సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 2039వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. శ్రీసాయి అనుగ్రహం
2. బాబా దయ
3. ఒక్క రాత్రిలో అనుగ్రహించిన బాబా


బాబా దయ

శ్రీ సచ్చిదానంద సద్గురు మహారాజ్ కీ జై. నా పేరు అనుజ. మేము 2025, అక్టోబర్ 3న బయలుదేరి 4వ తేదీకి తిరుపతి చేరుకున్నాము. మేము చేరినప్పటినుండి అక్కడ తిరుపతిలో భారీ వర్షం కురవసాగింది. నేను చాలా భయపడి, "బాబా! మేము మా ఇంటికి తిరిగి చేరేవరకు ఎలాంటి సమస్యలు రాకుండా చూడండి" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల 3 రోజులు పడుతుందన్న వర్షం 3 గంటలలో ఆగిపోయింది. మేము తిరిగి ఇల్లు చేరేవరకు లేదు. అంతేకాదు, మేము కేవలం తిరుమల, తిరుపతి దర్శించుకొని వద్దామనుకున్నప్పటికీ బాబా దయవల్ల ఏ ప్రణాలికా లేకుండా కాణిపాకం, గుడిమల్లం, తిరుచానూరు, వకుళమాత, గోవిందరాజస్వామి ఆలయాలు ఇలా అన్నీ స్థలాలు ఎలాంటి సమస్యలు లేకుండా దర్శించి వచ్చాము. నాకున్న నెలసరి సమస్య కూడా లేకుండా చూశారు ఆ సాయితండ్రి. "చాలా చాలా దాన్యవాదాలు బాబా. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్దం కావటం లేదు. మమ్మల్ని ఎల్లప్పుడూ మీ చల్లని నీడలో వుండేట్లు చూడు తండ్రి. అలాగే అందరిని చల్లగా చూడు తండ్రి. నా తప్పులు ఏమైనా ఉంటే క్షమించు సాయి".


ఒక్క రాత్రిలో అనుగ్రహించిన బాబా

నా పేరు అపర్ణ. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి బాబాయే నా ప్రపంచం. నా జీవితంలో బాబా చేసినవి లెక్కలేనన్ని. మంచి భర్త, పిల్లలతో సంతోషంగా ఉన్నానంటే అది బాబా దయే. ఈ బ్లాగులో భక్తుల అనుభవాలు చదువుతుంటే, అవి మమ్మల్ని బాబాకు మరింత దగ్గర చేస్తున్నాయి. ఈ బ్లాగు ఒక దేవాలయం వంటిది. ఇక నా అనుభవానికి వస్తే, మా పాపకి 9 నెలల వయసు. ఎప్పుడూ ఆడుకుంటూ ఉండే తనలో అన్నప్రాసన కార్యక్రమం అయ్యాక చాలా మార్పు వచ్చింది. ఎప్పుడూ ఏడుస్తూ ఉండేది. ఎందుకలా ఉంటుందో తెలిసేది కాదు. కొంతమంది దిష్టి అంటే, దిష్టి తీశాం. అయినా ఏ మార్పూ లేదు. పాప వారం రోజులు ఏడుస్తూనే ఉండేది. అప్పుడు నేను, "బాబా! పాప ఇదివరకటిలా ఉండాలి" అని బాబాకి చెప్పుకున్నాను. రాత్రి పడుకునేముందు అలా బాబాకి చెప్పుకున్నాను, ఉదయానికి పాప మునుపటిలా ఉంది. ఒక్క రాత్రిలో అంత మార్పు. అంతా బాబా దయ. ఆయన చాలా చాలా సహాయం చేస్తున్నారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

సాయిభక్తుల అనుభవమాలిక 2038వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • శ్రీసాయి అద్భుత లీల

ప్రియమైన శ్రీసాయి భగవత్ బంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు రాజేశ్వరి. నేను హైదరాబాద్‌లో ఉంటాను. నా జీవితంలో బాబా లీలలు కోకొల్లలు. నా జీవితమంతా శ్రీసాయిబాబా కృప, కానుక అని నేను నిస్సందేహంగా చెప్పగలను. నాకు ఎంతటి సమస్య వచ్చినా సాయి అనుక్షణం నా వెంటే ఉండి, ఆ సమస్య తీరేదాకా నాకు ఓర్పు, సహనాలను అనుగ్రహించి ఆ సమస్య నుండి బయటపడే సమయం రాగానే ఎంతో అవలీలగా నన్ను బయటపడేస్తారు. నాకు ఇద్దరు అబ్బాయిలు. వాళ్ళిద్దరూ బాబా పైసలు. ఈ విషయం స్వయంగా బాబానే చెప్పారు. బాబా అనుగ్రహంతో పెద్దబ్బాయి ఎంబీబీఎస్ పూర్తిచేసి వచ్చే సంవత్సరం పీజీ సీటు కోసం తయారవుతున్నాడు. చిన్నబ్బాయి ఈ సంవత్సరం ఎంబీబీస్‌లో చేరాడు. ఇద్దరు బిడ్డలు మెడికల్ ప్రొఫెషన్‌లో చేరడం, చదవటం అంతా బాబాచే ముందుగా నిర్ణయించబడి వుంది. ఆ విషయం బాబానే స్వయంగా మా చిన్నబ్బాయికి స్వప్నంలో కనిపించి చెప్పారు. నేనిప్పుడు మా చిన్నబ్బాయి మెడిసిన్ సీటు విషయంలో బాబా అద్భుత లీలను వివరించబోతున్నాను.

మేము మా చిన్నబ్బాయిని ఇంటర్ చదువుకోసం చైతన్యలో చేర్పించాము. వాడు అక్కడ ఒత్తిడి తట్టుకోలేకపోవడం వల్ల తన ఆరోగ్యం పాడయ్యింది. ఇంటర్ చదివే రెండు సంవత్సరాలూ తనని చాలా ఇబ్బందిపెట్టింది. ఎంతలా అంటే నెలలు తరబడి కాలేజీకి వెళ్ళలేకపోయాడు. ఎప్పుడూ అనారోగ్యంతో ఉండేవాడు. అన్ని హాస్పిటల్స్‌కు తిప్పి, అన్ని రకాల టెస్టులు చేయించాము. డాక్టర్లు "సమస్యేమీ లేదు. అంతా బాగుంది. అబ్బాయి విపరీతమైన టెన్షన్ పడుతున్నాడు. దానివల్లే ఆరోగ్యం దెబ్బతింటుంది" అని చెప్పారు. మా అబ్బాయి అంత ఇబ్బందిపడటం చూసి నాకు నరకం కనిపించేది. ఆఖరికి మా అబ్బాయి ఇంటర్ మొదటి సంవత్సరం సగం అయిన తర్వాత నేను, "నువ్వు ఈ సంవత్సరం పరీక్షలు వ్రాయొద్దు. వచ్చే సంవత్సరం తాజాగా ఎంపీసీ తీసుకో! ప్రశాంతంగా చదువుకోవచ్చు. ఆపై ఐఐటీలో ఏమీ వద్దు. మంచి కాలేజీలో బీటెక్ చదువుదువు. నేను నీ బాధ చూడలేకపోతున్నాను" అని ఖరాఖండిగా చదువు మానేయమని చెప్పాను. కానీ మా అబ్బాయి "మెడిసిన్ చదవడం నా కల. కానీ టెన్షన్‌ని, భయాన్ని తగ్గించుకోలేకపోతున్నాను. అలాగని నేను ఇప్పుడు మధ్యలో మానేసి వేరే గ్రూపుకు మారను" అని అన్నాడు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. మావారు, పెద్దబ్బాయి నన్ను స్థిమితపరిచి, "వాడికి ఇష్టం లేని పని బలవంతంగా చేయమని చెప్పొద్దు. కాలేజీకి వెళ్లే ఓపిక ఉన్న రోజు కాలేజీకి వెళ్తాడు. మిగతా సమయం అంతా ట్యూషన్స్ పెట్టిద్దామ"ని చెప్పారు. అలా రెండు సంవత్సరాలు కొనసాగించాం. తప్పక అలా చేసాము కానీ, ఆ విధంగా చదివి నీట్ ఎగ్జామ్ వ్రాసి, మెడిసిన్ సీటు తెచ్చుకోవడం అనేది నా దృష్టిలో అసాధ్యమనే చెప్తాను.

2025, మే 4న అబ్బాయి నీట్ పరీక్ష వ్రాసాడు. పేపర్ ఇంతకుముందెన్నడూ ఇవ్వనంత కఠినంగా వచ్చింది. మా అబ్బాయి వ్రాసిన విధానానికి, వచ్చిన మార్కులకి కేవలం బాబా దయవల్ల మెడిసిన్ సీటు రావాలి. ఒకవేళ బాబా అనుగ్రహించినా మేము కోరుకునే మూడు ప్రధాన కాలేజీలలో సీటు రాదు. ఆ విషయం  అర్థమైనా కౌన్సిలింగ్ మొదలుపెట్టాక మా అబ్బాయికి బాగా ఇష్టమైన ఆ మూడు కాలేజీలతోపాటు మిగతా కాలేజీలు పెడుతుండేవాళ్ళము. అది కూడా అన్ని కాలేజీలు కాదు. మా ఇంటినుంచి రోజూ వెళ్ళొచ్చేలా దగ్గర్లో ఉన్న కాలేజీలు మాత్రమే పెట్టేవాళ్ళము. మావాడు ఇంటర్ చదివిన తీరుకి ఫ్రీ సీటు వస్తుందని మేము అనుకోలేదు. అలాంటిది బాబా దయవల్ల మొదటి రౌండ్లో వాడికి ఫ్రీ సీటు వచ్చింది. మేము చాలా సంతోషపడ్డాం. మా అబ్బాయి కూడా సంతోషించినప్పటికీ అనుకున్న కాలేజీ రాలేదని మనసులో పెట్టుకున్నాడు. రెండవ రౌండ్ కౌన్సిలింగ్‌లో వాడికి ఇష్టమైన కాలేజీలలో సీటు వస్తుందేమోనని ఆశ పెట్టాము కానీ, రాలేదు. ఆఖరికి ఆ కాలేజీలలో సీటు మా అబ్బాయికొచ్చే అవకాశం దరిదాపుల్లో కూడా లేదని రూఢి అయ్యాక వాస్తవికత మా అబ్బాయికి చెప్పి, 'ఆ కాలేజీల మీద ఆశ పెట్టుకోవద్దని. వచ్చిన సీటు బాబా అనుగ్రహంగా భావించి చదువు కొనసాగించమని' చెప్పాము.

2025, అక్టోబర్ నెలాఖరులో కాలేజీ మొదలైంది. మేము సంతోషంగా మా అబ్బాయిని కాలేజీలో దింపాము. అయితే సాయంత్రం ఇంటికి వచ్చిన మా అబ్బాయి పెద్ద బాంబు పేల్చాడు. ఆ కాలేజీలో సీనియర్స్ వీళ్ళతో(జూనియర్స్) "ఈ కాలేజీ అస్సలు బాగోదు. ఇక్కడ చదవడం పెద్ద దండగ. లెక్చరర్లు క్లాసులోకి రారు. వచ్చినా ఏం చెప్పరు. బాగా చదివినవాళ్ళని కావాలని ఫెయిల్ చేస్తార"ని ఇష్టం వచ్చినట్లు చెప్పారంట. మా అబ్బాయి వాళ్ళ మాటలు బాగా బుర్రకు ఎక్కించుకొని భయపడిపోయి, "నేను ఈ కాలేజీలో చదవలేను. ఇలా ఉంటే నాకు నాకు కష్టం కదా!" అని అన్నాడు. అదే మెడిసిన్ ఫీల్డ్‌లో ఉన్న మా పెద్దబ్బాయి "నేనున్నాను కదా! ఎలా చదవాలో నేను చెప్తాను కదా! నాది మెడిసిన్ అయిపోయింది. నీ సీనియర్లది ఇంకా అవ్వలేదు. నా మాట విను. వాళ్ళని ఏం పట్టించుకోకు. ఈ రోజుల్లో మెడిసిన్ సీట్లు దొరకటం అంటే మామూలు విషయం కాదు. అతిగా ఆలోచించుకు" అని ఎన్ని విధాలా చెప్పినా, నేను, మావారు కూడా ఎంత చెప్పినా వినకుండా ఒక రకమైన భయం పెట్టేసుకొని తినటం బాగా తగ్గించేసి ఆరోగ్యం పాడుచేసుకోవడం మొదలుపెట్టాడు. మాకు ఏం చేయాలో తెలియలేదు. అలా నరకం కొనసాగుతుండగా ఒక పది రోజుల తర్వాత మూడో కౌన్సిలింగ్ డేట్ ఇచ్చారు. మా చిన్నబ్బాయి, "ఏ కాలేజీ అయినా పెట్టండి. సీటు వస్తే వెళ్ళిపోతాను. ఈ కాలేజీలో మాత్రం నేను చదవలేను" అని తేల్చేశాడు. అంటే ఆ కౌన్సిలింగ్‌లో మేము ఇంకా కింద స్థాయి కాలేజీలు పెట్టాలి. అయినా చేసేదేమీలేక మొదట రావనుకున్న మూడు కాలేజీలతోపాటు మిగతా కింద స్థాయిలో ఉన్న మరొ మూడు కాలేజీలు పెట్టాము. తర్వాత నేను, "బాబా! మీరే మాకు దిక్కు. వాడికి మేము ఏమీ చెప్పలేకపోతున్నాం. మెడిసిన్ సీటు వచ్చిందనే సంతోషమే లేకపోగా వీడి భవిష్యత్తు ఏమైపోతుందో అని విపరీతమైన భయమేస్తుంది" అని బాబా ముందు విపరీతంగా ఏడ్చి, "బాబా! నన్ను ఎన్నో సమస్యల నుండే మీరే బయటపడేశారు. పిల్లలిద్దరూ మెడిసిన్ ప్రొఫెషనల్‌లో ఉంటారని మీరే స్వయంగా చెప్పారు. ఇప్పుడు వీడు ఆ కాలేజీకి వెళ్లలేను అంటున్నాడు. ఈ చివరి కౌన్సిలింగ్‌లో వాడికి నచ్చిన కాలేజీలో వాడికి వచ్చిన ర్యాంకు ఆధారంగా ఎట్టి పరిస్థితుల్లోనూ సీటు రాదు. దిగువ స్థాయి కాలేజీల్లో సీటు వచ్చినా ఆ కాలేజీకి వెళ్ళాక ఏమంటాడో? నాకు ఏమీ అర్థం కావడం లేదు. ఇక మీరే దిక్కు. వాడి ఆలోచన మార్చండి. వాడి భయాన్ని మీరే తీసేయండి. వాడికి స్థిరత్వాన్ని ఇవ్వండి. వాడికి ఏది మంచని మీరు అనుకుంటున్నారో అది చేయండి" అని పదేపదే శ్రీసాయిని ప్రార్థించడం మొదలుపెట్టాను. నాతోపాటు మావారు కూడా బాబాను ప్రార్థించసాగారు. భగవత్ భక్తులారా! పూర్తి నిస్సహాయస్థితిలో శ్రీసాయి మీదే మొత్తం భారమేసి తీవ్రంగా ప్రార్థించే ప్రార్థనలను శ్రీసాయి క్షణం మాత్రం కూడా ఆశ్రద్ధ చేయరు. ఆశ లేదు, మునిగిపోతున్నామన్న సందర్భంలో 'సాయీ! నీవే దిక్కు' అని మనస్ఫూర్తిగా వేడుకున్న ప్రతిసారీ ఆయన, 'ఓయ్, ఇదిగో పక్కనే ఉన్న' అన్నట్టు పరిస్థితిని సవ్యంగా మలుస్తారు. ఇది నేను చవిచూసిన పరమసత్యం. శ్రీసాయి ఎంతటి అద్భుతం చూపారో చూడండి! శ్రీసాయి మా అబ్బాయి కోరికను మన్నించి, వాడు అత్యంత ఇష్టపడే కాలేజీలలో, అది కూడా అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ సీటు రాదనుకున్న మొదటి కాలేజీలో వాడికి సీటు అనుగ్రహించారు. అసాధ్యమనుకున్నది సాధ్యం చేసి తమ లీలలు  అనంతం, అమోఘం అని నిరూపించారు. ఇది ముమ్మాటికి శ్రీసాయి అద్భుతమైన లీల. మా జీవిత ప్రయాణంలో శ్రీసాయి మాకిచ్చిన మరొక వరం. "అన్నిటికీ చాలా చాలా ధన్యవాదాలు బాబా".

సాయిభక్తుల అనుభవమాలిక 2037వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. శ్రీసాయి అనుగ్రహ లీలలు - 38వ భాగం
2. బాబా కృప

శ్రీసాయి అనుగ్రహ లీలలు - 38వ భాగం 


నా పేరు సాయిబాబు. 2016లో ఒకరోజు మధ్యాహ్నం నేను నిద్రపోతున్నప్పుడు నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఇద్దరు యమభటులు తమ చేతులు చాచి నన్ను పట్టుకోబోతున్నారు. నాకు భయమేసి 'బాబా' అని గట్టిగా అరిచాను. అంతే! మరుక్షణంలో ఒక పాదం ఆ యమదూతలిద్దరినీ ఒక్క తన్నుతంతే వాళ్ళు దూరంగా పడి, లేచే పారిపోయారు. అంతలో బాబా నా పక్కన నిలబడి కనిపించారు. ఆయన, "భయపడకు! వాళ్ళని తన్ని తరిమేసాను" అని నాతో చెప్పారు. ఆకస్మాత్తుగా నాకు మెలకువ వచ్చింది. ఆ కలంతా నా భార్యకి చెప్పాను. అదేరోజు సాయంత్రం నా భార్య బాబా పుస్తకం చదువుతూ నన్ను పిలిచి ఒక పేజీలో వాక్యాలు చదవమని చెప్పింది. అక్కడ, "అవును నిజంగానే యమభటులు వచ్చారు. వాళ్ళని తన్ని తరిమేసాను. భయపడొద్దు!" అని ఉంది. మా ఇద్దరికీ చాలా ఆశ్చర్యమేసింది. అలా నాకొచ్చింది కల కాదు, నిజమేనని బాబా చెప్పారు.


2025. ఆగస్ట్ 18న నా భార్య శిరిడీ వచ్చి బాబా దర్శనం చేసుకొని 19వ తేదీన హైదరాబాద్ వెళ్లి, అక్కడినుండి కైలాష్, మానస సరోవర యాత్రకి బయలుదేరింది. నేను బాబాతో, "నా భార్య చేత మంచిగా యాత్ర చేయించి సురక్షితంగా తిరిగి మా ఇంటికి చేర్చండి బాబా" అని చెప్పుకున్నాను. బాబా నా ప్రార్థన విన్నారు. నా భార్య ఏ ఆటంకం లేకుండా మానససరోవరం సరస్సు చూసుకొని, కైలాస పర్వత ప్రదక్షిణ చేసింది. తరువాత తిరిగి వస్తున్నప్పుడు తను దారి తప్పిపోయింది. తనకి ఎవరూ కనపడక భయమేసి 'శివ' నామం చెప్పుకుంది. తర్వాత బాబాని తలుచుకొని కన్నీళ్లు పెట్టుకోగానే ముసలి దంపతులు తన దగ్గరికొచ్చి తన చెరొక చేయి పట్టుకొని నిలబెట్టారు. నా భార్య వాళ్ళని శివపార్వతులుగా భావించి తనతో శిరిడీ నుండి తీసుకెళ్లిన మారేడు దళాలు వారి పాదాలు మీద పెట్టింది. ముఖ్య విషయమేమిటంటే, చైనావాళ్లు యాత్రికులను తనిఖీ చేసినప్పుడు అందరి దగ్గర వున్న మారేడు దళాలను తీసుకొని తిరిగి ఇవ్వలేదుగానీ నా భార్యకు మాత్రం ఇచ్చారు. సరే అసలు విషయానికి వస్తే, ఆ వృద్ధ దంపతులు నా భార్యని నడిపించుకుంటూ తీసుకొని వెళ్తున్నప్పుడు ఎదురుగా వున్న పర్వతం మీద అభయహస్తంతో బాబా నా భార్యకి దర్శనమిచ్చారు. ఇదిలా ఉండగా నా భార్య వాళ్లతోపాటు వెళ్లిన గుర్రం వాడు ఒకామె తప్పిపోయందని మిలిటరీవాళ్ళకి రిపోర్ట్ ఇచ్చాడు. దాంతో మిలిటరీవాళ్ళు నా భార్యను వెతుక్కుంటే బయలుదేరారు. ఆ క్షణానికి వృద్ధ దంపతులు నా భార్యకి తను వెళ్లాల్సిన చోటుకి దారి చూపించారు. అంతలో మిలిటరీవాళ్ళు అక్కడికి వచ్చారు. వాళ్ళు దగ్గరకి రాగానే ఆ వృద్ధ దంపతులు మరి కనపడలేదు. అలా బాబా దయవల్ల 11 రోజుల యాత్ర ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తై నా భార్య క్షేమంగా మా ఇంటికి చేరుకుంది.


2025, సెప్టెంబర్ 11న నేను ఫేస్బుక్‌లో ఒకరు తమ ఇంట్లో హనుమాన్ చాలీసా పుస్తకం ఎక్కడో పెట్టి మర్చిపోయామని, ఎంత వెతికినా కనపడలేదని, తరువాత ఒకరోజు ఆ పుస్తకం దొరికిందని సంతోషంగా ఆ పుస్తకం ఫోటోతో సహా పెట్టారు. ఆ మర్నాడు ఉదయం 10 గంటలకి బాబా నన్ను దర్శనానికి రమ్మంటున్నట్లు నాకు అనిపించింది. నిజానికి నేను ప్రతిరోజూ మధ్యాహ్నం 2గంటలకు దర్శనానికి వెళ్లి 5 గంటలకు ఇంటికి వస్తుంటాను. కానీ ఆరోజు బాబా రమ్మంటున్నట్లు అనిపించడం వల్ల ఉదయమే దర్శనానికి సమాధి మందిరంకి వెళ్ళాను. అప్పుడు బాబా పాదాల వద్ద ఉన్న బంతి పువ్వు నాకు ఇచ్చారు. తర్వాత నేను ద్వారకామాయికి వెళ్లి, దర్శనం చేసుకుని బయటకు వస్తుంటే ఒకరు వచ్చి "మీరు తెలుగు చదువుతారు కదా!" అని చిన్న పుస్తకం చేతిలో పెట్టారు. అది హనుమాన్ చాలీసా పుస్తకం. అప్పుడు ముందురోజు నేను ఫేస్బుక్‌లో చదివిన అనుభవం నాకు ఒక మెసేజ్ అని అర్థమైంది. అలా బాబా భవిష్యత్తు ముందే చూపిస్తారు.

బాబా కృప

నా పేరు కామేశ్వరి. నేను ఒక సామాన్య సాయి భక్తురాలిని. నేను హైదరాబాద్‌లో నివాసముంటున్న 78 సంవత్సరాల ఒంటరి మహిళను. నాకు మరణ భయం లేదుగాని, రోగ భయం మటుకు చాలానే ఉంది. ఎందుకంటే, నేను ఆసుపత్రి పాలైతే నాకన్న నన్ను చూసుకునేవాళ్ళకి ఎక్కువ ఇబ్బంది. అందుచేత  నేనెప్పుడూ సాయినాథుని అనాయాస మరణం ప్రసాదించమని ప్రార్ధిస్తూ ఉంటాను.  నా పిల్లలిద్దరూ యుఎస్‌లో ఉంటున్నారు. నేను సంవత్సరంలో ఆరునెలలు వాళ్ళ దగ్గర, ఆరునెలలు ఇండియాలో ఉంటాను. 2025, ఆగస్టులో యుఎస్ వెళ్ళగానే నాకు సుస్తీ చేసింది. రోగ లక్షణాలను బట్టి అది క్యాన్సర్ కావచ్చన్న సందేహం కలిగింది. దాంతో నేను బాబాను శరణువేడి ఫ్యామిలీ డాక్టర్ను సంప్రదిస్తే, స్పెషలిస్ట్ డాక్టర్ని కలవమన్నారు. అలాగే కలిస్తే, బాబా దయవల్ల అది సాధారణ రుగ్మతే అని తేలింది. ఇది బాబా కృపేనని నా నమ్మకం. ఎల్లవేళలా నన్ను కాపాడుతున్న బాబాకు శతకోటి ప్రణామాలు, కృతజ్ఞతలు. ఓం సాయినాథాయ నమః.

సాయిభక్తుల అనుభవమాలిక 2036వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఆరోగ్య విషయంలో బాబా సహాయం
2. టాబ్లెట్ వేసుకోకపోయినా ఏ సమస్యా రాకుండా దయచూపిన బాబా

ఆరోగ్య విషయంలో బాబా సహాయం

నేను ఒక సాయి భక్తురాలిని. మా నాన్న షుగర్ వ్యాధిగ్రస్తులు. దానివల్ల ఆయనకి డయాబెటిక్ ఫుట్ వచ్చింది. డయాబెటిక్ ఫుట్ అంటే మధుమేహం కారణంగా పాదాలకు వచ్చే సమస్యలు. నరాలు దెబ్బతినడం, రక్తప్రసరణ సరిగా లేకపోవడం వల్ల పాదాలకు గాయాలైనా నొప్పి తెలియకపోవడం, చిన్న గాయాలు పెద్ద పుండ్లు లేదా ఇన్ఫెక్షన్ గా మారడం జరుగుతుంది. ఒకసారి నాన్న పాదానికి అయిన పుండు పగిలి రక్తం, చీము కారుతూ ఉండింది. అది అలానే ఉంటే ఇన్ఫెక్షన్ అవుతుందని నాన్న డాక్టర్ దగ్గరికి వెళ్లారు. డాక్టర్ అంతా క్లీన్ చేసి, కొన్ని మందులిచ్చి "ఇక మీదట జాగ్రత్తగా ఉండాలి. లేదంటే బాగా ఇబ్బంది అవుతుంది" అని అన్నారు. అయితే అందరూ మా నాన్న తాగుబోతు కాబట్టి అది అంత తేలికగా తగ్గదని, తగ్గినా మధుమేహం వల్ల అది మళ్లీ మళ్లీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఒకవేళ అది తగ్గకుండా పెరిగితే కాలు తీసేయాల్సిన పరిస్థితి వస్తుందని భయపెట్టారు. అది నిజమే కూడా. అందువల్ల వాళ్ళు చెప్పినట్లు పుండు తగ్గకపోతే ఆ పరిస్థితిని ఎదుర్కోవడం కష్టమని మాకు చాలా భయమేసింది. నేను బాబా మీద నమ్మకముంచి, "బాబా! ఆ గాయం ఎలాగైనా తగ్గించండి. అది మళ్ళీ రాకూడదు. ఆ గాయం పెరగకుండా తొందరగా గాయం తగ్గిపోయేలా చేయండి ప్లీజ్" అని వేడుకున్నాను. బాబా దయవల్ల నాన్న గాయం తగ్గింది. ఇదంతా జరిగి ఒక సంవత్సరంపైనే అయింది. ఇప్పటివరకు ఆ సమస్య మళ్ళీ రాలేదు. అంతా బాబా దయ.

ఈ సంవత్సరం(2025) మా తమ్ముడు హెల్త్ చెకప్ చేయించుకొని, రిపోర్టులో అన్నీ బాగానే ఉన్నాయని పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత 15 రోజులకి ఒకరోజు నేను మాటల్లో మా కంపెనీ సంవత్సరానికి ఒకసారి ఇచ్చే హెల్త్ చెకప్ సౌకర్యం గురించి చెప్తుంటే, మా తమ్ముడు విని, "నేను ఇటీవల చెకప్ చేయించుకున్నాను. బావగారికి(నా భర్త డాక్టర్) రిపోర్టు పెడతాను. ఒకసారి చూసి ఎలా ఉన్నాయో చెప్పమ"ని అన్నాడు. నా భర్త ఆ రిపోర్టు చూసి, "అంతా బాగుంది" అన్నారు. కానీ ఒక్క నిమిషం అగి, "క్రియేటిన్ లెవల్ 1.1 ఉంది" అన్నారు. అది  విన్న వెంటనే నాకు కంగారుగా అనిపించి భయమేసింది. ఎందుకంటే, అదివరకు మా ఆడపడుచు ఒకసారి ఇలానే హెల్త్ చెకప్ చేయించుకొని మొదటిసారి అంత నార్మల్‌గానే ఉందనుకొని తర్వాత క్రియేటిన్ లెవెల్ 1.3 ఉందని గమనించారు. జాబు అదేమంత పెద్ద సమస్య కాదని పట్టించుకోలేదు. కానీ 3 నెలల తర్వాత మళ్ళీ టెస్ట్ చేయించుకుంటే క్రియేటిన్ లెవల్ 1.7 ఉంది. అప్పటికే మోకాళ్ళ జాయింట్స్ దగ్గర నొప్పులు, కాళ్ళలో నీళ్లు రావడం మొదలైన లక్షణాలు మొదలయ్యాయి. ఇంకా బీపీ కూడా ఎక్కవగా ఉండింది. అవన్నీ చూసి డాక్టర్, 'CKD(క్రానిక్ కిడ్నీ డిసార్డర్- కిడ్నీ ఫెయిల్యూర్)' అని చెప్పారు. అప్పుడు వాళ్ళు మునపటి రిపోర్టులో క్రియేటిన్ 1.3 ఉందని చెప్తే, "1.3 ఉన్నప్పుడు సంప్రదించకుండా మీరు ఎందుకు నిర్లక్ష్యం చేసార"ని డాక్టర్ తిట్టారు. ఈ కారణాల వల్ల మా తమ్ముడికి క్రియేటిన్ లెవల్ 1.1 ఉందని భయమేసి కంగారుపడ్డాము. అదే విషయం మా తమ్ముడికి చెప్తే, తను కూడా భయపడ్డాడు. నా భర్త డీహైడ్రేషన్ వల్ల కూడా అలా చూపిస్తుంది అన్నారు. ఆయన చెప్పింది వాస్తవం. సాధారణంగా క్రియేటిన్ స్థాయి హెచ్చుతగ్గులకు గురవుతూ ఉంటుంది. చాలామంది విషయంలో అది తేలికగానే తగ్గుతుంది. మా ఆడపడుచుకి అయినట్లు CKD(కిడ్నీ ఫెయిల్యూర్) ఏం అవ్వదు. కానీ ఆవిడ పరిస్థితి దగ్గర నుండి చూసినందువల్ల మా తమ్ముడి క్రియేటిన్ లెవల్ 1.1 ఉన్నా కూడా నాకు భయమేసింది. పురుషులలో సాధారణ క్రియేటిన్ స్థాయి 1.3-1.5(బోర్డర్) అయినప్పటికీ 1 కంటే తక్కువ ఉంటే మంచిదని తెలిసి భయపడ్డాము. మా తమ్ముడు ఎలాగూ టెస్ట్ చేయించి 15 రోజులు అయింది కదా అని అదేరోజు మళ్ళీ టెస్ట్ చేయించుకుంటే, ఈసారి క్రియేటిన్ 1.3 ఉంది. మాకు ఇంకా భయమేసి అదివరకు మా ఆడపడుచు సంప్రదించిన డాక్టర్ని సంప్రదిస్తే, క్రియేటిన్ స్థాయి పెరగడం చూసి ఉప్పు లేని పదార్థాలు తినమన్నారు. అయితే అలా చేస్తున్న కూడా ఒక నెలకు క్రియేటిన్ 1.5 వరకు పెరిగింది. అప్పుడు ఇక మాకు బాబానే దిక్కు అని మా అమ్మతో 'సాయి దివ్యపూజ' మొదలుపెట్టామని చెప్పాను. మా అమ్మ సరేనని దివ్యపూజ 11 వారాలు చేస్తానని సంకల్పం చేసుకుంది. ఒక వారం పూజ అయ్యాక అదే వారంలో శనివారంనాడు నేను లక్ష్మీనరసింహస్వామి దేవాలయంకి వెళ్లి, “మా తమ్ముడు క్రియేటిన్ స్థాయి తగ్గితే, అదేరోజు మీ దర్శనం చేసుకోమని వాళ్ళకి చెప్తాన"ని అనుకున్నాను. అలా అనుకున్న 15 నిమిషాలకి మేము ఆ గుడిలో ఉండగానే మా తమ్ముడు నా భర్తకి ఫోన్ చేసి, "క్రియాటిన్ 1.3కి వచ్చింది" అని చెప్పాడు. నేను వెంటనే మా తమ్ముడికి కాల్ చేసి, 'మేము  లక్ష్మీనరసింహస్వామి గుడిలో ఉన్నాము. నేను ఇలా అనుకున్నాను. మీరు రండి' అని చెప్తే, వాళ్ళు సంతోషంగా వచ్చారు. బాబా, లక్ష్మీనరసింహస్వాముల దయవల్ల మా తమ్ముడికి క్రియాటిన్ లెవెల్ తగ్గి 1.1 దగ్గర ఉండేలా చేసారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

టాబ్లెట్ వేసుకోకపోయినా ఏ సమస్యా రాకుండా దయచూపిన బాబా

సాయి భక్తులందరికీ ప్రణామాలు. సాయిని దృఢంగా విశ్వసించే లక్షలాదిమంది భక్తులలో నేను ఒక దానిని. నాకు పెళ్ళై 5 నెలలు అవుతుంది. కొత్తగా అత్తవారింటికి వెళ్ళినప్పుడు నాకు ఒక సమస్య వచ్చింది. మూడేళ్ళ క్రితం నాకు థైరాయిడ్ సమస్య వచ్చింది. దానికోసం నేను రోజూ తప్పనిసరిగా ఒక టాబ్లెట్ వేసుకోవాల్సి ఉంది. లేకపోతే నిద్రపోయేటప్పుడు గురక వస్తుంది. అలాంటిది నేను టాబ్లెట్లు మా అమ్మ వాళ్ళింట్లో మార్చిపోయాను. అందువల్ల 'నేను నిద్రపోయే సమయంలో నాకు ఒకవేళ గురక వస్తే, అత్తింట్లోవాళ్ళు ఏం అనుకుంటారో!' అని చాలా భయమేసి పడుకునే ముందు బాబాకి నమస్కరించుకొనిఊదీ పెట్టుకొని, "బాబా! నాకు గురక రాకుండా చూడు" అని బాబాను ప్రార్ధించాను. ఆయనని తలచిన మరుక్షణంలో మన చెంత ఉంటారు. బాబా దయవల్ల 5 రోజులపాటూ నేను టాబ్లెట్లు వేసుకోకపోయినా నాకు ఏ సమస్య రాలేదు. "చాలా ధన్యవాదాలు బాబా".

సాయిభక్తుల అనుభవమాలిక 2035వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • శ్రీసాయి అనురాగ తరంగాలు






సాయిభక్తుల అనుభవమాలిక 2034వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • అడిగిన ప్రతి విషయంలో సహాయం చేసిన బాబా


సాయిభక్తుల అనుభవమాలిక 2033వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  • బాబా ఆశీస్సులు 


సాయిభక్తుల అనుభవమాలిక 2032వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా దయ లేకుంటే ఏమైపోతామో!
2. అర్ధరాత్రి బాబా అందించిన సాయం


అర్ధరాత్రి బాబా అందించిన సాయం

అందరికీ నమస్కారం. నా పేరు అలేఖ్య. మేము హైదరాబాద్‌లో ఉంటాము. ఒకరోజు మేము మా సొంతూరు వరంగల్‌ వెళ్ళడానికి కారులో ప్రయాణమయ్యాము. మధ్య దారిలో తినడానికని ఒక చోట ఆగి, తిన్న తర్వాత తిరిగి బయల్దేరుతుంటే కారు స్టార్ట్ అవ్వలేదు. అసలు సమస్యేమిటో తెలుసుకుందామంటే దగ్గర్లో మెకానిక్ షాపు లేదు. అక్కడ ఆ హోటల్ తప్ప చుట్టుపక్కల ఎక్కడా ఒక్క షాపు కూడా లేదు. మెల్లగా వర్షం కూడా మొదలయింది. గంటకు పైగానే వర్షంలో పిల్లలతో మేము ఇబ్బందిపడ్డాము. అక్కడ ఉన్నవాళ్లలో ఒక్కరు కూడా మాకు సహాయం చేయడానికి ముందుకు రాలేదు. మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నేను మనసులో "బాబా! మీరే ఏదో ఒకటి చేయండి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది(రాత్రి 11 గంటలు). ఏదో ఒక రూపంలో మాకు సాయమైన చేయండి. లేదా తొందరగా కారు స్టార్టు అయ్యేలా చూడు తండ్రీ" అని బాబాను వేడుకున్నాను. చాలాసేపటికి ఒక ముస్లిం అతను తనంతట తానుగా వచ్చి నేను సహాయం చేస్తానని చెప్పి, ఇంకొకరిని కూడా తీసుకొచ్చి సహాయం చేసాడు. 2 నిమిషాల్లో కారు స్టార్ట్ అయ్యింది. కొంతదూరం వెళ్ళాక సాయిబాబానే  ఆ ముస్లిం అబ్బాయి రూపంలో వచ్చి మాకు సహాయం చేసారని నాకనిపించింది. ఎప్పటికీ మా వెంటే ఉండే తండ్రి మా సాయిబాబా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.

సాయిభక్తుల అనుభవమాలిక 2031వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. దయతో ఇబ్బందులు లేకుండా సంతోషపరచిన బాబా
2. పిలిచిన వెంటనే పలికే బాబా ఉండగా భయం ఎందుకు?
3. బాబా దయతో దొరికిన లాకర్ తాళం



బాబా దయతో దొరికిన లాకర్ తాళం

సాయి బంధువులందరికీ నమస్కారం. నా పేరు గురుమూర్తి. ఒకరోజు నేను బ్యాంకు లాకర్ పని చేసుకొచ్చాను. కొన్నిరోజుల తరువాత ఇంట్లో వెతికితే ఆ బ్యాంకు లాకర్ తాళం కనిపించలేదు. దాదాపు  రెండు వారాలపాటు కప్‌బోర్డ్స్ మొదలుకొని ఇంట్లో అంతా వెతికినా ఆ తాళం కనిపించలేదు. దాంతో ఇక కనిపించదేమోనని భయమేసింది. ఎందుకంటే, బ్యాంకు లాకర్ తాళం పోతే చాలా పెద్ద ప్రక్రియ ఉంటుంది. అందువల్ల సాయినాథుని, ఏడుకొండలవాడిని తాళం దొరికేలా చేయమని మనసారా వేడుకున్నాను. ఒక వారం తరువాత వేరే వస్తువుకోసం వెతుకుతుంటే ఎప్పుడూ పెట్టని చోట హ్యాండ్ బ్యాగ్ కనిపించింది. ఆ హ్యాండ్ బ్యాగులో చూడగా తాళం అందులోనే ఉంది. మా ఆనందానికి అంతులేదు. "ధన్యవాదాలు సాయినాథా, ఏడుకొండలవాడా!".

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి.

సాయిభక్తుల అనుభవమాలిక 2030వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • కన్నీటిపరమైన జీవితాల్లో వెలుగు నింపిన బాబా

సాయిభక్తులందరికీ నా నమస్కారం. నేను ఒక సాయిభక్తురాలిని. మేము వరంగల్ దగ్గర ఒక పల్లెటూరులో నివాసముంటున్నాము. 2019 నుండి నేను బాబా భక్తురాలినయ్యాను. అసలు ఎందుకు ఆయనకు భక్తురాలినయ్యానో, ఎలా అయ్యాను నాకు ఇప్పటికీ అర్థం కాదు. కానీ నేను బాబాని విడువలేనంత, తలవకుండా ఉండలేనంత దగ్గరయ్యాను ఆయనకు. 2004, జనవరి 5న మా నాన్న అనారోగ్యంతో చనిపోయారు. అప్పటినుండి అమ్మ ఒక్కతే చాలా కష్టపడాల్సి వచ్చింది. నాన్న చనిపోయిన మూడు నెలలకి 2004, మార్చ్ 11న మా అక్కకి వివాహం చేసింది. నన్ను, మా అన్నని పెంచి పెద్ద చేసి చదివించింది. 2020 నుండి నాకు పెళ్లి చేయాలని సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. అయితే నాకు, మా అన్నకి సంబంధాలు చూసే పెద్ద దిక్కు, మా వివాహాలకు అండగా ఉండేవాళ్లు ఒక్కరు కూడా లేరు. తెలిసినవాళ్లు ఎవరైనా చూసినా వాళ్ళు వాళ్ళ కన్నా తక్కువ స్థాయిలో ఉండాలని, చదువులేని వాళ్ళని, క్రైస్తవులని తీసుకొచ్చేవాళ్ళు. అవి నాకు నచ్చేవి కాదు. అలా సంవత్సరాలు దొర్లుతూ ఎన్ని సంబంధాలు చూసినా ఒక్క సంబంధం కూడా కుదరలేదు. గ్రామంలో అందరూ మమ్మల్ని చూసి, 'మీకు దిక్కు ఎవరూ లేరని, మీకింకా పెళ్లి కాదని' ఎగతాళి చేసి నవ్వుకుంటూ ఉండేవారు. ఆ టార్చెర్ అనుభవిస్తూ నేను, అన్న, మా అమ్మ మాకు మేమే ధైర్యం చెప్పుకుంటూ, ఇంట్లో ఏడ్చుకుంటూ ఉండేవాళ్ళం. చివరికి ఊర్లో వాళ్ళందరూ మా అమ్మని అనే మాటలకి తట్టుకోలేక ఇంట్లోని అందరం చచ్చిపోదాం అనే స్థితికి వచ్చాము. మా పరిస్థితి అంత దారుణంగా ఉన్నప్పటికీ నేను మొదటినుంచి మా అమ్మ, అన్నలకి, "బాబా ఉన్నారు. ఆయన మంచి సంబంధాలు తెస్తారు. ఆయన అనుగ్రహంతో ఘనంగా వివాహాలు జరుగుతాయి" అని ధైర్యం చెప్తూండేదాన్ని. కానీ మనసులో మాత్రం, 'ఎప్పటికీ నా పరిస్థితి ఇంతేనేమో! నాకు వివాహం కాదేమో! నేను ఇలాగే ఈ ఇంట్లోనే ఉండిపోతానేమో! మమ్మల్ని అందరూ ఎగతాళి చేసి నవ్వుకుంటూ ఉంటారేమో!' అని బాగా ఏడ్చేదాన్ని. నేను ఏడవని రోజంటూ ఉండేది కాదు. నాలో నేనే కుమిలిపోతూ, కృంగిపోతూ ఉండటం వల్ల నా ఆరోగ్యం బాగుండేది కాదు.

అంతటి కష్టంలోనూ నేను ప్రతిక్షణం సాయిస్మరణ చేసుకుంటూ ఉండేదాన్ని. ఆయన నాకు ఎన్నో స్వప్న దర్శనాలు ఇచ్చారు. ఒకసారి స్వప్నంలో 'నేను ఒక అబ్బాయి బండి మీద వెళ్తున్నాను. ఒక మారుమూల గ్రామంలోని పొలం పక్కగా వెళ్తుంటే దారికి ఎడమవైపున ఒక రేగి చెట్టు ఉంది. అక్కడ నేను ఆ అబ్బాయిని బండి ఆపమని చెప్పి, రేగుపళ్ళు తెంపుకొని నేను తింటూ ఆ అబ్బాయికి కూడా ఇచ్చాను. అతను 'నాకొద్దు నువ్వే తిను' అన్నాడు. తర్వాత మేము అక్కడినుండి ఆ అబ్బాయి వాళ్ళింటికి వెళ్ళాము. వాళ్లది చిన్న ఇల్లు. ఆ ఇంటి ముందున్న ఒక హోటల్ వద్ద 'సాయిబాబా హోటల్' అని ఫ్లెక్సీ ఉంది. అది చూసిన నేను మా అమ్మవాళ్ళు రమ్మంటుంటే, 'ఇక్కడ బాబా ఉన్నారు. నేను రాను. నేను ఇక్కడే ఉంటాను. నాకు ఇక్కడే బాగుంది' అని అంటున్నాను. అంతలో బాబా ఒక నది మీదగా గాలిలో కాషాయ రంగు వస్త్రాలలో, చేతిలో జపమాలతో దర్శనమిచ్చి నన్ను ఆశీర్వదిస్తూ, 'నేను శిరిడీలో పుట్టాను. శిరిడీలో పెరిగాను. నీకు అంతా మంచే జరుగుతుంది' అని చెప్పి అదృశ్యమయ్యారు'. నాకు మెలకువ వచ్చింది. వెంటనే నేను ఆ కల గురించి మా ఇంట్లోని అమ్మవాళ్లతో చెప్పాను. వాళ్ళు, "అదంతా నీ భ్రమ" అన్నారు. కానీ నా మనసుకు తెలుసు, 'బాబా నాకు మంచి భాగస్వామిని ఇస్తార'ని. అదే నమ్మకంతో బాబా మీద విశ్వాసంతో బ్రతుకుతుండేదాన్ని.

2024, జూలై 10న నా పుట్టినరోజు. ఆ రోజు నాకు ఒక అబ్బాయి నుండి 'హాయ్! మేము పెళ్ళికి ఆసక్తిగా ఉన్నామ'ని మెసేజ్ వచ్చింది. విషయమేమిటంటే, 2023లో 'భరత్ మ్యాట్రిమోనీ'లో నేను నా ప్రొఫైల్ అప్లోడ్ చేశాను. కేవలం అప్లోడ్ చేయడమైతే చేసానుగాని, 'నాకేం సంబంధం కుదురుతుంది?' అనుకొని ఆ విషయం పూర్తిగా మర్చిపోయాను. ఆ అబ్బాయి మెసేజ్ వచ్చినప్పుడు 'ఎన్నో వస్తుంటాయి, పోతుంటాయి' అని ఏదో మామూలుగా చూశాను. కానీ ఆ అబ్బాయి ఫోటో చూస్తే, బాబా నాకు స్వప్నంలో చూపించిన అబ్బాయి పోలికలు సరిపోలాయి. ఆ విషయం నేను మా ఇంట్లోవాళ్ళకి చెప్తే, వాళ్ళు నమ్మలేదు, 'పిచ్చమ్మాయి' అన్నట్టుగా నన్ను చూశారు. నాకు ఒకవైపు బాబా లీల అనిపించినప్పటికీ మరోవైపు అంతా నా భ్రమ ఏమో అనిపించింది. కానీ అదే అబ్బాయితో నాకు వివాహం నిశ్చయమై 2024, డిసెంబర్ 11కి ఘనంగా జరిగింది. ఆరోజు స్వప్నంలో కనిపించిన అబ్బాయి, ఇప్పుడు నా భర్త; స్వప్నంలో ఉన్న ఆ ఇల్లే నా అత్తారిల్లు. నా జీవితాన్ని బాబా నాకు ముందుగానే స్వప్నంలో చూపించారు. నేను కోరుకున్న దానికంటే ఎన్నోరేట్లు అధిక సద్గుణాలు కలిగిన వ్యక్తిని నాకు భర్తగా ప్రసాదించారు బాబా. ఆయన కృపవల్ల గుణవంతుడైన భర్త, ప్రేమగా చూసుకునే అత్తారిల్లు నాకు లభించాయి. ఆయన నా వివాహాన్ని ఒక అద్భుతంలా జరిపించి నన్ను చిన్న చూపు చూసిన వారి ముందే తలెత్తుకుని గౌరవంగా ఉండేలా చేశారు.
 
బాబా అనుగ్రహంతో నా అన్నకి కూడా సంబంధం కుదిరి నా పెళ్ళికి 20 రోజుల ముందు అనగా 2024, నవంబర్ 20న వివాహం అయింది. ఇదంతా చూసి ఊర్లో వాళ్లంతా, 'ఏంటి ఇదంతా? ఇన్ని రోజులు, ఎన్ని సంబంధాలు చూసినా కుదరని వాళ్ళిద్దరికీ సంబంధాలు కుదిరి, రెండు పెళ్లిళ్లు ఒకేసారి అవ్వడం ఏంటి?' అని ఆశ్చర్యపోయారు. ఇప్పుడు మా ఇంట్లో అందరం చాలా సంతోషంగా, మనశాంతిగా, ప్రశాంతంగా ఉన్నాము. మాకు ఇప్పుడు బాబానే అండదండ అని తలచి ఆయన బిడ్డలుగా జీవిస్తున్నాము. మా ఇంట్లో జరిగిన ఈ పెళ్ళిళ్ళను బాబా ప్రసాదంగా, బిక్షగా నేను, నా కుటుంబం భావిస్తున్నాము. బాబా అంటే తెలియని నా భర్త కూడా ఇప్పుడు బాబా భక్తుడిగా మారి బాబానే సర్వంగా తలుస్తున్నారు. ఇదంతా బాబా దయవల్లనే. ఇదంతా టైపు చేస్తుంటే నా మనసు కదిలిపోతుంది, నాకు మాటలు రాక సరిగా బాబా లీలను వ్యక్తపరచలేకపోతున్నాను. ఏదేమైనా కన్నీటిపరమైన నా జీవితంలో వెలుగు నింపిన బాబాకి శతకోటి వందనాలు. "తండ్రీ! సాయినాథా! మీకు శతకోటి వందనాలు. నేను ఇప్పుడు చాలా సుఖంగా ఉన్నాను. నా భర్తతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాను. నేనేమైనా తప్పులు చేసుంటే నన్ను మన్నించి నాకు ఎల్లవేళలా తోడుగా ఉండు తండ్రీ. జన్మజన్మలకు నీ భక్తురాలిగా నీ పాద సేవ చేసుకునే అవకాశం నాకు కల్పించు తండ్రీ".

సర్వం శ్రీసాయినాథార్పణమస్తు.

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo