ఈ భాగంలో అనుభవం:
- బాబా మాట విని పాటిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు
భక్తులందరికీ నమస్కరం. నా పేరు నవీన్. నేను ఇప్పుడు ఇటీవలి బాబా నాకు ప్రసాదించిన ఒక అద్భుతమైన అనుభవం మీ అందరితో పంచుకుంటాను. 2025, డిసెంబర్ నెలాఖరులో మా అమ్మమ్మ పరమపదించారు. ఆవిడ కర్మాంతరాలు నెల్లూరులో జరిగాయి. ఆ కార్యక్రమానికి నేను వెళ్లాలని 2026, జనవరి 4వ తేదీ మద్యాహ్నం 2 గంటల ప్రాంతంలో హఠాత్తుగా నిర్ణయమైంది. మరుసటిరోజు కార్యక్రమాలకి అక్కడ ఉండాలంటే నేను అప్పటికప్పుడు బయలుదేరాల్సిన పరిస్థితి. కాబట్టి నేను ట్రైన్ లేదా బస్సులో వెళ్ళాలి. బస్సులో వెళదామంటే నడికుడి నుండి గుంటూరు వరకు ఒక బస్సు, అక్కడ నుండి ఇంకో బస్సు మారి చాలా ప్రయాణం చేయాలి. పోనీ ట్రైన్లో వెళదామంటే అది అంత అనుకూలమైన మార్గం కాదు, ఆ మార్గంలో రైళ్లు చాలా తక్కువ. ఉన్నవాటిలో శబరి అనే ట్రైన్ అందుబాటులో ఉన్నప్పటికీ నాకు రిజర్వేషన్ లేదు. మా అమ్మానాన్న, "ఏం కాదు. ఆ ట్రైన్కే వెళ్ళు, హాయిగా ఉంటుంది. జనరల్లో ఖాళీ లేకపోతే స్లీపర్లో ఎక్కి TTEతో మాట్లాడి నెల్లూరుదాకా టికెట్ వ్రాయించుకో" అని చెప్పారు. కానీ నాకైతే ఆ రైలు మీద అస్సలు నమ్మకం లేదు. ఎందుకంటే, ఆ రైలు కేరళ వెళ్తుంది. నాకు తెలిసినంతవరకు మామూలు సీజన్లోనే ఆ రైలు చాలా రద్దీగా ఉంటుంది. అలాంటిది ఇంకా ఇప్పుడు నడుస్తున్న అయ్యప్పస్వాములు సీజన్ సంగతి చెప్పాలా? రైలు అంతా చాలా రద్దీగా ఉంటుంది. అందుకని బస్సులో వెళదాం, సీట్ ఉంటుంది, ఇబ్బంది ఉండదని అనుకున్నాను. అయితే బయలుదేరడానికి సిద్ధమయ్యేముందు నాకు ఒక ఆలోచన వచ్చింది. అదేమిటంటే, "మనకి ఏది కరెక్టో బాబాకి తెలుసు. ఆయన్ని నాకు ఏది బెస్టో చెప్పమంటే, కరెక్ట్గా చెప్తారు కదా!" అని. వెంటనే నాకు తెలిసిన ఒక బాబా మిత్రుడిని, "నేను బస్సులో వెళ్లాలా? లేక శబరి ట్రైన్కి వెళ్లాలా? అని బాబాని అడిగి నాకు ఏ విషయం మెసేజ్ పెట్టండి. ఈలోపు నేను తయారవుతాను" అని చెప్పాను. అతను సరేనన్నారు. కాసేపటికి నేను తయారై ఫోన్లో మెసేజ్ చూస్తే. 'బాబా మిమ్మల్ని శబరికి వెళ్లమంటున్నారు' అని ఆ బాబా మిత్రుడు పెట్టిన మెసేజ్ కనపడింది. అది చూసి నేను ఆశ్చర్యపడ్డాను. ఆ ట్రైన్కి రిజర్వేషన్ లేదు. పైగా ఫుల్ రష్ సీజన్. మరి బాబా ఎందుకిలా చెప్పి ఉంటారనుకున్నాను. అయినాసరే, బాబా చెప్పారు కాబట్టి ఆయనే సీటు ఇప్పిస్తారు. ఆయనే స్వయంగా వచ్చి భక్తులకు సీటు ఇచ్చిన ఎన్నో అనుభవాలు చూసాను కదా! ఆయన ఏదో ఒకటి చేస్తారులే అని ఆయన మీద నమ్మకంతో నేను శబరి ట్రైన్కే వెళదామని నిశ్చయించుకున్నాను. అదే విషయం మా నాన్నకి చెప్తే, ఆయన సరేనని నన్ను రైల్వేస్టేషన్ వద్ద దింపడానికి స్టేషన్కి వచ్చారు. అప్పుడు అంతా నా మనసులో 'సీటు ఉంటుందో, లేదో, 6 గంటలపైన ప్రయాణం' అని ఒకటే ఆలోచనలు. దాంతో ఉండబట్టలేక బాబాని 'స్లీపర్ కోచ్ ఎక్కమంటారా?' అని అడిగాను. దానికి బాబా వద్దన్నారు. బాబా ఇలా అంటున్నారు ఏమిటి అని మళ్ళీ ఆశ్చర్యపడ్డాను. అంతలో, "నేను ఉండగా నువ్వు ఇతరులను(TTE) అడగడం ధేనికి? నేనే నీకు ఇస్తాను" అని బాబా అంటున్నట్లు నా మనసుకి స్ఫురించింది. ఆ విషయం బాబా మిత్రునికి చెప్తే, తను కూడా "బాబా చూసుకుంటారులే" అని భరోసా ఇచ్చారు. ఇలా టెన్షన్ నడుస్తుండగా ట్రైన్ వచ్చింది. నేను అనుకున్నంత రద్దీ లేకపోయినా జనం అయితే ఉన్నారు. దాదాపు ట్రైన్లో ఉన్న సీట్లన్నీ ఫుల్ అయి ఉన్నాయి. నేను ట్రైన్ ఎక్కి ఒక దగ్గర సీటు ఖాళీ ఉంటే అక్కడ కూర్చుందామనుకొనే లోపు ఒక ఆమె అక్కడ కూర్చుంది. నేను ఇంకా ఎక్కడ కూర్చుందామా అని చూస్తూ అక్కడే నిల్చున్నాను. ఇంతలో రైలు కదిలింది. నా వెనక సీటులో ఉన్న అతను నన్ను పిలిచి, "నేను దిగుతున్నాను. మీరు కూర్చోండి" అని సీటు ఇచ్చారు. నేను, "సూపర్ బాబా! పిలిచి మరీ సీటు ఇచ్చారు కదా!" అని చాలా ఆనందపడిపోయాను. ఇది బాబా దయకాకపోతే మరేంటి? రద్దీ సీజన్లో పిలిచి మరీ సీటు ఇవ్వడం ఏమిటీ? అంతా బాబా అనుగ్రహమే అని నాకు అర్థమైంది. ఈ విషయం నేను వెంటనే నా మిత్రుడికి మెసేజ్ పెడితే, "నేను ఇప్పుడే బాబాతో 6 గంటల ప్రయాణం, తనకి సీటు దొరికేలా చూడండి అని చెప్పుకున్నాను. రెండు నిమషాలు అయిందో, లేదో మీ మెసేజ్ సాయి. అది చూసి నాకు చాలా ఆనందమేసింది" అని చెప్పారు. మేమిద్దరమూ బాబాని నమ్మితే ఫలితం ఇంత అద్భుతంగా ఉంటుందని చాలా ఆనందించాము. ఇంకా ప్రయాణం అంతా బాగా జరిగింది. రైలు కాస్త ఆలస్యమై నేను నెల్లూరు చేరుకునేసరికి రాత్రి 11 గంటలు అయింది. నేను అక్కడినుండి వెళ్లాల్సిన ప్రదేశం సిటీకి చాలా దూరంలో, చాలా నిర్మానుష్యంగా ఉంటుంది. అటువంటి ప్రదేశానికి వెళ్ళడానికి ఆటో దొరుకుతుందో, లేదో అని ఆందోళన చెందాను కానీ, 'బాబా చూసుకుంటారులే' అని అనుకున్నాను. బాబా దయవల్ల రాపిడోలో చూస్తే, వెంటనే ఆటో బుక్ అయింది. హాయిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను చేరాల్సిన గమ్యం చేరుకున్నాను.
బాబాను నమ్మితే, ఆయన మాట విని పాటిస్తే మనకి ఇబ్బంది లేకుండా ఎంతటి ఫలితాలు వస్తాయో తెలియపరచడానికి నా ఈ అనుభవం ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. కేవలం ఒక రైలు ప్రయాణంలో బాబా చెప్పిన మాట విని పాటిస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా గడిచిపోయిందే, అదే ఆయన చెప్పిన ప్రతి మాట పాటిస్తే, మనం ఎంత మేలు పొందుతామో వేరే చెప్పాల్సిన పని లేదు. మనమంతా మన జీవితంలో చాలా విషయాలకి వ్యక్తుల మీద ఆధారపడుతుంటాం. నిజానికి వాళ్ళు మనకి అంతగా సహకారం అందిస్తారో, లేదో తెలియదు. అదే మనం వ్యక్తుల మీద ఆధారపడకుండా బాబా మీద ఆధారపడితే, ఆయన ఎంతో అద్భుతంగా అనుగ్రహిస్తారు. బాబా మనల్ని ఎన్నుకొని భక్తులుగా చేసుకోవడం మన జన్మజన్మల సుకృతం. అంత అద్భుతమైన వరాన్ని ఎవరూ వృధా చేసుకోవద్దు. ఎక్కడో మనకి అందనంత దూరంలో ఉండే మహావృక్షం నీకు సదా నీడనిచ్చి కాపాడుతానని మన ఇంటికే వస్తే, మనం ఆ నీడ నుండి బయటపడాలనుకుంటే మన అంత మూర్ఖులు ఎవరూ ఉండరు. బాబాపట్ల భక్తి పదింతలు ఉంటే వందింతలుకు, 1000 రెట్లు ఉంటే 10000 రెట్లుకు పెంచుకోవాలని, బాబా ప్రేమిని, ఆయనిచ్చిన సేవా భాగ్యాన్ని జాగ్రత్తగా ఆయనకోసం వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
చివరిగా ఒక మాట: "ఎవరైతే నన్నే నమ్మి నా ధ్యానమునందే మునిగివుంటారో వారి పనులన్నియు సూత్రధారినై నేనే నడిపిస్తాను" అని బాబా అన్న మాట అక్షర సత్యం. ఆయనని నమ్ముకుంటే ఇప్పుడే కాదు, ఎప్పటికీ తోడుగా ఉండి నడిపిస్తూ ఉంటారు. అలా ఆయన మనల్ని నడిపించాలంటే మనకి ఆయన పట్ల గట్టి నమ్మకం ఉండాలి. బస్సు లేదు రైలు ప్రయాణంలో డ్రైవర్ మీద నమ్మకంతో నిశ్చింతగా నిద్రపోయినట్టు మన జీవిత ప్రయాణంలో బాబాను నమ్మాలి. నమ్మితే, ఎటువంటి స్పీడ్ బ్రేకర్స్ లేకుండా మన ప్రయాణం బాబానగరి అనే శాశ్వత ముక్తిదామంకి చేరుకుంటుంది. అదే మన లక్ష్యం.
సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై

