పూణేకు చెందిన పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి శ్రీపురుషోత్తం రఘునాథ్ అవస్థి ఉరఫ్ దాజీసాహెబ్ అవస్థి(B.A., LLB.) సాయిబాబా భక్తులలో ఒకరు. అతను సజ్జనుడు, సత్ప్రవర్తన గల గృహస్థుడు. నిరాడంబరత, పవిత్రత అతని శరీరంలో అణువణువునా జీర్ణించుకుపోయాయి. పెద్ద అధికారి అయి కూడా చాలా వినయశీలిత, దానగుణం కలవాడు, నిజమైన కర్మయోగి(నిస్వార్థంగా కర్తవ్యాన్ని నిర్వర్తించేవాడు), ఏకనిష్ఠ భక్తిమార్గపరుడు(మనసును వేరే వైపుకు మళ్లించకుండా కేవలం ఒకే ఒక దైవంపట్ల భక్తిప్రపత్తులు కలిగి, ఆ దైవమే తన సర్వస్వమని జీవించే వ్యక్తి). సాయిబాబా సన్నిధిలోకి వచ్చిన క్షణం నుంచే, ఆయనకు పరమ భక్తుడయ్యాడు అతను. భగవద్గీత అతనికి అత్యంత ఇష్టమైన గ్రంథం. ఇతను చేసిన గొప్ప సుకృతం ఏమిటంటే, ఒకవేళ ఇతను లేకపోయి ఉంటే, శ్రీ బి.వి.నరసింహస్వామి భారతదేశమంతటా బాబా తత్వాన్ని అంత స్థాయిలో ప్రచారం చేయగలిగేవాడు కాదు.
శ్రీ పి.ఆర్.అవస్థి 1870, ఫిబ్రవరి నెలలో ఒక సాంప్రదాయ కుటుంబంలో జన్మించాడు. అతను దాదాపు రెండు దశాబ్దాల పాటు ఎంతో యోగ్యులు, పవిత్రులు ఆయిన వ్యక్తుల సాంగత్యాన్ని పొందాడు. 6ఏళ్ళ వయసప్పుడు 'దేవ్ మమ్లత్దార్'గా ప్రసిద్ధి చెందిన సతారా మమ్లత్దార్ శ్రీయశ్వంత్ రావు భాస్కర్ అనే సత్పురుషుని దర్శించి, వారి చేతుల మీదుగా ఒక జామపండును ప్రసాదంగా పొందిన భాగ్యశాలి అతను. కొంతకాలానికి దేవ్ మమ్లత్దార్కి నాసిక్కు బదిలీ అయింది. అప్పుడు శ్రీఅవస్థి తండ్రి కూడా నాసిక్లోనే ఉన్నందువల్ల చిన్నవయసునుండే అవస్థికు తరచూ దేవ్ మమ్లత్దార్ను దర్శించుకుని, భద్రాచల శ్రీరామదాసు భక్తి వంటి వారి అద్భుతమైన భక్తి గురించి తెలుసుకునే అనేక అవకాశాలు లభించాయి. దేవ్ మమ్లత్దార్ ఎంతో దయ కలవారు; ఒక పేదవాని కొడుకు పెళ్ళికి ధన సహాయం చేసాడు. నిజానికి ఆ సమయంలో అతని వద్ద డబ్బు లేదు. అయినా డబ్బు సమకూరినప్పుడు తిరిగి జమచేయొచ్చనే ఉద్దేశంతో, తన ఆధీనంలో ఉన్న ప్రభుత్వ ఖజానా నిధులు ఇచ్చాడు. ఈ విషయం బయటకు పొక్కడంతో, ఎవరో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దాంతో కలెక్టర్ ఆకస్మిక తనిఖీకి వచ్చి ఖజానాను పరిశీలించి, ఆపై ఉన్న నగదు నిల్వలతో అకౌంట్స్ సరిచూచే ప్రయత్నం చేసారు. అవేవీ తెలియని దేవ్ మమ్లత్దార్ ఇంట్లో ప్రశాంతంగా తన దైనందిన కార్యక్రమాలతోపాటు పూజ చేసుకుంటున్నారు. పూజ తదితర పనులు పూర్తయిన తర్వాత, కలెక్టర్ లెక్కలను మరియు నగదు నిల్వను సరిచూశారని, రెండూ సరిగ్గా సరిపోయాయని ఆయనకు తెలిసి ఎంతో సంతోషించి లోటును భర్తీ చేసినందుకు తన ఇష్టదైవానికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఆయన పదవీ విరమణ చేసిన తర్వాత అత్యంత ధార్మిక జీవితాన్ని గడుపుతూ యువకులు, వృద్ధుల మనస్సులు ఎంతగానో ప్రభావితం చేసారు. ఆయన వల్ల అవస్థి చాలా ప్రభావితుడయ్యాడు. ముఖ్యంగా 1887-90 మధ్య, అంటే అతని 17 నుండి 20 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు దేవ్ మామ్లత్దార్ నాసిక్లో నిష్టాగరిష్ట ఏకాంత జీవితాన్ని గడుపుతున్నప్పుడు అవస్థి, అతని తండ్రి తరచుగా ఆయనను సందర్శించి, గణనీయమైన భక్తి ప్రభావాన్ని పొందారు. ఇలా అవస్థి ఆధ్యాత్మిక జీవితానికి చాలా ముఖ్యమైన పునాది పడింది.
1889లో అవస్థి తన 19వ ఏట, ఒక వీధిలోని బజారు గుండా వెళ్తున్నప్పుడు అర అణాకు చిన్న భగవద్గీత ప్రతి దొరికితే దాన్ని కొని తన జేబులో జాగ్రత్తగా భద్రపరుచుకుని ప్రతిరోజూ తీరిక సమయాల్లో పఠింస్తుండటం అతని అలవాటుగా మారింది. ఆ అలవాటు అతని తరువాతి జీవితంలో చాలా మేలు చేసింది.
కొద్దికాలానికి అవస్థి కళాశాలలో చదువుతున్నప్పుడు జాన్ స్టువర్ట్ మిల్, స్పెన్సర్ల గురించి చేసిన అధ్యయనం అతని మనస్సుని పాశ్చాత్య దేశాలలో ప్రబలంగా ఉన్న సంశయవాదం, నాస్తికత్వం సులభంగా ఆకర్షించాయి. దాంతో అతను నాస్తికుడిగా, వాద స్వభావం గలవాడిగా, అహంకారిగా మారి ఉపన్యాసకుడిగా, వాదనాపటిమగలవాడిగా రాణించాలని, చాలా డబ్బు సంపాదించాలని కోరుకున్నాడు. అతనిని మునపటి భక్తి ప్రభావం విడిచిపెట్టినట్లే కనిపించింది. ఈ నాస్తికత్వం ఎనిమిది సంవత్సరాలు, అంటే 1890 నుండి 1898 వరకు కొనసాగింది. అయితే ఆ కాలంలో కూడా దైవ సంకల్పం వల్ల అతను గీతా పఠనం మానలేదు. అదికాక అతని నాస్తికత్వానికి ఎదురుదెబ్బలు తగిలే కొన్ని సంఘటనలు జరిగాయి.
ఒకసారి అతనికి శ్రీమద్భాగవతంకి సంబంధించిన ఒక కాగితం దొరికితే, దాన్ని తీసి చదివాడు. అందులోని శ్లోకాలలో వ్యక్తి దేవుని నుండి దారి తప్పి, మాయలో చిక్కుకున్నప్పుడు కలిగే ద్వైత భావన వల్ల భయం పుడుతుందని, అది వ్యక్తి యొక్క దైవ విచారణను(భగవదన్వేషణ) మరుగుపరిచి, దైవంలో ఐక్యం కాకుండా నిరోధిస్తుందని వర్ణించబడి ఉంది.
మరోసారి ఒక అందమైన దక్షిణ భారత మహిళ శ్రీరాముని విగ్రహం ముందు నిలబడి, చక్కటి హావభావాలు ప్రదర్శిస్తూ తమిళంలోనో, తెలుగులోనో మీరాబాయి, ముక్తాబాయి, జానాబాయి మొదలైన వారిని ప్రస్తావిస్తూ పాడిన పాటలు సహజంగానే చాలా సున్నితస్తులైన శ్రీఅవస్థి మనసుని మునుపటిలా భక్తి యొక్క సౌందర్యాన్ని, ప్రయోజనాన్ని అనుభూతి చెందేలా చేసాయి.
ఇంకోసారి అవస్థి తన పెదనాన్న/చిన్నాన్న పిల్లలతో దేవుని ఉనికి గురించి తీవ్రమైన చర్చలో నిమగ్నమయ్యాడు. ఆ చర్చకు వాళ్ళు తమ మేనమామ అయిన శ్రీబాలభీమ ఠాకూర్దాస్ను న్యాయనిర్ణేతగా నియమించుకున్నారు కానీ, వాళ్ళు ఆయన్ని సంప్రదించకుండానే చర్చ సాగించారు. ఆ చర్చ అంతులేకుండా కొనసాగింది. వాళ్లలో ప్రతి ఒక్కరూ మరొకరిని ఓడించాలని, తమ వాదనే సరైనదని ఒప్పించేలా ప్రయత్నించారు. చివరికి అవస్థి కీర్తనలు, పురాణాలపై గొప్ప నమ్మకమున్న తమ మేనమామని సంప్రదించి, "సాధుసత్పురుషులు వర్ణించబడినంత గొప్పవారని నిజంగా, నిజాయితీగా మీరు నమ్ముతున్నారా? ఆ విషయంలో నాకు నమ్మకం కలిగించగలరా?" అని అడిగాడు. అప్పుడు అతని మేనమామ అతన్ని గుడి లోపల ఉన్న శ్రీరాముని విగ్రహం ముందుకి తీసుకెళ్లి, ‘పవిత్ర గ్రంథాలలో చెప్పబడిన ప్రతి మాటను తాను పూర్తిగా విశ్వసిస్తున్నానని, అటువంటి సత్పురుషులను కలుసుకునే భాగ్యం నీకు కలుగుతుందని ఆశిస్తున్నానని, ఆ సత్పురుషుని ద్వారా ప్రత్యక్ష అనుభవాన్ని పొందిన తరువాత, నువ్వు కూడా అదే నిశ్చయానికి వస్తావని’ గట్టిగా ప్రమాణం చేశాడు. అప్పుడు శ్రీఅవస్థి, "సశరీరులుగా ఉన్న కొందరు సత్పురుషుల పేర్లు చెప్పమ"ని అడిగాడు. అతని మేనమామ, (1) పలుస్కు చెందిన దొండి బూవా, (2) ఫల్తాన్కు చెందిన హరి మహారాజ్ మరియు (3) కొల్హాపూర్కు చెందిన శ్రీకుంభారస్వామి పేర్లను చెప్పి వీరిని సందర్శించి, పరీక్షిస్తే నమ్మకం కలుగుతుందని చెప్పి, వారిని కలుస్తాన్నన్న వాగ్దానం అతని వద్ద నుండి తీసుకున్నాడు. అదృష్టవశాత్తు శ్రీఅవస్థి పైన పేర్కొన్న ముగ్గురినీ భవిష్యత్తులో కలుసుకోగలిగాడు.
శ్రీఅవస్తే అతని మేనమామతో మాట్లాడిన తర్వాత డాక్టర్ బీసెంట్ మరియు డాక్టర్ రిచర్డ్సన్ల తత్వశాస్త్ర ఉపన్యాసాలకు హాజరై, తత్వశాస్త్రం(వేదాంతం), మత గ్రంధాలు చదివాడు. 1896వ సంవత్సరం చివరిలో పూనాలో ప్లేగు వ్యాధి ప్రబలింది. అప్పుడు అవస్థికి ప్రాణం, ఆస్తుల పట్ల కలిగిన ఆందోళన అతనిని దేవుని వైపు నడిపించింది. ప్లేగు వ్యాధి నుండి ఆశ్రయం కోసం అతను జ్ఞానేశ్వర్, ఏక్నాథ్, నామ్దేవ్, తుకారాం, రామదాస్ వంటి మహారాష్ట్ర సత్పురుషుల జీవిత చరిత్రలను భక్తిశ్రద్ధలతో చదవడం ప్రారంభించాడు. తార్గావ్లోని తన మేనమామ ఇంటికి వెళ్లి అక్కడ అందుబాటులో ఉన్న కృష్ణుడు మొదలైన అవతారపురుషల గురించిన పవిత్ర గ్రంథాలన్నీ ప్రతిరోజూ చదివాడు. అటుపిమ్మట అతను తన మేనమామను పలూస్లోని దొండి బూవా గురించి విచారించగా, పలూస్కు ఎలా వెళ్ళాలో చెప్పాడతను. దాంతో అవస్థి పలూస్కు వెళ్లి దొండి బూవా దర్శనం చేసుకోవాలని బయలుదేరాడు. అతను దారిలో భగవద్గీత చదువుతుండగా, సత్పురుషులు జ్ఞానాన్ని ప్రసాదిస్తారని చెప్పబడిన నాల్గవ అధ్యాయం, 34వ శ్లోకం వద్ద అకస్మాత్తుగా ఆగి, ఆ దొండి బూవా వద్ద ఈ విషయం పరీక్షించి, అతను తనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడో, లేదో తెలుసుకోవాలని నిశ్చయించుకున్నాడు. కానీ పలూస్లో ఒక ఆలయం వెలుపల కూర్చుని ఉన్న దొండి బూవాను చూసి ఆయన శూద్రుడని భావించాడు అతను. అందువల్ల ఆయనకి నమస్కరించడం ఒక బ్రాహ్మణునిగా తనకి సులువు అనిపించలేదు. బూవా అతనితో కటువుగా, "గుడి లోపలకి వెళ్లి నమస్కరించు" అని చెప్పారు. అతనికి అది సులభంగా అనిపించి లోపలికి వెళ్ళాడు. చూస్తే, అక్కడ పూజించబడుతున్నది అదే శూద్ర బూవా చిత్రపటం! అక్కడ వేరే ఏ విగ్రహం లేదు. దాంతో అతను బయట ఉన్న శూద్రుడే లోపల పూజించబడుతున్న దేవుడని గ్రహించాడు. ఏదేమైనా తన చేతిలో ఉన్న పువ్వులు, నైవేద్యాలు అక్కడ ఉంచి తన మనసులో ఉన్న సందేహాలతో తర్జనభర్జనపడుతూ అక్కడ రెండు గంటల సమయం గడిపాడు. తర్వాత బయటకు వచ్చి దొండి బూవాకు క్షమాపణ చెప్పి, "మీకు ఈ శక్తులు ఎలా వచ్చాయ"ని అడిగాడు. దానికి ఆయన, "అది చాలా సులభం. కేవలం 'రామ్, రామ్, రాజారామ్ సీతారామ్' అని స్మరిస్తుండు, సర్వం సిద్ధిస్తుంది" అని బదులిచ్చారు. ఆపై దొండి బూవా తనకూ, తన పరివారంకీ వంట చేయమని అవస్తేతో అన్నారు. తర్వాత ఇతరుల ఉప్పు తినడం, వారికి ఋణపడి ఉండటం ఇష్టం లేనందున దొండి బూవా స్వయంగా ఉప్పు అతనికి ఇవ్వడమే కాకుండా అవస్థి తయారుచేసిన వంటకాలలో తామే తమ ఉప్పు కలిపారు. ఇంత జరుగుతున్నా దొండి బూవాను తన గురువుగా స్వీకరించడానికి అవస్థి ఇష్టపడలేదు, ఆయన కూడా, "నేను ఎవరికీ గురువుగా ఉండాలనుకోవడం లేద"ని చెప్పి తమ ఆశీస్సులు అతనికి ఇచ్చారు. అవస్తే తిరిగి వచ్చేశాడు.
తర్వాత అవస్థి మనసులో ప్రశ్నలతో పరమహంస(జ్ఞానోదయం పొంది, ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థాయికి చేరిన వ్యక్తి) అయిన ఒక బ్రాహ్మణ గురువును కలిసి, “బ్రహ్మజ్ఞానం పొందవచ్చా?" అని అడిగాడు. ఆయన అతన్ని నేలపై పడుకోమని, ఆయన కూడా అతని పక్కన పడుకుని, "భయపడవద్దు" అని హెచ్చరించి అతని గొంతుపై చేయిపెట్టి గట్టిగా నొక్కేశారు. అతను భయపడి ఆయన పట్టు నుండి విడిపించుకోవడానికి ప్రయత్నించాడు. అప్పుడు ఆయన, "నువ్వు పిరికివాడివి. వెళ్ళిపో, నువ్వు బ్రహ్మజ్ఞానం పొందలేవు" అని అన్నారు.
తరువాయి భాగం వచ్చేవారం..
