- బాబా ప్రేమ అపారం
|
సాయి వచనం:-
|
|
|
సాయిభక్తుల అనుభవమాలిక 2120వ భాగం....
శ్రీపురుషోత్తం రఘునాథ్ అవస్థి - 1వ భాగం....
పూణేకు చెందిన పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి శ్రీపురుషోత్తం రఘునాథ్ అవస్థి ఉరఫ్ దాజీసాహెబ్ అవస్థి(B.A., LLB.) సాయిబాబా భక్తులలో ఒకరు. అతను సజ్జనుడు, సత్ప్రవర్తన గల గృహస్థుడు. నిరాడంబరత, పవిత్రత అతని శరీరంలో అణువణువునా జీర్ణించుకుపోయాయి. పెద్ద అధికారి అయి కూడా చాలా వినయశీలిత, దానగుణం కలవాడు, నిజమైన కర్మయోగి(నిస్వార్థంగా కర్తవ్యాన్ని నిర్వర్తించేవాడు), ఏకనిష్ఠ భక్తిమార్గపరుడు(మనసును వేరే వైపుకు మళ్లించకుండా కేవలం ఒకే ఒక దైవంపట్ల భక్తిప్రపత్తులు కలిగి, ఆ దైవమే తన సర్వస్వమని జీవించే వ్యక్తి). సాయిబాబా సన్నిధిలోకి వచ్చిన క్షణం నుంచే, ఆయనకు పరమ భక్తుడయ్యాడు అతను. భగవద్గీత అతనికి అత్యంత ఇష్టమైన గ్రంథం. ఇతను చేసిన గొప్ప సుకృతం ఏమిటంటే, ఒకవేళ ఇతను లేకపోయి ఉంటే, శ్రీ బి.వి.నరసింహస్వామి భారతదేశమంతటా బాబా తత్వాన్ని అంత స్థాయిలో ప్రచారం చేయగలిగేవాడు కాదు.
శ్రీ పి.ఆర్.అవస్థి 1870, ఫిబ్రవరి నెలలో ఒక సాంప్రదాయ కుటుంబంలో జన్మించాడు. అతను దాదాపు రెండు దశాబ్దాల పాటు ఎంతో యోగ్యులు, పవిత్రులు ఆయిన వ్యక్తుల సాంగత్యాన్ని పొందాడు. 6ఏళ్ళ వయసప్పుడు 'దేవ్ మమ్లత్దార్'గా ప్రసిద్ధి చెందిన సతారా మమ్లత్దార్ శ్రీయశ్వంత్ రావు భాస్కర్ అనే సత్పురుషుని దర్శించి, వారి చేతుల మీదుగా ఒక జామపండును ప్రసాదంగా పొందిన భాగ్యశాలి అతను. కొంతకాలానికి దేవ్ మమ్లత్దార్కి నాసిక్కు బదిలీ అయింది. అప్పుడు శ్రీఅవస్థి తండ్రి కూడా నాసిక్లోనే ఉన్నందువల్ల చిన్నవయసునుండే అవస్థికు తరచూ దేవ్ మమ్లత్దార్ను దర్శించుకుని, భద్రాచల శ్రీరామదాసు భక్తి వంటి వారి అద్భుతమైన భక్తి గురించి తెలుసుకునే అనేక అవకాశాలు లభించాయి. దేవ్ మమ్లత్దార్ ఎంతో దయ కలవారు; ఒక పేదవాని కొడుకు పెళ్ళికి ధన సహాయం చేసాడు. నిజానికి ఆ సమయంలో అతని వద్ద డబ్బు లేదు. అయినా డబ్బు సమకూరినప్పుడు తిరిగి జమచేయొచ్చనే ఉద్దేశంతో, తన ఆధీనంలో ఉన్న ప్రభుత్వ ఖజానా నిధులు ఇచ్చాడు. ఈ విషయం బయటకు పొక్కడంతో, ఎవరో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దాంతో కలెక్టర్ ఆకస్మిక తనిఖీకి వచ్చి ఖజానాను పరిశీలించి, ఆపై ఉన్న నగదు నిల్వలతో అకౌంట్స్ సరిచూచే ప్రయత్నం చేసారు. అవేవీ తెలియని దేవ్ మమ్లత్దార్ ఇంట్లో ప్రశాంతంగా తన దైనందిన కార్యక్రమాలతోపాటు పూజ చేసుకుంటున్నారు. పూజ తదితర పనులు పూర్తయిన తర్వాత, కలెక్టర్ లెక్కలను మరియు నగదు నిల్వను సరిచూశారని, రెండూ సరిగ్గా సరిపోయాయని ఆయనకు తెలిసి ఎంతో సంతోషించి లోటును భర్తీ చేసినందుకు తన ఇష్టదైవానికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఆయన పదవీ విరమణ చేసిన తర్వాత అత్యంత ధార్మిక జీవితాన్ని గడుపుతూ యువకులు, వృద్ధుల మనస్సులు ఎంతగానో ప్రభావితం చేసారు. ఆయన వల్ల అవస్థి చాలా ప్రభావితుడయ్యాడు. ముఖ్యంగా 1887-90 మధ్య, అంటే అతని 17 నుండి 20 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు దేవ్ మామ్లత్దార్ నాసిక్లో నిష్టాగరిష్ట ఏకాంత జీవితాన్ని గడుపుతున్నప్పుడు అవస్థి, అతని తండ్రి తరచుగా ఆయనను సందర్శించి, గణనీయమైన భక్తి ప్రభావాన్ని పొందారు. ఇలా అవస్థి ఆధ్యాత్మిక జీవితానికి చాలా ముఖ్యమైన పునాది పడింది.
1889లో అవస్థి తన 19వ ఏట, ఒక వీధిలోని బజారు గుండా వెళ్తున్నప్పుడు అర అణాకు చిన్న భగవద్గీత ప్రతి దొరికితే దాన్ని కొని తన జేబులో జాగ్రత్తగా భద్రపరుచుకుని ప్రతిరోజూ తీరిక సమయాల్లో పఠింస్తుండటం అతని అలవాటుగా మారింది. ఆ అలవాటు అతని తరువాతి జీవితంలో చాలా మేలు చేసింది.
కొద్దికాలానికి అవస్థి కళాశాలలో చదువుతున్నప్పుడు జాన్ స్టువర్ట్ మిల్, స్పెన్సర్ల గురించి చేసిన అధ్యయనం అతని మనస్సుని పాశ్చాత్య దేశాలలో ప్రబలంగా ఉన్న సంశయవాదం, నాస్తికత్వం సులభంగా ఆకర్షించాయి. దాంతో అతను నాస్తికుడిగా, వాద స్వభావం గలవాడిగా, అహంకారిగా మారి ఉపన్యాసకుడిగా, వాదనాపటిమగలవాడిగా రాణించాలని, చాలా డబ్బు సంపాదించాలని కోరుకున్నాడు. అతనిని మునపటి భక్తి ప్రభావం విడిచిపెట్టినట్లే కనిపించింది. ఈ నాస్తికత్వం ఎనిమిది సంవత్సరాలు, అంటే 1890 నుండి 1898 వరకు కొనసాగింది. అయితే ఆ కాలంలో కూడా దైవ సంకల్పం వల్ల అతను గీతా పఠనం మానలేదు. అదికాక అతని నాస్తికత్వానికి ఎదురుదెబ్బలు తగిలే కొన్ని సంఘటనలు జరిగాయి.
ఒకసారి అతనికి శ్రీమద్భాగవతంకి సంబంధించిన ఒక కాగితం దొరికితే, దాన్ని తీసి చదివాడు. అందులోని శ్లోకాలలో వ్యక్తి దేవుని నుండి దారి తప్పి, మాయలో చిక్కుకున్నప్పుడు కలిగే ద్వైత భావన వల్ల భయం పుడుతుందని, అది వ్యక్తి యొక్క దైవ విచారణను(భగవదన్వేషణ) మరుగుపరిచి, దైవంలో ఐక్యం కాకుండా నిరోధిస్తుందని వర్ణించబడి ఉంది.
మరోసారి ఒక అందమైన దక్షిణ భారత మహిళ శ్రీరాముని విగ్రహం ముందు నిలబడి, చక్కటి హావభావాలు ప్రదర్శిస్తూ తమిళంలోనో, తెలుగులోనో మీరాబాయి, ముక్తాబాయి, జానాబాయి మొదలైన వారిని ప్రస్తావిస్తూ పాడిన పాటలు సహజంగానే చాలా సున్నితస్తులైన శ్రీఅవస్థి మనసుని మునుపటిలా భక్తి యొక్క సౌందర్యాన్ని, ప్రయోజనాన్ని అనుభూతి చెందేలా చేసాయి.
ఇంకోసారి అవస్థి తన పెదనాన్న/చిన్నాన్న పిల్లలతో దేవుని ఉనికి గురించి తీవ్రమైన చర్చలో నిమగ్నమయ్యాడు. ఆ చర్చకు వాళ్ళు తమ మేనమామ అయిన శ్రీబాలభీమ ఠాకూర్దాస్ను న్యాయనిర్ణేతగా నియమించుకున్నారు కానీ, వాళ్ళు ఆయన్ని సంప్రదించకుండానే చర్చ సాగించారు. ఆ చర్చ అంతులేకుండా కొనసాగింది. వాళ్లలో ప్రతి ఒక్కరూ మరొకరిని ఓడించాలని, తమ వాదనే సరైనదని ఒప్పించేలా ప్రయత్నించారు. చివరికి అవస్థి కీర్తనలు, పురాణాలపై గొప్ప నమ్మకమున్న తమ మేనమామని సంప్రదించి, "సాధుసత్పురుషులు వర్ణించబడినంత గొప్పవారని నిజంగా, నిజాయితీగా మీరు నమ్ముతున్నారా? ఆ విషయంలో నాకు నమ్మకం కలిగించగలరా?" అని అడిగాడు. అప్పుడు అతని మేనమామ అతన్ని గుడి లోపల ఉన్న శ్రీరాముని విగ్రహం ముందుకి తీసుకెళ్లి, ‘పవిత్ర గ్రంథాలలో చెప్పబడిన ప్రతి మాటను తాను పూర్తిగా విశ్వసిస్తున్నానని, అటువంటి సత్పురుషులను కలుసుకునే భాగ్యం నీకు కలుగుతుందని ఆశిస్తున్నానని, ఆ సత్పురుషుని ద్వారా ప్రత్యక్ష అనుభవాన్ని పొందిన తరువాత, నువ్వు కూడా అదే నిశ్చయానికి వస్తావని’ గట్టిగా ప్రమాణం చేశాడు. అప్పుడు శ్రీఅవస్థి, "సశరీరులుగా ఉన్న కొందరు సత్పురుషుల పేర్లు చెప్పమ"ని అడిగాడు. అతని మేనమామ, (1) పలుస్కు చెందిన దొండి బూవా, (2) ఫల్తాన్కు చెందిన హరి మహారాజ్ మరియు (3) కొల్హాపూర్కు చెందిన శ్రీకుంభారస్వామి పేర్లను చెప్పి వీరిని సందర్శించి, పరీక్షిస్తే నమ్మకం కలుగుతుందని చెప్పి, వారిని కలుస్తాన్నన్న వాగ్దానం అతని వద్ద నుండి తీసుకున్నాడు. అదృష్టవశాత్తు శ్రీఅవస్థి పైన పేర్కొన్న ముగ్గురినీ భవిష్యత్తులో కలుసుకోగలిగాడు.
శ్రీఅవస్తే అతని మేనమామతో మాట్లాడిన తర్వాత డాక్టర్ బీసెంట్ మరియు డాక్టర్ రిచర్డ్సన్ల తత్వశాస్త్ర ఉపన్యాసాలకు హాజరై, తత్వశాస్త్రం(వేదాంతం), మత గ్రంధాలు చదివాడు. 1896వ సంవత్సరం చివరిలో పూనాలో ప్లేగు వ్యాధి ప్రబలింది. అప్పుడు అవస్థికి ప్రాణం, ఆస్తుల పట్ల కలిగిన ఆందోళన అతనిని దేవుని వైపు నడిపించింది. ప్లేగు వ్యాధి నుండి ఆశ్రయం కోసం అతను జ్ఞానేశ్వర్, ఏక్నాథ్, నామ్దేవ్, తుకారాం, రామదాస్ వంటి మహారాష్ట్ర సత్పురుషుల జీవిత చరిత్రలను భక్తిశ్రద్ధలతో చదవడం ప్రారంభించాడు. తార్గావ్లోని తన మేనమామ ఇంటికి వెళ్లి అక్కడ అందుబాటులో ఉన్న కృష్ణుడు మొదలైన అవతారపురుషల గురించిన పవిత్ర గ్రంథాలన్నీ ప్రతిరోజూ చదివాడు. అటుపిమ్మట అతను తన మేనమామను పలూస్లోని దొండి బూవా గురించి విచారించగా, పలూస్కు ఎలా వెళ్ళాలో చెప్పాడతను. దాంతో అవస్థి పలూస్కు వెళ్లి దొండి బూవా దర్శనం చేసుకోవాలని బయలుదేరాడు. అతను దారిలో భగవద్గీత చదువుతుండగా, సత్పురుషులు జ్ఞానాన్ని ప్రసాదిస్తారని చెప్పబడిన నాల్గవ అధ్యాయం, 34వ శ్లోకం వద్ద అకస్మాత్తుగా ఆగి, ఆ దొండి బూవా వద్ద ఈ విషయం పరీక్షించి, అతను తనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడో, లేదో తెలుసుకోవాలని నిశ్చయించుకున్నాడు. కానీ పలూస్లో ఒక ఆలయం వెలుపల కూర్చుని ఉన్న దొండి బూవాను చూసి ఆయన శూద్రుడని భావించాడు అతను. అందువల్ల ఆయనకి నమస్కరించడం ఒక బ్రాహ్మణునిగా తనకి సులువు అనిపించలేదు. బూవా అతనితో కటువుగా, "గుడి లోపలకి వెళ్లి నమస్కరించు" అని చెప్పారు. అతనికి అది సులభంగా అనిపించి లోపలికి వెళ్ళాడు. చూస్తే, అక్కడ పూజించబడుతున్నది అదే శూద్ర బూవా చిత్రపటం! అక్కడ వేరే ఏ విగ్రహం లేదు. దాంతో అతను బయట ఉన్న శూద్రుడే లోపల పూజించబడుతున్న దేవుడని గ్రహించాడు. ఏదేమైనా తన చేతిలో ఉన్న పువ్వులు, నైవేద్యాలు అక్కడ ఉంచి తన మనసులో ఉన్న సందేహాలతో తర్జనభర్జనపడుతూ అక్కడ రెండు గంటల సమయం గడిపాడు. తర్వాత బయటకు వచ్చి దొండి బూవాకు క్షమాపణ చెప్పి, "మీకు ఈ శక్తులు ఎలా వచ్చాయ"ని అడిగాడు. దానికి ఆయన, "అది చాలా సులభం. కేవలం 'రామ్, రామ్, రాజారామ్ సీతారామ్' అని స్మరిస్తుండు, సర్వం సిద్ధిస్తుంది" అని బదులిచ్చారు. ఆపై దొండి బూవా తనకూ, తన పరివారంకీ వంట చేయమని అవస్తేతో అన్నారు. తర్వాత ఇతరుల ఉప్పు తినడం, వారికి ఋణపడి ఉండటం ఇష్టం లేనందున దొండి బూవా స్వయంగా ఉప్పు అతనికి ఇవ్వడమే కాకుండా అవస్థి తయారుచేసిన వంటకాలలో తామే తమ ఉప్పు కలిపారు. ఇంత జరుగుతున్నా దొండి బూవాను తన గురువుగా స్వీకరించడానికి అవస్థి ఇష్టపడలేదు, ఆయన కూడా, "నేను ఎవరికీ గురువుగా ఉండాలనుకోవడం లేద"ని చెప్పి తమ ఆశీస్సులు అతనికి ఇచ్చారు. అవస్తే తిరిగి వచ్చేశాడు.
తర్వాత అవస్థి మనసులో ప్రశ్నలతో పరమహంస(జ్ఞానోదయం పొంది, ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థాయికి చేరిన వ్యక్తి) అయిన ఒక బ్రాహ్మణ గురువును కలిసి, “బ్రహ్మజ్ఞానం పొందవచ్చా?" అని అడిగాడు. ఆయన అతన్ని నేలపై పడుకోమని, ఆయన కూడా అతని పక్కన పడుకుని, "భయపడవద్దు" అని హెచ్చరించి అతని గొంతుపై చేయిపెట్టి గట్టిగా నొక్కేశారు. అతను భయపడి ఆయన పట్టు నుండి విడిపించుకోవడానికి ప్రయత్నించాడు. అప్పుడు ఆయన, "నువ్వు పిరికివాడివి. వెళ్ళిపో, నువ్వు బ్రహ్మజ్ఞానం పొందలేవు" అని అన్నారు.
తరువాయి భాగం వచ్చేవారం..
సాయిభక్తుల అనుభవమాలిక 2119వ భాగం....
- సంపూర్ణ విశ్వాసముంటే అన్ని అనుగ్రహిస్తారు బాబా
సాయిభక్తుల అనుభవమాలిక 2118వ భాగం....
1. బాబా చూపిన కరుణ
2. తలచిన వెంటనే పలికే దైవం ఆ సాయినాథుడు
గోవిందస్వామి – ఆదిలక్ష్మియమ్మ
సాయిభక్తుల అనుభవమాలిక 2117వ భాగం....
1. ఆపదలను గట్టెక్కించే సాయితండ్రి
2. మనసు మార్చి దొంగింలించిన చైన్ తిరిగి ఇచ్చేలా అనుగ్రహించిన బాబా
సాయిభక్తుల అనుభవమాలిక 2116వ భాగం....
1. ఏదైనా సరిచేసే బాబా
2. సదా మొర అలకిస్తామని మరోసారి ఋజువిచ్చిన బాబా
శంభు మంగేష్ వాగ్లే - 2వ భాగం....
వాగ్లే, అతని స్నేహితులు స్నానం వగైరా ముగించుకుని మధ్యాహ్నం హారతి సమయానికి మళ్ళీ మశీదుకి వెళ్లారు. అక్కడి వైభవాన్ని చూసి వాగ్లే మనసు విస్మయానికి లోనైంది. అతని స్నేహితుడు శ్రీబస్తోద్కర్ నోటి నుండి అప్రయత్నంగా "ఎంతటి నాస్తిక పాషానుడైనప్పటికీ, ఈ సమయంలో మనసు ఇక్కడ లీనమవ్వాల్సిందే!" అని వెలువడ్డాయి. నిజంగా ఆ దృశ్యాన్ని గుర్తుచేసుకుంటూ, ‘అంతలా మనసు పూర్తిగా ఎలా లీనమవుతుందో అనిపిస్తుంద’ని వాగ్లే అంటారు. ఆ సమయంలో వెండి ఆసనం దీపాల కాంతులతో వెలిగిపోతోంది. అక్కడున్న ప్రతి ఒక్కరూ ఎంతో భక్తిశ్రద్ధలతో బాబాను పూజిస్తున్నారు. కొందరు వారి శిరస్సుపై గంధాక్షతలు పెడుతున్నారు, కొందరు పువ్వులు సమర్పిస్తున్నారు, కొందరు బిల్వ పత్రాలు, తులసి చేతపట్టుకుని ఉన్నారు, కొందరు హారతి ఇస్తున్నారు, కొందరు వారి చేతులకు తాంబూలం అందిస్తున్నారు. ఇలా గంటసేపు పూజ కార్యక్రమం కొనసాగి హారతి పూర్తైన తర్వాత భక్తులందరూ భోజనానికి వెళ్లారు. 'కానీ అక్కడ ఒక ఆచారం ఉందని, ఎవరైనా ఏదైనా కోరికతో దర్శనానికి వస్తే, ఆ కోరికలు బాబాకు విన్నవించుకొనే నిమిత్తం ప్రతిరోజూ ఆరతి అనంతరం కొంత సమయం కేటాయిస్తారని, అప్పుడు పాత, కొత్త భక్తులందరూ అక్కడ ఉండి బాబా తమ ఆసనంపై ఆశీనులయ్యాక వారికి దక్షిణ సమర్పించి, వారి చేతుల మీదుగా ఊదీ ప్రసాదాలు స్వీకరించి తాము వచ్చిన పని పూర్తయ్యాక సెలవు తీసుకొని వెళ్ళిపోతారని, అది అక్కడి పద్దతి అని, ఆ సమయంలో బాబా అనేక భాషలలో మాట్లాడుతూ, భక్తుల వద్ద నుండి దక్షిణ స్వీకరించి, జేబులో వేసుకొని, వారికి ప్రసాదమిచ్చి, ఆ తర్వాత ఎవరైనా ఏదైనా అడిగితే, సమాధానం చెప్తారని, కొందరు తమ పరీక్షల గురించి అడిగేవారని, దానికి బాబా 'అంతా సవ్యంగా ఉంటుంద'ని అని బదులు చెప్పేవారని, ఎవరూ ఏమీ అడగకున్నా అక్కడున్న వారందరూ పూర్తిగా సంతృప్తి చెందేవారని, అలా అక్కడున్న వారందరి మనసులోని మాటలకు బాబా సమాధానం చెప్తారని' వాగ్లే తెలియజేసారు.
అందుకని హారతి పూర్తైన తర్వాత వాగ్లే, అతని స్నేహితులు అక్కడే ఉండి బాబా పక్కన కూర్చున్నారు. అతని స్నేహితులలో ఒకరు 4, ఒకరు 8 అణాలు బాబాకు దక్షిణ సమర్పిస్తే, ఆయన వాటిని తీసుకొని "సరిపోతుంది" అని చెప్పారు. వాగ్లే ఒక రూపాయి సమర్పిస్తే, వారు దానిని తీసుకొని తమ జేబులో వేసుకున్నారు. 'ఆ జేబు వారి ఖజానా. ఎందుకంటే, డబ్బంతా అందులోనే ఉంటుందని, ఏ సమయంలో ఎవరికి ఏ అవసరమొచ్చినా ఆ ధనాన్ని వినియోగిస్తారని, రోజువారీ ఖర్చులన్నీ ఆవిధంగా జరుగుతాయని అంటార'ని వాగ్లే తెలియజేసారు.
ఇకపోతే, బాబా వాగ్లే ఇచ్చిన దక్షిణ తమ జేబులో వేసుకున్న తర్వాత అతనికి ప్రసాదమిచ్చి ఎవరికీ అర్థంకానీ రీతిలో తమ చేతితో సైగ చేసి అతని మనసులో మెదులుతున్న ఆలోచనకు సమాధానం చెప్పారు. అది చూసి అతను జలదరించిపోయాడు. కారణం, ఆ సమయంలో ఒక యువతి అతన్ని తన వలలో వేసుకోవాలని ప్రయత్నిస్తుంది. దాని గురించే బాబా చెప్పారు. ఆ తర్వాత వాగ్లే, అతని స్నేహితులు కొని తెచ్చుకున్న బాబా ఫోటోలు బాబాకిచ్చి, వారి చేతుల మీదగా తిరిగి తీసుకున్నారు. ఇక్కడ చెప్పవలసిన ఒక విషయం ఏమిటంటే, వాళ్ళు తమ తిరుగు ప్రయాణానికి టిక్కెట్లు తీసుకుని, బాబా వద్ద అనుమతి తీసుకోకుండానే రైలు ఎక్కాలని నిర్ణయించుకొని టాంగా కూడా మాట్లాడుకొని ఉన్నారు. కానీ వాళ్ళు నమస్కారం చేసి బయలుదేరబోతుండగా బాబా వాళ్ళతో, "ఇప్పుడు బొంబాయికి వద్దు, వెళ్లి వాడాలో కూర్చోండి" అని చెప్పారు. ఇంకా పాటిల్ నామధేయం గల గ్రామానికి చెందిన గృహస్థుడిని పిలిచి, "వీళ్ళని సాయంత్రం బెల్లం తయారీ జరిగే చోటకి తీసుకెళ్లి, తాగడానికి చెరుకు రసం ఇవ్వు" అని చెప్పారు. దాంతో వాళ్ళు చేసేదిలేక టాంగావానికి డబ్బులిచ్చి పంపేసి వాడాకి వెళ్లారు. అక్కడ వాగ్లే స్నేహితులిద్దరూ నిద్రపోగా అతను మాత్రం నిద్రపోకుండా పడుకొని విశ్రాంతి తీసుకుంటుంటే, కొంతసేపటికి పెద్ద కోలాహలం అతని చెవిన పడింది. 'ఏంటిది? అక్కడ ఏం జరుగుతుంది?' అని అతను కుతూహలంగా అది చూడటానికి వెళ్ళాడు.
ఆ సమయంలో మశీదు వద్ద చాలా జనం గుమిగూడి ఉన్నారు. మూడు, నాలుగు భక్తబృందాలు తబలాలు వాయిస్తూ ఒకే తాళంలో బాబాను కీర్తిస్తూ పాటలు పడుతున్నారు. వాటన్నింటిలోనూ నిరంతరాయంగా వస్తున్న ఏకైక చరణం 'సాయిబాబారే, సాయినాథారే'. వాగ్లే మశీదు బయట నిలబడి అదంతా చూస్తుండగా బాబా అతన్ని చూసి, "ఏ అబ్బాయీ! ఇక్కడికి రా(ఏ చోకర ఈదర ఆవ్)" అని దగ్గరకి పిలిచారు. అతను వారి దగ్గరకి వెళ్లి, వారికి నమస్కరించి, బాబా వైపే చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు ఆయన, "వాడాకి వెళ్లి మరో 5 రూపాయలు తీసుకొని రా" అని అన్నారు. అది విని బాబా సర్వజ్ఞతకు అతను ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే, ఆ సమయంలో అతని దగ్గర సరిగ్గా 5 రూపాయలే ఉన్నాయి. అయినా అతను తొందరగా వాడాకు వెళ్లి, ఆ 5 రూపాయలు తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టి, అక్కడే కూర్చున్నాడు. కారణం అతను బాబాతో పైన పేర్కొన్న(ముందు భాగంలో) నారేకర్ గురించి మాట్లాడాలని. కానీ అతను అతని గురించి బాబాకి వినతి చేసుకోబోతుండగా బాబా ఉన్నట్టుండి ఒక్కసారిగా భయంకర రూపు దాల్చారు. ఆయన కళ్ళు ఎర్రగా మారిపోయాయి. వాటిని పెద్దగా చేసి, నోటితో పెద్దపెద్దగా శబ్దాలు చేస్తూ తీవ్రంగా తిట్టనారంభించారు. ఆ సమయంలో వారిని స్తుతిస్తున్న కొందరు, అలాగే సమీపంలో కూర్చుని సాయి లీలలున్న ఏదో గ్రంథం చదువుతున్న వార్ధాకి చెందిన శ్రీనాయక్ తదితరులు బాబాని ఆ స్థితిలో చూసి ఎక్కడున్న వాళ్ళు అక్కడే తటస్థంగా ఉండిపోయారు. బాబా హఠాత్తుగా సమక్షంలో ఎవరున్నా శాపనార్థాలు కురిపిస్తూ జమదగ్ని అవతారం ఎందుకు దాల్చారో ఎవరికీ అర్థం కాలేదు. భక్తులంతా భయంతో వణికిపోయారు. 'ఎవరి మీద ఈ మండిపాటు? ఎవరి పాతక వృక్షాన్ని సమూలంగా తుడిచిపెడుతున్నారు?' అన్నది ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. బాబా దృష్టి మాత్రం ఎక్కడో దూరంగా ఉంది. వారి నోటి వెంబడి "అలాంటి పనులు చేసి(బహుశా దుష్కర్మలు) నా దగ్గరకి వస్తే, నేను నిన్ను నిర్దాక్షిణ్యంగా బయటకు గెంటేస్తాను" అని వెలువడ్డాయి. ఈవిధంగా సుమారు 10 నిముషాలపాటు సాగింది. అంతలో బాబా దృష్టి ఉన్న దిశలో పొడవాటి చెట్టు గుండా సూర్యకిరణాలు పట్టు వస్త్రంపై పడి చమక్, చమక్మని మెరవడం కనిపించింది. అంటే, దూరంగా ఇద్దరు ఆడవాళ్లు రావడం కనిపించసాగింది. వాళ్ళు అలా అలా దగ్గరకు వస్తుండగా, బాబా అలా అలా తమ దృష్టి మరోవైపుకు మళ్లించి నోటిలో చిలుము పెట్టుకొని పీల్చడం ప్రారంభించారు. అంతలో సుందరమైన మధ్యవయస్కురాలు పల్చని జరీ చీర ధరించి తన దాసితో మశీదు లోపలికి వచ్చింది. ఆమె చాలాసేపు నిలబడి బాబాకి నమస్కరించింది. కానీ బాబా ఆమెను ఏమాత్రమూ పట్టించుకోలేదు. అప్పుడు ఎవరో 'ఆమె నగర్ జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన ధనిక జాగీర్దార్ వితంతువు, మీ దర్శనానికి వచ్చింది' అని చెప్పారు. బాబా మార్మిక భాషలో, "నన్నెందుకు ఇబ్బందిపెడుతున్నారు. దీని గురించి అంతా నేను ముందే చెప్పలేదా? ఆమెను కూర్చోమని చెప్పండి" అని అన్నారు.
వాగ్లే కొంత సమయం తరువాత అవకాశం చూసుకొని నారేకర్ గురించి, అతని భార్యాబిడ్డల పరిస్థితి గురించి బాబాతో చెప్పాడు. బాబా అతను చెప్పిందంతా ప్రశాంతంగా విని నారేకర్ను పిలిపించి, "రేపు అతనితోపాటు వెళ్ళు" అని ఆజ్ఞాపించారు. నిజానికి వాగ్లే అదివరకే నారేకర్ను వెతికి పట్టుకొని, అతని కుటుంబ పరిస్థితుల గురించి అతనితో మాట్లాడాడు. గడ్డం వగైరా పెంచుకొని గుప్తంగా ఏకాంతంలో గడుపుతున్న అతను వాగ్లే చెప్పినదానికి సానుకూలంగా స్పందించలేదు. కానీ బాబా మాటని ధిక్కరించే సాహసం అతను చేయలేదు. అతను, వాగ్లే ఆ రాత్రి అతని రహస్య స్థలానికి వెళ్ళేముందు బాబా వద్దకు వెళ్లి వారి అనుమతి తీసుకున్నారు. మరుసటిరోజు వాళ్ళు శిరిడీ నుండి బయలుదేరి వారి గమ్యస్థానానికి క్షేమంగా చేరుకున్నారు.
వాగ్లే తన అనుభవం గురించి, ‘ఇలాంటి సందర్భం నా జీవితకాలం మొత్తంలో ఒక్కటే ఎదురైంది. అది కనీసం పూర్తి ఇరవై నాలుగు గంటల సమయం కూడా కొనసాగలేదు. అయినప్పటికీ, ఆ క్షణాన్ని నేను ఎప్పుడు తలచుకున్నా నా హృదయం అంతులేని ఆనందంతో పొంగిపోతుంది. మేము బాబాను తెలుసుకోలేదు, ఆయన గురించి ఆలోచించలేదు. కానీ ఆయన అనంతమైన దయతో మాకు స్ఫూర్తినిచ్చి తమ పవిత్ర పాద దర్శనాన్నిచ్చారు. సంతృప్తికరంగా జీవించే అవకాశం కల్పించారు. ఆ మహనీయుని పాదాల చెంత ఉండటం నా కర్తవ్యమని గ్రహించి నేను నా మనసున ఆ ఆత్మోద్ధారకుని పాదాలకు నమస్కరిస్తూ, "ప్రజలందరూ సుఖంగా, సుసంపన్నంగా ఉండాలి" అని ప్రార్థిస్తున్నాను’ అని తెలియజేసారు.
గమనిక: బాబా అప్పుడప్పుడు జమదగ్నిలా తీవ్రమైన ఆగ్రహంతో ఊగిపోయేవారని, ఆయన ఎందుకు అంత భయంకరమైన రూపాన్ని దాల్చేవారో ఎవరికీ తెలిసేది కాదని చాలామంది భక్తులు తమ అనుభవాలలో చెప్పి ఉన్నారు. అందుకు శ్రీవాగ్లేగారి పైఅనుభవం తగిన వివరణ ఇస్తుంది. కాస్త యోచించినట్లైతే, బాబా భక్తులు తమ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ అంతరాలలో దాగి ఉన్న(గతంలో చేసిన) దుష్కర్మల పట్ల తీవ్ర ఆగ్రహానికి గురయ్యేవారని, అయినప్పటికీ బాబా బాహ్యంగా ప్రదర్శించే ఆ కోపం లేదా ఆగ్రహం వెనుక అనంతమైన కరుణ దాగి ఉంటుందని పైఅనుభవం ద్వారా మనకి అర్థమవుతుంది.
సోర్స్: సాయిలీల పత్రిక 1938, 7,8,9 సంచిక
సాయిభక్తుల అనుభవమాలిక 2115వ భాగం....
- కోరుకున్నట్లే గృహవైద్యంతో ఆరోగ్య సమస్య నుండి ఉపశమనం ప్రసాదించిన బాబా
