నా పేరు ఛత్రపతి. నేను ఎప్పటినుంచో సాయిబాబా భక్తుడిని. జీవితంలో ఎన్నో సందర్భాల్లో నేను ఆయన కృపను అనుభవించాను. కానీ నా జీవితాన్ని పూర్తిగా మార్చిన రెండు అనుభవాలు మాత్రం ఎప్పటికీ మరచిపోలేను. అవి తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనం మరియు నాకు దక్కిన ఉద్యోగం. చిన్నప్పటినుంచి నాకు దేవుడంటే భక్తి ఉన్నా విచిత్రంగా తిరుమల వెళ్లి స్వామివారిని తరచూ దర్శించుకోవాలనే కోరిక మాత్రం అంతగా ఉండేది కాదు. బహుశా అందుకు సమయం రాకపోయి ఉండొచ్చు లేదా స్వామి పిలుపు లేకపోయి ఉండొచ్చు. అయితే 2025 చివర్లో ఒక్కసారిగా నా మనసులో 'ఎలా అయినా వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకోవాల'ని తపన మొదలైంది. కానీ ఆ సమయంలో నా జీవితంలో చాలా అనిశ్చితి నడుస్తోంది. ఉద్యోగ మార్పుకోసం ప్రయత్నాలు, భవిష్యత్తుపై భయం. ఇలాంటి స్థితిలో నేను తిరుపతి ఎలా వెళ్లాలి? ఏమీ తెలీదు, టికెట్లు ఎలా దొరుకుతాయి? ఒంటరిగా ఎలా ప్రయాణం చేయాలి? అని ఆలోచనలు సాగాయి. కానీ ఒక నమ్మకం మాత్రం గట్టిగా ఉంది – 'బాబాను నమ్ముకుంటే ఆయన ఎప్పుడూ చేయి వదలరు' అని. తిరుమల దర్శనం టికెట్ల కోసం వెబ్సైట్ ఓపెన్ చేసే ముందు, “బాబా! ఎలా అయినా దర్శనం టికెట్లు దొరికేలా అనుగ్రహించండి” అని బాబాను వేడుకున్నాను. కొన్ని క్షణాల్లోనే టికెట్ బుక్ అయింది. అది బాబా లీల కాకపోతే ఇంకేంటి? అయితే హడావుడిలో నేను నా ఫ్రెండ్కి టికెట్ బుక్ చేయలేకపోయాను. అప్పుడే అర్థమైంది స్వామి నన్ను ఒంటరిగా రమ్మన్నారని. అయితే అంతకుముందు ఎన్నడూ ఒంటరిగా అంత దూరం వెళ్లనందున భయం వేసింది. “ఎలా వెళ్తాను? ఎలా దర్శనం జరుగుతుంది?” అని ఎన్నో సందేహాలు. కానీ మళ్లీ బాబానే గుర్తొచ్చారు. “బాబా! నువ్వే తీసుకెళ్లాలి. నువ్వే దర్శనం చేయించాలి” అని హృదయపూర్వకంగా ప్రార్థించాను. తర్వాత జరిగిన ప్రతి విషయం ఆయన కృపే. ప్రయాణం ఎంతో సాఫీగా జరిగింది. తిరుమల చేరిన క్షణం నుంచి నా హృదయం వర్ణించలేని ఆనందంతో నిండిపోయింది. స్వామివారి దర్శనం అయినా క్షణాన నా కళ్లలో నీళ్లు ఆగలేదు. అది కేవలం దర్శనం కాదు – నా జీవితానికి దైవం ఇచ్చిన ఒక కొత్త ఆశీర్వాదం.
తిరుమల టికెట్లు దొరికిన కొద్ది రోజులకే ఒక కంపెనీ నుంచి నాకు కాల్ వచ్చి, ఇంటర్వ్యూ షెడ్యూల్ అయ్యింది. ఇంటర్వ్యూ జరిగేరోజు నేను ఎప్పటిలాగే 'సాయి సచ్చరిత్ర' నా పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే, నాకు ఎప్పుడూ అనిపించేది ఒక్కటే – 'బాబా నా పక్కన ఉంటే నాకు భయం ఉండదు' అని. సరే, మనసులో బాబాపై నమ్మకంతో ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. మాటల్లో ఆత్మవిశ్వాసంతో ఎంతో ధైర్యంగా సమాధానాలు చెప్పాను. బాబా దయతో ఆ ఉద్యోగం కన్ఫర్మ్ అయింది. నేను ఊహించిన దానికంటే ఎక్కువ జీతం కూడా. ఆ క్షణంలో నా మనసు కృతజ్ఞతతో నిండిపోయింది. కానీ ఆఫర్ లెటర్ రావడానికి చాలా ఆలస్యం అయింది. అప్పుడు 'ఏదైనా సమస్య వస్తుందా?' అని భయంతో ప్రతిరోజూ ఆందోళనగా ఉండేది నాకు. ఆ రోజుల్లో నేను ప్రతిరోజూ, “బాబా! ఎలా అయినా ఈ ఉద్యోగం నా చేతికి రావాలి" అని బాబాని ప్రార్థిస్తూ ఉండేవాడిని. ఆయన నా ప్రార్థన విన్నారు. ఒకరోజు అనుకోకుండా ఆఫర్ లెటర్ వచ్చింది. అంతటితో అయిపోలేదు. బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ సమయంలో ఎన్నో అడ్డంకులు వచ్చాయి. నేను ముందు పని చేసిన కంపెనీ నుంచి కన్ఫర్మేషన్ మెయిల్ రావాల్సి ఉండగా ఎంత ప్రయత్నించినా పని కాలేదు. నేను పూర్తిగా అలసిపోయాను. కానీ ఆ సమయంలో నాకు తోడుగా నిలిచింది ఒక్కటే – 'సాయి నామస్మరణ'. ప్రతిరోజూ 'ఓం శ్రీసాయిరాం' అని జపిస్తూ బాబాపై భారం వేసాను. చివరికి ఆయన కృపతో అన్ని వెరిఫికేషన్లు పూర్తై నాకు ఆ ఉద్యోగం కన్ఫర్మ్ అయింది. సాధారణంగా నోటీస్ పీరియడ్లో ఉన్నప్పుడు కంపెనీలు సెలవులు లేదా ఇంటి నుండి పని చేసుకొనే వెసులుబాటు ఇవ్వవు. కానీ కొన్ని వ్యక్తిగత అవసరాల వల్ల నాకు అది చాలా అవసరం అయ్యింది. అది సాధ్యం అవుతుందో, లేదో తెలియని పరిస్థితిలో నేను బాబాని ప్రార్థించాను. ఆశ్చర్యంగా సాధారణంగా సాధ్యం కానిది ఎంతో సులభంగా సాధ్యమైంది. ఇకపోతే, నేను కొత్త ఉద్యోగంలో 2026, ఫిబ్రవరి 27న జాయిన్ అవ్వాల్సి ఉండగా అప్పటికి నేను పని చేస్తున్న కంపెనీ నోటీస్ పీరియడ్ ప్రకారం మార్చి 6 వరకు పని చేయాల్సి ఉంది. అందువల్ల 'పాత కంపెనీ నుంచి రిలీవింగ్ ఎలా వస్తుంది? 27న కొత్త ఉద్యోగంలో ఎలా చేరాలి? కొత్త అవకాశం కోల్పోతానా?' వంటి ఆలోచనలతో
నేను చాలా ఒత్తిడికి లోనయ్యాను. ఎన్నో రోజులు నాకు నిద్రపట్టలేదు. ఆ సమయంలో నేను బాబా పాదాల దగ్గర నా బాధను చెప్పుకొని, “బాబా! ఈ సమస్యను మీరే తీర్చాలి” అని ప్రార్థించాను. అంతే! పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. చర్చలన్నీ సానుకూలంగా జరిగి అనుకున్న సమయానికి నన్ను రిలీవ్ చేసారు. తర్వాత కొత్త ఉద్యోగం కోసం కొత్త ప్రదేశానికి వెళ్లాల్సి ఉండగా 'అక్కడ మంచి PG దొరుకుతుందా? భోజనం బాగుంటుందా? కొత్త ప్రదేశంలో నేను అలవాటు పడగలనా?” అన్న ఆందోళన మొదలైంది. నేను మళ్లీ బాబాను, “నాకు మంచి వాతావరణం ఉండే PG దొరకాలి. ప్రశాంతంగా ఉండగలిగే చోటు ఇవ్వు బాబా” అని ప్రార్థించాను. బాబా దయవల్ల నాకు మంచి PG దొరికింది. భోజనం కూడా బాగుంది. కొత్త ప్రదేశంలో కూడా నాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకున్నారు బాబా. కొత్త కంపెనీలో చేరిన తర్వాత నాకు రావాల్సిన రిలొకేషన్ అమౌంట్ చాలా రోజులపాటు రాలేదు. నేను ప్రతిరోజూ ఆ డబ్బుల కోసం అకౌంట్ చెక్ చేస్తూ ఆందోళనపడుతూ చివరికి బాబాకి నా బాధ చెప్పుకున్నాను. కొన్ని రోజుల తర్వాత అనుకోకుండా ఆ అమౌంట్ నా అకౌంట్లో క్రెడిట్ అయింది. ఆరోజు నేను ఆలస్యమైనా బాబా ఎప్పుడూ అన్యాయం చేయరని గ్రహించాను. నేను ఈరోజు నాకు నచ్చిన చోట, నాకు ఇష్టమైన పనిని ప్రశాంతంగా చేసుకుంటున్నానంటే, అది నా ప్రతిభ మాత్రమే కాదు. అది బాబా దయ, వెంకటేశ్వరస్వామి ఆశీర్వాదం. కొన్ని సందర్భాల్లో మనం ఒంటరివాళ్లమని అనిపిస్తుంది. దారులు మూసుకుపోయినట్లు కనిపిస్తాయి. కానీ మనం నిజమైన భక్తితో దేవుని నమ్ముకుంటే, ఆయన మన జీవితాన్ని అందంగా రాస్తాడు.
నేను చెన్నై, పాత కంపెనీలో ఉన్న రోజుల్లో నా ఉద్యోగ విధులతో బిజీగా గడుస్తున్న సమయంలో ఒకరోజు రాత్రి అకస్మాత్తుగా నేను ఉండే PG(హాస్టల్)లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొద్దిసేపట్లో వస్తుందనుకున్నాం కానీ, గంటల సమయం గడిచినా రాలేదు. నేనేమో చాలా ముఖ్యమైన పని పూర్తి చేయాల్సి ఉండగా ల్యాప్టాప్లో ఛార్జింగ్ అయిపోతుంది, ఫోన్ బ్యాటరీ తగ్గిపోతోంది, మరోపక్క వేడి, ఉక్కపోతలతో రాత్రంతా చాలా ఇబ్బందిగా గడిచింది. 'మర్నాడు సమస్య తీరుతుందేమో!' అని అనుకున్నాను కానీ, మరుసటిరోజు కూడా అదే పరిస్థితి. PG ఓనర్ "ఎప్పుడు పవర్ వస్తుందో చెప్పలేం" అన్నారు. అది విని నాకు చాలా నిరాశ కలిగింది. పని ఎలా పూర్తి చేయాలి? ఏమి చేయాలి? అనే ఆందోళన ఎక్కువైంది. అప్పుడు నాకు గుర్తొచ్చింది ఒక్కరే — నా సాయిబాబా. మనస్పూర్తిగా ఆయనను, “బాబా! ఈ సమస్య నుంచి నన్ను బయటపడేయండి” అని బాబాను వేడుకున్నాను. అలా బాబాను ప్రార్థించిన కొద్దిసేపటికి పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఎన్నో గంటలుగా రాని పవర్ తిరిగి వచ్చింది. నా పని కూడా ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తయ్యింది. అది చాలామందికి చిన్న విషయం అనిపించొచ్చు కానీ, నాకు మాత్రం అది మరోసారి బాబా నా పక్కనే ఉన్నారని తెలియజేసిన అనుభవం. మొత్తం ప్రపంచం దూరమైనా, సాయిబాబా మాత్రం తమ భక్తుడిని ఒక్క క్షణం కూడా ఒంటరిగా వదలరు.
ఒకసారి హఠాత్తుగా నేను మా ఇంటి నుంచి చెన్నైకి తిరిగి వెళ్లాల్సిన అవసరం వచ్చింది. తత్కాల్లో ట్రైన్ టికెట్ దొరకడం చాలా కష్టం. ఎందుకంటే, ప్రతిసారీ తత్కాల్ కోట ఓపెన్ అయినా క్షణాల్లోనే టిక్కెట్లు అయిపోతున్నాయి. అందువల్ల నాకు టెన్షన్ పెరిగిపోయింది. ఆ సమయంలో మళ్లీ నేను, "బాబా! టికెట్ దొరికేలా అనుగ్రహించండి" అని బాబాను ప్రార్థించాను. ఆయన దయవల్ల అసాధ్యమనిపించిన టికెట్ దొరికింది.
సాధారణంగా కార్పొరేట్ సంస్థలలో వేరే వాళ్ళని తీసుకొస్తే కొంత డబ్బు బోనస్గా ఇస్తారు. 2025 చివరిలో మావూరి అమ్మాయి నాకు ఫోన్ చేసి, రిఫరెన్స్ అడిగితే నేను సరేనని వేరే టీంలో వేకెన్సీ ఉన్నందున కంపెనీలో పని చేస్తున్న ఒక స్నేహితురాలిని రిఫర్ చేయమని చెప్పాను. దానికి తను తనకి వచ్చే బోనస్లో సగం నాకు ఇస్తానని చెప్పింది. నేను సరేనన్నాను. తర్వాత 6 నెలలు గడిచాయి. బోనస్ తను ఇస్తుందని తెలుసు కానీ, ఒకవేళ ఇవ్వకపోతే అనే ప్రశ్న నన్ను సతమతం చేసింది. అలాగని అడిగితే స్నేహం పోతుంది. అందుకని, సమస్యను బాబా ముందు పెట్టి, "తను నాకు అమౌంట్ ఇచ్చేలా చూసి, మా స్నేహాన్ని కాపాడు స్వామీ" అని వేడుకున్నాను. బాబా దయవల్ల తను అమౌంట్ వేసింది. బాబాని నమ్ముకుంటే మన స్నేహాలు, బంధాలు పోకుండా ఆయనే కాపాడతారు. "ధన్యవాదాలు బాబా".
మొదట తిరుమల యాత్ర తర్వాత నా మనసులో స్వామివారి పట్ల భక్తి మరింత పెరిగింది. ఆ దర్శనం ఇచ్చిన ఆధ్యాత్మిక ఆనందం ఇంకా నా హృదయంలో ఉండగానే మరోసారి వెంకటేశ్వరస్వామి దర్శన భాగ్యం లభించింది. ఈసారి నా స్నేహితులతో కలిసి వెళ్లే అవకాశం వచ్చింది. ముఖ్యంగా ఉంజల్ సేవ టికెట్ దొరకడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. అయితే నా మనసులో చిన్న భయం కూడా ఉంది — 'ఈ యాత్ర కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా బాగా జరగాలి' అని. ఎప్పటిలాగే నేను నా బాబాను, “ఈ యాత్రను కూడా దయతో విజయవంతంగా పూర్తి చేయించు బాబా” అని ప్రార్థించాను. ఆయన కృపతో ప్రతి విషయం ఎంతో అందంగా జరిగింది. ప్రయాణం ప్రశాంతంగా సాగింది, దర్శనం ఎంతో దివ్యంగా జరిగింది, స్నేహితులతో గడిపిన ఆ క్షణాలు జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాలయ్యాయి. ఉంజల్ సేవలో స్వామివారిని చూసిన క్షణం నా హృదయం భక్తితో నిండిపోయింది. ఆరోజు నాకు అనిపించింది — బాబా ఆశీర్వాదం ఉండబట్టే స్వామివారి పిలుపు వచ్చిందని, లేకుంటే ఊరకే రాదని. ఈరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే, నా జీవితంలో జరిగిన ప్రతి చిన్న అద్భుతం వెనుక బాబా కృప స్పష్టంగా కనిపిస్తుంది. "అన్నిటికీ చాలా చాలా ధన్యవాదాలు బాబా".