సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

బాబా దర్శనానికి వచ్చిన ఆంగ్ల దొరలు


సద్గురు శ్రీసాయినాథుని అనుగ్రహం కుండపోతగా వర్షించే పర్వదినం గురుపూర్ణిమ.
శ్రీసాయి అనుగ్రహధారలలో మనమంతా ఆమూలాగ్రం తడిసి ఆనందంగా ఓలలాడాలని శ్రీసాయిని మనసారా ప్రార్థిస్తూ..
సాయిభక్తులందరికీ గురుపూర్ణిమ శుభాకాంక్షలు

1911, మార్చి నెలలో ఒకరోజు ఉదయం సుమారు 7 గంటల ప్రాంతంలో బాబా వద్ద సెలవు తీసుకొని కాకాసాహెబ్ దీక్షిత్, శ్రీమాధవరావు దేశ్‌పాండే బొంబాయికి బయలుదేరి వెళ్లారు. వాళ్ళు వెళ్లిన పిమ్మట మసీదులో బాబా, బాపుసాహెబ్ జోగ్, బాలసాహెబ్ భాటే, నీలకంఠ రామచంద్ర సహస్రబుద్దే మరియు ముఖ్య సేవకులు కొందరున్నారు. అకస్మాత్తుగా బాబా తమ కఫ్నీ(కఫ్నీ లోపల ఎప్పుడూ కౌపీనం ఉండేది) పైకి లేపి, "ఆ వెధవ నన్ను చూడటానికి వస్తున్నాడు! నా దగ్గర ఏముంది? నేను దిగంబర ఫకీరును. ముందు పురుషాంగం మరియు వెనుక పిరుదులు…(సాలా హమ్కూ దేఖనేకూ అతా హై. హమారే పాస్ క్యా హై? హమ్ తో నంగా ఫకీర్ హై. ఆగేలండ్ ఔర్ పిచే గాండ్- )" అని పెద్దగా అరిచారు. ఆ మాటలు విని అక్కడున్న వాళ్లంతా ఆశ్చర్యచకితులమయ్యారు. వారికెవరికీ బాబా మాటల అంతరార్థం అస్సలు అర్థం కాలేదు. ఎందుకంటే, ఆ సమయంలో మసీదు ముంగిట కొత్త వ్యక్తులు ఎవరూ లేరు. కానీ రెండు, మూడు నిమిషాల తర్వాత సెంట్రల్ ప్రావిన్సెస్ కమిషనర్ మిస్టర్ కర్టిస్, అతని భార్య, అహ్మద్‌నగర్ కలెక్టర్ మిస్టర్ మెక్‌నీల్, కమిషనర్ స్థానిక సహాయకుడు రావుబహదూర్ రామచంద్ర నారాయణ్(అలియాస్ భావుసాహెబ్ జోగ్లేకర్) తదితరులతో కూడిన అధికారుల బృందం మసీదు పక్కగా చావడి వైపు వెళ్తూ కనిపించారు. వాళ్ళని చూసాక మశీదులో ఉన్న భక్తులకు బాబా మాటల అర్థం బోధపడి, ఇది బాబా దివ్య దృష్టికి నిదర్శనమని గుర్తించారు. అనంతరం బాబా వద్ద సెలవు తీసుకొని కొందరు భక్తులు చావడికి వెళ్లగా, సహస్రబుద్దే, బాలాసాహెబ్ బాటే ఇంటికి వెళ్లారు.

శిరిడీ గ్రామపాటిల్, కులకర్ణిలు అధికారుల బృందాన్ని చూడగానే ‘శిరిడీలో ఏదైనా రాజకీయ అశాంతి నెలకొందా లేదా ఇంకేమన్నా అన్న విషయం చూడటానికి ఆ బృందం ఆకస్మికంగా వచ్చిందని’ భావించి తీవ్ర గందరగోళానికి గురయ్యారు. వాళ్ళు హడావిడిలో చావడికి మూడు కుర్చీలే తెప్పించడంతో సాహెబ్‌లు(ఆంగ్ల దొరలు) కుర్చీలలో కూర్చోగా తక్కువ స్థాయి అధికార హోదాలో ఉన్నవాళ్ళు సహజంగానే నిలబడక తప్పలేదు. తర్వాత భావుసాహెబ్ జోగ్లేకర్ తన విచారణను ప్రారంభించారు. ఆ క్రమంలో తమకి కావాల్సిన సమాచారం ఇవ్వడానికి ఆ సమయంలో తన మిత్రుడు, శ్రీబాలాసాహెబ్ భాటే, బి.ఏ.(పదవీ విరమణ చేసిన మామలతదారు) తప్ప తమకు పరిచయమున్న ఇతరులెవ్వరూ లేరని తెలిసి వెంటనే, ప్యూన్‌తో బాలాసాహెబ్‌ బాటేను రమ్మని కబురు ​​పంపారు. అయితే, మామలతదారుగా ఉన్నప్పుడు కర్టిస్ సాహెబ్ పాలన వల్ల విసుగు చెందిన బాలాసాహెబ్ భాటే వాళ్ళ దగ్గరకి వెళ్ళడానికి ఇష్టపడలేదు. అందుచేత తనను తీసుకెళ్లడానికి వచ్చిన ప్యూన్‌తో, "నేను రావడం లేదని భావుసాహెబ్‌కు చెప్పు" అని అన్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న సహస్రబుద్ధే ఆ ప్యూన్‌తో, "బాలాసాహెబ్ సందేశాన్ని అందించే బదులు, ముందు భావుసాహెబ్‌నే ఇక్కడికి(బాలాసాహెబ్ ఇంటికి) రమ్మని చెప్పు. ఆ తర్వాత నేను అతనితోపాటు చావడికి వస్తాన”ని చెప్పాడు. సహస్రబుద్దే సందేశం అందుకున్న వెంటనే భావుసాహెబ్ బాలాసాహెబ్ ఇంటికి వచ్చాడు. భావుసాహెబ్ జోగ్లేకరు, సహస్రబుద్దేలు చిన్ననాటి స్నేహితులు అయినందున కొద్దిసేపు అక్కడే మాట్లాడుకున్నారు. తర్వాత సహస్రబుద్ధే అతనితో కలిసి చావడికి వెళ్లాడు. 

అక్కడికి చేరుకున్నాక, భావుసాహెబ్ సహస్రబుద్ధేతో, "బాబాను సత్వరం వారి ఉదయపు కాలకృత్యాలు ముగించుకోమని బాబాకు సందేశం పంపండి. ఎందుకంటే, సాహెబ్ ఆయనను కలవాలనుకుంటున్నారు" అని అన్నాడు. ఆ మాటలు విని సహస్రబుద్దే కొంత ఆశ్చర్యానికి గురై, “ఇక్కడ ఎవరూ అలాంటి పని చేయరు” అని, ఆపై “ 'అసలు నీకు పేరే లేనప్పుడు, నీపై నాకెలాంటి హక్కు ఉంటుంది?’ అని సాక్షాత్తు దేవుడినే ప్రశ్నించే సాహసం చేసిన సంత్ తుకారాం వంటి అత్యున్నత కోవకు చెందిన మహనీయులు ఆయన(సాయిబాబా). అటువంటప్పుడు, మీ పెత్తనం ఇక్కడ ఎలా చెల్లుతుందని మీరు ఆశిస్తున్నారు? ఆయనతో మీకు ఏదైనా పని ఉంటే, మీరు ఖచ్చితంగా ఆయన ఇష్టానుసారమే నడుచుకోవాలి" అని అన్నాడు. అతని ఆ మాటలకు కర్టిస్ సాహెబ్ నొచ్చుకోకుండా ఉండేందుకు బావుసాహెబ్ తనకి, సహస్రబుద్దేకి మధ్య చిన్ననాటినుండి ఉన్న స్నేహబంధం గురించి వాళ్ళకి కాస్త వివరంగా చెప్పాడు. ఆ తర్వాత వాళ్లంతా శ్రీసాయిబాబా తమ ప్రాతఃకాల విధులు(స్నానం వగైరా) ముగించుకుని, తమ నిత్య నియమానుసారం భిక్షాటనకు వెళ్లే సమయం వరకు వేచి చూశారు.

సుమారు అరగంట తర్వాత బాబా చావడి వైపు రావడం చూసిన శ్రీమతి కర్టిస్ కిందకు దిగి, దారి మధ్యలో బాబాను కలిసి, వినయంగా వారికి నమస్కరించి, "నేను మహారాజ్‌తో నాలుగు మాటలు మాట్లాడాలనుకుంటున్నాను" అని అంది. అందుకు బాబా, "అరగంట ఆగు" అని ముందుకు వెళ్లిపోయారు. అరగంట తర్వాత ఆయన తిరిగి వస్తుంటే, శ్రీమతి కర్టిస్ మళ్ళీ మునుపటిలాగే వారికి నమస్కరించి, అభ్యర్థించింది. అప్పుడు ఆయన, "ఒక గంట ఆగు" అని చెప్పి మసీదుకు వెళ్లిపోయారు. అలా జరిగేసరికి శిరిడీలో ఏ వింత, విశేషం కనిపించక కర్టిస్ సాహెబ్ తిరిగి వెళ్ళడానికి తొందరపడటంతో మిగత అందరూ కూడా కాసేపట్లో బయలుదేరడానికి సిద్ధం కాసాగారు. సహస్రబుద్ధే, భావుసాహెబ్‌లు చావడి దగ్గర బయట మాట్లాడుకుంటూ నిలబడ్డారు. కొంతసేపటికి కర్టిస్ సాహెబ్ సహస్రబుద్దే దగ్గరకు వచ్చి, ఎంతో కష్టంగా అతని చేతిలో 5 రూపాయలు పెట్టి, దానిని పేదలకు పంచమని ఆజ్ఞాపించాడు. అది విని సహస్రబుద్దే ఆయనతో, "నేను ఈ మొత్తాన్ని బాబాకి అందజేస్తాను. దానిని పేదలకు పంచడం వారి ఇచ్చ అయితే, పాటిల్, కులకర్ణిలతో ఆ పని చేయమని చెప్తారు" అని అన్నాడు. అతని ఆ మాటలు విన్న సాహెబ్, "నీకు ఏది సరైనదనిపిస్తే, అది చేయి" అని చెప్పాడు. తర్వాత మెక్‌నీల్ సాహెబ్ 5 రూపాయలు, భావుసాహెబ్ 2 రూపాయలు సహస్రబుద్దెకి ఇచ్చారు. అతను ఆ మొత్తం ధనాన్ని వెంటనే బాబాకి పంపించాడు కానీ, వారు ఆ ధనాన్ని స్వీకరించలేదు. అందువల్ల ఆ ధనం తిరిగి అతని వద్దకే వచ్చింది. అతను దానిని మళ్ళీ బాబాకి పంపినప్పుడు, వారు దానిని తీసుకుని పక్కన కూర్చున్న ఒక వ్యక్తికి ఇచ్చేసారు. ఆ తర్వాత కొద్దిసేపటికి అధికారులు నగరానికి తిరిగి వెళ్లిపోయారు.

సుమారు రెండు గంటల తర్వాత హారతికోసం సహస్రబుద్దే మసీదుకు వెళ్ళినప్పుడు బాబా అతనితో, "గవర్నర్ సాహెబ్ ఇచ్చిన ఆ ముప్పై రూపాయలు నాకు ఇవ్వు" అన్నారు. అతను ఆ రూపాయల గురించిన వాస్తవాలన్నీ బాబాకి చెప్పిన మీదట, "నాకు అందిన 12 రూపాయలు వెంటనే మీకు పంపించాను. మీకు కావాలంటే, అదనంగా నా సొంత డబ్బు 18 రూపాయలు తెప్పించి ఇస్తాను" అన్నాడు. బాబా, "ఆ సాహెబ్‌ల నుండి మొత్తం 30 రూపాయలు నాకు రావాల్సి ఉంది. నాకు నీ డబ్బు వద్దు" అన్నారు. వారి ఆ మాటల్లోని మర్మాన్ని అతను గ్రహించలేకపోయాడు. అతనికేమీ అర్థం కాలేదు. కానీ బాబా మాట్లాడిన ఒక్క మాట కూడా వ్యర్థం కాదని అతనికి తెలుసు కనుక వాస్తవేమేమిటో శ్రీమతి కర్టిస్‌ను అడిగి, విషయమేమిటో తెలియజేయమని కోరుతూ భావుసాహెబ్ జోగ్లేకర్‌కు ఒక లేఖ పంపాడు. దానికి ప్రతిస్పందనగా అతను, "ఆ రూపాయలకు సంబంధించి కర్టిస్‌కు, అతని భార్యకు మధ్య జరిగిన సంభాషణను వ్రాసాడు. శిరిడీలో కర్టిస్ సాహెబ్ సహస్రబుద్దేకు పైకమివ్వడానికి ముందు సహస్రబుద్ధే, భావుసాహెబ్‌లు చావడి బయట నిల్చొని మాట్లాడుకుంటున్న సమయంలో అక్కడ చావడిలో కర్టిస్ సాహెబ్ తన భార్యతో పేదలకు పంచడానికి ఒక్క రూపాయి ఇవ్వాలనే తన ఉద్దేశాన్ని చెప్పగా, ఆమె చాలా బాధపడి, "మీ హోదా, సంపద దృష్ట్యా మీరు కనీసం 25 రూపాయలైనా ఇవ్వాల"ని అందట. ఈ వివరాలు తెలిసాక కర్టిస్ సాహెబ్‌ ఇవ్వవలసిన 25 రూపాయలు, మెక్‌నీల్ సాహెబ్‌ ఇచ్చిన 5 రూపాయలు కలిపి మొత్తం 30 రూపాయలు, అందుకే బాబా తనని 30 రూపాయలు అడిగారని సహస్రబుద్దేకి అర్థమైంది.

ఇకపోతే, ఆ తర్వాత సహస్రబుద్ధే చాలా విచారించిన మీదట, ‘శ్రీమతి కర్టిస్‌‌కి పిల్లల్లేరని, సత్పురుషుల కృప లభిస్తే, పుత్రప్రాప్తి కలుగుతుందనే నమ్మకంతో ఆమె శిరిడీ వచ్చి తన మనోభీష్టాన్ని సాయి పాదాలకు విన్నవించుకోవాలనుకుందని’ తెలిసింది. అయితే ఆమె శ్రద్ధ అంత బలంగా లేనందున, బాబా ఆజ్ఞను ఉల్లఘించి తన భర్తకి అనుకూలంగా వెనుదిరిగి వెళ్లిపోవడానికి సిద్ధపడింది. కానీ ఎవరి(దొరల) ఎంగిలి స్వీకరించడానికి వేలాది ప్రాపంచిక మహాపండితులు సిద్ధపడతారో, అటువంటి ఆమెను అంత అవమానకరంగా చూసే ధైర్యం ఒక నిజమైన సాధువుకి తప్ప మరెవరికి ఉంటుంది? ఆ విషయం ఆమె గ్రహించలేదు గనకనే బాబా పెట్టిన పరీక్షలో ఓడిపోయింది. ఆమె మనోభీష్టం నెరవేరలేదు.

పై వివరాలన్నీ తెలియజేసిన సహస్రబుద్దే చివరిగా అధికారులు గ్రామ ప్రవేశం చేసే సమయంలో శ్రీ(బాబా) పలికిన మాటలు ఎవరికైతే అశ్లీలంగా, అసభ్యకరంగా ఉన్నాయని అనిపిస్తాయో వారిని శ్రీతుకారాం గాధలో ఆయన రచించిన 4438వ అభంగం పూర్తిగా చదవమని సూచించారు(ఆ అభంగం వృద్ధాప్యం యొక్క స్వభావాన్ని, భగవన్నామాన్ని స్మరించుకోవాల్సిన ఆవశ్యకతను వివరిస్తుంది. అందులోని 7వ వాక్యంలో సాయిబాబా వాడినటువంటి పదజాలమే వాడారు సంత్ తుకారాం మహారాజ్).

చివరిగా ‘ఆగేలండ్ ఔర్ పిచే గాండ్(आगे लंड, पीछे गांड)’ అని బాబా అన్న ఆ వాక్యం మామూలుగా మరాఠీలో ఎటువంటి పని పాట లేని, బాధ్యత లేని, భవిష్యత్తు గురించి ఆలోచన లేని, లేదా నిరుపేద వ్యక్తి గురించి చెప్పేటప్పుడు ఉపయోగిస్తారు. అంటే ‘తాము పేద పకీరుమని, తమ వద్ద ఏమీ లేదని’ చెప్పడమే బాబా మాటల అంతరార్థం. అయినా బాబా వంటి మహాత్ముల అంతరంగం ప్రేమమయం. వారు ఎప్పుడూ కోపంతోనో, ద్వేషంతోనే తిట్లు, శాపనార్థాలు పెట్టరు. వారి తిట్లు, శాపనార్థాల వల్ల తెలియకుండానే భక్తుల జన్మజన్మల దుష్ట సంస్కారాలు తొలగిపోయి మనో పవిత్రత జరుగుతుంది. అందుకే ఒక్కొక్కప్పుడు భక్తులను చెడ్డగా తిట్టడానికి కారణమేమిటని అడిగిన ఒకరితో, “నేను తిట్టలేదు, ఆశీర్వదించాను” అన్నారు బాబా.

మూలం: శ్రీసాయిలీల మరాఠీ పత్రిక, 1923, 3వ సంచిక & 1931, 4వ సంచిక,
సాయి లీలామృతం, సాయి సన్నిధి.

సాయిభక్తుల అనుభవమాలిక 2108వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా నాతోనే ఉన్నారన్న అనుభూతి
2. నెక్లెస్ దొరికేలా బాబా చేసిన సహాయం

బాబా నాతోనే ఉన్నారన్న అనుభూతి

నా పేరు భారతి. మా కుటుంబమంతా కర్ణాటకలో జరిగే మా బంధువుల ఎంగేజ్మెంట్ ఫంక్షన్‌కి హైదరాబాద్ నుండి వెళ్లాలని మొదట అనుకున్నాము. కానీ తర్వాత పనుల ఒత్తిడి వల్ల కుదరక మావారు  రానన్నారు. ఆయన రావడం లేదని, పైగా నెలసరి సమయమని హైదరాబాద్‌లోనే ఉద్యోగం చేస్తున్న మా పాప కూడా రానంది. ఇంకా నేను ఒక్కదాన్నే ప్రయాణానికి సిద్ధమయ్యాను. అప్పటినుండి తిరిగి హైదరాబాద్ చేరేవరకు బాబా నా వెంటే ఉంటూ వివిధ సందర్భాలలో రక్షణనిచ్చారు. నేను రాత్రి 10 గంటలకు లింగంపల్లిలో ట్రైన్ ఎక్కాల్సి ఉండగా ఆరోజు ఉదయం నుండి ఆ ట్రైన్ 3 నుండి 4 గంటలు ఆలస్యంగా నడుస్తుందని మెసేజ్లు వస్తూపోయాయి. ఆ మెసేజ్ బట్టి చూస్తే, నేను రాత్రి ఒంటి గంట, రెండు గంటల మధ్య ట్రైన్ ఎక్కాలి. కానీ ఆ సమయంలో స్టేషన్‌కి ఎలా వెళ్ళాలని తర్జనభర్జన పడ్డాను. 10 గంటలకైతే మా పాప కారులో నన్ను స్టేషన్ వద్ద దింపేసేది కానీ, ఒంటిగంటకు తనని డ్రాప్ చేయమని చెప్పాలంటే మళ్ళీ తను ఒక్కతే వెనక్కి వెళ్ళాలి. కాబట్టి ఆ సమయంలో తను వద్దు అనుకున్నాం. క్యాబ్ బుక్ చేద్దామంటే, రక్షణ సమస్య. అదీకాక ఆ సమయంలో దొరుకుతాయో, లేదో కూడా తెలీదు. మా పాప "పర్లేదు, నేను డ్రాప్ చేస్తా" అంటే, ఊర్లో ఉన్న మావారు వద్దన్నారు. సిటీలో ఉన్న కొందరు బంధువుల పిల్లలు, స్నేహితులు నన్ను స్టేషన్ వద్ద దింపగలరేమో అని ప్రయత్నాలు చేశాను కానీ, వాళ్ళకి వీలుకాలేదు. చివరికి 10 గంటలకే బయలుదేరి వెళ్ళిపోయి స్టేషన్‌లోనే ఎలాగో ఒకలా కాలక్షేపం చేద్దామని అనుకున్నాను. కానీ ఆ సమయంలో కూడా హైదరాబాద్ రోడ్లలో ట్రాఫిక్ ఉంటుంది. మా పాప, "ఏం పర్వాలేదు" అని అంటున్నా తల్లిదండ్రులుగా మా భయాలు మాకు ఉండడంతో బాబా మీద భారం వేసి కాస్త ముందుగానే వెళ్ళాం. బాబా దయవల్ల కాస్త అటుఇటుగా 11 కల్లా మా పాప నన్ను స్టేషన్ వద్ద దింపేసి, తిరిగి తను సురక్షితంగా ఇంటికి చేరుకుంది. నేను భయపడినట్టుగా స్టేషన్‌లో నాకు బోర్ అనిపించలేదు. అది అర్ధరాత్రి సమయమైనందున ఏసీ పెయిడ్ వెయిటింగ్ హాల్లో కూర్చొని, అమెరికాలో ఉన్న బంధువులతో ఫోన్(వాళ్ళకి అది పగలు) మాట్లాడుతూ కాలక్షేపం చేసి పావు తక్కువ రెండుకి ట్రైన్ ఎక్కాను.

కర్ణాటకలో చేరాల్సిన చోటుకి వెళ్లి పెళ్లి వాళ్ళింటికి వెళ్ళాను. మర్నాడు సమీప పట్టణంలో ఎంగేజ్మెంట్. రాత్రి అందరికీ ఆ పట్టణంలోని హోటల్లో రూమ్ బుక్ చేశారు. నేను మా మరిది కుటుంబంతో కలిసి కారులో అక్కడికి వెళ్ళి రిసెప్షన్‌లో రూమ్ గురించి విచారిస్తుండగా, అంతకుముందు మేము లోపలికి వెళ్తుంటే బయటకు వెళ్తున్న పెళ్ళి బృందంలోని ఒకాయన తిరిగి లోపలికి వచ్చి, చేతిలో దుమ్ముతో ఉన్న సెల్ ఫోన్ రిసెప్షన్‌వాళ్ళకి చూపిస్తూ, "ఇది ఎవరు పారేసుకున్నారో, ఏమో! కాస్త చూడండి" అంటూ చేయి చాపేసరికి అది నా ఫోన్! దాన్ని చూడగానే నా గుండె గుభేలుమంది. ఏం జరిగిందో నాకు వెంటనే అర్థమైంది. నేను కారు దిగేటప్పుడు అప్పటివరకు నా ఒళ్ళో ఉన్న సెల్ ఫోన్ జారి రోడ్ మీద పడినట్టుంది, అది నేను గమనించకుండా చేతిలో హ్యాండ్ బ్యాగుతో లోనికి వచ్చేశాను. ఫోన్ పోయిన విషయం నేను గ్రహించి ఉంటే ఎంత టెన్షన్ పడేదాన్నో కానీ, ఆ విషయం నాకు తెలియకముందే బాబా దాన్ని తిరిగి సురక్షితంగా నాకు అందించారు(రోడ్ మీద చాలా వాహనాలు తిరుగుతూ ఉంటాయి, దేని కింద కూడా పడకుండా). ఇలాగే ఇంతకుముందు ఒకసారి నా ఫోన్, క్యాష్, కార్డులు, బంగారం ఉన్న బ్యాగ్ బండికి వదిలేస్తే, బాబా ఎలా రక్షించారో నేను గతంలో ఈ బ్లాగులో పంచుకున్నాను. అప్పుడు కనీసం నేను బ్యాగ్ లేదన్న విషయం గుర్తించి ఒకసారి బాబాను తలచుకున్నాను. ఈసారి అది కూడా లేదు. నేను నిర్లక్ష్యంగా పారేసుకుంటే వెనకే బాబా నాకు తెచ్చి ఇచ్చేసారు. చిన్న టెన్షన్ కూడా నేను పడకుండా చేసారు. ఊరు కానీ ఊర్లో, మావారు పక్కన లేకుండా(చుట్టాలు ఎందరో ఉన్నారు అనుకోండి) ఫోన్ పోతే నా పరిస్థితి ఏంటి అనేది ఊహించుకోడానికి కూడా నాకు చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే, ఒకసారి మా పాప సరిగ్గా ఇదే విధంగా ఫోన్ పోగొట్టుకుని ఎంతో ఇబ్బందిపడింది. ఈ అనుభవం ద్వారా బాబా నాతోనే ఉన్నారని అనుభూతి చెందాను.

మెనోపాజ్ దశ దగ్గర పడుతుండటం వల్ల ఈమధ్య నాకు నెలసరి సమయానికి రావడం లేదు. ఈ ఫంక్షన్ విషయంలో ముందే వచ్చి, వెళ్లేనాటికి ఆ సమస్య అస్సలు లేకుండా ఉండాల్సింది, కానీ నెలసరి రాలేదు. ఇంకా నేను బాబా మీద భారమేసి ధైర్యంగా వెళ్ళిపోయాను. బాబా నెలసరి విషయంలో ఎప్పుడూ నాకు సహకరించినట్టే, ఈసారి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసారు. అక్కడున్న 2 రోజులలో కానీ, ట్రైన్‌లో గాని నెలసరి రాలేదు. హ్యాపీగా అన్ని ముగించుకుని ఇంటికి చేరుకున్నాను. బాబా మనతో ఉన్నారన్న భరోసా లేకపోతే ఇంత ధైర్యంగా మనం ఏ పని చేయలేము. అన్ని బాబా మీద వేసేస్తే, చాలా ధైర్యంగా ఫ్రీగా ఉంటుంది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. మిగిలి ఉన్న ఒక పని సవ్యంగా త్వరగా మంచిగా జరిగేట్లు చూడు తండ్రీ"..

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి


సాయిభక్తుల అనుభవమాలిక 2107వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. శ్రద్ధ-సబూరిలతో బాబాని ప్రార్థిస్తే, ఆయన తప్పకుండా సహాయం చేస్తారు
2. బదిలీ కాకుండా దయచూపిన బాబా


బదిలీ కాకుండా దయచూపిన బాబా

నేను ఒక సాయి భక్తుడిని. మేము సోలాపూర్‌లో ఉంటాము. ఇక్కడ నేను రైల్వేలో, నా భార్య LICHFLలో పని చేస్తున్నాం. గత ఆరు సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నందున ఒక ఇల్లు తీసుకుంటే బాగుంటుందని నిర్మాణంలో ఉన్న ఒక ఇల్లు తీసుకున్నాం. ఇంకా ఇంటికి ఫర్నిచర్, గృహప్రవేశం చేయాల్సి ఉండగా అనుకోకుండా నా భార్యకి ప్రమోషన్‌తో పాటు బదిలీ అయ్యే అవకాశం ఉందని ఆఫీసులో చెప్పారు. కొత్తగా తీసుకున్న ఇంట్లో అడుగుపెట్టకుండానే ఊరి వదిలి వెళ్ళిపోవడం ఏంటని అనిపించి బాబాని, "వేరే చోటుకి బదిలీ వస్తే, నచ్చిన ఉద్యోగం మానేయాల్సి ఉంటుంది. ఒక్కరి జీతంతో ఇల్లు గడవడం కష్టం. ఇద్దరు పిల్లలతో చాలా కష్టం అవుతుంది. ఎలా అయినా బదిలీ కాకుండా ఉండి అందరం కలిసి కొత్త ఇంట్లో అడుగుపెట్టేలా చూడండి. ఐదుగురుకి అన్నదానం చేసి, మీ మందిరంలో కొబ్బరికాయ సమర్పించుకుంటాను" అని వేడుకున్నాను. బాబా దయవల్ల ఈ సంవత్సరం బదిలీ రాలేదు. వస్తాదనుకున్న ప్రమోషన్ కూడా రాకపోయినా బాబా ఏం చేసినా మన క్షేమం కోసమే చేస్తారని అనుకున్నాం. "చాలా ధన్యవాదాలు బాబా. ఇంటి పని తొందరగా పూర్తై గృహప్రవేశం చక్కగా జరిగేలా చూడండి".

సాయిభక్తుల అనుభవమాలిక 2106వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • బాబా మీద నమ్మకముంచితే అంతా శుభమే!


సాయిభక్తుల అనుభవమాలిక 2105వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా చేసిన గొప్ప సహాయాలు
2. సమస్యలు తీర్చే సాయితండ్రి 

బాబా చేసిన గొప్ప సహాయాలు

సాయి మహరాజ్ కి జై. సాయి బంధువులందరికీ నమస్కారం. నా పేరు భాస్కర్. మాది తాడేపల్లిగూడెం. 2026, మార్చి 3న మా నాన్న మాకు భౌతికంగా దూరమై, మమ్మల్ని అనాథలను చేశారు. దాంతో ఇంటికి నేనే ఒక్కగానొక్క మగ దిక్కు అయ్యాను. అప్పటిదాకా అన్నీ నాన్నే చూసుకోవడం వల్ల నాకు బయట ప్రపంచం గురించి అంతగా అవగాహన లేదు. అప్పుల గొడవలు, పోలీసులు, కోర్టు వంటి వ్యవహారాలు ఏం తెలియదు. అలాంటిది మేము నాన్న పోయారన్న దుఃఖంలో వుండగా అనుకోకుండా ఒక లాయర్ నోటీసు మాకు వచ్చింది. మేమంతా ఆశ్చర్యపోయాము. ఆ నోటీసులో మా అమ్మ 2 సంవత్సరాల క్రితం మాకు తెలియని ఎవరి దగ్గరో 6 లక్షల రూపాయలు అప్పు చేశారని, ప్రామిసరీ నోటు కూడా ఉందని వుంది. నిజానికి మా అమ్మ గుమ్మంలో కూరగాయలు కొనడానికి కూడా ఏనాడూ బయటకు రాని మనిషి. అందుచేత ఆ నోటీసుతో పిడుగు పడినట్టై వణికిపోయి నిద్రలేని రాత్రులు గడిపాము. మా నాన్న ఆర్థికంగా మాకు అన్నీ అమర్చి వెళ్ళిపోయారు. బాబా దయవల్ల మాకు ఏ లోటూ లేదు. కాబట్టి 6 లక్షలు ఇవ్వడం సమస్య కాదు. కానీ నాన్న గుప్త దాత. సమాజంలో ఒక్కరితో కూడా మాట పడకుండా, అందరితో మనిషంటే ఇలా బ్రతకాలి అనిపించుకున్నారు. అలా మచ్చ లేకుండా దానకర్ణుడిలా వెళ్ళిపోయిన మా నాన్న మీద ఆయన వెళ్ళిపోయిన 3వ నెలలోపే ఇలాంటి అపవాదు రావడం ఆయన గౌరవానికి పెద్ద మచ్చ అని మేము కుమిలిపోయాము. నేను సదరు లాయరుకి ఫోన్ చేస్తే, "కోర్టుకు రండి, మాట్లాడుకుందాం" అన్నాడు. విషయం తెలిసిన ఇంకో లాయర్ సెటిల్మెంట్ చేయిస్తా, రండి అన్నాడు. ఇంకా ఎవరెవరో కల్పించుకొని ఏమేమో చేస్తాం అంటూ గందరగోళం చేసారు. ఇవన్నీ చూసి, 'ఎక్కడో ఎవరో మోసం చేస్తున్నారు. ఒంటరివాళ్లు, అమాయకులు, డబ్బు ఉంది. భయపెట్టి ఎంతోకొంత కాజేద్దామని తోడేళ్లలా వెంటాడుతున్నారు' అనిపించి MLA ఆఫీస్ నుండి ఆ లాయరుకి ఫోన్ చేయించాను. అప్పుడు ఆ లాయర్, "నన్ను భయపెడతారు ఎందుకు? ఎవరో ప్రామిసరీ నోటు తెచ్చి, కేసు నోటీసు పంపమంటే పంపాను. సాక్ష్యం లేకుండా నేను పంపాను కదా! మీకు ఏదైనా చేయాలని ఉంటే, కౌంటర్ ఇవ్వండి" అని చెప్పాడు. అప్పుడు నేను, 'నాన్న సంరక్షణలో సౌఖ్యంగా గుమ్మం దాటని మా అమ్మను నా సంరక్షణలోకి రాగానే కోర్టు గుమ్మం ఎక్కించాలా దేవుడా?' అని బాబాకు నా బాధ చెప్పుకొని, "స్తవనమంజరి 108 సార్లు చదువుతాను. ఈ ఆపద, అపవాదు నుండి గట్టు ఎక్కించండి. నాన్న లేని నాకు నువ్వే నాన్నవు" అని బాబాను కష్టనివారణ స్తోత్రం చదువుతూ పగలూరాత్రీ ప్రార్థించాను. ఒక లాయరును కలిసి కౌంటర్ ఇచ్చాను. బాబా దయవల్ల అటునుండి ఇప్పటివరకు రిప్లై రాలేదు. ఇక రాదని నిర్ధారించుకున్న తరువాత నెత్తి మీద భారం తీరిపోయి బాబాకు వేలవేల కృతజ్ఞతలు చెప్పుకుందామని మీ అందరికి తెలియజేస్తున్నాను.  అపార కరుణ గల మన అవధూత (సాయి)మహరాజ్‌కు మన కుటుంబ పెద్దగా ఉండమని బాధ్యత అప్పగిస్తే, మన 7 తరాలకు ఆయన రక్షణ వహిస్తారు.

నేను బ్యాంకులో పని చేస్తున్నాను. ఆ బ్రాంచులో పని ఒత్తిడికి నాకు గుండెనొప్పి వచ్చేలా ఉంటుంది. నేను చాలా బాధపడుతూ ఆ ఉద్యోగం మానేసి బిజినెస్ పెట్టుకుందామని అనుకోని రోజు లేదు. కానీ కొన్నాళ్ళు ఆ ఉద్యోగం తప్పనిసరిగా చేసేలా నాకు బాధ్యతలు ఉన్నాయి. అదికాక నాన్న మరణంతో నా మీదే ఆధారపడ్డ మా అమ్మ, చెల్లి, మేనకోడలు, నా భార్య, నా కూతురు అందరూ ఆడవాళ్లు  నేను డ్యూటీకి వెళ్ళిపోతే ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో బాబా చేసిన సహాయం చూడండి. ఆయన విచిత్రంగా నా సొంత వూరిలో మా ఇంటి ప్రక్కనే ఉన్న బ్రాంచ్కి నాకు బదిలీ అయ్యేలా అనుగ్రహించారు(ఈ బ్రాంచ్‌లో పని తక్కువ). నిజానికి నాకు బదిలీలు అస్సలు ఉండవు. కానీ, ప్రక్క బ్రాంచ్‌లో ఒక ఫ్రాడ్ జరగడంతో నన్ను అక్కడికి బదిలీ అయ్యేలా బాబా ఏర్పాటు చేశారు. ఇప్పుడు నేను నా కుటుంబానికి, పిల్లలకు ఎంతో సమయాన్ని కేటాయించగలుగుతున్నాను.  "బాబా! మీ పాదాలను కౌగిలించుకుని ఆనందంగా ఏడవాలని ఉంది. ఇంతకు మించి మీకు నేనేం ఇవ్వగలను నాన్నా".


సాయిభక్తుల అనుభవమాలిక 2104వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • పట్టుబట్టి మొక్కు తీర్పించి మరీ సొంతింటిని అనుగ్రహించిన బాబా 


సాయిభక్తుల అనుభవమాలిక 2103వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • ఏది అడిగితే అది, ఎలా కావాలనుకుంటే అలా అనుగ్రహించే సాయితండ్రి


సాయిభక్తుల అనుభవమాలిక 2102వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • పెళ్ళైన 15ఏళ్లకు సంతాన భాగ్యం ప్రసాదించిన బాబా - రెండవ భాగం


సాయిభక్తుల అనుభవమాలిక 2101వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • పెళ్ళైన 15ఏళ్లకు సంతాన భాగ్యం ప్రసాదించిన బాబా - మొదటి భాగం


సాయిభక్తుల అనుభవమాలిక 2100వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • ఖచ్చితంగా బాబా ఉన్నారు - మనల్ని చూస్తున్నారు, మన ప్రార్థనలు వింటున్నారు

నా పేరు జగదీశ్వర్. 2026, ఏప్రిల్ 2న మా చిన్నమ్మాయి పెళ్లి కరీంనగర్‌లో, ఏప్రిల్ 29న మా అబ్బాయి పెళ్లి విశాఖపట్నంలో జరిగాయి. వేసవికాలం, ఒక్క పెళ్లికే అలసిపోయే రోజులు. అలాంటిది రెండు పెళ్లిళ్లు. ఎలా చేయగలనో అని మొదట్లో కొంచెం టెన్షన్ పడ్డాను కానీ, తర్వాత మొత్తం భారం బాబా మీద వేసి, "బాబా! నేను నిమిత్తమాత్రుణ్ణి, రెండు పెళ్లిళ్లు ఏ ఇబ్బందులు రాకుండా మీరే దగ్గరుండి జరిపించి ఆశీర్వదించండి" అని వేడుకున్నాను. బాబా దయవల్ల పెళ్లి కార్యక్రమాలు మొదలు పెట్టినప్పటినుంచి అమ్మాయి పెళ్లి కరీంనగర్‌లో, అబ్బాయి పెళ్లి విశాఖపట్నంలో, తన రిసెప్షన్ కరీంనగర్‌లో అయ్యేవరకు ఎలాంటి టెన్షన్ లేకుండా అన్నీ సక్రమంగా అనుకున్న విధంగా పూర్తయ్యాయి. అమ్మాయి పెళ్లిలో, అబ్బాయి రిసెప్షన్‌లో ఎవరో ఇద్దరు బ్రాహ్మణులు వచ్చి ఆశీస్సులు ఇచ్చి వెళ్ళారు. వాళ్ళు సాధారణంగా వచ్చేవాళ్ళో, బాబా దయ చూపి అలా వచ్చారో నాకైతే తెలియలేదు. ఇంకా డబ్బుల విషయానికి వస్తే, అప్పట్లో సివిల్ సర్వీసెస్‌కి ప్రిపేర్ అవుతున్న మా అబ్బాయి, హఠాత్తుగా మనసు మార్చుకొని యుఎస్ వెళ్లి MS పూర్తి చేసి, NVedia అనే పెద్ద కంపెనీలో సూపర్ జీతంతో జాయినయ్యాడు. ఈ పెళ్లిళ్ల ఖర్చులు తనే సర్దుబాటు చేసుకున్నాడు. ఇదంతా బాబా ముందస్తు ప్రణాళిక.


నాకు ఒక సాయిబాబా బంగారు ఉంగరం ఉంది. నేను దాన్ని అప్పుడప్పుడు పెట్టుకొని, తిరిగి లోపల దాచేస్తుంటాను. 2026, ఏప్రిల్ 2న మా చిన్నమ్మాయి పెళ్లి ఉందని వారం ముందు ఆ ఉంగరం కోసం చూస్తే, అది కనిపించలేదు. అన్నీ చోట్లా వెతికినా కానీ దొరకలేదు. నేను చాలా టెన్షన్ పడిపోయి బాబాకి దణ్ణం పెట్టుకొని, "ఎలాగైనా ఆ ఉంగరం దొరికేలా చేయమ"ని వేడుకున్నాను. ఐదు రోజుల తర్వాత మా ఆవిడ ఏదో మందు కొరకు వెతుకుతుంటే, విచిత్రంగా టాబ్లెట్ల బాక్స్‌లో బాబా ఉంగరం ఉంది.


ఇకపోతే, పెళ్ళైన తర్వాత, ఏప్రిల్ 6న భోజనాల అనంతరం మా అమ్మాయి చేతి వేలికి ఉండాల్సిన వంకి ఉంగరం లేదు. ఫోటోలలో చేస్తే భోజనం చేసేటప్పుడు తన వేలికి ఉంగరం ఉంది. ఇంకా అందరం అన్నీ చోట్లా వెతికాము కానీ, ఎక్కడా ఆ ఉంగరం దొరకలేదు. మా చిన్నమ్మాయి ఏడుస్తూ అత్తవారింటికి హైదరాబాద్ వెళ్ళింది. నేను బాబాకి దణ్ణం పెట్టుకొని, "ఎలాగైనా ఆ ఉంగరం దొరకాల"ని వేడుకున్నాను. మర్నాడు ఉదయం మా చిన్నమ్మాయి ఫోన్ చేసి, ఒక బ్యాగులో ఉంగరం ఉందని చెప్పింది. అందరం చాలా సంతోషించాం.


పెళ్లిళ్లు అయిన తర్వాత, 2026, మే 8న అందరం అంటే మా ఇద్దరు అమ్మాయిలు, అల్లుళ్లు, మనవరాలు, అబ్బాయి, కోడలు, నేను, నా భార్య బయలుదేరి ఫ్లైట్‌లో శిరిడీ వెళ్లాము. అదే రోజు ధూప్ ఆరతిలో మేము పాల్గొన్నాము. మర్నాడు 9వ తేదీ మధ్యాహ్నం 3.40కి మా రిటర్న్ ఫ్లైట్ ఉండగా నేను పొద్దున్నే బాబా దర్శనం చేసుకున్నాను. తర్వాత 10 గంటలకు అందరం టిఫిన్ చేసి దర్శనానికి సీనియర్ సిటిజన్ లైన్లో వెళ్ళడానికి ప్రయత్నిస్తే నన్ను, నా భార్యను అనుమతించి మిగతా వాళ్లను అనుమతించలేదు. దాంతో వాళ్ళు స్పెషల్ ఎంట్రీ దర్శనం టిక్కెట్టు తీసుకుని వస్తామని వెళ్లారు. అప్పటికి దాదాపు 11.10 అవుతుంది. నాకు, నా భార్యకి 20 నిమిషాల్లో దర్శనం అయింది కానీ, పిల్లలు రాలేదు. మేము ముందుగా భయపడ్డట్టే ఆరతికోసం లైన్లు ఆపేసారు. దాంతో ఒకవైపు మేము కనీసం 2 గంటలకి ఎయిర్‌పోర్ట్‌లో ఉండాలన్న టెన్షన్, ఇంకో వైపు పిల్లలు ఎప్పుడు బయటికి వస్తారో తెలియని పరిస్థితి. బాబానే ప్రార్థించి ఆయన మీదే భారమేసాను. బాబా దయవల్ల వాళ్ళు సరిగ్గా 1:30కి బయటకు వచ్చారు. మేము ఇంకా ఆలస్యం చేయకుండా రూమ్‌కి వెళ్లి, లగేజ్ సర్దుకొని సమయానికి ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వచ్చాము. అక్కడ వేరే ఫ్లైట్ ఎక్కి తిరుపతి వెళ్ళాము. మే 10వ తేదీన పద్మావతి అమ్మవారి కళ్యాణం జరిపించాము. మర్నాడు 11వ తేదీ రాత్రి 9 గంటలకి మా తిరుగు ప్రయాణానికి ఫ్లైట్ ఉంది. స్వామివారి దర్శనానికి నా దగ్గర విఐపి లెటర్స్ ఉన్నా వాటిని యాక్సెప్ట్ చేయని పరిస్థితి ఎదురైంది. ఇంకా తప్పనిసరై నేను, నా భార్య మళ్లీ వచ్చి దర్శనం చేసుకుంటామని అనుకున్నాము. కానీ పిల్లలు విదేశాలకు వెళ్ళిపోతారు కాబట్టి, స్వామివారికి దణ్ణం పెట్టుకొని 11వ తేదీకి శ్రీవాణి టిక్కెట్లు తీసుకున్నాం. ఆరోజు మేము కూడా కొండపైకి వెళ్లి స్వామివారికి బయటనుండి దణ్ణం పెట్టుకొని, రాత్రి 7 కల్లా విమానాశ్రయం చేరుకున్నాము కానీ, 4 గంటలకి శ్రీవాణి బ్రేక్ దర్శనానికి లోపలికి వెళ్లిన పిల్లలు రావడానికి ఎంత టైం పడుతుందో, వాళ్లకి ఫ్లైట్ అందుతుందో, లేదో అని టెన్షన్ పడ్డాం. అయినా నాకు బాబా ఉన్నారన్న ధైర్యం మాత్రం పోలేదు. బాబా దయవల్ల వాళ్ళు మొదటి గడప దర్శనం చేసుకొని 6.30కి బయటకు వచ్చి, ఎయిర్ పోర్ట్కి 8 గంటల కల్లా చేరుకున్నారు. సురక్షితంగా ప్రయాణం చేసి ఇంటికి చేరుకున్నాము.


మా పెద్దమ్మాయి, అల్లుడు, మనుమరాలు పోలాండ్‌కి వెళ్ళడానికి మే 16కి టికెట్లు బుక్ చేసుకున్నారు. కానీ 5 రోజుల ముందు వాళ్ళు దుబాయ్‌కి బుక్ చేసుకున్న ఫ్లైట్ క్యాన్సిల్ అయినట్టు మెసేజ్ వచ్చింది. దాంతో వాళ్ళు తప్పనిసరై హైదరాబాద్ నుండి ఢిల్లీకి, ఢిల్లీ నుండి వియన్నాకి ఫ్లైట్, వియన్నా నుండి పోలాండ్ దేశంలోని క్రకౌకి బస్సు బుక్ చేసుకున్నారు. బస్ ఫ్లైట్‌కి లింక్ సర్వీస్ కాదు కాబట్టి, బస్సు బయలుదేరే లోపు వీళ్ళు వియన్నా చేరుకోవాలి. కానీ ఢిల్లీ నుండి వియన్నా వెళ్లే ఫ్లైట్ ఆలస్యం అయింది. దాంతో అక్కడ బస్ మిస్ అవుతుందేమో అని భయపడ్డాము. ఇక్కడ నేను బాబాకి దణ్ణం పెట్టుకొని, "పిల్లలు బస్సుకి అందేలా చూడమ"ని వేడుకున్నాను. వాళ్ళు వియన్నా చేరుకున్నాక మా పెద్దమ్మాయి చాలా ఉత్సాహంగా ఫోన్ చేసి, "బస్ అందుకున్నాము. ఒక్క నిమిషం ఆలస్యమైనా బస్సు వెళ్లిపోయేది" అని చెప్పడంతో 'మనకు బాబా ఉన్నారు కదా!' అనుకోని మనసులోనే వారికి దణ్ణం పెట్టుకున్నాను. ఆయన దయవల్ల మా పెద్దమ్మాయివాళ్ళు క్రకౌలోని వాళ్ళ ఇంటికి సురక్షితంగా చేరుకున్నారు.


తర్వాత 14వ రోజు మా అబ్బాయి, కోడలు బయలుదేరి బాబా దయవల్ల  ఇమ్మిగ్రేషన్‌లో ఎటువంటి సమస్య లేకుండా యుఎస్ చేరుకోని, వాళ్ళవాళ్ళ ఉద్యోగాల్లో చేరారు. తర్వాత మా చిన్నమ్మాయి, అల్లుడు స్లీపర్ బస్సులో గోవా వెళ్లారు. వాళ్ళ క్షేమం గురించి నేను బాబాను ప్రార్థించాను. బాబా అనుగ్రహంతో వాళ్ళు క్షేమంగా వెళ్లొచ్చారు. 100కి 200% బాబా దయవల్లనే అన్నీ సక్రమంగా జరిగాయి. నేను అందరికీ చెప్పేది ఒక్కటే, 'ఖచ్చితంగా బాబా ఉన్నారు. మనల్ని చూస్తున్నారు, మన ప్రార్థనలు వింటున్నారు. ఇది నూటికి నూరుపాళ్లు నిజం.


ఓం శ్రీసాయి సర్వభారాభృతే నమః.

బాబా సాయి చరణం

సర్వదా శరణం శరణం.


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo