1. ఏదైనా సరిచేసే బాబా
2. సదా మొర అలకిస్తామని మరోసారి ఋజువిచ్చిన బాబా
|
సాయి వచనం:-
|
|
|
1. ఏదైనా సరిచేసే బాబా
2. సదా మొర అలకిస్తామని మరోసారి ఋజువిచ్చిన బాబా
వాగ్లే, అతని స్నేహితులు స్నానం వగైరా ముగించుకుని మధ్యాహ్నం హారతి సమయానికి మళ్ళీ మశీదుకి వెళ్లారు. అక్కడి వైభవాన్ని చూసి వాగ్లే మనసు విస్మయానికి లోనైంది. అతని స్నేహితుడు శ్రీబస్తోద్కర్ నోటి నుండి అప్రయత్నంగా "ఎంతటి నాస్తిక పాషానుడైనప్పటికీ, ఈ సమయంలో మనసు ఇక్కడ లీనమవ్వాల్సిందే!" అని వెలువడ్డాయి. నిజంగా ఆ దృశ్యాన్ని గుర్తుచేసుకుంటూ, ‘అంతలా మనసు పూర్తిగా ఎలా లీనమవుతుందో అనిపిస్తుంద’ని వాగ్లే అంటారు. ఆ సమయంలో వెండి ఆసనం దీపాల కాంతులతో వెలిగిపోతోంది. అక్కడున్న ప్రతి ఒక్కరూ ఎంతో భక్తిశ్రద్ధలతో బాబాను పూజిస్తున్నారు. కొందరు వారి శిరస్సుపై గంధాక్షతలు పెడుతున్నారు, కొందరు పువ్వులు సమర్పిస్తున్నారు, కొందరు బిల్వ పత్రాలు, తులసి చేతపట్టుకుని ఉన్నారు, కొందరు హారతి ఇస్తున్నారు, కొందరు వారి చేతులకు తాంబూలం అందిస్తున్నారు. ఇలా గంటసేపు పూజ కార్యక్రమం కొనసాగి హారతి పూర్తైన తర్వాత భక్తులందరూ భోజనానికి వెళ్లారు. 'కానీ అక్కడ ఒక ఆచారం ఉందని, ఎవరైనా ఏదైనా కోరికతో దర్శనానికి వస్తే, ఆ కోరికలు బాబాకు విన్నవించుకొనే నిమిత్తం ప్రతిరోజూ ఆరతి అనంతరం కొంత సమయం కేటాయిస్తారని, అప్పుడు పాత, కొత్త భక్తులందరూ అక్కడ ఉండి బాబా తమ ఆసనంపై ఆశీనులయ్యాక వారికి దక్షిణ సమర్పించి, వారి చేతుల మీదుగా ఊదీ ప్రసాదాలు స్వీకరించి తాము వచ్చిన పని పూర్తయ్యాక సెలవు తీసుకొని వెళ్ళిపోతారని, అది అక్కడి పద్దతి అని, ఆ సమయంలో బాబా అనేక భాషలలో మాట్లాడుతూ, భక్తుల వద్ద నుండి దక్షిణ స్వీకరించి, జేబులో వేసుకొని, వారికి ప్రసాదమిచ్చి, ఆ తర్వాత ఎవరైనా ఏదైనా అడిగితే, సమాధానం చెప్తారని, కొందరు తమ పరీక్షల గురించి అడిగేవారని, దానికి బాబా 'అంతా సవ్యంగా ఉంటుంద'ని అని బదులు చెప్పేవారని, ఎవరూ ఏమీ అడగకున్నా అక్కడున్న వారందరూ పూర్తిగా సంతృప్తి చెందేవారని, అలా అక్కడున్న వారందరి మనసులోని మాటలకు బాబా సమాధానం చెప్తారని' వాగ్లే తెలియజేసారు.
అందుకని హారతి పూర్తైన తర్వాత వాగ్లే, అతని స్నేహితులు అక్కడే ఉండి బాబా పక్కన కూర్చున్నారు. అతని స్నేహితులలో ఒకరు 4, ఒకరు 8 అణాలు బాబాకు దక్షిణ సమర్పిస్తే, ఆయన వాటిని తీసుకొని "సరిపోతుంది" అని చెప్పారు. వాగ్లే ఒక రూపాయి సమర్పిస్తే, వారు దానిని తీసుకొని తమ జేబులో వేసుకున్నారు. 'ఆ జేబు వారి ఖజానా. ఎందుకంటే, డబ్బంతా అందులోనే ఉంటుందని, ఏ సమయంలో ఎవరికి ఏ అవసరమొచ్చినా ఆ ధనాన్ని వినియోగిస్తారని, రోజువారీ ఖర్చులన్నీ ఆవిధంగా జరుగుతాయని అంటార'ని వాగ్లే తెలియజేసారు.
ఇకపోతే, బాబా వాగ్లే ఇచ్చిన దక్షిణ తమ జేబులో వేసుకున్న తర్వాత అతనికి ప్రసాదమిచ్చి ఎవరికీ అర్థంకానీ రీతిలో తమ చేతితో సైగ చేసి అతని మనసులో మెదులుతున్న ఆలోచనకు సమాధానం చెప్పారు. అది చూసి అతను జలదరించిపోయాడు. కారణం, ఆ సమయంలో ఒక యువతి అతన్ని తన వలలో వేసుకోవాలని ప్రయత్నిస్తుంది. దాని గురించే బాబా చెప్పారు. ఆ తర్వాత వాగ్లే, అతని స్నేహితులు కొని తెచ్చుకున్న బాబా ఫోటోలు బాబాకిచ్చి, వారి చేతుల మీదగా తిరిగి తీసుకున్నారు. ఇక్కడ చెప్పవలసిన ఒక విషయం ఏమిటంటే, వాళ్ళు తమ తిరుగు ప్రయాణానికి టిక్కెట్లు తీసుకుని, బాబా వద్ద అనుమతి తీసుకోకుండానే రైలు ఎక్కాలని నిర్ణయించుకొని టాంగా కూడా మాట్లాడుకొని ఉన్నారు. కానీ వాళ్ళు నమస్కారం చేసి బయలుదేరబోతుండగా బాబా వాళ్ళతో, "ఇప్పుడు బొంబాయికి వద్దు, వెళ్లి వాడాలో కూర్చోండి" అని చెప్పారు. ఇంకా పాటిల్ నామధేయం గల గ్రామానికి చెందిన గృహస్థుడిని పిలిచి, "వీళ్ళని సాయంత్రం బెల్లం తయారీ జరిగే చోటకి తీసుకెళ్లి, తాగడానికి చెరుకు రసం ఇవ్వు" అని చెప్పారు. దాంతో వాళ్ళు చేసేదిలేక టాంగావానికి డబ్బులిచ్చి పంపేసి వాడాకి వెళ్లారు. అక్కడ వాగ్లే స్నేహితులిద్దరూ నిద్రపోగా అతను మాత్రం నిద్రపోకుండా పడుకొని విశ్రాంతి తీసుకుంటుంటే, కొంతసేపటికి పెద్ద కోలాహలం అతని చెవిన పడింది. 'ఏంటిది? అక్కడ ఏం జరుగుతుంది?' అని అతను కుతూహలంగా అది చూడటానికి వెళ్ళాడు.
ఆ సమయంలో మశీదు వద్ద చాలా జనం గుమిగూడి ఉన్నారు. మూడు, నాలుగు భక్తబృందాలు తబలాలు వాయిస్తూ ఒకే తాళంలో బాబాను కీర్తిస్తూ పాటలు పడుతున్నారు. వాటన్నింటిలోనూ నిరంతరాయంగా వస్తున్న ఏకైక చరణం 'సాయిబాబారే, సాయినాథారే'. వాగ్లే మశీదు బయట నిలబడి అదంతా చూస్తుండగా బాబా అతన్ని చూసి, "ఏ అబ్బాయీ! ఇక్కడికి రా(ఏ చోకర ఈదర ఆవ్)" అని దగ్గరకి పిలిచారు. అతను వారి దగ్గరకి వెళ్లి, వారికి నమస్కరించి, బాబా వైపే చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు ఆయన, "వాడాకి వెళ్లి మరో 5 రూపాయలు తీసుకొని రా" అని అన్నారు. అది విని బాబా సర్వజ్ఞతకు అతను ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే, ఆ సమయంలో అతని దగ్గర సరిగ్గా 5 రూపాయలే ఉన్నాయి. అయినా అతను తొందరగా వాడాకు వెళ్లి, ఆ 5 రూపాయలు తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టి, అక్కడే కూర్చున్నాడు. కారణం అతను బాబాతో పైన పేర్కొన్న(ముందు భాగంలో) నారేకర్ గురించి మాట్లాడాలని. కానీ అతను అతని గురించి బాబాకి వినతి చేసుకోబోతుండగా బాబా ఉన్నట్టుండి ఒక్కసారిగా భయంకర రూపు దాల్చారు. ఆయన కళ్ళు ఎర్రగా మారిపోయాయి. వాటిని పెద్దగా చేసి, నోటితో పెద్దపెద్దగా శబ్దాలు చేస్తూ తీవ్రంగా తిట్టనారంభించారు. ఆ సమయంలో వారిని స్తుతిస్తున్న కొందరు, అలాగే సమీపంలో కూర్చుని సాయి లీలలున్న ఏదో గ్రంథం చదువుతున్న వార్ధాకి చెందిన శ్రీనాయక్ తదితరులు బాబాని ఆ స్థితిలో చూసి ఎక్కడున్న వాళ్ళు అక్కడే తటస్థంగా ఉండిపోయారు. బాబా హఠాత్తుగా సమక్షంలో ఎవరున్నా శాపనార్థాలు కురిపిస్తూ జమదగ్ని అవతారం ఎందుకు దాల్చారో ఎవరికీ అర్థం కాలేదు. భక్తులంతా భయంతో వణికిపోయారు. 'ఎవరి మీద ఈ మండిపాటు? ఎవరి పాతక వృక్షాన్ని సమూలంగా తుడిచిపెడుతున్నారు?' అన్నది ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. బాబా దృష్టి మాత్రం ఎక్కడో దూరంగా ఉంది. వారి నోటి వెంబడి "అలాంటి పనులు చేసి(బహుశా దుష్కర్మలు) నా దగ్గరకి వస్తే, నేను నిన్ను నిర్దాక్షిణ్యంగా బయటకు గెంటేస్తాను" అని వెలువడ్డాయి. ఈవిధంగా సుమారు 10 నిముషాలపాటు సాగింది. అంతలో బాబా దృష్టి ఉన్న దిశలో పొడవాటి చెట్టు గుండా సూర్యకిరణాలు పట్టు వస్త్రంపై పడి చమక్, చమక్మని మెరవడం కనిపించింది. అంటే, దూరంగా ఇద్దరు ఆడవాళ్లు రావడం కనిపించసాగింది. వాళ్ళు అలా అలా దగ్గరకు వస్తుండగా, బాబా అలా అలా తమ దృష్టి మరోవైపుకు మళ్లించి నోటిలో చిలుము పెట్టుకొని పీల్చడం ప్రారంభించారు. అంతలో సుందరమైన మధ్యవయస్కురాలు పల్చని జరీ చీర ధరించి తన దాసితో మశీదు లోపలికి వచ్చింది. ఆమె చాలాసేపు నిలబడి బాబాకి నమస్కరించింది. కానీ బాబా ఆమెను ఏమాత్రమూ పట్టించుకోలేదు. అప్పుడు ఎవరో 'ఆమె నగర్ జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన ధనిక జాగీర్దార్ వితంతువు, మీ దర్శనానికి వచ్చింది' అని చెప్పారు. బాబా మార్మిక భాషలో, "నన్నెందుకు ఇబ్బందిపెడుతున్నారు. దీని గురించి అంతా నేను ముందే చెప్పలేదా? ఆమెను కూర్చోమని చెప్పండి" అని అన్నారు.
వాగ్లే కొంత సమయం తరువాత అవకాశం చూసుకొని నారేకర్ గురించి, అతని భార్యాబిడ్డల పరిస్థితి గురించి బాబాతో చెప్పాడు. బాబా అతను చెప్పిందంతా ప్రశాంతంగా విని నారేకర్ను పిలిపించి, "రేపు అతనితోపాటు వెళ్ళు" అని ఆజ్ఞాపించారు. నిజానికి వాగ్లే అదివరకే నారేకర్ను వెతికి పట్టుకొని, అతని కుటుంబ పరిస్థితుల గురించి అతనితో మాట్లాడాడు. గడ్డం వగైరా పెంచుకొని గుప్తంగా ఏకాంతంలో గడుపుతున్న అతను వాగ్లే చెప్పినదానికి సానుకూలంగా స్పందించలేదు. కానీ బాబా మాటని ధిక్కరించే సాహసం అతను చేయలేదు. అతను, వాగ్లే ఆ రాత్రి అతని రహస్య స్థలానికి వెళ్ళేముందు బాబా వద్దకు వెళ్లి వారి అనుమతి తీసుకున్నారు. మరుసటిరోజు వాళ్ళు శిరిడీ నుండి బయలుదేరి వారి గమ్యస్థానానికి క్షేమంగా చేరుకున్నారు.
వాగ్లే తన అనుభవం గురించి, ‘ఇలాంటి సందర్భం నా జీవితకాలం మొత్తంలో ఒక్కటే ఎదురైంది. అది కనీసం పూర్తి ఇరవై నాలుగు గంటల సమయం కూడా కొనసాగలేదు. అయినప్పటికీ, ఆ క్షణాన్ని నేను ఎప్పుడు తలచుకున్నా నా హృదయం అంతులేని ఆనందంతో పొంగిపోతుంది. మేము బాబాను తెలుసుకోలేదు, ఆయన గురించి ఆలోచించలేదు. కానీ ఆయన అనంతమైన దయతో మాకు స్ఫూర్తినిచ్చి తమ పవిత్ర పాద దర్శనాన్నిచ్చారు. సంతృప్తికరంగా జీవించే అవకాశం కల్పించారు. ఆ మహనీయుని పాదాల చెంత ఉండటం నా కర్తవ్యమని గ్రహించి నేను నా మనసున ఆ ఆత్మోద్ధారకుని పాదాలకు నమస్కరిస్తూ, "ప్రజలందరూ సుఖంగా, సుసంపన్నంగా ఉండాలి" అని ప్రార్థిస్తున్నాను’ అని తెలియజేసారు.
గమనిక: బాబా అప్పుడప్పుడు జమదగ్నిలా తీవ్రమైన ఆగ్రహంతో ఊగిపోయేవారని, ఆయన ఎందుకు అంత భయంకరమైన రూపాన్ని దాల్చేవారో ఎవరికీ తెలిసేది కాదని చాలామంది భక్తులు తమ అనుభవాలలో చెప్పి ఉన్నారు. అందుకు శ్రీవాగ్లేగారి పైఅనుభవం తగిన వివరణ ఇస్తుంది. కాస్త యోచించినట్లైతే, బాబా భక్తులు తమ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ అంతరాలలో దాగి ఉన్న(గతంలో చేసిన) దుష్కర్మల పట్ల తీవ్ర ఆగ్రహానికి గురయ్యేవారని, అయినప్పటికీ బాబా బాహ్యంగా ప్రదర్శించే ఆ కోపం లేదా ఆగ్రహం వెనుక అనంతమైన కరుణ దాగి ఉంటుందని పైఅనుభవం ద్వారా మనకి అర్థమవుతుంది.
సోర్స్: సాయిలీల పత్రిక 1938, 7,8,9 సంచిక
- కోరుకున్నట్లే గృహవైద్యంతో ఆరోగ్య సమస్య నుండి ఉపశమనం ప్రసాదించిన బాబా
1. బాబా చూపించిన ప్రేమ, కరుణ, మార్గదర్శకత్వానికి ప్రత్యక్ష సాక్ష్యం
2. సాయి సచ్చరిత్ర చదవడం వల్ల పొందిన బాబా అనుగ్రహం
బాబా చూపించిన ప్రేమ, కరుణ, మార్గదర్శకత్వానికి ప్రత్యక్ష సాక్ష్యం
ఓం శ్రీసాయినాథాయ నమః. సాయి భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు ఛత్రపతి. నా జీవితంలో ప్రతి అడుగు బాబా అనుగ్రహంతోనే పడుతుందని నేను గట్టిగా నమ్ముతాను. ఏ పని ప్రారంభించినా, ఎక్కడికి ప్రయాణం చేసినా ముందుగా బాబాను మనసారా ప్రార్థించి, ఆయన ఆశీస్సులు తీసుకోవడం నాకు అలవాటు. ఈ మధ్య నా తిరుమల యాత్ర కూడా అలాగే ప్రారంభమైంది. నిజానికి నేను ఈ యాత్రను నా స్నేహితురాలికోసం ప్లాన్ చేసి ఇద్దరికీ టికెట్లు బుక్ చేశాను. ఎందుకంటే, తను ఇంతవరకు తిరుమల దర్శనం చేసుకోలేదు. కానీ విధి విచిత్రమైనది. చివరి క్షణంలో అనివార్య కారణాల వల్ల తను రాలేని పరిస్థితి వచ్చింది. ఒక్క క్షణం, 'నేను కూడా ప్రయాణం వాయిదా వేసుకుందామా?' అన్న ఆలోచన నాకు వచ్చింది. కానీ, 'ఎవరికోసం ఈ యాత్రను ప్లాన్ చేశానో తను రాలేకపోయింది. అయినా శ్రీవేంకటేశ్వరస్వామి నన్ను తమ సన్నిధికి పిలుస్తున్నారేమో! ఆ పిలుపు వెనుక బాబా దివ్య సంకల్పమే ఉందేమో! అని నా మనసుకి బలంగా అనిపించింది. బహుశా ఈ యాత్రను నేను ఒంటరిగా చేయాలని, ఆ అనుభూతిని పూర్తిగా ఆస్వాదించాలని బాబా ముందుగానే నిర్ణయించి ఉండవచ్చు. అందులకాని నేను ఒక్కడినే తిరుమల వెళ్లి, వద్దామని అనుకున్నాను. అయితే, తిరుమలలో విపరీతమైన రద్దీ ఉందని, దర్శనానికి గంటల సమయం పడుతుందని అందరూ అన్నారు. తర్వాత నేను నా ప్రయాణం మొదలుపెట్టేముందు బాబాను ఒక్కటే కోరుకున్నాను, "బాబా! మీ దయతో శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనం తొందరగా, ప్రశాంతంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగేలా అనుగ్రహించండి తండ్రీ" అని. బాబా కరుణ ఎంత అద్భుతమో! ఎవరి ఊహకి అందనంత త్వరగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎంతో ప్రశాంతమైన స్వామివారి దివ్య దర్శనం నాకు లభించింది. ఆ క్షణం నా మనసంతా బాబాపట్ల కృతజ్ఞతతో నిండిపోయింది. దర్శనానికి క్యూలో వెళ్తున్నప్పుడు ప్రతి అడుగు బాబా నా చేయి పట్టుకుని నడిపిస్తున్నట్లు నాకు అనిపించింది. నాకు ఒక గొప్ప సత్యం అర్థమైంది, 'మనం ప్రణాళికలు వేసుకుంటాం కానీ, అవి ఎప్పుడు, ఎలా, ఎవరి ద్వారా నెరవేరాలో నిర్ణయించేది మాత్రం దైవ సంకల్పమే. కొన్నిసార్లు మనం అనుకున్నది జరగకపోవచ్చు. కానీ ఆ జరగకపోవడం వెనక కూడా భగవంతుని దయ దాగి ఉంటుంది. జరిగేది మన ఊహలకు మించిన అనుభవమవుతుంది' అని. చివరిగా నా ఈ తిరుమల యాత్ర నాకు కేవలం ఒక దర్శనం కాదు, బాబా చూపించిన ప్రేమ, కరుణ, మార్గదర్శకత్వానికి ప్రత్యక్ష సాక్ష్యం. నన్ను తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధికి చేర్చి, ఎలాంటి ఆటంకం లేకుండా దివ్య దర్శనం ప్రసాదించి, తిరిగి క్షేమంగా ఇంటికి తిరిగి చేర్చిన నా సద్గురు శ్రీ శిరిడీ సాయిబాబాకు నా హృదయపూర్వక శతకోటి ప్రణామాలు.
బాబా సశరీరులుగా ఉండగా వారిని దర్శించిన భాగ్యశాలి శంభు మంగేష్ వాగ్లే. అతను గోవా రాష్ట్రంలోని ఐయాస్(తిస్వాడి) తాలూకా, శాంతాక్రజ్ గ్రామవాసి. 1911లో అతను బోరివలిలో ఉన్న ప్రఖ్యాత 'మాడ్గాంకర్' కుటుంబానికి చెందిన విస్తారమైన స్థిరాస్తుల పర్యవేక్షకుడిగా పనిచేస్తుండేవాడు. ఒకరోజు 'బలవంతరావు రామచంద్ర' ఉరఫ్ 'బాలభాయ్' మాడ్గాంకర్ అతన్ని, "గోవాలో మేలైన ‘సోన్కేవడే’(సుగంధభరితమైన పసుపురంగు పూలు) లభిస్తాయి కదా?" అని అడిగారు. అందుకతను "అవున"ని సమాధానమిస్తూ, "వాటికి ఒక నిర్దిష్ట కాలం(సీజన్) ఉంటుంది. ఆ సమయంలో మాత్రమే అవి పుష్కలంగా లభిస్తాయ"ని వివరించాడు. అప్పుడు బాలభాయ్, "బాంద్రా ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ శ్రీగోవిందరావు రఘునాథ్ దభోల్కర్ వాటిని తీసుకురమ్మని మీతో చెప్పమని చెప్పారు. మీరు వాటిని తీసుకొచ్చి ఆయనకిస్తే, ఆయన ఎంతో సంతోషిస్తారు. కారణం, వారి ఆధ్యాత్మిక గురువు శ్రీశిరిడీ సాయిబాబాకు ఆ పూల సుగంధానిచ్చే కాచు గోళీలు(కాచు అనే పదార్థాన్ని కిళ్ళిలో వాడతారు) అంటే చాలా ఇష్టం. కాబట్టి, ఆయనకోసం మీరు ఈ పనిని తప్పక చేయాల"ని అన్నారు. అతను "సరేన"ని ఒక వారంలోపే ఆ పూలు సేకరించి దాబోల్కర్కి అందజేశాడు. సహజంగానే ఆయన చెప్పలేనంతగా ఆనందభరితులయ్యారు. నాటినుండి వాగ్లేకి దభోల్కర్తో పరిచయం మొదలైంది. ఆ విషయమై అతను, "కాలం గడిచేకొద్దీ దాభోల్కర్ నాతో ఎంతో ఆప్యాయతతో, సానుభూతితో వ్యవహరించసాగారు. అంతటి ఉన్నత పదవి, తన హోదాకు తగినంత గంభీరత, అధికార దర్పం కలిగిన వ్యక్తి అయినప్పటికీ నా వంటి ఒక సామాన్య, అల్పుడైన వ్యక్తిపట్ల ఆయన ప్రవర్తన అసాధారణమైన ఆప్యాయతతో కూడుకొని ఉండేది. నేటికీ(1939) ఆయన ఆ దయార్ద్ర ప్రవర్తనను తలచుకున్నప్పుడల్లా నా మనసు కృతజ్ఞతా భావంతో నిండిపోతుంది" అని చెప్పారు.
దైవసంకల్పమో, యాదృచ్చికమో గానీ ఒకరోజు వాగ్లే బోరివాలి స్టేషన్లో దభోల్కర్ను అనుకోకుండా కలిసినప్పుడు ఆయనకి ఏదో స్ఫూర్తి కలిగి సమీపంలో ఉన్న తమకి పరిచయస్తుడైన భన్సాలీవాణి వర్గానికి చెందిన ఒక వ్యాపారిని పిలిచి, "మీరు శిరిడీ వెళ్ళినప్పుడు, ఈ వాగ్లేని తప్పకుండ మీతోపాటు తీసుకువెళ్ళండి" అని అన్నారు. అది విన్న వాగ్లే ఆశ్చర్యపోతూ, "ఎందుకు రావూసాహెబ్! మీరంత ప్రయాస పడుతున్నారు? నేను అక్కడికి వెళ్లి ఏం చేయాలి? అక్కడికి వెళ్లి ఆయన(సాయిబాబా) నుండి కోరుకోవాల్సింది నాకేమీ లేదు, ఆయనకు ఏ ఇబ్బంది కలిగించాలని కూడా నాకు లేదు" అని అన్నాడు. దానికి ఆయన, "మీ అభిప్రాయాన్ని నేను కాదనను కానీ, మీరు వెళ్లాల్సిందే!" అని నిశ్చయంగా చెప్పడంతో అతను, "సరే రావుసాహెబ్, చూద్దాం" అని బదులిచ్చాడు. అతను అలా చెప్పగానే, ఆయన రైలు బయలుదేరింది. ఆ తర్వాత రోజుల్లో దభోల్కర్ గట్టిగా పలికిన ఆ మాటలు వాగ్లే మనసును నిరంతరం కుదిపేసాయి. ఒకరోజు అతను బోరివాలికి చెందిన దామోదర్ రఘునాథ్ ఠాకూర్తో కూర్చుని ఉండగా యధాలాపంగా జరిగిన ఆ సంఘటన గురించి చెప్పాడు. అది విన్న ఠాకూర్ ఎంతో సంతోషించి, "దభోల్కర్ సాహెబ్ ఇలాంటి విషయాలను ఎవరికి పడితే వారికి చెప్పే వ్యక్తి కాదు. ఆయన ప్రత్యేకంగా మీకే ఈ విషయం చెప్పారంటే, మీరు ఖచ్చితంగా అక్కడికి వెళ్లాల్సిందే!" అని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అది అక్కడితోనే ముగిసిపోలేదు. ఆ సమయంలో ఆయన కుమార్తె, మనవళ్లు అక్కడే ఉన్నారు. వాళ్లంతా చాలా ఆనందంగా ఏకకంఠంతో, "వాగ్లేసాహెబ్, మీరు గనక శిరిడీ వెళితే, మాకు మా మనిషి కలుస్తార"ని ఆశని వ్యక్తం చేసారు. విషయమేమిటంటే, ఠాకూర్గారి అల్లుడు- వసాయి నివాసి అయిన శ్రీపాండురంగ్ సఖారాం నారేకర్ తన కుటుంబాన్ని వదిలేసి అప్పటికి రెండేళ్లగా శిరిడీలోనే ఉంటున్నారు.
పైసంఘటనతో సహజంగానే అప్పటివరకు శిరిడీ వెళ్ళడం గురించి వాగ్లే మనసులో ఉన్న అనిశ్చితి దానంతటదే తొలగిపోయి శిరిడీ వెళ్లాలని నిశ్చయానికి వచ్చాడు. కాబట్టి, ఆ సంవత్సరం డిసెంబరులో అతను గోవాలోని తన ఇంటికి వెళ్లడానికని యజమాని నుండి అనుమతి పొందాడు. తర్వాత అతను బొంబాయిలోని భివాండిలో మూడవ సంవత్సరం వైద్య పరీక్షలకు సిద్ధమవుతున్న తన స్నేహితుడు డా. నారాయణ రామచంద్ర బస్తోద్కర్ ఇంటికి వెళ్ళాడు. అక్కడ గోవాకు చెందిన గృహస్థుడైన పాండురంగ్ అనంత్ కెంకరే అనే అతని ఇంకో స్నేహితుడు కళాశాలలో బి.ఏ. చదువుతున్నాడు. అతను వాళ్ళిద్దరితో శిరిడీ వెళ్లాలన్న తన సంకల్పం గురించి చెప్పి, వాళ్ళు కూడా వస్తారేమోనని అడిగాడు. కానీ వాళ్ళు వెంటనే ఎలాంటి సమ్మతి తెలియజేయలేదు. కానీ ఆ రాత్రి 8 గంటల కలకత్తా మెయిల్లో వెళ్ళడానికి వాగ్లే సిద్ధమై, వేళకు బోరిబందర్ స్టేషన్కు బయలుదేరబోతుండగా ఆ స్నేహితులిద్దరూ స్టేషన్ వరకు వస్తామంటూ అతనితోపాటు వెళ్లారు. అక్కడ ఏం జరిగిందంటే, వాగ్లే తన టిక్కెట్ కొన్నప్పుడు వాళ్ళు కూడా రహస్యంగా తమతమ టిక్కెట్లు తీసుకుని, అతనికి వీడ్కోలు చెప్పకుండా అతనితోపాటు వెళ్లి కోచ్లో కూర్చున్నారు. అది చూసి అతను ఆశ్చర్యానందాలకు గురయ్యాడు. తర్వాత రైలు సమయానికి బయలుదేరడంతో వారి శిరిడీ యాత్ర ప్రారంభమైంది. మధ్య దారిలో వాళ్ళు మన్మాడ్ స్టేషన్లో దిగి, 'డౌన్-మన్మాడ్' రైలు వచ్చేవరకు అక్కడ వేచి ఉండాల్సి వచ్చింది. అక్కడ వాళ్ళు జీవితంలో ఎన్నడూ చూడని తీవ్రమైన చలికి ఇబ్బందిపడ్డారు కానీ, రైలు నిర్ణీత సమయానికి రావడంతో అది ఎక్కి ఉదయం ఆరు గంటలకు కోపర్గాఁవ్ స్టేషన్లో దిగారు. వాళ్ళు అక్కడినుండి టాంగాలో శిరిడీకి ప్రయాణమయ్యారు. దారిలో గోదావరి నీటి ప్రవాహం చూసి సంతోషపడ్డారు. సుమారు ఏడున్నర గంటలకు వాళ్ళు శిరిడీ పుణ్యభూమిలో అడుగుపెట్టారు.
వాగ్లే, అతని స్నేహితులు గ్రామంలోకి వెళ్ళినప్పుడు ముందుగా పైకప్పులేని మట్టి ఇళ్లను చూసి చకితులయ్యారు. కానీ వారి దృష్టి అంతా శ్రీసాయిబాబాపైనే కేంద్రీకృతమై ఉంది. సరిగ్గా అప్పుడే ఒక నల్లని దిగంబర వ్యక్తి ఒక మట్టి ఇంటి కప్పుపై నిలబడి, సూర్యుని వైపు ముఖం ఉంచి సూర్యుని చూస్తూ కనిపించాడు. అతన్ని చూసిన వాగ్లే, అతని స్నేహితులకి, 'ఈయనే సాయిబాబానా?' అనిపించింది. ఒక క్షణం పాటు అలాగే అనిపించి, అక్కడి ప్రజలను అదే ప్రశ్న అడిగారు. దానికి ఆ ప్రజలు, "ఈయన బాబా కాదు, షెగాం మహారాజ్ శిష్యుడు, తన ఉద్ధరణార్థం బాబా పాదాల చెంతకు వచ్చి, మౌనవ్రతం పాటిస్తున్నాడు" అని తెలియజేసారు. అప్పుడు వాళ్ళు, "ఇప్పుడు బాబా ఎక్కడ ఉన్నారు?" అని అడగ్గా, "బాబా బయటకు వెళ్లారు. ఇప్పుడు తిరిగి వస్తున్నారు. అదిగో బాకాల శబ్దం. మీరు వెళ్లి, మశీదులో కూర్చోండి" అని చెప్పారు. వాగ్లే, అతని స్నేహితులు బాకాలు మోగుతున్న దిశగా చూస్తే, దూరంగా ఒక పెద్ద ఎర్ర గొడుగు, చాలా జనం వస్తూ కనిపించారు. అది చూసి వాళ్ళు వెళ్లి మశీదులో కూర్చున్నారు. అక్కడ కింద ఒక సభా మండపం, దాని ముందు ఒక పెద్ద ఎత్తైన ప్రదేశం, వ్యాసపీఠం, దానికి కుడి వైపున వెండి ఆసనం, మధ్యలో గోడకు ఆనుకుని పగలు రాత్రి వెలిగే దీపాల వరస, ఎడమ వైపున ఎల్లప్పుడూ మండుతూ ఉండే ఒక అగ్నిగుండం(ధుని), చిలుము ఉన్నాయి. వాళ్ళు అవన్నీ గమనిస్తూ ఉండగా సరిగ్గా అప్పుడే దూరాన కనిపించిన బాబావారి ఊరేగింపు మశీదులోకి ప్రవేశించింది. సాయిబాబా చూడటానికి మంచి రంగుతో, దృఢంగా, కొద్దిగా వంగి ఉన్నారు. ఆయన చిరిగిన అరబిక్ శైలి కఫ్నీ ధరించి, తలకి ఒక చిన్న గుడ్డను చుట్టుకుని ఉన్నారు. ఆయన భుజాల నుండి తల పైకెత్తి, నోటితో కఠిన పదజాలంతో తిట్లు, శాపనార్థాలు పలుకుతూ వచ్చి ఆసనం మీద కూర్చున్నారు. వాగ్లే, అతని స్నేహితులు వెంటనే లేచి, బాబాకోసం కానుకగా తెచ్చిన బాదం హల్వా, ఇతర వస్తువులు తీసుకొని బాబా ముందుకి వెళ్లారు. బాబా వాళ్ళని చూస్తూనే, "బొంబాయి నుండి వచ్చారు. కూర్చోండి" అని అన్నారు. వాళ్ళు బాబాకు నమస్కరించి, ఆ వస్తువులను ఆయన ముందు ఉంచారు. ఆయన వాళ్ళకి ఊదీ ఇచ్చారు. వాళ్ళు దానిని తీసుకొని తమలాగే బాబా దర్శనానికి వచ్చిన ప్రయాణికులు ఆరోజు చాలామంది ఉన్నందున అక్కడినుండి లేచి అన్నపానీయాల కోసం వెళ్లారు.
- అన్నీ వింటూ సమాధానమిచ్చే బాబా
- సాయి వర్షించే కరుణని ఎంతని వర్ణించను?
కృష్ణజీ లక్ష్మణ్ సోమన్ శిరిడీలో తాను గమనించిన విషయాలు గురించి ఇంకా ఇలా చెప్తున్నారు:
నేను శ్రీసాయిబాబా దర్శనానికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు భాటే(భాటియా), పార్సీ మొదలైన వారి అందమైన భార్యలు, కుమార్తెలు కూడా వారి దర్శనానికి వచ్చేవారు. వాళ్ళు కొన్నిసార్లు శ్రీసాయిబాబా దగ్గర కూర్చునేవారు. అటువంటి సమయాల్లో కొంతమంది పురుషులు కూడా అక్కడ ఉండేవారు. వాళ్లలో ఎప్పుడూ అక్కడే ఉండేవాళ్ళు, బయటినుండి వచ్చినవాళ్ళు అనే రెండు రకాల వ్యక్తులు ఉండేవారు. ఈ వ్యక్తుల కళ్ళు సహజంగానే అక్కడున్న అందమైన స్త్రీల వైపు ఆకర్షింపబడేవి. మానవ స్వభావాన్ని చూస్తే, ఇది చాలా సహజమైన విషయం. కానీ బయటినుండి వచ్చిన వారి వైఖరి భక్తి, విశ్వాసాలతో, భావోద్వేగాలతో నిండి ఉన్నందున వారి ముఖాలపై ఎలాంటి ప్రత్యేక భావోద్వేగం కనిపించేది కాదు. వారి ముఖాలపై సాత్విక(ధర్మబద్ధమైన) భావాలు మాత్రమే ప్రకటమైనందున వాళ్ళు గంభీర స్వభావులుగా కనబడేవారు. కానీ ఎల్లప్పుడూ అక్కడే ఉండే వారి మనసులు మాత్రం చంచలమైనట్లు స్పష్టంగా కనిపించేది. శ్రీసాయిబాబా వైఖరి ఏ సమయంలోనూ, ఏ కారణంగానూ మారేది కాదు. ఆయన చాలా గంభీరంగా, ప్రశాంతంగా, స్థిర చిత్తంతో ఉన్నట్లు స్పష్టంగా కనిపించేది. ఆయన చాలా గంభీరంగా ఉన్నారని స్పష్టంగా తెలిసేది. వారి దర్శనానికి వచ్చిన ఆ అందమైన స్త్రీల హావభావాల్లో కూడా ఎలాంటి చంచలత్వం కనపడేది కాదు, దానికి విరుద్ధంగా నిష్కళంకమైన, స్వచ్ఛమైన వైఖరి, సాత్విక భావాలు స్పష్టంగా ప్రకటమవుతుండేవి. అటువంటి సన్నివేశాన్ని చూసినప్పుడు బయటినుండి వచ్చిన నా వంటి మనుషుల మనస్సులో మొదట ఏవైనా తప్పుడు లేదా పాపభావాలు కలిగినప్పటికీ వారి ఆ సాత్విక భావాల వల్ల అవి క్షణంలో మాయమైపోయి, వాటి స్థానంలో స్వచ్ఛమైన సాత్విక భావాలు వాటంతటవే ఉదయించేవి. నాకు అనిపించేది ఏమిటంటే, ‘సాధుసత్పురుషులను దర్శించడం వల్ల వేరే ఏ ప్రయోజనం లేకపోయినా, ప్రజల భావోద్వేగాలను శుద్ధిచేసే కార్యం వారికి తెలియకుండానే జరుగుతుంది. అది మామూలు ప్రయోజనం కాదు. సాధుసత్పురుషుల(మహాత్ముల) చరిత్రలు చదవడం ద్వారా జరిగే భావోద్వేగ శుద్ధి కార్యం వారి సాన్నిధ్యంలో, వారి ప్రత్యక్ష దర్శనం వల్ల మరింతగా జరుగుతుంది.
శ్రీసాయిబాబా ఎన్నడూ వేదాల గురించి మాట్లాడలేదు. భక్తి మార్గ ఉపదేశాలను కూడా వారి ప్రవర్తన, ఆచరణ, ప్రత్యక్ష ఉదాహరణల ద్వారా భోదించారు. ఇలా చెప్పడం అతిశయోక్తి అవుతుందని నేను అనుకోను. సాయిబాబా తమ దర్శనానికి వచ్చే భక్తులను అప్పుడప్పుడు 'గురుచరిత్ర' వంటి ప్రామాణిక గ్రంథాలను పఠించమని లేదా 'సప్తాహం' చేయమని సూచించేవారు. ఒకసారి 'ఓక్' అనే భక్తునితో గోవాలోని తన ఇంటిలో కూర్చొని 'గురుచరిత్ర' సప్తాహం చేయమని చెప్పారు బాబా.
మసీదులో శ్రీసాయి మహారాజ్ తీర్థ ప్రసాదాల పంపిణీ జరిగేది. ప్రజలందరూ వాటిని గొప్ప భక్తితో స్వీకరించేవారు. సాయిబాబా తాగిన పాత్రలో మిగిలిన నీరే ఆ తీర్థం. కొందరు దానిని స్వీకరించడానికి మొదట సంకోచించినప్పటికీ భక్తితోనో లేదా లోకవిరుద్ధంగా కనపడకుండా ఉండటానికో ప్రతి ఒక్కరూ దానిని తీసుకునేవారు. కుష్ఠురోగుల వంటి రోగగ్రస్తులకు మసీదులోకి రావడానికి ఎటువంటి నిషేధం లేనప్పటికీ, మశీదు నిర్వాహకులు అలాంటి వారు అక్కడికి రాకుండా ఏర్పాట్లు చేశారు. కనుక మహారాజ్ ఉదయం లెండికి వెళ్లే సమయానికి ఆ కుష్ఠురోగులు రహదారికి ఇరువైపులా నిలబడి మహారాజ్ దర్శనం కోసం ఎదురుచూసేవారు. ఆ సమయంలో వాళ్ళు మహారాజ్ పాదాలపై తమ తలను ఉంచి వారి దర్శనం చేసుకునేవారు. వారి స్పర్శ మహారాజ్ ముఖకవళికలలో ఎలాంటి మార్పు కలిగించేది కాదు. దానికి విరుద్ధంగా ఆయన కరుణ దృష్టితో వారిని చూస్తున్నట్లు అనిపించేది. నాలాంటి వ్యక్తులకు అదంతా వికారంగా, అత్యంత జుగుప్సాకరంగా, అంటువ్యాధి అన్న భయం కలిగించేదిగా ఉన్నప్పటికీ మహారాజ్ వైఖరిని చూసి ఆయనపై నాకు గౌరవం మరింత పెరిగింది. అంతేకాక, సత్పురుషుల వైఖరి(స్వభావం)లో దైవిక గుణాలు ఎలా ఉన్నతంగా ఉంటాయో కూడా నిరూపణగా చూడటం వల్ల ఒక విధమైన శిక్షణ లభించేది.
మహారాజ్ మసీదులో ఉన్నప్పుడు ఆయన వద్దకి చిన్న పిల్లలు వచ్చేవారు. వాళ్ళు చాలా అపరిశుభ్రంగా ఉన్నప్పటికీ, మహారాజ్ వాళ్ళని ఎత్తుకుని నవ్వుతూ నవ్వుతూ తమ ఒంటి మీద ఉన్న వస్త్రంతో వాళ్ళ ముక్కు, నోరు తుడిచి శుభ్రం చేసేవారు. ఆ తర్వాత వాళ్ళ చేతుల్లో పంచదార పలుకులు లేదా మరేవైనా తినుబండారాలు పెట్టేవారు. తద్వారా సహజాతిసహజంగా ఆయనకి అందరిపట్ల ఉండే సమత, మమతలు ప్రదర్శితమయ్యేవి. ఇది కూడా ఒక విధంగా భక్తులకు శిక్షణే.
శ్రీసాయిబాబా ఎప్పుడూ శాంతంగా, ఆనందంగా, సమచిత్తంతో ఉండేవారు. కానీ అప్పుడప్పుడు ఆయన మనో వైఖరి ఆకస్మికంగా మారిపోయి తీవ్రమైన భయాందోళనలు కలిగించేదిగా కనిపించేది. ఆయన రుద్రావతారం ధరించినట్లుగా అనిపించేది. ఒకరోజు రాత్రి నేను ఇతరులతో కలిసి రాధాకృష్ణమాయి ఇంటికి వెళ్లి, అక్కడ హారతి అయ్యాక తిరిగి వస్తుంటే, దారిలో మహారాజ్ ఒకటే కోపంతో ఊగిపోతూ కనిపించారు. ఆయన కళ్ళు ఎర్రబారిపోయాయి. ఆయన నిటారుగా నిలబడి, చేతిలోని కర్రను అటూ ఇటూ ఊపుతున్నారు. బాబా ఆ వైఖరి ప్రజలలో భయాన్ని పుట్టించగా పరుగులు తీయనారంభించారు. అటువంటి సంఘటనను నేను మొదటిసారి చూసినప్పుడు మహారాజ్ ఇంతలా ఆవేశపడటానికి కారణం ఏమిటో నా తర్కానికి అందలేదు. దీని గురించి నేను చాలామందిని అడిగాను. కానీ వారి నుండి నాకు సంతృప్తికరమైన సమాధానం లభించలేదు. ఇలాంటి ఆగ్రహావేశాలు శ్రీఅక్కల్కోట్ మహారాజ్లో తరచుగా కనిపించేదని నేను విన్నాను. ఇంకా తర్వాత ఎవరో నాతో ఇలా కూడా అన్నారు, 'హారతి అనంతరం అక్కల్కోట్కర్ మహారాజ్ మహారాజ్(సాయిబాబా) శరీరాన్ని ఆవహించినందున అలా జరుగుతుందని, మరియు పాపాలు వంటి అదృశ్య కారణాలు ఉండవచ్చని'. కానీ అది విని నాకు అంతగా సంతృప్తి కలగలేదు. ఒక సత్పురుషుని విషయంలో ఎల్లప్పుడూ సాత్విక గుణాలు కనిపిస్తున్నప్పుడు, ఉన్నట్టుండి ఆగ్రహావేశాలు వంటి తామసిక గుణం ఎందుకు ఉద్భవిస్తుందో అంతుచిక్కని రహస్యం. తత్వశాస్త్రవేత్తలే దీని గురించి ఆలోచించాలి.
మహారాజ్ విషయంలో కనిపించే ఇతరుల మనసును తెలుసుకోవడం, భూత, భవిష్యత్తుల గురించిన జ్ఞానం, ఇంకా అలాంటి ఇతర అద్భుతాలు కేవలం యోగ సిద్ధ పురుషునికి మాత్రమే ప్రాప్తిస్తాయి. పతంజలి యోగశాస్త్రంలో ఇటువంటి అనేక విషయాలు ప్రస్తావించబడ్డాయి. దీనిని బట్టి శ్రీసాయిబాబా ఒక గొప్ప యోగి సత్పురుషులై ఉండాలనే స్పష్టమైన అవగాహనకు నేను వచ్చాను. భావికభక్తులు ఆయనను ప్రత్యక్ష దైవమన్న దృష్టితో చూడటం కూడా యోగ్యమైనదే(సరైనదే). ఎందుకంటే, యోగ సాధన ద్వారా దైవత్వాన్ని(భగవత్ స్వరూపాన్ని) పొందినవారు దైవం కాక మరేమిటి? అటువంటి సత్పురుషుల వద్దకి కపటం లేకుండా వెళ్లినా, చికిత్స నిమిత్తం వెళ్లినా ఆ సత్పురుషుల సాత్విక గుణాల ప్రభావం వల్ల వారు కూడా సాత్వికులు కావడం సహజం.
సోర్స్: సాయిలీల పత్రిక 1938, 4,5, 6 సంచిక & 1938, 7,8,9 సంచిక
- సాయి సమాధానాలు - నేర్పిన పాఠం
- వెంట వున్నానని నిదర్శనం చూపించిన సాయి