవేరి సందిగ్ధంలో పడి చివరికి ఓటమిని అంగీకరించాల్సి వచ్చింది. ఆ రాత్రంతా జవేరికి కంటిమీద కునుకు లేదు. 'ఈ సాయిబాబా ఎవరు? నేను పుట్టడానికి 20 సంవత్సరాల ముందు నా అరచేతిలోని గీతలను ఆయన ఎలా తెలుసుకోగలిగారు? తమ మహాసమాధి అనంతరం జరగబోయే సంఘటనలను ఆయన ఎలా ఊహించగలిగారు? ఈ సమయంలో ఈ రెండు సంఘటనలు జరుగుతాయని ఆయన 1912లోనే రాయికర్‌కు ఎలా హామీ ఇచ్చారు? నేను ఎప్పుడు పుడతానో ఆయనకి ఎలా తెలుసు?' అనే ఆలోచనలు మనసులో సుడులు తిరగసాగాయి. చివరికి అతను భవిష్యత్తు గురించి అంతులేని జ్ఞానమున్న ఆ అత్యున్నత శక్తికి తలవంచాల్సి వచ్చింది.

మరుసటిరోజు జవేరి నెమ్మదిగా వెళ్లి నరహరి ముందు నిలబడి, "మీరు చెప్పినవన్నీ నిజమే" అని అన్నాడు. అప్పటినుండి అతను తన ఖాళీ సమయాన్ని నరహరితో గడుపుతుండేవాడు. ప్రతిరోజూ రాత్రి తన పని పూర్తయిన తర్వాత నరహరి వద్ద కూర్చుని బాబా గురించి అడుగుతుండేవాడు. బాబా దైవత్వం గురించి నరహరి అతనికి చెప్తుండేవాడు. ఒకరోజు నరహరి అలమరాలో ఉన్న తన ట్రంకుపెట్టెను తీసుకొని రమ్మని జవేరితో చెప్పాడు. జవేరి ఆ పెట్టెను తీసుకురాగానే నరహరి ఆ పెట్టెలో ఉన్న ఒక చిన్న గుడ్డమూటను జవేరికిచ్చి, 1912లో బాబా జవేరితో చెప్పమని తనకు చెప్పిన వివరాలన్నీ చెప్పి, "నేను త్వరలోనే మరణిస్తాను. నేను మరణించిన పిమ్మట నా దగ్గర ఉన్నదంతా ఒక మూట కట్టి నాతోపాటు దహనం చేయండి. అనంతరం ఈ మూటను తెరిచి, అందులోని వస్త్రంపైన ఉన్న పాదముద్రల ఆధారంగా రాతితో ఒక జత పాదుకలను, ఇత్తడితో మరో జత పాదుకలను తయారు చేయించి, ఆ వస్త్రాన్ని పాదుకల వద్ద ఉంచి నేనిప్పుడు చెప్పబోయే మంత్రం పఠించండి” అంటూ జవేరి కుడిచెవిలో మంత్రం చెప్పడానికి ఉపక్రమించాడు. చిత్రంగా 49 ఏళ్లుగా ఒక్క పదం కూడా గుర్తులేని బాబా 1912లో చెప్పిన ఈ క్రింది మంత్రం అతనికి గుర్తొచ్చి, జవేరి చెవిలో ఉచ్ఛరించాడు.

'జన్మ్ జన్మో జన్మి శ్రీచరణ్ శ్రీభాగ్య సాయి'

తర్వాత కొద్దిసేపట్లోనే నరహరి తుదిశ్వాస విడిచాడు. నరహరి సూచనలననుసరించి అతని పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహించి, అతని అస్థికలను నాసిక్‌లోని గోదావరి నదిలో నిమజ్జనం చేశాడు జవేరి. ఆ తరువాత నరహరి ఇచ్చిన గుడ్డమూటను తెరిచి చూశాడు. అందులో చాలా పురాతనమైన నల్లటి వస్త్రం కనిపించింది. దానిపై బాబా పాదాల ముద్రలు మరింత నల్లగా ముద్రించబడి ఉన్నాయి. వాటి ఆధారంగా రాతితో ఒక జత పాదుకలను, ఇత్తడితో మరో జత పాదుకలను తయారుచేయించి వాటిని ఇంటికి తీసుకొచ్చాడు. వాటిపై బాబా పాదముద్రలున్న వస్త్రాన్ని ఉంచి, అగరుబత్తీలు వెలిగించి, కళ్ళు మూసుకొని బాబా చెప్పిన మంత్రాన్ని ఉచ్ఛరించాడు. కళ్లు తెరిచి చూసేసరికి పాదుకలపై ఉంచిన వస్త్రం కనిపించలేదు. చుట్టుప్రక్కలంతా వెతికినప్పటికీ దాని జాడ తెలియలేదు. దాంతో ఆ వస్త్రం తుదకు తన ఇంటికి చేరుకుందని (అనగా భగవంతుని పాదాలలో ఐక్యమైందని) జవేరి గ్రహించాడు. అప్పటినుంచి 36 సంవత్సరాలపాటు క్రమంతప్పకుండా జవేరి నిష్ఠగా ప్రతిరోజూ రాత్రి ఒంటిగంటకు లేచి, బాబా చెప్పిన మంత్రాన్ని భక్తితో ఉచ్ఛరించి నిద్రపోయేవాడు. ఆ విధంగా 36 సంవత్సరాలు పూర్తైన తర్వాత బాబా చెప్పినట్లు ఆ పాదుకలను దర్శనార్థం భక్తులకు అందుబాటులో ఉంచాడు. ఆ పాదుకలు ఎంతో పవిత్రమైనవి. పూజాసమయంలో బాబా చిత్రపటానికి వేసిన పూలమాల పొడవు దానంతటదే పెరిగి క్రిందనున్న పాదుకలను ఆచ్ఛాదన చేయడం వంటి అనేక అద్భుతాలను డాక్టర్ జవేరి చవిచూశారు.
ఆ పాదుకలకు చేసే అభిషేకం ఎంత ప్రభావవంతమైనదో ఈ క్రింది లీల మనకు తెలియజేస్తుంది. ఇది కొల్హాపూర్ నివాసస్థులైన శ్రీబాలకృష్ణ రామచంద్ర బక్రే కుమార్తె గంగ యదార్థ గాధ. 2004, డిసెంబర్ నెలలో ఒకరోజు గంగ అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యానికి గురైంది. అయితే ఆ రాత్రి తనకు బాగానే ఉండటంతో వంట చేసి తన కుటుంబంతో కలిసి భోజనం చేసింది. ఆపై ఆమె ఇంటిపనులన్నీ పూర్తిచేసి నిద్రపోయింది. మరుసటిరోజు ఉదయం ఆమె ఎప్పటిలాగే ఉదయం 6 గంటలకు నిద్రలేచింది. కానీ, అవయవాలు పటుత్వం కోల్పోయివున్నందున గంగ తన అవయవాలను కదల్చలేకపోయింది. గంగ పరిస్థితిని చూసిన తండ్రి, తన కూతురికి ఏదో తీవ్రమైన సమస్య ఉందని గ్రహించి వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ గంగను వారంరోజులు ఐసీయూలో ఉంచి క్షుణ్ణంగా పరిశీలించిన మీదట ఆమెకొచ్చిన సమస్యను పక్షవాతంగా నిర్ధారించారు డాక్టర్లు. అది విని బాలకృష్ణ విస్తుపోయాడు. పక్షవాతానికి గురైన కండరాలలో బలం ఎప్పుడు తిరిగి పుంజుకుంటుందో నిర్ధారణగా చెప్పలేమని చెప్పి డాక్టర్లు గంగను డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు. తన కుమార్తె కోలుకుంటుందన్న ఆశతో బాలకృష్ణ ఎంతోమంది వైద్యులను సంప్రదించి తనకు సాధ్యమైనమేరకు అన్నిరకాల వైద్యచికిత్సలు ఆమెకు అందించే ప్రయత్నం చేశాడు. అనేకమంది న్యూరాలజీ నిపుణులు, ఆయుర్వేద వైద్యలు, హకీమ్‌లు గంగకు చికిత్స చేశారు. ఒకటిన్నర సంవత్సరంపాటు ఆమెకు అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేద మందులు ఇచ్చారు. అలా గంగ చికిత్స కోసం బాలకృష్ణ లక్షలాది రూపాయలు ఖర్చు చేసినప్పటికీ ఆమె పరిస్థితిలో ఎటువంటి మెరుగుదలా కనిపించలేదు. గంగ పూర్తిగా మంచానికే పరిమితమైంది. దాంతో గంగ రోజువారీ అవసరాలు చూసుకోవడానికి బాలకృష్ణ ఒక నర్సును నియమించాడు. ఇలా ఉండగా ఒకరోజు ఒక సాయిభక్తుడు 'శ్రీభాగ్య' సాయిబాబా మంత్రం మరియు పాదుకల గురించి బాలకృష్ణతో చెప్పాడు. వెంటనే బాలకృష్ణ పూణే వెళ్లి గంగ పేరు మీద బాబా పాదుకలకు అభిషేకం చేసి, 'శ్రీచరణ్ శ్రీభాగ్య సాయి' మంత్రాన్ని నిరంతరాయంగా పఠిస్తూ బాబాపై అత్యంత విశ్వాసంతో పాదుకల అభిషేకతీర్థాన్ని, బాబా ఊదీని గంగకు ఇవ్వసాగాడు. ఆ విధంగా ఒక సంవత్సరం చేశాక అద్భుతమైన ఫలితం వచ్చింది. మంచానికే పరిమితమైన గంగ కోలుకొని ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఇంటిపనులన్నీ చేసుకోసాగింది. ఖాళీ సమయంలో టైలరింగ్ కూడా నేర్చుకొని జీవనోపాధి పొందింది. ఇది కేవలం బాబా ఆశీస్సులతో ఆయన ఊదీ, తీర్థం, మంత్రం వల్లనే సాధ్యమైంది. గంగ, ఆమె కుటుంబం బాబాకు శాశ్వతంగా ఋణపడిపోయారు. బాలకృష్ణ ఇలా అంటారు: “నేను అనేకమంది వైద్యులు, మందులు, ఆసుపత్రులకు ఖర్చు చేసిన లక్షల రూపాయలతో పోలిస్తే రవాణా ఛార్జీలు(పూనా వెళ్లి రావడానికి), పువ్వులు, అభిషేకం అన్నిటికీ కలిపి కేవలం 1,800 రూపాయల ఖర్చు మాత్రమే అయింది. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న నా కూతురిని చూసి అంతటి అపూర్వమైన మంత్రాన్ని, పాదుకలను తన భక్తులకు ప్రసాదించిన బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను".

నరహరిని అనుగ్రహించినట్లే జవేరిని కూడా ఎంతగానో అనుగ్రహించారు బాబా. తనను ఇంతగా అనుగ్రహించిన తన సద్గురువైన శ్రీసాయిబాబాకు ‘గురుదక్షిణ’ ఎలా సమర్పించుకోవాలా అన్న ఆలోచన డాక్టర్ జవేరి మనస్సుని చాలా కలతకు గురిచేసింది. ఎంతో ఆలోచించిన మీదట, మానవాళికి సేవ చేయడమే భగవంతుని సేవ అనీ, అది బాబాకు నచ్చుతుందనీ, బాధల్లో ఉన్న మానవాళికి సహాయం చేయడమే తాను తన గురువుకు సమర్పించుకునే ఉత్తమమైన దక్షిణ అనీ నిర్ణయించుకున్నాడు. అందువల్ల అతను 30 ఏళ్ళపాటు ఎంతో పరిశోధన చేసి ఆస్తమా రోగులకు ఉపశమనం కలిగించే ఆయుర్వేద ఔషధాన్ని కనుగొని 7,000 మందికి పైగా రోగులకు విజయవంతంగా చికిత్స అందించాడు. అతని ద్వారా శ్వాస సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందిన ప్రతి రోగి హృదయపూర్వకంగా అతనిని ఆశీర్వదించినందువల్ల అతను సంతృప్తికరమైన ప్రశాంత జీవితాన్ని గడిపాడు. 2016లో డాక్టర్ జవేరి చికెన్ గున్యాతో అనారోగ్యం పాలై చివరికి 2016, అక్టోబరు 1, శనివారంనాడు బాబాలో ఐక్యమయ్యాడు.

శ్రీసాయిబాబా పవిత్రమైన ఈ పాదుకలు పూణేలో డాక్టర్ జవేరి క్లినిక్‌లో భక్తుల దర్శనార్థం అందుబాటులో ఉన్నాయి. సాయిభక్తుల ప్రయోజనార్థం ఆ క్లినిక్ చిరునామా దిగువన ఇవ్వబడింది.

Shree Aushadhalaya.
Shop No.2,
Radhakrishna Apartment,
Bajirao Road,
Infront of Prabhat Cinema,
Shaniwar Peth,
Pune – 411030
Maharashtra, India.

మూలం: బాబాస్ డివైన్ మేనిఫెస్టేషన్స్ బై విన్నీ చిట్లూరి.

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo