సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

శ్రీపురుషోత్తం రఘునాథ్ అవస్థి - 1వ భాగం....



పూణేకు చెందిన పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి శ్రీపురుషోత్తం రఘునాథ్ అవస్థి ఉరఫ్ దాజీసాహెబ్ అవస్థి(B.A., LLB.) సాయిబాబా భక్తులలో ఒకరు. అతను సజ్జనుడు, సత్ప్రవర్తన గల గృహస్థుడు. నిరాడంబరత, పవిత్రత అతని శరీరంలో అణువణువునా జీర్ణించుకుపోయాయి. పెద్ద అధికారి అయి కూడా చాలా వినయశీలిత, దానగుణం కలవాడు, నిజమైన కర్మయోగి(నిస్వార్థంగా కర్తవ్యాన్ని నిర్వర్తించేవాడు), ఏకనిష్ఠ భక్తిమార్గపరుడు(మనసును వేరే వైపుకు మళ్లించకుండా కేవలం ఒకే ఒక దైవంపట్ల భక్తిప్రపత్తులు కలిగి, ఆ దైవమే తన సర్వస్వమని జీవించే వ్యక్తి). సాయిబాబా సన్నిధిలోకి వచ్చిన క్షణం నుంచే, ఆయనకు పరమ భక్తుడయ్యాడు అతను. భగవద్గీత అతనికి అత్యంత ఇష్టమైన గ్రంథం. ఇతను చేసిన గొప్ప సుకృతం ఏమిటంటే, ఒకవేళ ఇతను లేకపోయి ఉంటే, శ్రీ బి.వి.నరసింహస్వామి భారతదేశమంతటా బాబా తత్వాన్ని అంత స్థాయిలో ప్రచారం చేయగలిగేవాడు కాదు.


శ్రీ పి.ఆర్.అవస్థి 1870, ఫిబ్రవరి నెలలో ఒక సాంప్రదాయ కుటుంబంలో జన్మించాడు. అతను దాదాపు రెండు దశాబ్దాల పాటు ఎంతో యోగ్యులు, పవిత్రులు ఆయిన వ్యక్తుల సాంగత్యాన్ని పొందాడు. 6ఏళ్ళ వయసప్పుడు 'దేవ్ మమ్లత్‌దార్'గా ప్రసిద్ధి చెందిన సతారా మమ్లత్‌దార్ శ్రీయశ్వంత్ రావు భాస్కర్‌ అనే సత్పురుషుని దర్శించి, వారి చేతుల మీదుగా ఒక జామపండును ప్రసాదంగా పొందిన భాగ్యశాలి అతను. కొంతకాలానికి దేవ్ మమ్లత్‌దార్‌కి నాసిక్‌కు బదిలీ అయింది. అప్పుడు శ్రీఅవస్థి తండ్రి కూడా నాసిక్‌లోనే ఉన్నందువల్ల చిన్నవయసునుండే అవస్థికు తరచూ దేవ్ మమ్లత్‌దార్‌ను దర్శించుకుని, భద్రాచల శ్రీరామదాసు భక్తి వంటి వారి అద్భుతమైన భక్తి గురించి తెలుసుకునే అనేక అవకాశాలు లభించాయి. దేవ్ మమ్లత్‌దార్ ఎంతో దయ కలవారు; ఒక పేదవాని కొడుకు పెళ్ళికి ధన సహాయం చేసాడు. నిజానికి ఆ సమయంలో అతని వద్ద డబ్బు లేదు. అయినా డబ్బు సమకూరినప్పుడు తిరిగి జమచేయొచ్చనే ఉద్దేశంతో, తన ఆధీనంలో ఉన్న ప్రభుత్వ ఖజానా నిధులు ఇచ్చాడు. ఈ విషయం బయటకు పొక్కడంతో, ఎవరో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దాంతో కలెక్టర్ ఆకస్మిక తనిఖీకి వచ్చి ఖజానాను పరిశీలించి, ఆపై ఉన్న నగదు నిల్వలతో అకౌంట్స్ సరిచూచే ప్రయత్నం చేసారు. అవేవీ తెలియని దేవ్ మమ్లత్‌దార్ ఇంట్లో ప్రశాంతంగా తన దైనందిన కార్యక్రమాలతోపాటు పూజ చేసుకుంటున్నారు. పూజ తదితర పనులు పూర్తయిన తర్వాత, కలెక్టర్ లెక్కలను మరియు నగదు నిల్వను సరిచూశారని, రెండూ సరిగ్గా సరిపోయాయని ఆయనకు తెలిసి ఎంతో సంతోషించి లోటును భర్తీ చేసినందుకు తన ఇష్టదైవానికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఆయన పదవీ విరమణ చేసిన తర్వాత అత్యంత ధార్మిక జీవితాన్ని గడుపుతూ యువకులు, వృద్ధుల మనస్సులు ఎంతగానో ప్రభావితం చేసారు. ఆయన వల్ల అవస్థి చాలా ప్రభావితుడయ్యాడు. ముఖ్యంగా 1887-90 మధ్య, అంటే అతని 17 నుండి 20 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు దేవ్ మామ్లత్‌దార్ నాసిక్‌లో నిష్టాగరిష్ట ఏకాంత జీవితాన్ని గడుపుతున్నప్పుడు అవస్థి, అతని తండ్రి తరచుగా ఆయనను సందర్శించి, గణనీయమైన భక్తి  ప్రభావాన్ని పొందారు. ఇలా అవస్థి ఆధ్యాత్మిక జీవితానికి చాలా ముఖ్యమైన పునాది పడింది.


1889లో అవస్థి తన 19వ ఏట, ఒక వీధిలోని బజారు గుండా వెళ్తున్నప్పుడు అర అణాకు చిన్న భగవద్గీత ప్రతి దొరికితే దాన్ని కొని తన జేబులో జాగ్రత్తగా భద్రపరుచుకుని ప్రతిరోజూ తీరిక సమయాల్లో పఠింస్తుండటం అతని అలవాటుగా మారింది. ఆ అలవాటు అతని తరువాతి జీవితంలో చాలా మేలు చేసింది.

 

కొద్దికాలానికి అవస్థి కళాశాలలో చదువుతున్నప్పుడు జాన్ స్టువర్ట్ మిల్, స్పెన్సర్‌ల గురించి చేసిన అధ్యయనం అతని మనస్సుని పాశ్చాత్య దేశాలలో ప్రబలంగా ఉన్న సంశయవాదం, నాస్తికత్వం సులభంగా ఆకర్షించాయి. దాంతో అతను నాస్తికుడిగా, వాద స్వభావం గలవాడిగా, అహంకారిగా మారి ఉపన్యాసకుడిగా, వాదనాపటిమగలవాడిగా రాణించాలని, చాలా డబ్బు సంపాదించాలని కోరుకున్నాడు. అతనిని మునపటి భక్తి ప్రభావం విడిచిపెట్టినట్లే కనిపించింది. ఈ నాస్తికత్వం ఎనిమిది సంవత్సరాలు, అంటే 1890 నుండి 1898 వరకు కొనసాగింది. అయితే ఆ కాలంలో కూడా దైవ సంకల్పం వల్ల అతను గీతా పఠనం మానలేదు. అదికాక అతని నాస్తికత్వానికి ఎదురుదెబ్బలు తగిలే కొన్ని సంఘటనలు జరిగాయి.


ఒకసారి అతనికి శ్రీమద్భాగవతంకి సంబంధించిన ఒక కాగితం దొరికితే, దాన్ని తీసి చదివాడు. అందులోని శ్లోకాలలో వ్యక్తి దేవుని నుండి దారి తప్పి, మాయలో చిక్కుకున్నప్పుడు కలిగే ద్వైత భావన వల్ల భయం పుడుతుందని, అది వ్యక్తి యొక్క దైవ విచారణను(భగవదన్వేషణ) మరుగుపరిచి, దైవంలో ఐక్యం కాకుండా నిరోధిస్తుందని వర్ణించబడి ఉంది. 


మరోసారి ఒక అందమైన దక్షిణ భారత మహిళ శ్రీరాముని విగ్రహం ముందు నిలబడి, చక్కటి హావభావాలు ప్రదర్శిస్తూ తమిళంలోనో, తెలుగులోనో మీరాబాయి, ముక్తాబాయి, జానాబాయి మొదలైన వారిని ప్రస్తావిస్తూ పాడిన పాటలు సహజంగానే చాలా సున్నితస్తులైన శ్రీఅవస్థి మనసుని మునుపటిలా భక్తి యొక్క సౌందర్యాన్ని, ప్రయోజనాన్ని అనుభూతి చెందేలా చేసాయి.


ఇంకోసారి అవస్థి తన పెదనాన్న/చిన్నాన్న పిల్లలతో దేవుని ఉనికి గురించి తీవ్రమైన చర్చలో నిమగ్నమయ్యాడు. ఆ చర్చకు వాళ్ళు తమ మేనమామ అయిన శ్రీబాలభీమ ఠాకూర్‌దాస్‌ను న్యాయనిర్ణేతగా నియమించుకున్నారు కానీ, వాళ్ళు ఆయన్ని సంప్రదించకుండానే చర్చ సాగించారు. ఆ చర్చ అంతులేకుండా కొనసాగింది. వాళ్లలో ప్రతి ఒక్కరూ మరొకరిని ఓడించాలని, తమ వాదనే సరైనదని ఒప్పించేలా ప్రయత్నించారు. చివరికి అవస్థి కీర్తనలు, పురాణాలపై గొప్ప నమ్మకమున్న తమ మేనమామని సంప్రదించి, "సాధుసత్పురుషులు వర్ణించబడినంత గొప్పవారని నిజంగా, నిజాయితీగా మీరు నమ్ముతున్నారా? ఆ విషయంలో నాకు నమ్మకం కలిగించగలరా?" అని అడిగాడు. అప్పుడు అతని మేనమామ అతన్ని గుడి లోపల ఉన్న శ్రీరాముని విగ్రహం ముందుకి తీసుకెళ్లి, ‘పవిత్ర గ్రంథాలలో చెప్పబడిన ప్రతి మాటను తాను పూర్తిగా విశ్వసిస్తున్నానని, అటువంటి సత్పురుషులను కలుసుకునే భాగ్యం నీకు కలుగుతుందని ఆశిస్తున్నానని, ఆ సత్పురుషుని ద్వారా ప్రత్యక్ష అనుభవాన్ని పొందిన తరువాత, నువ్వు కూడా అదే నిశ్చయానికి వస్తావని’ గట్టిగా ప్రమాణం చేశాడు. అప్పుడు శ్రీఅవస్థి, "సశరీరులుగా ఉన్న కొందరు సత్పురుషుల పేర్లు చెప్పమ"ని అడిగాడు. అతని మేనమామ, (1) పలుస్‌కు చెందిన దొండి బూవా, (2) ఫల్తాన్‌కు చెందిన హరి మహారాజ్ మరియు (3) కొల్హాపూర్‌కు చెందిన శ్రీకుంభారస్వామి పేర్లను చెప్పి వీరిని సందర్శించి, పరీక్షిస్తే నమ్మకం కలుగుతుందని చెప్పి, వారిని కలుస్తాన్నన్న వాగ్దానం అతని వద్ద నుండి తీసుకున్నాడు. అదృష్టవశాత్తు శ్రీఅవస్థి పైన పేర్కొన్న ముగ్గురినీ భవిష్యత్తులో కలుసుకోగలిగాడు.


శ్రీఅవస్తే అతని మేనమామతో మాట్లాడిన తర్వాత డాక్టర్ బీసెంట్ మరియు డాక్టర్ రిచర్డ్‌సన్‌ల తత్వశాస్త్ర ఉపన్యాసాలకు హాజరై, తత్వశాస్త్రం(వేదాంతం), మత గ్రంధాలు చదివాడు. 1896వ సంవత్సరం చివరిలో పూనాలో ప్లేగు వ్యాధి ప్రబలింది. అప్పుడు అవస్థికి ప్రాణం, ఆస్తుల పట్ల కలిగిన ఆందోళన అతనిని దేవుని వైపు నడిపించింది. ప్లేగు వ్యాధి నుండి ఆశ్రయం కోసం అతను జ్ఞానేశ్వర్, ఏక్‌నాథ్, నామ్‌దేవ్, తుకారాం, రామదాస్ వంటి మహారాష్ట్ర సత్పురుషుల జీవిత చరిత్రలను భక్తిశ్రద్ధలతో చదవడం ప్రారంభించాడు. తార్గావ్‌లోని తన మేనమామ ఇంటికి వెళ్లి అక్కడ అందుబాటులో ఉన్న కృష్ణుడు మొదలైన అవతారపురుషల గురించిన పవిత్ర గ్రంథాలన్నీ ప్రతిరోజూ చదివాడు. అటుపిమ్మట అతను తన మేనమామను పలూస్‌లోని దొండి బూవా గురించి విచారించగా, పలూస్‌కు ఎలా వెళ్ళాలో చెప్పాడతను. దాంతో అవస్థి పలూస్‌కు వెళ్లి దొండి బూవా దర్శనం చేసుకోవాలని బయలుదేరాడు. అతను దారిలో భగవద్గీత చదువుతుండగా, సత్పురుషులు జ్ఞానాన్ని ప్రసాదిస్తారని చెప్పబడిన నాల్గవ అధ్యాయం, 34వ శ్లోకం వద్ద అకస్మాత్తుగా ఆగి, ఆ దొండి బూవా వద్ద ఈ విషయం పరీక్షించి, అతను తనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడో, లేదో తెలుసుకోవాలని నిశ్చయించుకున్నాడు. కానీ పలూస్‌లో ఒక ఆలయం వెలుపల కూర్చుని ఉన్న దొండి బూవాను చూసి ఆయన శూద్రుడని భావించాడు అతను. అందువల్ల ఆయనకి నమస్కరించడం ఒక బ్రాహ్మణునిగా తనకి సులువు అనిపించలేదు. బూవా అతనితో కటువుగా, "గుడి లోపలకి వెళ్లి నమస్కరించు" అని చెప్పారు. అతనికి అది సులభంగా అనిపించి లోపలికి వెళ్ళాడు. చూస్తే, అక్కడ పూజించబడుతున్నది అదే శూద్ర బూవా చిత్రపటం! అక్కడ వేరే ఏ విగ్రహం లేదు. దాంతో అతను బయట ఉన్న శూద్రుడే లోపల పూజించబడుతున్న దేవుడని గ్రహించాడు. ఏదేమైనా తన చేతిలో ఉన్న పువ్వులు, నైవేద్యాలు అక్కడ ఉంచి తన మనసులో ఉన్న సందేహాలతో తర్జనభర్జనపడుతూ అక్కడ రెండు గంటల సమయం గడిపాడు. తర్వాత బయటకు వచ్చి దొండి బూవాకు క్షమాపణ చెప్పి, "మీకు ఈ శక్తులు ఎలా వచ్చాయ"ని అడిగాడు. దానికి ఆయన, "అది చాలా సులభం. కేవలం 'రామ్, రామ్, రాజారామ్ సీతారామ్' అని స్మరిస్తుండు, సర్వం సిద్ధిస్తుంది" అని బదులిచ్చారు. ఆపై దొండి బూవా తనకూ, తన పరివారంకీ వంట చేయమని అవస్తేతో అన్నారు. తర్వాత ఇతరుల ఉప్పు తినడం, వారికి ఋణపడి ఉండటం ఇష్టం లేనందున దొండి బూవా స్వయంగా ఉప్పు అతనికి ఇవ్వడమే కాకుండా అవస్థి తయారుచేసిన వంటకాలలో తామే తమ ఉప్పు కలిపారు. ఇంత జరుగుతున్నా దొండి బూవాను తన గురువుగా స్వీకరించడానికి అవస్థి ఇష్టపడలేదు, ఆయన కూడా, "నేను ఎవరికీ గురువుగా ఉండాలనుకోవడం లేద"ని చెప్పి తమ ఆశీస్సులు అతనికి ఇచ్చారు. అవస్తే తిరిగి వచ్చేశాడు.


తర్వాత అవస్థి మనసులో ప్రశ్నలతో పరమహంస(జ్ఞానోదయం పొంది, ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థాయికి చేరిన వ్యక్తి) అయిన ఒక బ్రాహ్మణ గురువును కలిసి, “బ్రహ్మజ్ఞానం పొందవచ్చా?" అని అడిగాడు. ఆయన అతన్ని నేలపై పడుకోమని, ఆయన కూడా అతని పక్కన పడుకుని, "భయపడవద్దు" అని హెచ్చరించి అతని గొంతుపై చేయిపెట్టి గట్టిగా నొక్కేశారు. అతను భయపడి ఆయన పట్టు నుండి విడిపించుకోవడానికి ప్రయత్నించాడు. అప్పుడు ఆయన, "నువ్వు పిరికివాడివి. వెళ్ళిపో, నువ్వు బ్రహ్మజ్ఞానం పొందలేవు" అని అన్నారు.


తరువాయి భాగం వచ్చేవారం..


సోర్స్:- లైఫ్ అఫ్ సాయిబాబా బై బి.వి. నరసింహస్వామి

సాయిభక్తుల అనుభవమాలిక 2119వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • సంపూర్ణ విశ్వాసముంటే అన్ని అనుగ్రహిస్తారు బాబా

నా పేరు మాధవి. మేము అమెరికాలో ఉంటాము. నేను నా భర్తకోసం ఈ సంవత్సరం(2026) ఒక సర్‌ప్రైజ్ పుట్టినరోజు పార్టీ ప్లాన్ చేయాలని సంకల్పించి మొట్టమొదట బాబాను ఆహ్వానించి, 'అంతా సజావుగా జరిగేలా చూడమని, అలాగే చివరి క్షణం వరకు సర్‌ప్రైజ్‌నా భర్తకి తెలియకుండా రహస్యంగా ఉంచమని' ఆయనను కోరాను. తర్వాత అన్నీ ప్రణాళిక చేసి, నా భర్త స్నేహితులను ఆహ్వానించాను. వాళ్ళు మావారి పుట్టినరోజు రేపనగా ముందురోజు సర్ప్రైజ్ బయటపెట్టడానికి ప్రయత్నించారు కానీ, బాబా దయవల్ల బయటపడలేదు. అయితే మావారు మర్నాడు బయటకు వెళ్లాలని అన్నారు. నేను ఆయన్ని వెళ్లోద్దని చెప్పినా, ఆయన వినలేదు. చివరికి నేను అంతా బాబా పాదాల చెంత వదిలేశాను. బాబా దయవల్ల మావారు ఇంట్లోనే ఉండటానికి ఒప్పుకున్నారు. ఒకవేళ ఆయన బయటకు వెళ్లి ఉంటే, నా ప్రణాళిక మొత్తం దెబ్బతిని ఉండేది. మర్నాడు సాయంత్రం నేను ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఎట్టకేలకు వచ్చింది. ఆ సర్‌ప్రైజ్‌ను చూసినప్పుడు నా భర్త ముఖంలోని హావభావాలను చూసి నాకు చాలా సంతోషమేసింది. పార్టీ మొత్తం చాలా బాగా జరిగింది. పార్టీ అయిపోయిన తర్వాత నా భర్త చాలా సంతోషంగా, "నాకు ఈ పార్టీ గురించి ఏమాత్రం తెలీదు. ఇలా జరుగుతుందని నేను ఎప్పుడూ ఊహించలేద"ని నాతో చెప్పారు. "బాబా! మీ అనుగ్రహం లేకుండా ఇదంతా సాధ్యమయ్యేది కాదని నాకు తెలుసు. మీరు ఏదో ఒక రూపంలో నా భర్తని ఆశీర్వదించడానికి, అంతా చక్కగా జరిగేలా చూడటానికి వచ్చారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను బాబా. చాలా చాలా ధన్యవాదాలు బాబా".

మేము మా అమ్మ, నాన్నలను అమెరికాకు తీసుకొని రావాలని ప్రణాళిక చేసాము. కానీ మొదట మా నాన్నకి తన ఆఫీసులో అనుమతి లభించలేదు. నేను ఆశలన్నీ వదులుకున్నప్పటికీ సమస్యను బాబా పాదాల చెంత పెట్టాను. బాబా దయవల్ల ఆశ్చర్యకరంగా ఒక నెల సెలవు నాన్నకి మంజూరైంది. నేను సంతోషంగా చాలా ధన్యవాదాలు బాబాకి చెప్పుకొని, "మా అమ్మానాన్నలు సంతోషంగా ఇక్కడికి వచ్చి, ప్రశాంతంగా ఇక్కడంతా ఆస్వాదించాలి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్లాల"ని బాబాను ప్రార్థించాను. వాళ్ళు ఇక్కడున్న నెల రోజుల్లో మేము అనేక చోట్లకి పర్యటించాలని ప్రణాళిక చేసాము. ఆ క్రమంలో మేము న్యూయార్క్ వెళ్ళినప్పుడు, నా భర్త సెక్యూరిటీ చెక్ చేస్తున్న సమయంలో తన గాగుల్స్‌ అక్కడెక్కడో పొరపాటున పెట్టేసారు. ఆ సమయంలో ఆయన ఆఫీస్ కాల్‌లో మాట్లాడుతున్నందువల్ల వాటిని అక్కడే వదిలేశానని గమనించుకోకుండా వచ్చేసారు. తర్వాత ఆయన అవి ఎక్కడో పోయాయని గుర్తించారు. ఆ గాగుల్స్ చాలా ఖరీదైనవి, మరీ ముఖ్యంగా అవి పుట్టినరోజు బహుమతిగా తన స్నేహితులు తనకి ఇచ్చినవి. అందువల్ల నాకు చాలా బాధగా అనిపించి, 'బహుశా నేను ఆయన పుట్టినరోజున ఏదైనా తప్పు చేశానేమో! లేదంటే మనస్ఫూర్తిగా ఆ బహుమతి ఇవ్వలేదేమో!' అని ఎన్నో ఆలోచనలు నా మనసులో మెదిలాయి. చివరకి నేను, “బాబా! ఆయన స్నేహితులు ఆ కానుకను మనస్ఫూర్తిగా ఇవ్వకపోయుంటే, ఆ గాగుల్స్ పోయినా ఫర్వాలేదు. కానీ వాళ్ళు మనస్ఫూర్తిగా ఇచ్చి ఉంటే, దయచేసి ఎలాగైనా ఆ గాగుల్స్ మావారి దగ్గరకి తిరిగి వచ్చేలా చేయండి” అని బాబాను ప్రార్థించి సర్వం వారి పాదాల చెంత ఉంచి, పూర్తిగా శరణాగతి చేశాను. ఆ తర్వాత బాబా చేసిన అద్భుతం చూడండి! నా భర్త వెనక్కి వెళ్లి భద్రతా సిబ్బందిని ఆ గాగుల్స్ గురించి అడిగితే, 'వాళ్ళకి అవి దొరికితే, భద్రంగా పక్కన పెట్టి, ఎవరైనా వచ్చి వాటిని తీసుకెళ్తారా అని ఎదురుచూస్తున్నామని' చెప్పి మావారికి ఇచ్చారు. మనం సంపూర్ణ విశ్వాసంతో ప్రతిదీ బాబా పాదాల చెంత ఉంచినప్పుడు, ఆయన తనదైన రీతిలో అన్నింటినీ చూసుకుంటారు. "మీకు చాలా ధన్యవాదాలు బాబా".

మేము న్యూయార్క్‌ పర్యటనలో భాగంగా ఒక చోటకి వెళ్లి, అక్కడినుండి తిరిగి వచ్చేటప్పుడు ఏ రైలు ఎక్కాలో తెలుసుకోవడానికి రద్దీగా ఉండే అంత పెద్ద నగరంలో రైళ్ల గురించి సరైన సమాచారం తెలుసుకోవడానికి చాలా ఇబ్బందిపడ్డాము. అదే సమయంలో మా నాన్నకి అత్యవసరంగా మూత్రవిసర్జన చేయాల్సిన అవసరం వచ్చింది. ఆయన షుగర్ వ్యాధిగ్రస్తులైనందున తరచుగా బాత్రూంకి వెళ్లాల్సి ఉంటుంది. కానీ దాదాపు గంటసేపు వెతికినా ఒక్క టాయిలెట్ కూడా కనపడలేదు. నాన్న నడవడానికి చాలా ఇబ్బందిపడ్డారు. ఆయన్ని నేను అంతకు ముందెన్నడూ ఆ స్థితిలో చూడని నేను  ఆయన అంతలా ఇబ్బందిపడటం చూడలేకపోయాను. ఆయన విలవిలలాడటం చూసి నా కళ్లలో నీళ్లు తిరిగాయి. నాకు చాలా నిస్సహాయంగా అనిపించి, "బాబా! నాన్న ఇలా బాధపడటం నేను చూడలేకపోతున్నాను. దయచేసి మాకు సహాయం చేయండి" అని బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల 15 నిమిషాల తర్వాత మాకు ఒక టాయిలెట్ కనిపించింది. "చాలా ధన్యవాదాలు బాబా. నేను ఎప్పుడూ మా అమ్మానాన్నల ఆరోగ్యం గురించి చింతిస్తూ ఉంటాను. దయచేసి వారిని జాగ్రత్తగా చూసుకోండి బాబా. దయచేసి వారిని ఎల్లప్పుడూ సురక్షితంగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉంచండి".

నేను ఈ అనుభవాలన్నిటి ద్వారా బాబాకు సంపూర్ణంగా శరణాగతి చెందడం వల్ల ఎంత మేలు జరుగుతుందో, శరణాగతి మహిమ ఏమిటో అర్థం చేసుకున్నాను.  ఇంకా ఈ అనుభవాలు నా విశ్వాసాన్ని బలపరిచి, బాబా ఎల్లప్పుడూ మనతోనే ఉంటారని నాకు బోధించాయి. బాబా మన ప్రార్థనలను ఆలకిస్తారు, మన చింతలను అర్థం చేసుకుంటారు, మనం ఊహించని రీతులలో మనల్ని ఆదుకుంటారు. ప్రియ భక్తులారా, మనం మన సర్వస్వాన్ని బాబా పాదాల చెంత మనస్ఫూర్తిగా సమర్పించినప్పుడు, మనం ప్రగాఢమైన శాంతిని అనుభూతి చెందగలము. "ధన్యవాదాలు బాబా. దయచేసి మీ భక్తులందరిపై మీ ఆశీర్వాద హస్తాన్ని ఎల్లప్పుడూ ఉంచండి. మీకు పూర్తిగా శరణాగతి చెందేందుకు, మీపై అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉండేందుకు మాకు శక్తిని ప్రసాదించండి".

సాయిభక్తుల అనుభవమాలిక 2118వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా చూపిన కరుణ
2. తలచిన వెంటనే పలికే దైవం ఆ సాయినాథుడు

బాబా చూపిన కరుణ

సాయి భక్తులకు నమస్కారాలు. ఒకప్పుడు నా భర్త ఒకరికి షూరిటీ సంతకం చేశారు. వాళ్ళు మోసం చేయడంతో మాకు అప్పులు ఎక్కువై నా భర్త మద్యానికి బానిస అయ్యారు. మేము ఉంటున్న ఇల్లు అమ్ముకొని బయటికి వచ్చాము. కానీ అప్పులు పూర్తిగా తీరలేదు. నేను ప్రైవేట్ స్కూల్లో పని చేస్తున్నందువల్ల నా జీతంతో ఇల్లు నడుస్తుండేది. మాకు ఇద్దరు పిల్లలు. ఒక పాప, ఒక బాబు. పాప ఇంటర్ అయిన సంవత్సరం మా పెద్ద ఆడబిడ్డ కూతురి పెళ్లి జరిగింది. ఆ సమయంలో వాళ్ళు నన్ను చాలా మాటలు అన్నారు, 'నా కూతురి పెళ్లి చేయడం గురించే కాకుండా తనని పనికి పంపి జీవనం సాగించు' అని. ఈవిధంగా బంధువులందరూ ఏదో ఒక మాట అంటుండేవారు. నాకు భయంగా ఉండేది. నేను స్కూలుకి వెళ్లే దారిలో 'SAI VEN' అని ఒక ఫంక్షన్ హాల్ ఉంది. అక్కడ పెళ్లి జరుగుతుంటే నా మనసుకి, 'బాబా! నేను నా కూతురికి పెళ్లి చేయగలనా? నా దగ్గర ఏమీ లేదు. ఇంకా అప్పులు ఉన్నాయి. నా భర్తకి బాధ్యత లేదు. పిల్లల్ని ఇంకా చదివించాలి' అని అనిపించి ఏడుపు వచ్చేది. బాబా దయవల్ల పాప ఇంటర్ పూర్తి చేసింది. తర్వాత డిగ్రీలో చేరింది. రెండు సంవత్సరాల తర్వాత అపోలోలో నర్సింగ్ ట్రైనింగ్ తీసుకొని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా చేరి నాకు కొంత సహాయంగా ఉండేది. ఆరునెలలు చేసిన తర్వాత 'హాస్పిటల్ దూరమని, ఆడపిల్ల సంపాదన మీద పడి ఉన్నారని' మా తోడికోడలు, అత్తగారు మావారికి చెప్పి పాపని హాస్పిటల్‌కి వెళ్లకుండా మాన్పించారు. దాంతో మా పాప మనసు కొంచం బాధపడి, ఓదార్పుకోసం మా అమ్మ వాళ్ళింటికి వెళ్లింది. అక్కడ బాబా తమ కరుణ మా మీద కురిపించారు. హఠాత్తుగా మా తమ్ముడి స్నేహితుడు మా అమ్మాయిని చూసి, ఇంటికెళ్లి మాట్లాడుకొని 'అమ్మాయిని తన తమ్ముడికి ఇస్తారా?' అని అడిగారు. ఆవిధంగా అమ్మాయికి పెళ్లిసంబంధం కుదిరింది. కానీ నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. బాబా మీద భారం వేసాను. ఎలా సర్దుబాటు అయ్యాయో కానీ, డబ్బులు సర్దుబాటు అయి వారంలోపు బాగా గ్రాండ్‌గా నిశ్చితార్థం జరిగింది. పెళ్లి మగ పెళ్లివాళ్ళు చేసుకున్నారు. మా అమ్మాయి పెళ్లి జరుగుతుందా అనుకుంటే బాబా దగ్గరుండి ఎంతో వైభవంగా జరిపించారు. తలుచుకుంటే, నాకు ఎప్పటికీ కలగలాగే అనిపిస్తుంది.

ఇకపోతే, నేను అమ్మాయి పెళ్లి అప్పుడు సత్యనారాయణస్వామి వ్రతం చేయించాలని అనుకున్నాను. కానీ మా వియ్యంకులవారు, "పెళ్లిలో వద్దు, తర్వాత చేద్దాం" అన్నారు. పెళ్లి అయిపోయిన తర్వాత చేద్దామంటే, పెళ్లికి చేసిన అప్పులు నెలనెలా కడుతూ ఉండటం వల్ల డబ్బులు సర్దుబాటు కాలేదు. అప్పుడు బాధగా బాబాని తలుచుకొని గుడిలో అయినా చేద్దామని అడిగితే, 'వెయ్యి రూపాయలు కడితే దంపతులు ఇద్దరు పీటల మీద కూర్చొని వ్రతం చేయవచ్చు' అన్నారు. నేను ఉన్న స్థితికి అది పెద్ద మొత్తమే అయినాసరే చేయిద్దామని మా అమ్మాయికి చెప్పాను. మా అమ్మాయివాళ్ళ మామగారు, మా అమ్మవాళ్లు అక్కడ వద్దు, ఇక్కడ సాయిబాబా గుడిలో చేయిద్దామని అన్నారు. అక్కడ సామూహికంగా చేస్తారు, నాకేమో కొత్త దంపతులు పీటల మీద కూర్చొని చేస్తే బాగుంటుందని. కానీ నేను ఏం చేయలేక, "సరే, మీ ఇష్టం" అని, వ్రతం కోసం 150 రూపాయలు పంపమంటే, పంపించాను. వ్రతం అయ్యాక మా అమ్మాయి నాకు ఫోటోలు పంపించింది. అవి చూసిన నాకు కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. నిజంగా బాబా మా మీద ఎంతో కరుణ చూపించారు. ఆరోజు వ్రతంలో మా అమ్మాయి,  అల్లుడు గుడికి వెళితే, కొత్త దంపతులని వాళ్ళిద్దరిని పీటల మీద కూర్చోబెట్టి, వాళ్ళ చేతుల మీదగా వ్రతం జరిపించారు. 1000 రూపాయలు పెద్ద మొత్తం నా దగ్గర లేనందున అప్పు చేయాల్సిన పరిస్థితి. బాబా ఆ అవసరం లేకుండా నా మనసులోని కోరిక తీర్చారు. బాబాకు నా మీద ఎంత దయ? ‌ఎవరూ లేరని బాధపడుతున్నప్పుడు బాబానే నాకు తోడు అయ్యారు. నాకు అన్నీ ఆయనే. నేను ఆయన మీదే భారం వేసాను. నా జీవితాన్ని నడిపిస్తుంది బాబానే. "శతకోటి ధన్యవాదాలు బాబా. మా అమ్మాయి వివాహమై రెండున్నర సంవత్సరాలవుతుంది. వాళ్ళకి ఒక బిడ్డను ప్రసాదించు బాబా. మీ కరుణ వల్ల అబ్బాయి టెన్త్‌లో స్టేట్ ఫస్ట్ వచ్చాడు. బాబు కూడా బాగా చదివి మంచి ఉద్యోగంలో స్థిరపడేలా చూడు బాబా. నా భర్త తాగుడు మానేసి బాధ్యతగా ఉండేలా కరుణించు బాబా". 


గోవిందస్వామి – ఆదిలక్ష్మియమ్మ



మద్రాస్ నివాసి గోవిందస్వామి అలియాస్ భావుస్వామి 1915 ప్రాంతంలో మద్రాసు ఎలక్ట్రిక్ ట్రామ్‌వేస్‌లో పని చేస్తుండేవాడు. అప్పటికి అతనికి వివాహమై ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు. అతని భార్య పేరు ఆదిలక్ష్మియమ్మ. దక్షిణ కెనరా (దక్షిణ కన్నడ) ప్రాంతంలో నివసించే  'రామ్ భావు' అనే ఆయన అతని గురువు. ఆ కారణంగా అతనిని 'భావుస్వామి' అని పిలిచేవారు.

1915వ సంవత్సరంలో అతను తన కుటుంబంతో కలిసి భారతదేశ యాత్ర చేయాలని సెలవుపై బయలుదేరాడు. మార్గమధ్యంలో వాళ్ళు నాసిక్ వెళ్లి, అక్కడ ఉన్న శ్రీకాలారామ్ ఆలయంలో ‘నరసింగ్ మహారాజు’ను దర్శించి సేవించారు. ఆ మహరాజ్ వాళ్లతో, “శిరిడీ వెళ్ళి శ్రీసాయిబాబాను దర్శించుకోండి” అని సలహా ఇచ్చారు. ఆ మహరాజ్ సలహా ప్రకారం వాళ్ళు అక్కడి నుండి  శిరిడీ చేరుకున్నారు. 1915, ఆగస్టు 23(రాక్షసి నామ సంవత్సరం, ఆవని మాసం 6వ రోజు), ఉదయం 10:30 గంటలకు వాళ్ళు శిరిడీ చేరుకొని శ్రీసాయిబాబాను ప్రథమంగా దర్శించుకుని సంతుష్టులయ్యారు. ఆరోజు వారు మసీదులో శ్రీసాయిబాబా సన్నిధిలో భజన చేసారు, గోవిందస్వామికి 8 అణాలు కానుకగా ఇచ్చారు శ్రీసాయిబాబా.

శ్రీసాయిబాబా దర్బారు ఎంతో వైభవంగా ఉండేది. ఆయన సన్నిధిలో, అనేకమంది నర్తకీమణులు నాట్యం చేసేవారు. హరికథా కాలక్షేపాలు జరుగుతుండేవి. రకరకాల విన్యాసాలు ప్రదర్శించబడేవి. మసీదు వద్ద ఎప్పుడూ జనసందోహంతో కోలాహలంగా ఉండేది; శ్రీసాయిబాబాను మసీదు నుండి ‘చావడి’కి భక్తులందరూ కలిసి ఊరేగింపుగా తీసుకువెళ్లేవారు. ఇదంతా గోవిందస్వామి కుటుంబం గమనించింది. ఇంకా వాళ్ళు శిరిడీలో శ్రీసాయిబాబా గొప్ప యోగీశ్వరులు, పరబ్రహ్మస్వరూపులు, ప్రశాంతులు, ఉదారస్వభావులు, కరుణాస్వరూపులు అని తెలుసుకున్నారు. శ్రీసాయిబాబా తన భక్తులకు ప్రతిరోజు డబ్బును పంచుతారని, విద్యావంతులు మరియు కళాకారులను వారి వారి కళాకుశలతను బట్టి యథోచితంగా సత్కరిస్తారని విన్నారు. కేవలం పండుగలు, పర్వదినాలలోనే కాకుండా, ప్రతిరోజు ఆయన నియమంగా 1 రూపాయి నుండి 50 రూపాయల వరకు భక్తులకు, పేదలకు పంచుతుండేవారు. పావలా, అర్థరూపాయలు అయితే వర్షంలా కురిపించేవారు. శ్రీసాయిబాబా గొప్ప కరుణామయులే కానీ అందరికీ దానం చేసేవారు కాదు. ఆ భాగ్యాన్ని పొందే ఘడియ వచ్చిన వారికే శ్రీసాయిబాబా హస్తస్పర్శను పొందిన ద్రవ్యం లభించేది. గోవిందస్వామి కుటుంబంవారు రామదాసి సంప్రదాయానికి చెందినవారు. వారు ప్రతిరోజు ఎంతో ఉత్సాహంగాను, ఉల్లాసంగాను భజనలు చేసేవారు. శ్రీసాయిబాబా తమకు తోచినప్పుడు వారికి ఒకరూపాయో, అర్థరూపాయో ఇచ్చేవారు. ఒక్క ఆదిలక్ష్మియమ్మ తప్పించి, ఆ కుటుంబంలోని మిగిలన వారందరు శ్రీసాయిబాబా పంచే ధనాన్ని ఆశించసాగారు. ఆమె స్వభావం తక్కిన కుటుంబసభ్యుల కంటే భిన్నమైంది.

ఆదిలక్ష్మియమ్మకు శ్రీసాయి పవిత్రపాదాల యందు ఎంతో భక్తి కుదిరింది. వారు శిరిడీ చేరిన వారం రోజులకు అంటే ఆగస్టు 30వ తేదీన ఆమె శ్రీసాయిబాబాకు నైవేద్యం సమర్పించింది(ఆ ఒక్కసారి మాత్రమే ఆమె నైవేద్యం సమర్పించింది). ఆమె తాను సమర్పించే నైవేద్యాన్ని బాబా స్వీకరిస్తారో, లేదో అన్న సంకోచం వల్ల ఎంతో భక్తితో శ్రీసాయిబాబా నామాన్ని స్మరించుకుంటూ నైవేద్యాన్ని అంటే పాయసం, బజ్జీలు సిద్ధం చేసింది. వాటిని తీసుకెళ్లి శ్రీసాయిబాబా ముందు ఉంచినప్పుడు, దుర్గాబాయి అనే బ్రాహ్మణ వితంతువు ఆమె తెచ్చిన నైవేద్యాన్ని వరుసక్రమంలో చివరగా, అంటే శ్రీసాయిబాబాకు చాలా దూరంగా ఉంచింది. అయితే శ్రీసాయిబాబా నెమ్మదిగా ఆదిలక్ష్మియమ్మ తెచ్చిన నైవేద్యం దగ్గరకు వెళ్ళి, వాటిని ఎంతో ఇష్టంగా తినడం మొదలుపెట్టారు. అంతేకాకుండా, ప్రక్కనే ఉన్న షామా మొదలైన భక్తులతో పంచుకుంటూ వాటిని పూర్తిగా ఆరగించారు. శ్రీసాయిబాబా తన భక్తిని ఆమోదించినందుకు ఆదిలక్ష్మియమ్మ ఎంతో ఆనందించింది. శ్రీసాయిబాబా సర్వహృదయాంతరస్థుడు. తమ భక్తుల హృదయాలలో ఉన్న వారి ప్రేమకు శ్రీసాయిబాబా అంతే గొప్పగా ప్రతిస్పందిస్తారని ఆమె అనుభవపూర్వకంగా తెలుసుకుంది.

ఇంకొకరోజు ఆదిలక్ష్మియమ్మ శ్రీసాయిబాబా దర్శనానికి మసీదుకు వెళ్ళింది. అప్పుడు అక్కడే ఉన్న శ్రీమతి తారాబాయి తర్ఖడ్‌తో “ఈరోజు నేను ఏదో పొరపాటు చేసినట్లుగా అనిపిస్తుంది. ఈరోజు బాబా నన్ను కొడతారేమో!” అని తన మనోభావాలను వ్యక్తం చేసింది. అదే భావనతో ఆమె శ్రీసాయిబాబా వద్దకు వెళ్లి, నమస్కరించుకోబోతుండగా, శ్రీసాయిబాబా ఆయన ఆమెను తిట్టి అక్కడినుండి తరిమేసారు. ఆమె హృదయంలోని భావాలు మరియు ఆమె మానసిక స్థితి అన్నీ శ్రీసాయిబాబాకు తెలుసు కాబట్టి, ఆయన తమదైన శైలిలో, ఆమె ఊహించినట్లుగానే శ్రీసాయిబాబా ప్రవర్తించారు(శిక్ష విధించారు) అని ఆమె భావించింది.

ఆమె భక్తి విశ్వాసాలకు ప్రీతిచెంది శ్రీసాయిబాబా ఆమెకు సెప్టెంబర్ 3వ తేదీన మసీదులో మధ్యాహ్నఆరతి జరుగుతుండగా ఆమె ఇష్టదైవమైన శ్రీరామునిలా దర్శనాన్ని ప్రసాదించారు. తన ఇష్టదైవాన్ని చూసి ఆమె కరిగిపోయింది. మిగిలిన వారందరికీ శ్రీసాయిబాబావలె దర్శనమిస్తున్నారు, కానీ ఆమెకి మాత్రం శ్రీరాముని వలె దర్శనమివ్వగా ఆమె కళ్లనుండి ఆనందాశ్రువులు జలజలా రాలుతుండగా, ఆమె ఎంతో ఆనందంతో రెండు చేతులతో తాళాలు వాయిస్తున్న, అపూర్వ దృశ్యాన్ని చూచిన తక్కిన భక్తులు, “ఆహా, ఈమెకు ఇంతటి ప్రేమ ఎలా కలిగింది? ఈమెకు మాత్రమే ఇంత ఆనందం ఎలా కలిగింది?” అని ఆశ్చర్యచకితులయ్యారు. కానీ ఆమె అలా ప్రవర్తించటానికి కారణాన్ని మాత్రం గ్రహించలేకపోయారు.

ఆరోజు సాయంత్రమే ఆమె తన భర్తకు శ్రీసాయిబాబా ప్రసాదించిన అద్భుతలీలను వర్ణించింది.  శ్రీసాయిబాబా తనకు ప్రసాదించిన శ్రీరామదర్శన విశేషాన్ని ఆనందంగా వివరించింది. ఆమె గొప్ప భక్తురాలు అయినప్పటికీ ఆమె భర్తకు శ్రీసాయిబాబా పట్ల అంత భక్తి లేదు. అతడు, “స్త్రీలు అమాయక స్వభావం కలవారు. అమాయక భక్తుల మనసులో ఏదైతే ఉన్నదో అదే పైకి భాసిస్తుంది. మాకందరికీ సాయిబాబా కనిపిస్తే, నీకు మాత్రం శ్రీరాముని రూపమెలా కనిపించింది? నీకు ఇక్కడ శ్రీరాముని దర్శనమెలా సంభవమయింది? అదంతా నీ భ్రమ. వట్టి చాదస్తం” అని కుతర్కబుద్ధితో ఆమెను రకరకాలుగా అవహేళన చేశాడు. అయితే ఆమె ఈ ఆక్షేపణలకు ఏమీ కోపగించుకోలేదు, బాధపడలేదు. ఆమె అసత్య కల్పనలను ఎఱుగదు. అంతకుమునుపు కూడా ఆమెకు శ్రీరాముని దర్శనం అప్పుడప్పుడూ కలుగుతుండేది. ఆ తరువాత ద్రవ్యలోభం కలిగింది. డబ్బు ఉన్నచోట దైవం ఉండడు. అందువల్ల ఆమెకు శ్రీరాముని దర్శనం కరువైపోయింది. అయితే శ్రీసాయిబాబాకు సర్వము విదితమే, కనుక ఆమె శ్రీసాయిబాబా చెంతకు చేరిన తరువాత, ఆమెలో శ్రీసాయిబాబా పట్ల భక్తివిశ్వాసాలు కుదరటంతో, ఆమెకు మరల శ్రీరాముని దర్శనాన్ని అనుగ్రహించారు.

శిరిడీ వచ్చిన మొదట్లో గోవిందస్వామికి శ్రీసాయిబాబా పట్ల అంతగా నమ్మకం ఉండేది కాదు. అయితే అతని భార్య ఆదిలక్ష్మియమ్మకు శ్రీరామునిగా దర్శనమిచ్చిన రోజు రాత్రి(1915, సెప్టెంబర్ 3) గోవిందస్వామికి ఒక వింతైన స్వప్నదర్శనాన్ని శ్రీసాయిబాబా ప్రసాదించారు. అప్పటి నుండి అతడికి శ్రీసాయిబాబాపై నమ్మకం కలిగింది. ఆ కలలో అతను ఒక పట్టణంలో ఉండగా, అక్కడి పోలీసులు అతడిని ఒక పెద్ద పంజరంలో పెట్టి అతడి చేతులను తాళ్ళతో గట్టిగా బంధిస్తున్నారు. అదే సమయంలో శ్రీసాయిబాబా పంజరం సమీపంలోనే ఊరకే ఆ దృశ్యాన్ని చూస్తూ నిలబడివున్నారు. అతడు శ్రీసాయి మహారాజును చూచి, రెండు చేతులు జోడించి, దీనవదనంతో ప్రార్థించాడు. వారి మధ్య జరిగిన సంభాషణ

గోవిందస్వామి - “బాబా! మీ కీర్తిని విని మీ పాదాల వద్దకు వస్తే, మీరిక్కడే ప్రత్యక్షంగా ఉండగా మాకీ దుస్థితి ఎందుకు?”

శ్రీసాయిబాబా - “నీవు చేసుకున్న కర్మనంతా నీవే అనుభవించి తీరాలి”

గోవిందస్వామి (అత్యంత వినయంగా) - “ఇటువంటి కష్టాన్ని అనుభవించటానికి నేను ఈ జన్మలో ఏ నేరం చేయలేదు”

శ్రీసాయిబాబా - “పూర్వజన్మలలో చేసి ఉండవచ్చు”

గోవిందస్వామి - “పూర్వజన్మలలో నేనేం చేశానో నాకేం తెలుసు? ఏదైనా ఉన్నా అది మీ దర్శనంతో భస్మమైపోవాలి కదా! మీ దర్శనంతో అగ్ని ముందు ఎండుగడ్డివలె భస్మమై పోయి నేను ఎందుకు కర్మనుండి విముక్తుణ్ణి కాలేదు?”

శ్రీసాయిబాబా - “నీకంతటి విశ్వాసముందా?”

గోవిందస్వామి - “ఉంది బాబా”

శ్రీసాయిబాబా – "అయితే కళ్లు మూసుకో" అని ఆజ్ఞాపించారు.

గోవిందస్వామి కళ్లు మూసుకోగానే, ఎవరో క్రిందపడినట్లుగా పెద్ద శబ్దమయింది. ఆ శబ్దాన్ని విని చకితుడై అతడు కళ్ళు తెరచి చూడగా, అతను బంధవిముక్తుడై ఉన్నాడు. కానీ పోలీసులు రక్తసిక్తమై పడి ఉండటం కనిపించింది. దాంతో అతడు చాలా గాబరాపడుతూ సాయిమహరాజు వైపు చూడసాగాడు.

శ్రీసాయిబాబా నవ్వుతూ - “ఇప్పుడు భలే పట్టుబడ్డావు. ఇక్కడి అధికారి వచ్చి ఇదంతా చూసి తప్పకుండా నీవే నేరస్థుడవని మరల నిన్ను బంధిస్తారు”

గోవిందస్వామి - "మీరు చెప్పింది నిజమే. ఏదో విధంగా నన్ను విడిపించండి. మీరు తప్ప నన్ను రక్షించే వారెవరూ కనిపించటం లేదు".

శ్రీసాయిబాబా – "అయితే మళ్ళీ కళ్లు మూసుకో" అని ఆజ్ఞాపించారు.

అతడు అలాగే చేసి తిరిగి కళ్ళు తెరిచినంతలో, అతడు పంజరం నుండి విడుదలయినట్లు, శ్రీసాయిబాబా ప్రక్కనే ఉన్నట్లు కనిపించింది. వెంటనే అతడు శ్రీసాయిబాబా పాదాలకు సాష్టాంగ ప్రణామం చేశాడు. అప్పుడు

శ్రీసాయిబాబా - "ఇప్పుడు చేసిన నమస్కారానికి ఇంతకుముందు చేసిన నమస్కారానికి ఏమైనా భేదమున్నదా? బాగా ఆలోచించి చెప్పు!"

గోవిందస్వామి - "బాబా! భూమికి, ఆకాశానికి ఉన్నంత భేదమున్నది. మొదట కేవలం ద్రవ్యాన్ని ఆశించి నమస్కరించాను. ఇప్పుడు మీరే పరమేశ్వరుడు అనే భావంతో వందనం చేస్తున్నాను. మొదట నాకు మీపై ఏమాత్రం భక్తిలేదు. పైగా మీరు ముసల్మానులై ఉండి హిందువులమైన మమ్మల్ని భ్రష్టుపట్టిస్తున్నారని నా మనసులో కోపంగా ఉండేది".

శ్రీసాయిబాబా – "అయితే నీ మనస్సులో మహమ్మదీయ దేవతలను నమ్మవా(దేవతలపై భక్తి లేదా)?"

గోవిందస్వామి – "లేదు".

శ్రీసాయిబాబా - "మీ ఇంట్లో పంజాలేదూ? మొహరమప్పుడు దానిని పూజచేయవూ? బాగా ఆలోచించి చెప్పు.  మీ ఇంట్లో మహమ్మదీయ దేవతయైన కాడ్ బీబి ఉంది. ఆమెను వివాహాది శుభకార్యాలలో పూజించి ఆమెను శాంతపరుస్తారు కదా!"

గోవిందస్వామి – "అవును బాబా, మీరు చెప్పింది అంతా నిజమే" (అని ఒప్పుకున్నాడు).

శ్రీసాయిబాబా - "నీకేమైనా కోరిక ఉందా? నీకు ఇంకా ఏం కావాలి?".

గోవిందస్వామి – "నా గురువును దర్శించాలి".

శ్రీసాయిబాబా – "అయితే వెనుకకు తిరిగి చూడు".

అతను వెనుకకు తిరిగి చూసేసరికి, అతని ఎదుట అతని గురువు దర్శనమిచ్చారు. అతను తన గురువు పాదాలపై పడి నమస్కరించగా వారు వెంటనే అదృశ్యమయ్యారు.

గోవిందస్వామి జిజ్ఞాసతో - "బాబా! మీకు బాగా వయసుమళ్లి, ముసలివారి వలె కన్పిస్తున్నారు. మీ వయస్సు మీకు తెలుసా?"

శ్రీసాయిబాబా – "ఏంటి, నేను ముసలివాడినని అంటున్నావా? ఏదీ నాతో సమానంగా పరుగెత్తి చూడు!".

అని అంటూ శ్రీసాయిబాబా పరుగెత్తసాగారు. వారి వెనుక అతను పరుగుపెట్టాడు. శ్రీసాయి మహరాజ్ వేగంగా పరుగెత్తుతుంటే లేచిన ధూళిలో వారు అదృశ్యమయ్యారు. ఇంతలో అతను స్వప్నం నుండి మేలుకున్నాడు. వెంటనే తనకొచ్చిన స్వప్నం గురించి తీవ్రంగా ఆలోచించగా, అతని మనోవైఖరి పూర్తిగా  మారిపోయింది. శ్రీసాయిబాబా గొప్పతనాన్ని గ్రహించాడు. అది స్వప్నమే అయినా అందులోని ప్రశ్నోత్తర సంవాదన ద్వారా అతను చక్కటి జ్ఞానాన్ని పొందాడు. శ్రీసాయి పాదాల యందు అతనికి భక్తి కుదిరింది. అంతకుముందు తనకు శ్రీసాయి పట్ల ఉన్న దురభిప్రాయాలు, సంశయాలు తొలగిపోయి, వారి మహిమను స్తుతించాడు.

మరునాడు ఉదయం గోవిందస్వామి, అతని కుటుంబం దర్శనానికి మసీదుకు వెళ్ళినప్పుడు శ్రీసాయిబాబా కరుణించి వాళ్ళకు రెండురూపాయల బర్ఫి మిఠాయి, అలాగే రెండురూపాయలు కానుక ఇచ్చి, "కొంతకాలం శిరిడీలోనే ఉండండి" అన్నారు. శిరిడీలో ఉన్నన్ని రోజులు శ్రీసాయిబాబా సన్నిధిలో వాళ్లు భజన చేసేవాళ్ళు. వారికి ఎంతో ప్రశంసలు లభించేవి. శ్రీసాయిబాబా ప్రతిరోజు వారికి 2 రూపాయల విలువైన బర్ఫీ(స్థానిక దుకాణాదారుని దగ్గర నుండి), మరియు 2 రూపాయల ధనం కానుకగా ఇస్తుండేవారు. (ప్రతిరోజు అంతమొత్తంలో మిఠాయి వారికి అవసరం లేదనిపించేది. అందువలన ఆ బర్ఫీని వెంటనే దుకాణదారుడికి 1 రూపాయి 12 అణాలకు అమ్మేసేవాళ్ళు.) అయితే ఒకరోజు మాత్రం శ్రీసాయిబాబా వారికి 4 రూపాయలు ఇచ్చారు. అలాగే అప్పుడప్పుడు, రాధాకృష్ణఆయి ఇంట్లో కూడా వారు భజన చేసేవాళ్ళు. శ్రీసాయిబాబా జీవితచరిత్రకు సంబంధించిన ఒక మరాఠీ గ్రంథాన్ని రాధాకృష్ణఆయి వారికి బహుకరించింది.

శిరిడీవాసులు గోవిందస్వామిని ‘భావుస్వామి’ అని, ఆదిలక్ష్మియమ్మను ‘బువామాయి’ అని పిలిచేవారు. సుమారు ఒక నెలన్నర రోజులు శిరిడీలో గడిపాక వాళ్ళు శిరిడీ విడిచి వెళ్ళటానికి శ్రీసాయిబాబా అనుమతి లభించింది. వాళ్ళకు ఎక్కువ మొత్తంలో డబ్బు కానుక రూపంలో దొరకలేదు గాని శ్రీసాయిబాబా ఆశీస్సులు మాత్రం పుష్కలంగా లభించాయి. వారు శిరిడీ వదిలి వెళ్ళేటప్పుడు, శ్రీసాయిబాబా వారిని “అల్లా మీకు చాలా ఇస్తాడు(అల్లా మాలిక్ బహుత్ దేగా)”, “అల్లా మీకు మంచి చేస్తాడు(అల్లా తుమ్హారా అచ్చా కరేగా) అని ఆశీర్వదించారు. ఆ ఆశీర్వచనాలే వారికి మార్గంలో అహర్నిశలూ ఉపయోగపడ్డాయి. వారు శిరిడీ నుండి బయలుదేరేటప్పుడు అక్కడున్న భక్తులతో శ్రీసాయిబాబా, “కాశీకి వెళ్ళడానికి అయ్యే రైలు ఖర్చు (సుమారు 200 లేదా 300 రూపాయలు) వాళ్ళకు ఇవ్వాలి”  అని అన్నారు. అయితే శిరిడీలో ఎవ్వరూ వాళ్ళకు డబ్బు ఇవ్వలేదు. కానీ మార్గమధ్యంలో హర్దా ఘాట్‌కు వెళ్ళినప్పుడు, శ్రీసాయిబాబా అనుగ్రహం వల్ల, అక్కడ కొంతమంది భక్తులు విరాళాల సేకరించి వారి ప్రయాణానికి కావలసిన ధనాన్ని సమకూర్చారు. వారు తమ ప్రయాణంలో శ్రీసాయిబాబాను మనసులో ధ్యానించుకోవటం వలన వారికి కలలోనైనా కొంచెం కూడా ఇబ్బంది కలుగలేదు. వారు సంకల్పించిన యాత్రలే కాక, ఇతర యాత్రలు కూడా పూర్తిచేయగలిగారు. శ్రీసాయిబాబా ఆశీర్వాద ఫలితంగా వారి యాత్ర ఏ లోటూ లేక, సుఖంగా సాగి, వారు క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. వాళ్లందరికీ అనుపమానమైన ఆనందం కలిగింది. శ్రీసాయిబాబా వచనాలలోని అమోఘమైన శక్తిని కొనియాడారు. గోవిందస్వామికి డైరీ వ్రాసుకునే అలవాటుండేది. శ్రీసాయిబాబాతో తమ కుటుంబానికి గల అనుభవాలన్నీ డాక్టరి పిళ్ళై కోరితే అన్నీ వ్రాసిచ్చాడు.

సోర్స్: సాయిలీల పత్రిక, 1939, Ank 4,5,6.pdf, శ్రీసాయి సచ్చరిత్ర.

సాయిభక్తుల అనుభవమాలిక 2117వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఆపదలను గట్టెక్కించే సాయితండ్రి
2. మనసు మార్చి దొంగింలించిన చైన్ తిరిగి ఇచ్చేలా అనుగ్రహించిన బాబా

ఆపదలను గట్టెక్కించే సాయితండ్రి

రాజాధిరాజ యోగిరాజ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. బాబా భక్తులందరికీ నా నమస్కారములు. నా పేరు పుష్పలత. నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం, సర్వం ఆ సాయినాథుడే. నాకు ఎటువంటి ఆపద, సమస్య వచ్చినా నేను వెంటనే ఆ తండ్రికి చెప్పుకుంటాను. 2025, జూలై 1న మా పాప కాన్పుకోసం నేను యూఎస్ఏ వెళ్లాను. బాబా దయవలన చక్కటి బాబు పుట్టి అంతా సాఫీగా జరిగింది. తర్వాత నవంబర్ నెలలో మేము ఇండియాకి తిరిగి రావలసి ఉండగా అక్కడ పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. ప్రభుత్వం షట్ డౌన్ ప్రకటించడంతో విమానాలన్నీ రద్దయ్యాయి. దాదాపు 47 రోజులపాటు ఈ పరిస్థితి కొనసాగింది. మేము తిరిగి రావలసిన సమయం దగ్గర పడుతుండేసరికి, 'పరిస్థితి ఇలాగే ఉంటే ఎలా?' అని నాలో ఆందోళన, భయం మొదలై బాబాకి వినతి చేసుకున్నాను. 'సాయీ అనగానే ఓయీ అంటూ' మన ఆపదలను గట్టెక్కించే సాయితండ్రి నా మొర విన్నారు. వెంటనే ఆయన నాపై అపారమైన దయ చూపించారు. మా తిరుగు ప్రయాణానికి 5 రోజుల ముందు సంకట పరిస్థితి తొలగిపోయింది. అమెరికా ప్రభుత్వము షట్ డౌన్ ఎత్తివేసింది. విమానాల రాకపోకలు మొదలయ్యాయి. నా ఆనందానికి అంతే లేదు.

ఆ తర్వాత 2026, ఫిబ్రవరిలో మా అల్లుడు ఇండియా రావడానికి వీసా స్లాట్ దొరికింది. కానీ అప్పటి పరిస్థితులలో చాలావరకు స్లాట్స్ అన్ని పోస్ట్ ఫోన్ చేస్తూ ఉండటం వల్ల మా అల్లుడు రావాలా, వద్దా అన్న సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది. అయినా మేము బాబాపై భారం వేసి ఇండియాకి రమ్మని చెప్పాము. బాబా దయవలన వీసా ఇంటర్వ్యూతో సహా అన్ని ప్రశాంతంగా జరిగి మా అల్లుడు ఇండియా వచ్చి, తిరిగి అమెరికా వెళ్ళాడు. నన్ను అడుగడుగునా కరుణించి కాపాడుతూ, ఆపదలని గట్టెక్కిస్తున్న సాయితండ్రికి నేను ఎంతో ఋణపడి ఉన్నాను. నిత్యం ఆయనను స్మరించుకోవడం, కృతజ్ఞతలు తెలుపుకోవడం తప్ప ఇంకేమిచ్చి నా ఋణం తీర్చుకోగలను? "మీరు మాపై చూపిస్తున్న ప్రేమకు, కరుణకు చాలా చాలా ధన్యవాదాలు. ఇలాగే అందరినీ ఎల్లవేళలా కరుణించాలని, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ చరణములకు నమస్సుమాంజలి".

మనసు మార్చి దొంగింలించిన చైన్ తిరిగి ఇచ్చేలా అనుగ్రహించిన బాబా

శ్రీసాయినాథునికి హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు పద్మిని. 2026, మార్చి నెలలో మేము ఇల్లు మారాలని సామాన్లు సర్దుతున్నప్పుడు కిటికీ దగ్గర ఒక బాక్స్‌లో నా నల్లపూసల గొలుసు పెట్టాను. ఆ సమయంలో కొంతమంది పనివాళ్ళు, అలాగే మా ఇంట్లో పనిచేసే ఆమె ఉన్నారు. మరుసటిరోజు చూస్తే, నల్లపూసల గొలుసు కనిపించలేదు. ఇంట్లో నేను, మావారు మాత్రమే ఉంటాం. మావారు ఆ బాక్స్ గురించి తనకి తెలియదన్నారు. ఇకపోతే, ఆ గదిలోకి శుభ్రం చేయడానికి మా పని ఆమె వెళ్లి, రావటం నేను చూశాను. ఇంకెవరూ వెళ్లలేదు. కాబట్టి ఆమె మీద అనుమానమొచ్చి అడిగితే, తాను తీయలేదని చాలా గట్టిగా వాదించింది. మేము ఇల్లంతా వెతికి పోలీసు రిపోర్ట్ ఇచ్చాము. నేను సాయినాథుని మనసారా, " చైన్ దొరికేలా అనుగ్రహించండి" అని వేడుకున్నాను. పోలీసులు ఆమెతో మాట్లాడితే, తాను తీయలేదని చెప్పింది. కానీ ఆమే తీసిందని నాకు నమ్మకం గనక, "ఆమె మనసు భగవాన్ మార్చి, నా చైన్ నాకు తెచ్చి ఇచ్చేలా చేయాలి" అని బాబాను ప్రార్థించాను. మరుసటిరోజు ఆమె మా ఇంటికి వచ్చి చైన్ టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయింది. నేను ఆ చైన్ చూసి ఎంతో బాధ నుంచి ఉపశమనం పొందాను. నా అనుభవాన్ని బ్లాగుకి వ్రాసి పంపాలనుకొని పంపకుండా కాలయాపన చేసి మరిచిపోయాను. చాలారోజుల తర్వాత 2026, జూలై 27న ఈ బ్లాగులో భక్తులొకరు తమ నెక్లస్ దొరికిన అనుభవం పంచుకున్నారు. అది చదివాక నా అనుభవం నాకు గుర్తొచ్చి ఇలా మీ అందరితో పంచుకున్నాను. సాయినాథుని నమ్ముకుంటే, ఆయనే అన్ని చూసుకుంటారు. అందరికీ నమస్కారాలు. "నన్ను క్షమించు తండ్రీ. నేను మీ బిడ్డను. ఆశాశ్వతమైన వాటికోసం ఏడుస్తాము కానీ, అసలైన, విశ్వరూపుడైన మిమ్మల్ని మరిచాను. సాయి స్తవనమంజరిలో గోదావరి నది మురికి కాలువను కూడా తనలో కలుపుకుంటుందని ఉంది. మరి నన్ను, నా బలహీనతలు క్షమించి మీ సన్నిధిని నాకు ప్రసాదించండి ప్రభువు! మీరే నా దైవం. మీ లీలలు చదవటమే మాకు ఆనందం. నిరంతరం మీ నామజపం చేసే భాగ్యం నాకు కలిగించండి".

సాయిభక్తుల అనుభవమాలిక 2116వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఏదైనా సరిచేసే బాబా
2. సదా మొర అలకిస్తామని మరోసారి ఋజువిచ్చిన బాబా


సదా మొర అలకిస్తామని మరోసారి ఋజువిచ్చిన బాబా

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!! సాయిబంధువులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. బాబా నన్ను ప్రతిక్షణం కనిపెట్టుకొని ఉంటారని, రాబోయే సమస్యలు నుండి నేను తేలిగ్గా బయటపడేటట్టు చేస్తారని నా ప్రగాఢ నమ్మకం. మా ఆయన ఉద్యోగరీత్యా వేరే ఊరిలో ఉంటుండగా నేను 8  మా బాబుతో అత్తమామలు దగ్గర ఉంటున్నాను. కొద్దిరోజులు ముందు నాకు గొంతునొప్పి, జలుబులతోపాటు ఒంట్లో జ్వరం వచ్చినట్లు 2 రోజులు ఉండింది. మామూలుగా మా బాబు పనులన్నీ నేనే చూసుకుంటాను. ఒంట్లో  బాగాలేకున్న ఆ రెండు రోజులు కూడా పిల్లాడిని చూసుకుంటూ, వాడి పనులన్నీ ఎవరి సహాయం లేకుండా చేసుకోవడం నాకు చాలా కష్టంగా అనిపించింది. కానీ బాబా దయవల్ల 3వ రోజు నుంచి తగ్గుముఖం పట్టి నెమ్మదిగా జలుబు, గొంతునొప్పి అన్ని తగ్గిపోయాయి. మామూలుగా ఒంట్లో బాగా లేనప్పుడు కావలసినంత రెస్ట్ తీసుకోవచ్చు.కానీ, ప్రస్తుతం పిల్లాడితో రెస్ట్ కాదు కదా, ఏ పనైనా పక్క వాళ్ళు సహకరిస్తేనే అవుతుండటం వల్ల ఇక నుంచి నా ఆరోగ్యం పట్ల శ్రద్ధగా ఉంటూ జలుబు, గొంతునొప్పి లాంటివి తెచ్చుకోకూడదని అనుకున్నాను. కానీ కొద్దిరోజులు తర్వాత ఇంట్లో ఒక డబ్బాలో ఏదో బిస్కెట్ ఉంటే ఆలోచించకుండా తిన్నాను. ఇంకా అప్పటినుండి గొంతులో కిచకిచ మొదలై గొంతునొప్పి వచ్చే సూచన కనపడింది. దాంతో మళ్ళీ ఇదివరకటిలా ఇబ్బందిపడాలా అని చాలా భయమేసింది. ఈసారి నా దగ్గర మందులు కూడా లేవు. అందువల్ల ఇంకేం చేయలేక, "బాబా! నాకు మళ్ళీ గొంతునొప్పి రాకుండా ఉండేలా అనుగ్రహించండి" అని బాబాని వేడుకొని ఆయన మీద భారమేసాను. ఆ రాత్రి గొంతుకు బామ్ రాసుకొని పడుకున్నాను. అంతే! బాబా దయవల్ల పొద్దున్న లేచేసరికి గొంతు బాగుంది. ఏ కిచకిచ, నస లేవు. హాయిగా ఉంది. ఈ అనుభవం ద్వారా బాబా నా మొర సదా అలకిస్తారని మరోసారి ఋజువు అయింది. "ధన్యవాదాలు బాబా".

సర్వం శ్రీసాయినాథార్పణమస్తు

శంభు మంగేష్ వాగ్లే - 2వ భాగం....



వాగ్లే, అతని స్నేహితులు స్నానం వగైరా ముగించుకుని మధ్యాహ్నం హారతి సమయానికి మళ్ళీ మశీదుకి వెళ్లారు. అక్కడి వైభవాన్ని చూసి వాగ్లే మనసు విస్మయానికి లోనైంది. అతని స్నేహితుడు శ్రీబస్తోద్కర్ నోటి నుండి అప్రయత్నంగా "ఎంతటి నాస్తిక పాషానుడైనప్పటికీ, ఈ సమయంలో మనసు ఇక్కడ లీనమవ్వాల్సిందే!" అని వెలువడ్డాయి. నిజంగా ఆ దృశ్యాన్ని గుర్తుచేసుకుంటూ, ‘అంతలా మనసు పూర్తిగా ఎలా లీనమవుతుందో అనిపిస్తుంద’ని వాగ్లే అంటారు. ఆ సమయంలో వెండి ఆసనం దీపాల కాంతులతో వెలిగిపోతోంది. అక్కడున్న ప్రతి ఒక్కరూ ఎంతో భక్తిశ్రద్ధలతో బాబాను పూజిస్తున్నారు. కొందరు వారి శిరస్సుపై గంధాక్షతలు పెడుతున్నారు, కొందరు పువ్వులు సమర్పిస్తున్నారు, కొందరు బిల్వ పత్రాలు, తులసి చేతపట్టుకుని ఉన్నారు, కొందరు హారతి ఇస్తున్నారు, కొందరు వారి చేతులకు తాంబూలం అందిస్తున్నారు. ఇలా గంటసేపు పూజ కార్యక్రమం కొనసాగి హారతి పూర్తైన తర్వాత భక్తులందరూ భోజనానికి వెళ్లారు. 'కానీ అక్కడ ఒక ఆచారం ఉందని, ఎవరైనా ఏదైనా కోరికతో దర్శనానికి వస్తే, ఆ కోరికలు బాబాకు విన్నవించుకొనే నిమిత్తం ప్రతిరోజూ ఆరతి అనంతరం కొంత సమయం కేటాయిస్తారని, అప్పుడు పాత, కొత్త భక్తులందరూ అక్కడ ఉండి బాబా తమ ఆసనంపై ఆశీనులయ్యాక వారికి దక్షిణ సమర్పించి, వారి చేతుల మీదుగా ఊదీ ప్రసాదాలు స్వీకరించి తాము వచ్చిన పని పూర్తయ్యాక సెలవు తీసుకొని వెళ్ళిపోతారని, అది అక్కడి పద్దతి అని, ఆ సమయంలో బాబా అనేక భాషలలో మాట్లాడుతూ, భక్తుల వద్ద నుండి దక్షిణ స్వీకరించి, జేబులో వేసుకొని, వారికి ప్రసాదమిచ్చి, ఆ తర్వాత ఎవరైనా ఏదైనా అడిగితే, సమాధానం చెప్తారని, కొందరు తమ పరీక్షల గురించి అడిగేవారని, దానికి బాబా 'అంతా సవ్యంగా ఉంటుంద'ని అని బదులు చెప్పేవారని, ఎవరూ ఏమీ అడగకున్నా అక్కడున్న వారందరూ పూర్తిగా సంతృప్తి చెందేవారని, అలా అక్కడున్న వారందరి మనసులోని మాటలకు బాబా సమాధానం చెప్తారని' వాగ్లే తెలియజేసారు.


అందుకని హారతి పూర్తైన తర్వాత వాగ్లే, అతని స్నేహితులు అక్కడే ఉండి బాబా పక్కన కూర్చున్నారు. అతని స్నేహితులలో ఒకరు 4, ఒకరు 8 అణాలు బాబాకు దక్షిణ సమర్పిస్తే, ఆయన వాటిని తీసుకొని "సరిపోతుంది" అని చెప్పారు. వాగ్లే ఒక రూపాయి సమర్పిస్తే, వారు దానిని తీసుకొని తమ జేబులో వేసుకున్నారు. 'ఆ జేబు వారి ఖజానా. ఎందుకంటే, డబ్బంతా అందులోనే ఉంటుందని, ఏ సమయంలో ఎవరికి ఏ అవసరమొచ్చినా ఆ ధనాన్ని వినియోగిస్తారని, రోజువారీ ఖర్చులన్నీ ఆవిధంగా జరుగుతాయని అంటార'ని వాగ్లే తెలియజేసారు.    


ఇకపోతే, బాబా వాగ్లే ఇచ్చిన దక్షిణ తమ జేబులో వేసుకున్న తర్వాత అతనికి ప్రసాదమిచ్చి ఎవరికీ అర్థంకానీ రీతిలో తమ చేతితో సైగ చేసి అతని మనసులో మెదులుతున్న ఆలోచనకు సమాధానం చెప్పారు. అది చూసి అతను జలదరించిపోయాడు. కారణం, ఆ సమయంలో ఒక యువతి అతన్ని తన వలలో వేసుకోవాలని ప్రయత్నిస్తుంది. దాని గురించే బాబా చెప్పారు. ఆ తర్వాత వాగ్లే, అతని స్నేహితులు కొని తెచ్చుకున్న బాబా ఫోటోలు బాబాకిచ్చి, వారి చేతుల మీదగా తిరిగి తీసుకున్నారు. ఇక్కడ చెప్పవలసిన ఒక విషయం ఏమిటంటే, వాళ్ళు తమ తిరుగు ప్రయాణానికి టిక్కెట్లు తీసుకుని, బాబా వద్ద అనుమతి తీసుకోకుండానే రైలు ఎక్కాలని నిర్ణయించుకొని టాంగా కూడా మాట్లాడుకొని ఉన్నారు. కానీ వాళ్ళు నమస్కారం చేసి బయలుదేరబోతుండగా బాబా వాళ్ళతో, "ఇప్పుడు బొంబాయికి వద్దు, వెళ్లి వాడాలో కూర్చోండి" అని చెప్పారు. ఇంకా పాటిల్ నామధేయం గల గ్రామానికి చెందిన గృహస్థుడిని పిలిచి, "వీళ్ళని సాయంత్రం బెల్లం తయారీ జరిగే చోటకి తీసుకెళ్లి, తాగడానికి చెరుకు రసం ఇవ్వు" అని చెప్పారు. దాంతో వాళ్ళు చేసేదిలేక టాంగావానికి డబ్బులిచ్చి పంపేసి వాడాకి వెళ్లారు. అక్కడ వాగ్లే స్నేహితులిద్దరూ నిద్రపోగా అతను మాత్రం నిద్రపోకుండా పడుకొని విశ్రాంతి తీసుకుంటుంటే, కొంతసేపటికి పెద్ద కోలాహలం అతని చెవిన పడింది. 'ఏంటిది? అక్కడ ఏం జరుగుతుంది?' అని అతను కుతూహలంగా అది చూడటానికి వెళ్ళాడు.


ఆ సమయంలో మశీదు వద్ద చాలా జనం గుమిగూడి ఉన్నారు. మూడు, నాలుగు భక్తబృందాలు తబలాలు వాయిస్తూ ఒకే తాళంలో బాబాను కీర్తిస్తూ పాటలు పడుతున్నారు. వాటన్నింటిలోనూ నిరంతరాయంగా వస్తున్న ఏకైక చరణం 'సాయిబాబారే, సాయినాథారే'. వాగ్లే మశీదు బయట నిలబడి అదంతా చూస్తుండగా బాబా అతన్ని చూసి, "ఏ అబ్బాయీ! ఇక్కడికి రా(ఏ చోకర ఈదర ఆవ్)" అని దగ్గరకి పిలిచారు. అతను వారి దగ్గరకి వెళ్లి, వారికి నమస్కరించి, బాబా వైపే చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు ఆయన, "వాడాకి వెళ్లి మరో 5 రూపాయలు తీసుకొని రా" అని అన్నారు. అది విని బాబా సర్వజ్ఞతకు అతను ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే, ఆ సమయంలో అతని దగ్గర సరిగ్గా 5 రూపాయలే ఉన్నాయి. అయినా అతను తొందరగా వాడాకు వెళ్లి, ఆ 5 రూపాయలు తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టి, అక్కడే కూర్చున్నాడు. కారణం అతను బాబాతో పైన పేర్కొన్న(ముందు భాగంలో) నారేకర్ గురించి మాట్లాడాలని. కానీ అతను అతని గురించి బాబాకి వినతి చేసుకోబోతుండగా బాబా ఉన్నట్టుండి ఒక్కసారిగా భయంకర రూపు దాల్చారు. ఆయన కళ్ళు ఎర్రగా మారిపోయాయి. వాటిని పెద్దగా చేసి, నోటితో పెద్దపెద్దగా శబ్దాలు చేస్తూ తీవ్రంగా తిట్టనారంభించారు. ఆ సమయంలో వారిని స్తుతిస్తున్న కొందరు, అలాగే సమీపంలో కూర్చుని సాయి లీలలున్న ఏదో గ్రంథం చదువుతున్న వార్ధాకి చెందిన శ్రీనాయక్ తదితరులు బాబాని ఆ స్థితిలో చూసి ఎక్కడున్న వాళ్ళు అక్కడే తటస్థంగా ఉండిపోయారు. బాబా హఠాత్తుగా సమక్షంలో ఎవరున్నా శాపనార్థాలు కురిపిస్తూ జమదగ్ని అవతారం ఎందుకు దాల్చారో ఎవరికీ అర్థం కాలేదు. భక్తులంతా భయంతో వణికిపోయారు. 'ఎవరి మీద ఈ మండిపాటు? ఎవరి పాతక వృక్షాన్ని సమూలంగా తుడిచిపెడుతున్నారు?' అన్నది ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. బాబా దృష్టి మాత్రం ఎక్కడో దూరంగా ఉంది. వారి నోటి వెంబడి "అలాంటి పనులు చేసి(బహుశా దుష్కర్మలు) నా దగ్గరకి వస్తే, నేను నిన్ను నిర్దాక్షిణ్యంగా బయటకు గెంటేస్తాను" అని వెలువడ్డాయి. ఈవిధంగా సుమారు 10 నిముషాలపాటు సాగింది. అంతలో బాబా దృష్టి ఉన్న దిశలో పొడవాటి చెట్టు గుండా సూర్యకిరణాలు పట్టు వస్త్రంపై పడి చమక్, చమక్‌మని మెరవడం కనిపించింది. అంటే, దూరంగా ఇద్దరు ఆడవాళ్లు రావడం కనిపించసాగింది. వాళ్ళు అలా అలా దగ్గరకు వస్తుండగా, బాబా అలా అలా తమ దృష్టి మరోవైపుకు మళ్లించి నోటిలో చిలుము పెట్టుకొని పీల్చడం ప్రారంభించారు. అంతలో సుందరమైన మధ్యవయస్కురాలు పల్చని జరీ చీర ధరించి తన దాసితో మశీదు లోపలికి వచ్చింది. ఆమె చాలాసేపు నిలబడి బాబాకి నమస్కరించింది. కానీ బాబా ఆమెను ఏమాత్రమూ పట్టించుకోలేదు. అప్పుడు ఎవరో 'ఆమె నగర్ జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన ధనిక జాగీర్దార్ వితంతువు, మీ దర్శనానికి వచ్చింది' అని చెప్పారు. బాబా మార్మిక భాషలో, "నన్నెందుకు ఇబ్బందిపెడుతున్నారు. దీని గురించి అంతా నేను ముందే చెప్పలేదా? ఆమెను కూర్చోమని చెప్పండి" అని అన్నారు.


వాగ్లే కొంత సమయం తరువాత అవకాశం చూసుకొని నారేకర్ గురించి, అతని భార్యాబిడ్డల పరిస్థితి గురించి బాబాతో చెప్పాడు. బాబా అతను చెప్పిందంతా ప్రశాంతంగా విని నారేకర్‌ను పిలిపించి, "రేపు అతనితోపాటు వెళ్ళు" అని ఆజ్ఞాపించారు. నిజానికి వాగ్లే అదివరకే నారేకర్‌ను వెతికి పట్టుకొని, అతని కుటుంబ పరిస్థితుల గురించి అతనితో మాట్లాడాడు. గడ్డం వగైరా పెంచుకొని గుప్తంగా ఏకాంతంలో గడుపుతున్న అతను వాగ్లే చెప్పినదానికి సానుకూలంగా స్పందించలేదు. కానీ బాబా మాటని ధిక్కరించే సాహసం అతను చేయలేదు. అతను, వాగ్లే ఆ రాత్రి అతని రహస్య స్థలానికి వెళ్ళేముందు బాబా వద్దకు వెళ్లి వారి అనుమతి తీసుకున్నారు. మరుసటిరోజు వాళ్ళు శిరిడీ నుండి బయలుదేరి వారి గమ్యస్థానానికి క్షేమంగా చేరుకున్నారు.


వాగ్లే తన అనుభవం గురించి, ‘ఇలాంటి సందర్భం నా జీవితకాలం మొత్తంలో ఒక్కటే ఎదురైంది. అది కనీసం పూర్తి ఇరవై నాలుగు గంటల సమయం కూడా కొనసాగలేదు. అయినప్పటికీ, ఆ క్షణాన్ని నేను ఎప్పుడు తలచుకున్నా నా హృదయం అంతులేని ఆనందంతో పొంగిపోతుంది. మేము బాబాను తెలుసుకోలేదు, ఆయన గురించి ఆలోచించలేదు. కానీ ఆయన అనంతమైన దయతో మాకు స్ఫూర్తినిచ్చి తమ పవిత్ర పాద దర్శనాన్నిచ్చారు. సంతృప్తికరంగా జీవించే అవకాశం కల్పించారు. ఆ మహనీయుని పాదాల చెంత ఉండటం నా కర్తవ్యమని గ్రహించి నేను నా మనసున ఆ ఆత్మోద్ధారకుని పాదాలకు నమస్కరిస్తూ, "ప్రజలందరూ సుఖంగా, సుసంపన్నంగా ఉండాలి" అని ప్రార్థిస్తున్నాను’ అని తెలియజేసారు.


గమనిక: బాబా అప్పుడప్పుడు జమదగ్నిలా తీవ్రమైన ఆగ్రహంతో ఊగిపోయేవారని, ఆయన ఎందుకు అంత భయంకరమైన రూపాన్ని దాల్చేవారో ఎవరికీ తెలిసేది కాదని చాలామంది భక్తులు తమ అనుభవాలలో చెప్పి ఉన్నారు. అందుకు శ్రీవాగ్లేగారి పైఅనుభవం తగిన వివరణ ఇస్తుంది. కాస్త యోచించినట్లైతే, బాబా భక్తులు తమ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ అంతరాలలో దాగి ఉన్న(గతంలో చేసిన) దుష్కర్మల పట్ల తీవ్ర ఆగ్రహానికి గురయ్యేవారని, అయినప్పటికీ బాబా బాహ్యంగా ప్రదర్శించే ఆ కోపం లేదా ఆగ్రహం వెనుక అనంతమైన కరుణ దాగి ఉంటుందని పైఅనుభవం ద్వారా మనకి అర్థమవుతుంది.


సోర్స్: సాయిలీల పత్రిక 1938, 7,8,9 సంచిక


సాయిభక్తుల అనుభవమాలిక 2115వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • కోరుకున్నట్లే గృహవైద్యంతో ఆరోగ్య సమస్య నుండి ఉపశమనం ప్రసాదించిన బాబా


సాయిభక్తుల అనుభవమాలిక 2114వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా చూపించిన ప్రేమ, కరుణ, మార్గదర్శకత్వానికి ప్రత్యక్ష సాక్ష్యం
2. సాయి సచ్చరిత్ర చదవడం వల్ల పొందిన బాబా అనుగ్రహం



సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo