సాయి వచనం:-

- శ్రీబాబూజీ.
Showing posts with label Sri Saibaba. Show all posts
Showing posts with label Sri Saibaba. Show all posts

ఒక ముస్లిం రైతు


ఒక ముస్లిం రైతు తన పంటపొలాలను అభివృద్ధిపరచడం కోసం 500 రూపాయలు అప్పు చేశాడు. ఆ ఋణాన్ని ఎలా తీర్చగలనా అని ఆందోళన చెందాడు. తన పొలంలో ఒక బావి త్రవ్వినట్లయితే పంటలు బాగా పండుతాయని, తద్వారా వచ్చే ఆదాయంతో తన ఋణాన్ని తీర్చుకోవచ్చని తలచాడు. అనుకున్నట్లుగానే బావి త్రవ్వకం మొదలుపెట్టాడు. త్రవ్వుతున్నప్పుడు మధ్యలో రాయి పడి, దాన్ని పేల్చాల్సిన అవసరం ఏర్పడింది. అందుకు అవసరమైన ప్రేలుడు పదార్థాలను కొనుగోలు చేయడానికి అనుమతికోసం అతడు రెండుసార్లు కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. కానీ అతని దరఖాస్తులను కలెక్టర్ తిరస్కరించాడు. దాంతో ఏమి చేయాలో అర్థంకాక అతడు చాలా నిరుత్సాహపడ్డాడు. ఆ స్థితిలో అతను సాయిబాబాను దర్శించి తన మనోవేదనను ఆయనతో విన్నవించుకున్నాడు. అప్పుడు బాబా, "నానాను (నానాసాహెబ్ చందోర్కర్) రానీ, నేను అతనితో చెప్తాను" అని అన్నారు. 

తరువాత నానా శిరిడీ వచ్చినప్పుడు రైతు మళ్ళీ తన విషయాన్ని సాయిబాబాకు గుర్తుచేశాడు. బాబా నానాతో, "ఇతని దరఖాస్తుని నీ సిఫారసుతో కలెక్టర్‌కి అందజేయి. తద్వారా ఇతని పని పూర్తవుతుంది" అని అన్నారు. బాబా శక్తిసామర్థ్యాల గురించి నానాకు తెలుసు, కానీ అతడు తన మనసులో 'ఆ దరఖాస్తు ఆమోదింపబడద'ని అనుకున్నాడు. అయినా సరే అతడు బాబా ఆజ్ఞను శిరసావహించి, కలెక్టర్ వద్దకు రైతుని తీసుకొని వెళ్లి, దరఖాస్తుని కలెక్టర్ ముందు ఉంచి, అంతకుముందు రెండుసార్లు అతని దరఖాస్తు తిరస్కరించబడినట్లు కూడా చెప్పాడు. అప్పుడు కలెక్టర్, "ప్రేలుడు పదార్థాలను ఎందుకు ఉపయోగించాలని పట్టుబడుతున్నావు?" అని రైతును అడిగాడు. అందుకతను, "సాహెబ్! నేను ప్రభుత్వం నుండి 500 రూపాయలు అప్పుగా తీసుకున్నాను. నా వ్యవసాయ క్షేత్రాన్ని అభివృద్ధిపరచి ఆ ఋణం తీర్చాలని అనుకున్నాను. బావి లేకుండా నేను వ్యవసాయాన్ని అభివృద్ధిపరచలేను. ప్రేలుడు పదార్థాలు లేకుండా బావి త్రవ్వకం పూర్తికాదు. మీరు అనుమతి ఇవ్వకపోతే నేను ఎలా బావి త్రవ్వకం పూర్తి చేయగలను? ఎలా ఋణాన్ని తిరిగి చెల్లించగలను?" అని బదులిచ్చాడు. కలెక్టర్ అతని సమాధానంతో సంతృప్తి చెంది అనుమతినిచ్చాడు. నానాసాహెబ్‌కు సాయిబాబా శక్తిసామర్థ్యాలు ఏమిటో మరోసారి అనుభవమయ్యాయి. రైతు బావి త్రవ్వించుకొని, పంటలొచ్చాక ఋణం నుండి విముక్తి పొంది సంతోషంగా బాబాకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాడు.

సమాప్తం.

Source: శ్రీసాయిబాబా, రచన: సాయిశరణానంద

ఆత్మారామ్ హరిభావు చౌబల్


ఇప్పుడు మీరు చదవబోయే అద్భుత సాయి లీల సాయిశరణానంద గుజరాతీలో రచించిన శ్రీ సాయిబాబా పుస్తకం నుండి సంగ్రహించబడింది. చదివి ఆనందించండి.

1913వ సంవత్సరంలో సాయిభక్తుడు ఆత్మారామ్ హరిభావు చౌబల్ సాయిబాబా దర్శనార్థం శిరిడీ వెళ్ళాడు. అతడు తనతోపాటు ప్రత్యేకంగా తయారు చేయించిన వెండి పాదుకలను కూడా తీసుకుని వెళ్ళాడు. ద్వారకామాయికి వెళ్లి బాబా దర్శనంతో అతడు ఆనందభరితుడయ్యాడు. తరువాత వెండి పాదుకలను బాబాకు చూపించగా, బాబా వాటిని తమ చేతుల్లోకి తీసుకుని, "ఎంత అందంగా ఉన్నాయి!" అన్నారు. తరువాత తమ కాలి వేళ్ళను పాదుకాల్లోకి చొప్పించి, "ఇవి ఎంత చక్కగా కనిపిస్తున్నాయి!" అని, "వీటిని తీసుకుని వెళ్లి, మీ పూజ మందిరంలో ఉంచి పూజించుకో" అని అన్నారు. చౌబల్ పట్టలేని ఆనందంతో వాటిని తీసుకుని వెళ్లి తన ఇంటి పూజామందిరంలో ఒక చిన్న చెక్క స్టూల్‌పై ప్రతిష్టించుకున్నాడు. అప్పటినుండి ఆ పాదుకలను అతడెంతో శ్రద్ధాభక్తులతో ప్రతినిత్యం ఆరాధిస్తుండేవాడు. ఇలా చాలా ఏళ్ళు  గడిచాక 1930వ సంవత్సరం, ఆశ్వయుజ మాసం(అక్టోబర్-నవంబర్), కృష్ణ పక్షం, 13వ రోజు అంటే త్రయోదశినాడు అతడు ఉదయాన్నే లేచి పాదుకల దర్శనార్ధం పూజగదికి వెళ్లగా రెండు పాదుకలలో ఒకటి కనిపించలేదు. చెక్కస్టూల్ క్రిందగాని, ఆ దరిదాపుల్లోగాని పాదుక కనిపించలేదు. మిగతా అన్నిచోట్లా వెతికారుగాని, వారి ప్రయత్నమంతా నిష్ప్రయోజనమైంది. బాబా స్పర్శతో పావనమైన పాదుకలలో ఒకటి కనిపించకపోవడంతో చౌబల్ చాలా బాధపడ్డాడు. అయినప్పటికీ అతడు తన రోజువారీ పాదుక పూజను మిగిలి ఉన్న ఒక్క పాదుకకు చేస్తూ ఉండేవాడు. రెండునెలల తరువాత ఒక ఉదయాన ఉన్న ఆ ఒకపాదుక కూడా కనపడలేదు. ఎంత వెతికినా దాని జాడ తెలియలేదు. దానితో అతను, అతని కుటుంబీకులు బాబా యొక్క తీవ్రమైన ఆగ్రహానికి గురయ్యామని అనుకుని ఎంతో బాధపడ్డారు. తరువాత అతడు బాగా ఆలోచించుకుని కొత్త పాదుకలను కొని తెచ్చుకుందామనే ఉద్దేశ్యంతో బొంబాయికి వెళ్ళాడు. అతను వెళ్లిన రోజున తయారు చేయబడి ఉన్న పాదుకలు అందుబాటులో లేవు. దాంతో అతను చాలా నిరాశతో తిరిగి ఇల్లు చేరాడు. పాదుకలు లేవు గనక బాబా పటానికే తన రోజువారీ పూజను కొనసాగిస్తూ ఉండేవాడు. అలా తొమ్మిదినెలల గడిచిపోయాయి. దయార్ధహృదయుడైన సాయిబాబా తన భక్తుడిని తొమ్మిదినెలలు పరీక్షించి ఉండాలి. ఆ కాలంలో ఎప్పుడూ తన భక్తుడు పాదుకలను మరచిపోలేదని ఆయన మనసు కరుణతో నిండిపోయి ఉంటుంది. కాబట్టి అద్భుతమైన లీల చూపించారు బాబా. ఒకరోజు చెక్కస్టూల్ క్రింద రెండు పాదుకలు చక్కగా ఉంచబడ్డాయి. వాటిని చూసిన చౌబల్ కుటుంబీకుల మనసులకు గొప్ప ఉపశమనం లభించింది. వాళ్ళు పొందిన సంతోషం మాటల్లో చెప్పలేనిది.

source: Sri Saibaba written by sai sharanananda.

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo