సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 2009వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా వల్లే ఏదైనా సాధ్యం
2. బాబా ఉండగా ఏమీ కాదు!
3. కింద పడకుండా కాపాడిన బాబా

బాబా వల్లే ఏదైనా సాధ్యం

సాయి భక్తులందరికీ నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. మా అమ్మాయికి పెళ్ళైన ఒకటిన్నర సంవత్సరంకి నెలసరి సమస్య వచ్చింది. డాక్టరుకి చూపిస్తే, మందులు వ్రాసిచ్చి 3 నెలలు వాడిన తర్వాత మళ్ళీ రమ్మన్నారు. కానీ 3 నెలలయ్యాక నా ఆర్థిక పరిస్థితి బాగాలేక అమ్మాయిని డాక్టర్ దగ్గరకి తీసుకొని పోలేదు. ఒక నెల అమ్మాయి తీవ్రమైన రక్తస్రావంతో ఇబ్బందిపడింది. ఇంతలో 2025, జూన్ 8న మా బావగారి అమ్మాయి పెళ్లి వచ్చింది. ఆ పెళ్ళికి వెళ్లాలని వారం ముందు నేను, మా అమ్మాయి అనుకున్నాము. అప్పటికి మా అమ్మాయి నెలసరి సమస్య తీరిపోయింది. అయినప్పటికీ హఠాత్తుగా పెళ్లికి 4 రోజుల ముందు మా అమ్మాయి ఫోన్ చేసి, మళ్ళీ రక్తస్రావం అవుతుందనీ, వాళ్ళ అత్తగారు పెళ్ళికి పోవద్దనీ, ఒకవేళ వెళ్ళేటట్టైతే ముందుగా డాక్టరుకి చూపించుకోవాలనీ చెప్పారని చెప్పింది. కానీ నా దగ్గర డబ్బులు లేవు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. కొంచం ఊదీ చేతిలోకి తీసుకొని బాబాను, "తెల్లారేసరికల్లా అమ్మాయికి రక్తస్రావం తగ్గి ఊరికి వచ్చేలా చేయండి బాబా" అని ప్రార్థించి, ఆ ఊదీ నా కడుపుకి రాసుకున్నాను. నిజంగా బాబా అద్భుతం చేసారు. అమ్మాయికి రక్తస్రావం ఆగి ఊరికి వచ్చింది. పెళ్లి బాగా జరిగింది. పెళ్లి జరిగిన ఒక గంట తర్వాత అమ్మాయికి మళ్ళీ రక్తస్రావం మొదలైంది. తన అత్తగారు ఫోన్ చేసి, "డాక్టరుకి చూపించుకోకుండా ఇంటికి రావద్దు" అన్నారు. ఏమి చేయాలో అర్థంకాక, "బాబా! నువ్వే దిక్కు" అని అనుకొని నాకు తెలిసిన ఒక డాక్టరుకి ఫోన్ చేశాను. ఆయన తన ఫ్రెండ్ ఒకరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారని, అక్కడికి వెళ్లి ఆ డాక్టర్ని కలవమన్నారు. అలాగే వెళ్లి కలిసాము. ఆ డాక్టరు చాలా మంచి వ్యక్తి. అమ్మాయిని చూసి, స్కానింగ్, థైరాయిడ్ మొదలగు అన్ని టెస్టులు చేసి, అన్నీ బాగున్నాయి, రిపోర్ట్స్లో ఏ సమస్యా లేదు, కొంచం రక్తం తక్కువ అని చెప్పారు. ఇదంతా బాబా వలనే సాధ్యం. "ధన్యవాదాలు బాబా". 



సాయిభక్తుల అనుభవమాలిక 2008వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఊహించని విధంగా లోన్ వచ్చేలా అనుగ్రహించిన బాబా
2. బాబా దయ
3. ఊదీతో నెలసరి సమస్యను పరిష్కరించిన బాబా




సాయిభక్తుల అనుభవమాలిక 2007వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • బాబా దయతో పార్ట్ టైమ్ ఉద్యోగం - కోరుకున్న చోటుకు బదిలీ


సాయిభక్తుల అనుభవమాలిక 2006వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాధలను తీర్చే బాబా
2. శరణాగతి నేర్పిస్తున్న బాబా

బాధలను తీర్చే బాబా

నా పేరు పుష్పలత. నేను ఉపాధ్యాయురాలుగా పనిచేసి రిటైరయ్యాను, బాబాతో నాకు ఉన్న పరిచయం ఇప్పటిది కాదు. సుమారు 30 సంవత్సరాల క్రితం జనవరి 1న మా పాఠశాల విద్యార్థులు బాబా ఫోటో ఉన్న గ్రీటింగ్ కార్డు నాకు ఇచ్చారు. అప్పుడు మొదలైన బాబాతో నా అనుబంధం ఇప్పటివరకు కొనసాగుతూనే ఉంది. నా జీవితాంతం కొనసాగుతూనే ఉంటుంది. బాబా నాపై చూపిన కరుణ, దయ ఇంతని చెప్పలేను‌. కొద్దిరోజుల క్రితం నాకు ఒక అనారోగ్య సమస్య వచ్చింది. హఠాత్తుగా వైట్ డిశ్చార్జ్ అవ్వడం మొదలైంది. 'సాయీ' అనగానే 'ఓయ్' అని మన బాధలను తీర్చే బాబా తప్ప మనకి దిక్కు ఎవరు? ఆయన్నే తలుచుకొని 'నాకీ వయసులో ఇదేంటి బాబా?' అని నేను ఎంతో బాధపడ్డాను, భయపడ్డాను. మనసులో బాబాని తలుచుకొని ఊదీ మంచినీళ్లలో వేసుకొని, బాబాకి దణ్ణం పెట్టుకొని ఆ తీర్థం తాగి, కొంత ఊదీ నా పొట్టకి రాసుకున్నాను. అనూహ్యంగా నాకొచ్చిన సమస్య తొలగిపోయింది.

నేను యుఎస్ఏలో ఉన్న మా పాప దగ్గరకు వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు అక్కడ ఇమ్మిగ్రేషన్‌వాళ్ళు అడిగిన ప్రశ్న నాకు అర్థంకాక నేనేమీ సమాధానం చెప్పలేకపోయాను. దాంతో వాళ్ళు నన్ను కాసేపు పక్కన ఉండమన్నారు. నాకు చాలా భయమేసి పక్కన కూర్చొని అక్కడ ఉన్నంతసేపూ, "బాబా! నన్ను ఎలాగైనా ఈ ఇబ్బందుల నుంచి బయటపడేయండి" అని బాబాకి దణ్ణం పెట్టుకొని ఆయన నామస్మరణ చేశాను. కాసేపటికి వాళ్ళు నన్ను 'ఓకే' చేసి ఫ్లైట్ దగ్గరకి పంపించారు. బాబా దయవలన నా ప్రయాణం నిర్విఘ్నంగా సాగి క్షేమంగా ఇండియాకి వచ్చాను. ఇలా అడుగడుగునా నాకు అండగా ఉంటూ నా బాధలు, ఇక్కట్లు తొలగిస్తూ నన్ను గట్టెక్కిస్తున్న సాయినాథునికి నేను ఎంతగానో ఋణపడి ఉన్నాను. ఇలా బాబా నాపై చూపిన ప్రేమ, కరుణలను మీతో పంచుకున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను. "బాబా! నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ నీవే. ఇదేవిధంగా కరుణించి నన్ను, సాయి బంధువులందరినీ ప్రేమతో కాపాడుతూ అందరూ క్షేమంగా ఉండేలా తండ్రీ. ఎల్లవేళలా నా అండ నుండి నన్ను నడిపించు మీకు శతకోటి వందనాలు".

సర్వం శ్రీ సాయినాథ చరణారవిందార్పణమస్తు.


సాయిభక్తుల అనుభవమాలిక 2005వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. పరీక్షల సమయంలో బాబా అనుగ్రహం
2. నిజంగా బాబా ఎంత కరుణమయుడో!
3. క్తులను ఎప్పుడూ విడిచిపెట్టరు బాబా 



క్తులను ఎప్పుడూ విడిచిపెట్టరు బాబా  

ప్రియమైన సాయిభక్తులారా! నా పేరు సుధీర్. సాయితో నా ప్రయాణం 1999లో ప్రారంభమైంది. నా గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత నేను విదేశాలకు వెళ్లాలని ఆశపడ్డాను. ఆ ఆశ కారణంగా నేను ఒక ఏజెంట్ మోసానికి గురై నా డబ్బు, పాస్‌పోర్ట్ పోగొట్టుకొని ముంబయిలో అడుగుపెట్టాను. అక్కడ నాకు తెలిసిన వాళ్ళెవరూ లేరు. వెనక్కి వెళ్లిపోదామంటే బంధువుల ముందు పరువు పోతుందని నా స్వస్థలానికి తిరిగి వెళ్ళలేకపోయాను. నాకు ఏమి చేయాలో తెలియలేదు. అటువంటి సమయంలో నేను శిరిడీ వెళ్లి బాబాను ప్రార్థించి, 3 రోజులు అక్కడే ఉన్నాను. అంతే, 15 రోజుల్లో ముంబయిలో నాకు ఉద్యోగంతోపాటు వసతి కూడా లభించింది. బాబా తమ భక్తులను ఎప్పుడూ విడిచిపెట్టరని తెలియజేసిన నా మొదటి అనుభవమిది. నేను పిలిచిన ప్రతిసారీ బాబా నా వెనుక ఉన్నారు. ప్రతిసారీ ఆలస్యం లేకుండా ఆయన నాకు సహాయం చేసారు. నా జీవితంలో నేను నా బాబాను మరచిపోలేను. ఆయనే నా సర్వస్వం, ఆయనే నా గురువు, సఖుడు. "మీరు మాపై చూపే దయకు చాలా ధన్యవాదాలు బాబా".

సాయిభక్తుల అనుభవమాలిక 2004వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబాకి చెప్పుకున్నాక ఆయన సమస్య తీర్చకుండా ఉంటారా!
2. ఆరోగ్య ప్రదాత సాయి


ఆరోగ్య ప్రదాత సాయి

నా పేరు సౌదామిని. నాకు 25 సంవత్సరాలుగా బాబాతో అనుబంధం ఉంది. 2021లో నాకు కరోనా వచ్చిన దగ్గరనుండి నేను ఏదో ఒక అనారోగ్యంతో చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. సరిగా అదే సంవత్సరం నాకు ఈ బ్లాగు పరిచయమైంది. అప్పటినుండి నాకు ఏ సమస్య వచ్చినా నా బాధలన్నీ బాబాకు చెప్పుకుంటూ ఉన్నాను. అలాగే ఆరోగ్య పరీక్షలన్నీ చేయించుకుంటూ ఉన్నాను. ఆ తండ్రి దయవల్ల నాకు ఏ ప్రమాదం జరగకుండా తిరిగి సాధారణ స్థితికి వచ్చి నా పనులు చేసుకుంటూ ఉండగా 2024 సంవత్సరాంతంలో ఒకసారి డాక్టర్ దగ్గరకి వెళితే, బీపీ చాలా ఎక్కువగా ఉందని మళ్ళీ అన్ని టెస్టులు చేయించమన్నారు. మరుసటిరోజు "ఈసారి కూడా నాకు ఏ ఆరోగ్య సమస్య లేకుండా చూడండి" అని బాబాని ప్రార్థించి అన్ని టెస్టులు చేయించుకున్నాను. రిపోర్టులు చూసి డాక్టర్, "అన్నీ నార్మల్‌గా ఉన్నాయి. కానీ బీపీ కొంచెం ఎక్కువగా ఉంద"ని చికిత్స ప్రారంభించారు. బాబా దయతో బీపీ నార్మల్‌గా వచ్చేలా చేసి నాకు ఏ సమస్య లేకుండా అనుగ్రహించారు. "ధన్యవాదాలు సాయినాథా".

2025, మే నెలలో కోవిడ్-19 మరలా వస్తుందని వార్తలు వచ్చిన సమయంలో ఒకరోజు మధ్యాహ్నం నాకు ఉన్నట్టుండి 101 డిగ్రీల జ్వరం వచ్చింది. ఒళ్లునొప్పులు, కీళ్ళనొప్పుల, ఒళ్ళంతా వేడివల్ల ఆవిర్లతో మంచం మీద నుండి లేవలేకపోయాను. నాకు భయమేసి బాబాకి చెప్పుకొని మందులతోపాటు ఊదీ పెట్టుకొని, ఊదీ నీళ్ళు తీసుకుంటూ ఒకరోజు గడిపాను. రెండు రోజుల తర్వాత గొంతునొప్పి, శ్వాస ఆడక జ్వరం ఒళ్ళునొప్పులతో నరకం అనుభవించాను. అప్పుడు, "బాబా! దయచేసి నాపై దయ చూపండి" అని ఆర్తిగా చెప్పుకొని సాయిచరిత్ర తల కింద పెట్టుకొని పడుకున్నాను. మందులు వేసుకుంటూ బాబా మీద నమ్మకముంచి నా పనులు నేను చేసుకుంటుండగా రెండు రోజులకి జ్వరం, నొప్పులు అన్నీ తగ్గిపోయాయి. "నా యందు మీ చల్లని చూపు ఎల్లవేళలా ఈ విధంగానే ఉండాలి సాయిదేవా".

సాయిభక్తుల అనుభవమాలిక 2003వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. అడిగిన ప్రతిదీ ప్రసాదించే బాబా
2. బాబా చూపిన కరుణ

అడిగిన ప్రతిదీ ప్రసాదించే బాబా

ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయి బంధువులందరికీ నా నమస్కారం. నా పేరు చినవెంకటలక్ష్మి. మాది కాకినాడ. 2020లో మా చిన్నన్నయ్యకి కరోనా వచ్చింది. వాళ్లకు కామన్ బాత్రూం కాకుండా వేరే బాత్రూం లేనందున ఇంట్లోనే వేరే గదిలో క్వారంటైన్ ఉండడానికి లేకపోయింది. అందుకని JNTU వాళ్ళు వాళ్ళ కాలేజీలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ గదుల్లో ఉండవలసి వచ్చింది. మాకు చాలా భయమేసింది. ఆ సమయంలో మాకు తిండి సహించేది కాదు, నిద్రపట్టేది కాదు. నేను, " 'బాబా.. బాబా..' అన్నయ్యని కాపాడు. తనకి కరోనా తగ్గి ఇంటికి క్షేమంగా రావాలి" అని బాబాను దృఢంగా వేడుకుంటూ ఉండేదాన్ని. అయితే ఐదు రోజులకి మా పెద్దన్నయ్యకి జ్వరం, దగ్గు, జలుబు వచ్చాయి. కరోనా టెస్ట్ చేయిస్తే తనకి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. తనని కూడా క్వారంటైన్‌కి వెళ్లాలన్నారు. ఇంట్లో చూస్తే.. మా వదిన, వాళ్ళ అబ్బాయి, అమ్మాయి ఉన్నారు. వాళ్లని వదిలి వెళ్లడం అన్నయ్యకి చాలా కష్టమైనప్పటికీ వేరే దారి లేక, "భగవంతుడా! ఏమిటీ పరీక్ష?" అని చాలా బాధపడి చిన్నన్నయ్య ఇంటికి రాకముందే పెద్దన్నయ్యను కూడా అదే JNTU కాలేజీలో క్వారంటైన్‌కు పంపించాము. ఆ పరిస్థితి తలచుకుంటే ఇప్పటికీ భయమేస్తోంది. ప్రతిరోజూ నాకు వాళ్ళిద్దరి గురించి బెంగగా ఉండేది. అనుక్షణం బాబాకి మొరపెట్టుకుంటుండేదాన్ని. బాబా దయవల్ల పెద్దన్నయ్య క్వారంటైన్‌కి వెళ్లిన రెండు రోజులకి అంటే 7రోజులు క్వారంటైన్‌లో ఉన్నాక చిన్నన్నయ్యకి కరోనా తగ్గడంతో ఇంటికి పంపించారు. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. పెద్దన్నయ్యను కూడా ఏడు రోజులు క్వారంటైన్‌లో ఉంచి ఇంటికి పంపించారు. బాబా దయవల్ల ఇద్దరికీ కరోనా పూర్తిగా తగ్గింది. బాబా నా మొర ఆలకించి వాళ్ళకి కరోనా తగ్గించి నా బాధను పోగొట్టారు. కానీ రెండు, మూడు రోజులకి ఒరిస్సాలో ఉంటున్న మా పెద్దబ్బాయికి కరోనా వచ్చింది. అది తెలిసి వాళ్ళింటి యజమాని ఇంటికి అస్సలు రావద్దన్నారు.  అబ్బాయి అక్కడ తన భార్య, మూడు సంవత్సరాల కొడుకుతో ఉంటున్నాడు. బంధువులు కూడా ఎవరూ లేరు. అందువల్ల మాకు ఏమి చేయాలో అర్థం కాలేదు. అబ్బాయి వెళ్లి తన ఆఫీస్ గెస్ట్‌హౌస్‌లోని ఒక గదిలో ఒంటరిగా ఉండిపోయాడు. తర్వాత వాళ్ళ ఇంటి ఓనర్ మా కోడలికి కరోనా టెస్ట్ చేయిస్తే, ఆమెకి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో ఇంటి ఓనర్ "తెల్లవారేసరికి మీరు ఇంట్లో ఉండకూడదు. ఎక్కడికి వెళతారో మాకు తెలియదు. వెళ్లిపోండి" అని కఠినంగా మాట్లాడాడు. మా కోడలు మాకు ఫోన్ చేసి ఒకటే ఏడుపు! వాళ్ళ అమ్మగారిది, మాది కాకినాడే. ఎవరు అక్కడికి వెళదామన్నా కరోనా కారణంగా ప్రయాణ సదుపాయాలు లేవు ఆ సమయంలో. ఒకవేళ ఏదోవిధంగా ప్రయాణం మొదలుపెట్టినా రాష్ట్ర సరిహద్దుల్లో ఎక్కడ ఆపేస్తారో తెలియని పరిస్థితి. ఇలాంటి స్థితిలో కరోనా వచ్చిన కోడలు ఒక్కతే చిన్నపిల్లాడితో అక్కడ ఎక్కడ ఉంటుందో, ఎలా ఉంటుందో అని భయపడి ఆ రాత్రంతా బాబానే తలుచుకుంటూ, "బాబా! మీరే దారి చూపండి. ఇంటి ఓనర్ మనసును మర్చి వాళ్లని ఎక్కడికి పంపించకుండా చేయండి" అని వేడుకున్నాను. బాబా గొప్ప అద్భుతం చేసారు. తెల్లవారుతూనే ఇంటి ఓనర్, "మీరు ఎక్కడికీ వెళ్లనవసరం లేదు. కానీ, బయటకు రాకండి. జాగ్రత్తగా లోపలే ఉండండి" అని చెప్పారు. కానీ అబ్బాయి గెస్ట్‌హౌస్‌లో ఉన్నందున ఇంట్లో ఉండే కోడలు, మనవడి కనీస అవసరాలు తీరే దారి లేకపోయింది, మందులు కూడా దొరికే అవకాశం లేకుండా పోయింది. కోడలు చిన్నపిల్లాడిని చూసుకోలేక, ఒంట్లో ఓపిక లేక నీరసంగా ఉన్నా బాబుకోసం వంట చేస్తూ నరకయాతన పడింది. ఇక్కడ మేము ఫోనులో వారి బాధ వినలేక, చేసేదిలేక నిస్సహాయంగా బాబాని తలుచుకుంటూ ఉండిపోయాము. బాబా దయవలన మా అబ్బాయికి, కోడలికి కరోనా తగ్గింది. బాబుకు మాత్రం కరోనా రాలేదు. అది బాబా చేసిన అద్భుతం.

మా చిన్నబ్బాయి బీటెక్ పూర్తిచేసి ఉద్యోగం కోసం చాలా ఎదురుచూశాడు. అప్పుడు నేను, "బాబా! మీ దయవలన అబ్బాయికి ఉద్యోగం రావాలి" అని అనుకున్నాను. తర్వాత మాకు తెలిసినవాళ్ళు, "ఒక కంపెనీలో జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయ"ని చెప్పి అప్లై చేసుకోమని సలహా ఇచ్చారు. అబ్బాయి అలాగే చేసాడు. బాబా దయవల్ల వాడికి వెంటనే మంచి ఉద్యోగం వచ్చింది. 

మా చిన్నన్నయ్యకి 50 సంవత్సరాలు దాటినా పెళ్లి కాలేదు. ఎన్ని సంబంధాలు చూసినా వయసు ఎక్కువని కుదరలేదు. దాంతో మా అన్నయ్య నేనింకా పెళ్లి చేసుకోను అనేవాడు. నేను, మా అమ్మ చాలా చాలా బాధపడ్డాము. నేను బాబాని, "బాబా! మీ దయవల్ల చిన్నన్నయ్యకి పెళ్లి అవ్వాలి" అని మనస్ఫూర్తిగా ప్రార్థించాను. బాబా దయవల్ల అన్నయ్యకు మంచి సంబంధం వచ్చి పెళ్లి అయింది. వాళ్లు చాలా ఆనందంగా ఉన్నారు. ఇలా నేను అడిగిన ప్రతిదీ బాబా నాకు ప్రసాదించారు, నా కోరికలన్నీ తీర్చారు. ఇప్పటికీ నేను ఏమి అడిగినా తప్పకుండా తీరుస్తున్నారు బాబా. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

బాబా చూపిన కరుణ

సాయిబంధువులకు నమస్కారం. నా పేరు స్వాతి. బాబా నా మీద చూపిన కరుణ పంచుకుంటున్నాను. నేను నా ఆరోగ్యరీత్యా ఇంట్లో పని చేయడానికి ఒక ఆమెని పెట్టుకున్నాను. కొన్నాళ్లకి తనతో నాకు చాలా స్నేహం ఏర్పడింది. తనని బాగా చేసుకునేదాన్ని. తాను కూడా అలానే వుండేది. అయితే ఒకరోజు మా ఇద్దరి మధ్య మాట మాట పెరిగి గొడవకి దారి తీసింది. నేను కోపంలో తనని పనిలో నుండి తీసేసాను. కానీ ఆ తరువాత నేను పడ్డ బాధ వర్ణనాతీతం. బాబాకి, "మళ్లీ తను పనికి రావాలి" అని దణ్ణం పెట్టుకున్నాను. బాబా దయతో కొన్నాళ్ళకి తను మళ్ళీ పనిలో చేరింది. "ప్రతి విషయంలో నాకు సహాయం చేస్తూ కాపాడుతున్న బాబాకి ధన్యవాదాలు".

సాయిభక్తుల అనుభవమాలిక 2002వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా మనతో ఉన్నారని నమ్మడానికి ఇది సరిపోదా?
2. బాబాని నమ్ముకుంటే కానిదంటూ ఏదీ ఉండదు
3. అడిగినవన్నీ ఇస్తున్న బాబా



అడిగినవన్నీ ఇస్తున్న బాబా

ముందుగా అందరికీ నా  వందనాలు. నా పేరు గురుప్రసాద్. నేను ఆస్ట్రేలియాలో ఉంటాను. ఇక్కడ నేను, నా బావమరిది ఒకే కంపెనీలో, ఒకే టీమ్‌లో పని చేస్తున్నాము. మా మేనేజర్‌వాళ్ళు నా బావమరిదిని 'ఇదే టీమ్‌లో ఇంకా కొనసాగించలేము, వేరే టీమ్‌కి పంపాలి' అన్నారు. మా మేనేజర్ హై లెవెల్‌‌‌‌‌‌‌తో మాట్లాడితే, చూద్దామని అన్నారు. నేను బాబాని, "ఎలాగైనా నా బావమరిదిని మా టీమ్‌లో  ఉండేలా చేయండి బాబా" అని దృఢంగా బాబాని వేడుకున్నాను. ఒక వారంలో ఎవరైతే అదివరకు నా బావమరిదిని మా టీమ్‌లో వద్దని అన్నారో, వాళ్లే కాల్ చేసి, "తను మీ టీమ్‌లో ఉంటాడు. మీరు అధైర్యపడకండి" అని చెప్పారు. నాకు ఒక్క నిమిషం ఏమీ అర్థం కాలేదు. తర్వాత నా ఫోన్‌లో బాబాని చూసి, "అంతా మీ దయ" అనుకున్నాను. ఇంతవరకు నేను అడిగినవన్నీ ఇచ్చారు బాబా. "అన్నిటికీ ధన్యవాదాలు బాబా".

సాయిభక్తుల అనుభవమాలిక 2001వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • బాబా అద్భుత అనుగ్రహం - మూడవ భాగం

నా పేరు రాజేశ్వరి. మాది విజయవాడ. నేను ముందు భాగాలలో కొన్ని అనుభవాలు పంచుకుంటాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటాను. ఒకరోజు మానాన్నకి ఒంట్లో బాగాలేదు. ఆయనకు మమ్మల్ని చూడాలనిపించి పిలిపించుకున్నారు. మేము వెళ్లేసరికి ఆయనకి ఆయాసంగా ఉంది. మేము నాన్నని చూసి విజయవాడ తిరిగి వచ్చేసాం. మా ఇంట్లో మేము పడుకునే గదిలో సాయిబాబా ఫోటో ఉంది. రోజూ నిద్రలేవగానే ఆఫోటోకి దణ్ణం పెట్టుకోవటం నాకలవాటు. నాన్నని చూసి వచ్చిన మరునాడు ఉదయం నిద్రలేచి బాబాకి దణ్ణం పెట్టుకుంటుంటే, ఆయన ఏడుస్తున్నట్లు నాకు కనపడింది. అప్పటికే మేము అనుకోని కారణాల వల్ల సొంతింట్లో నుండి అద్దె ఇంట్లోకి వచ్చాం. అందుకని బాబా అలా కనపడుతున్నారనుకొని, “నువ్వెందుకయ్యా! బాధపడతావు? మా మామగారు వాళ్ళకి ఈయన ఒక్క కొడుకై ఉండి కూడా ఈ విధంగా అయినందుకు, నిన్నేమీ అనటం లేదు కదా! ఇదేదో మా మంచికే అనుకుంటాము. నువ్వెందుకయ్యా అలా ఉంటావు” అన్నాను. బాబా కలలోకీ రాలేదు, నాకు సమాధానమూ ఇవ్వలేదు. మర్నాడు ఉదయం కూడా అలాగే కనిపించారు బాబా. "ఏంటి ఇలా వున్నావు?" అని అడిగాను. నాకు బాబా నుండి ఏ విధంగానూ సమాధానం రాలేదు కానీ, అదేరోజు మధ్యాహ్నం మా నాన్న చనిపోయారని మా తమ్ముడు ఫోన్ చేసి చెప్పాడు. అప్పుడు నాకు రెండు రోజులుగా బాబా ముఖం అలా ఎందుకుందో అర్థం అయింది. నేను పడబోయే బాధను ఆయనే ముందుగా పడ్డారు.


మా అక్కయ్యవాళ్ళు వైజాగ్‌‌లో ఉంటారు. ఒకసారి తన కొడుకు ఎంసెట్ పరీక్షకి వెళ్ళాడు. తను పరీక్ష వ్రాసి ఇంటికి వచ్చేదాక మా అక్క తనకి మంచి ర్యాంక్ రావాలని ఎంతో నియమనిష్ఠలతో ఒక్కరోజులో సచ్చరిత్ర పారాయణ చేస్తాననుకొని ఉదయం నుండి సాయంత్రం వరకు చదివింది. కానీ పరీక్ష ఫలితాలు వచ్చేసరికి అబ్బాయికి అనుకున్న ర్యాంకు రాలేదు. అప్పుడు మా అక్క చాలా బాధపడి, "మీరు మావాడికి మంచి ర్యాంకు ఇప్పిస్తారనే కదా! వాడు పరీక్ష వ్రాసినంతసేపూ నేను నీ పారాయణ చేస్తూ నీ ధ్యాసలోనే ఉన్నాను. మీరు వాడు పరీక్ష వ్రాసినంతసేపూ వాడి దగ్గర, వాడికి తోడుగా ఉంటారనుకున్నాను కదా బాబా!” అంటూ బాగా ఏడ్చింది. అదేరోజు బాబా మా అక్క కలలోకి వచ్చి, “ఎందుకేడుస్తావు?" అని అక్క తలను తమ ఒడిలో పెట్టుకొని, నిమురుతూ, “నేనున్నాను కదా! నేను చూసుకుంటాను. నువ్వు అధైర్యపడకు" అని చెప్పారట. ఆ స్పర్శ అక్కకి స్పష్టంగా తెలిసిందట. ఇంకా పాలు, విబూది, అత్తరు వాసనలు వచ్చాయట. అక్కకి మెలకువ వచ్చాక కూడా ఆ వాసనలు అలాగే వచ్చాయట. అక్క చాలా సంతోషపడింది. మరుసటిరోజు అక్కవాళ్ళు అబ్బాయికి మంచి ర్యాంక్ రాలేదు కాబట్టి, ఒక కాలేజీలో పేమెంట్ సీటు కోసం రెండు లక్షలు కట్టారు. బాబా ఏ అద్భుతం చేసారోగాని, ఆ కాలేజీ ప్రిన్సిపాల్, "మీరు కట్టిన రెండు లక్షలు తీసుకోండి. నేను ఈ బాబుకి ఫ్రీగానే సీటిస్తాను. డొనేషన్ అవసరం లేదు" అన్నారు. అక్కవాళ్ళు ఆ ప్రిన్సిపాల్ని, "ఎందుకు డబ్బులు వెనక్కి ఇచ్చేస్తున్నార"ని అడిగితే, "అవసరం లేద"ని చెప్పరాతను.


ఒకరోజు బాబా అక్క కలలోకి వచ్చి, “నాకు రోజూ పులగం అన్నం వండి నైవేద్యంగా పెట్టు" అని చెప్పారు. బాబాయే స్వయంగా తట్టి లేపి మరీ ఈ విషయం చెప్పినట్లుగా అక్కకి అనిపించింది. అక్క నిద్రలేచి, 'ఇదేంటి? నేను అలా రోజూ ఎలా చేయగలను? నెలలో నాలుగు రోజులు ఇబ్బంది ఉంటుంది. పైగా ఎక్కడికైనా ఊరికి వెళితే ఎలా కుదురుతుంది?' అని ఆలోచనలో పడింది. ఎటూ తేల్చుకోలేక తనలోతనే తర్జన భర్జనలు పడి, మనసంతా పాడుచేసుకుంది. ఆ విషయం గురించి చాలారోజులు ఆలోచించి ఏం చేయాలో తెలియక అలా ఉండిపోయింది. ఇలా ఉండగా అక్క అనుకోకుండా పుట్టపర్తి వెళ్ళింది. అక్కడ రాత్రి నిద్రస్తుంటే తనకి ఒక కల వచ్చింది. ఆ కలలో ఒకావిడ, "ఏంటి? బాబా పులగం వండి పెట్టమని చెబితే, పెట్టవేంటి?" అని అంది, అంతలోనే ఇంకొక ఆవిడ, "బాబా చెప్పారంటే అంతే! మరి చేసి తీరాలి! ఎందుకు చేయటం లేదు? ఏంటి నీ అనుమానం? ఆ నాలుగురోజులు ఏం చేయకు. నువ్వెప్పుడైనా ఊరికి వెళ్ళవలసి వస్తే, ఒక గిన్నెలో బియ్యం, పెసరపప్పు, బెల్లం ముక్కవేసి బాబా దగ్గర వుంచి, పక్కనే మరోగ్లాసులో నీళ్లు తాగటానికి పెట్టు. నువ్వు ఊరినుండి వచ్చాక ఆపెట్టిన బెల్లం, బియ్యం పెసరపప్పు తోటి పరమాన్నం వండి బాబాకి నైవేద్యం పెట్టు" అని చెప్పింది. సరేనని అక్క ఇంటికి వచ్చాక, పులగం వండి నైవేద్యం పెట్టటం మొదలుపెట్టింది. ఒక నెలరోజులకి అక్కకేదో ఇబ్బందయ్యి హాస్పిటల్కి వెళ్తే, వెంటనే గర్భసంచి తీసేయాలని చెప్పి, ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేసారు. దాంతో అక్కకి ఆ నాలుగురోజుల ఇబ్బంది లేకుండాపోయింది.

సాయిభక్తుల అనుభవమాలిక 2000వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • బాబా అద్భుత అనుగ్రహం - రెండవ భాగం

నా పేరు రాజేశ్వరి. మాది విజయవాడ. బాబా అనుగ్రహంతో నేను నెల తప్పానని ముందు భాగంలో పంచుకున్నాను. ఇక తర్వాత విషయానికి వస్తే, నా ఆడపడుచుకి ఇద్దరమ్మాయిలు. అందుకని నేను 'నాకు పుట్టేది అబ్బాయి అయితే బావుండున'ననుకొని బాబాని అదే కోరుకున్నాను. కానీ 9 నెలల తర్వాత నాకు అమ్మాయి పుట్టింది. నాకు బాబాపై చాలా కోపమొచ్చి, "బాబా! నేను నిన్ను అబ్బాయిని అడిగాను. మరేంటి నాకు అమ్మాయినిచ్చారు" అని పోట్లాడాను. నిజానికి నేనప్పుడు సిజేరియన్ చేసినప్పుడు ఇచ్చిన మత్తులో ఉన్నాను. కాసేపటికి నేను పడుకుంటే బాబా నా కలలోకి వచ్చారు. ఆయన ద్వారకామాయిలో రాయి మీద ఎలా కూర్చుంటారో అలాగే దర్శనమిచ్చి, “అమ్మాయినిచ్చానని నువ్వు బాధపడతావేంటి? నేను నీకు పండంటి బిడ్డనిచ్చాను. అబ్బాయి బొమ్మను కూడా తయారు చేస్తున్నాను. కానీ, ఇప్పుడు అబ్బాయినివ్వటానికి సరైన సమయం కాదు. మొదట అమ్మాయి బొమ్మనే ఇవ్వాలి నీకు. అబ్బాయి బొమ్మ కూడా వుంది, నేనిస్తాను. ఈ అమ్మాయిని నా అంశగా అనుకో! దాన్ని బాధపెట్టక చక్కగా చూసుకో! నేను ఉన్నాను” అని చెప్పారు. బొమ్మని తయారు చేస్తున్నానంటూ మట్టి బాల్స్ లాంటివి కూడా చూపించారు. అయితే మొదట బాబు కావాలన్న కోరిక నా మనసులో బలంగా ఉండిపోయినట్లుంది. ఆ భావం వల్ల ఏడాదిలోపు పాపను రెండు, మూడుసార్లు కొట్టాను. మొదటిసారి పాపని కొట్టినప్పుడు బాబా కలలోకి వచ్చి, “కొట్టద్దు అని చెప్పానుగా, ఎందుక్కొట్టావు? పాపాయిని కొడితే నన్ను బాధపెట్టినట్టే! నీకు అబ్బాయిని ఇస్తానని చెప్పానుగా!" అన్నారు. కానీ నేను రెండు రోజులలో పాపకి మరో దెబ్బ వేసాను. మళ్ళీ బాబా కలలోకి వచ్చి, “నేనింక నీ కలలోకి రాను. ఆ భావం మనసులో నుండి తీసేసి పాపని ప్రేమగా చూసుకో!” అన్నారు. అంతే! ఆ తర్వాత బాబా నాకింక కలలోకి రాలేదు. పాపని కొడితేనైనా బాబా కలలోకి వస్తారని రెండు మూడుసార్లు పాపని కొట్టాను కూడా. అయినా బాబా కలలోకి రాలేదు.


రెండు సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ నెల తప్పాను. నెల తప్పేముందు నాకో కల వచ్చింది. ఆ కలలో, "బొమ్మ తయారు అయిపోయింది. ఇదిగో తీసుకో!" అని అప్పజెప్పినట్లు మాటలు వినిపించాయి, బాబా మాత్రం కనిపించలేదు. 9వ నెల వచ్చాక నేను మా అమ్మవాళ్ళింట్లో పడుకుని ఉండగా, నిద్రలో ఆంజనేయస్వామి మేఘంలా వచ్చారు. నేను తల ఎత్తలేకపోతున్నాను. బాబా కలలోకి రానన్నారుగా! అందుకని ఆంజనేయస్వామిని పంపారేమో! నేను, "ఏం బాబా! ఇలా చేస్తున్నావు? నేను తల ఎత్తలేకపోతున్నాను" అని అంటుంటే ఆయన, "ఉండు చిట్టీతల్లి! నేను నిన్ను వదులుకోలేను" అని అన్నారు. తర్వాత ఆ మేఘమంతా ఒక వైపు గొట్టంలోంచి వచ్చినట్లు నా పొట్టలోకి వచ్చింది. అదేంటి అనేది నాకర్ధం కాలేదు. ఆ తర్వాత నాకు స్కానింగ్ తీసి అంతా బాగానే ఉందని చెప్పారు. నాలుగురోజుల్లో సిజేరియన్ చేసి బాబుని బయటకి తీస్తే, తనకి ఆక్సిజన్ అందటం లేదు. డాక్టర్లు బిడ్డ బ్రతకడం గురించి గ్యారంటీ ఇవ్వలేదు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసారు. ఆపరేషన్ చేసేటప్పుడు నాకు పెట్టిన ఆక్సిజన్ తీసి బాబుకి తగిలించారు. కొంతసేపటికి అంతా సెట్ అయింది. అంత సీరియస్ అయిన బాబుని నా చేతిలో పెట్టేసరికి నా ఆనందం చెప్పనలవి కాలేదు. మేఘం అంటే గాలే కదా! నాకిలా సమస్య ఉందనే బాబా అదివరకే హెచ్చరించి నా పొట్టలోకి ఏదో పంపించారు. నా కలలోకి రానున్నారు కానీ, అన్ని విధాలా నాకు సాయం చేసారు.


నేను మాకు సంతానం కలిగితే బాబా భజన చేయిస్తానని అనుకున్నాను. కానీ ఏడాది, ఏడాదిన్నర అయినాగానీ భజన చేయించటానికి మాకు అసలు కుదరలేదు. అప్పుడు బాబా కలలోకి వచ్చి, “భజన పెడతానన్నావు? ముందు భజన పెట్టు, ఇంటికి దృష్టి తగలబోతోంది. నేను నీ ఇంటికి రావాలి, శాంతి చేయాలి. ఒక వారం లోపు నా భజన పెట్టు" అని అన్నారు. విజయవాడలోని వస్త్రలత షాపింగ్ కాంప్లెక్స్‌‌లో సాయిబాబా భజనలు చేసే బృందంవారు బాగా చేస్తారని మావారికి నమ్మకం. కానీ వాళ్ళనడిగితే రెండు నెలలవరకు ఖాళీ లేదన్నారు. మరో ఇద్దర్ని అడిగితే, వాళ్ళు కూడా ఖాళీ లేదన్నారు. ఇంక మాకేం చేయాలో తోచలేదు. మావారు నాతో, "నువ్వేమో బాబా వారం రోజుల లోపే పెట్టమన్నారని చెప్పావు. వాళ్ళేమో ఖాళీ లేదంటున్నారు" అన్నారు. నేను ఆయనతో, "ఏమండీ! బాబాయే కలలో కనిపించి చెప్పారు. ఆయనే మార్గం చూపిస్తారు. నాకా నమ్మకం ఉంది" అన్నాను. ఆ రాత్రి ఇద్దరం పడుకున్నాము. మరునాడు ఉదయాన్నే 6గంటలకి వస్త్రలతలోని భజనబృందం వారు ఫోన్ చేసి, "మేము భజన చేయాల్సిన ఇంటివాళ్ళకేదో ఇబ్బంది వచ్చి హఠాత్తుగా ప్రోగ్రామ్ రద్దు చేసుకున్నారు. నలుగురైదుగురు భజన చేయమని మమ్మల్ని అడిగారు కానీ మొదటి ప్రాధాన్యత మీకే ఇవ్వాలనిపించింది. అందుకని మీకు ఫోన్ చేసాం నిరంజన్ గారూ(మావారి పేరు)" అని చెప్పారు. ఇంకేముంది బాబా చెప్పినట్లు వారంలోపే భజన జరిగిపోయింది. అలా బాబా మాచేత కోరి భజన చేయించుకున్నారు.


ఆ భజన బృందంవాళ్ళు ఒక బాబా విగ్రహం తీసుకొచ్చి భజన చేసారు. వాళ్ళు భజన అయిపోయాక ఆ విగ్రహం మా ఇంట్లోనే ఉంచి, "వారం రోజులు పూజలు చేసుకొండి. బట్టలు ఉంటే మార్చుకొండి. మీరు ఏది తింటే అది బాబాకి పెట్టండి. మీ ఇంటికి వచ్చిన అతిథిగా భావించండి" అని చెప్పి వెళ్లిపోయారు. నేను మొదటిరోజు బాబాకి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం అన్నం, రాత్రికి కూడా టిఫిన్ పెట్టాను. రెండవరోజు కూడా అలాగే చేసాను. మూడవరోజు రాత్రి ఇంకా టిఫిన్ పెట్టడానికి సమయం ఉంది. మా పిల్లలు రోజూ సంగీతం క్లాస్‌‌కి వెళ్లారు. నేను రోజూ వాళ్ళని పక్క సందులోనే ఉన్న సంగీతం క్లాసు వద్ద దింపి వస్తాను. ఆరోజు వాళ్ళని క్లాసులో దింపేసి, నేనొక్కదాన్నే తిరిగి నడుచుకుంటూ వస్తుంటే, ఒక ముసలాయన నా ముందుకు వచ్చి, "ఈ పూటైనా అన్నం పెడతావా? టిఫినే పెడతావా?" అని అడిగి నేను సమాధానం చెప్పే వ్యవధి కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. ఆ ముసలాయన్ని నేను అంతకుముందుకానీ, తర్వాతకానీ చూడలేదు. ఇంతకీ విషయమేమిటంటే, నేను రాత్రి బాబాకి టిఫిన్ అయితే బాగుంటుందని ప్రత్యేకించి టిఫిన్ చేసి పెడుతున్నాను. నేను ఆ ప్రసాదాన్ని కొంచెం తిని అన్నం తింటున్నాను. ఆ ముసలాయన అలా అడిగినంతనే నేను గబగబా ఇంటికి వచ్చేసి రెండు చెంబులు నీళ్లు పోసుకుని అన్నం, కూరలు వండి బాబాకి నైవేద్యం పెట్టాను. మిగిలిన నాలుగు రోజులు కూడా అన్నమే పెట్టాను. అలా టిఫిన్ పెడ్తుంటే వద్దని, నేను ఏది తింటే తమకీ అదే కావాలని అన్నం పెట్టించుకుని తిన్నారు బాబా.


తరువాయి భాగంలో మరికొన్ని అనుభవాలు...

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo